ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఈ పేరు చెబితే చాలు ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. దాయాది పాకిస్థాన్ దేశానికి చెందిన ముష్కరులను వారి సొంత దేశంలోకే చొరబడి తుదముట్టించారు. భారత్ జోలికోస్తే ఎక్కడున్నా వదిలేది లేదంటూ ప్రపంచానికి భారత్ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఈ ఘటనపై మాట్లాడుతూ..“ ఈ దాడి జరిగిన తర్వాత విమానాశ్రయంలోనే ప్రధాని మోదీతో మాకు సమావేశం జరిగింది. మొదట, ఆయన వాస్తవాలన్నీ తెలుసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన మొదటి ప్రశ్న, ‘ఇది ఎవరు చేశారు?’ "మేము వారిని వెంబడిస్తాము. వారు భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే... మేము వారిని క్షమించము," అని మోదీ తనతో ఆగ్రహంగా అన్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గూడఛార సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. వారు అద్భుతంగా పనిచేశారు. తక్కువ సమయంలోనే మనం నిందితులను గుర్తించి, కచ్చితత్వంతో చర్యలు తీసుకోగలిగామన్నారు. భారతదేశం చూపే ఉదారత లేదా సహనాన్ని ఎవరూ బలహీనతగా భావించకూడదని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని తెలిపారు. పహల్గామ్ దాడికి కారణమైన శత్రువుల ఉగ్రవాద శిబిరాలను ముఖ్యంగా ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పరిణామాలతో సంబంధం లేకుండా భారతదేశం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనగలదని, శత్రువులపై తీవ్రంగా ఎదురుదాడి చేయగలదని ఆయన స్పష్టం చేశారు.
2025 ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభమైంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను తిప్పికొడుతూ, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి కీలక నేతలను అంతమెుందించింది.


