మోదీ కోటు జేబులో త్రివర్ణంపై విమర్శలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు.


