న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి విస్తరణ త్వరలో జరగనుందనే వార్తల మధ్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను దేశ ఉప ప్రధాన మంత్రి (డిప్యూటీ పీఎం)గా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ ప్రతిపాదనకు అధికార జనతాదళ్ (యునైటెడ్)తో పాటు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కూడా మద్దతు ప్రకటించింది. జేడీయూ శాసనసభ్యుడు పంకజ్ మిశ్రా, ఆర్జేడీ సీనియర్ నేత ముఖేష్ రోషన్ ఇద్దరూ నితీష్ కుమార్కు కేంద్రంలో తగిన గౌరవం దక్కాలని, ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవానికి డిప్యూటీ పీఎం పదవి సరైనదని అంటున్నారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా సేవలు అందించడమే కాకుండా, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన నితీష్ కుమార్కు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అన్ని అర్హతలు ఉన్నాయని జేడీయూ పేర్కొంది. ఆర్జేడీ నేత ముఖేష్ రోషన్ ఒకడుగు ముందుకు వేసి, ఆయనకు ఉప ప్రధాని పదవితో పాటు వ్యవసాయం లేదా రైల్వే వంటి కీలక శాఖల బాధ్యతలను కూడా అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ డిమాండ్లపై అటు బీజేపీ కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రాజకీయ సమీకరణాల విషయానికొస్తే, నితీష్ కుమార్ 2026, ఏప్రిల్ 10న రాజ్యసభకు ఎన్నికైన తర్వాత, ఏప్రిల్ 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏప్రిల్ 15న బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం జేడీయూ జాతీయ అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్న నితీష్ కుమార్ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలా లేదా అనే తుది నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనాయకత్వంపైనే ఆధారపడి ఉంది.
ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర షురూ.. రిజిస్ట్రేషన్ వివరాలివే..


