విమర్శకులను, ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో దిమాగీ నక్సలైట్లు అశాంతి, అరాచకాలకు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి. నక్సలిజాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, మావోయిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఆరోపించారు.
దిమాగీ నక్సలైట్లుఅంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం, పాకిస్తాన్కు వెళ్లాలని అనడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరెస్టయిన మావోయిస్టుల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాద చర్యలను తలపిస్తోందని ఆరోపించారు. కొందరిపై చట్టపరమైన విచారణ జరపకుండా, కస్టడీలోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా మోదీ అసమ్మతివాదులను టార్గెట్ చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించరు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కళంకం వేయడానికి దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మర్చిపోయి, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి సమయం, అవకాశం వెతుక్కుంటున్నారని రాజా తప్పుపట్టారు. ఇది కేవలం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. విద్య, ఉపాధికి సంబంధించి విద్యార్థులు, యువత లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించాలని ప్రధాన మోదీకి డి.రాజా సూచించారు.
రాజకీయ శాస్త్రంలో మోదీ ‘ఎంఏ’
‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను దిమాగీ నక్సల్స్ అని పిలుస్తూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరైంది కాదు. మోదీ ఇకనైనా అహంకారం వదిలించుకోవాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధానమంత్రి మొదట తన ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. ఇప్పుడు వారిని దిమాగీ నక్సల్స్ అని పిలుస్తున్నారు. ఇది మోదీ నిస్సహాయతకు స్పష్టమైన సంకేతం. ఇతరులపై నిందలు వేయడంతో మోదీ ఆరితేరిపోయారు. మొత్తం రాజకీయ శాస్త్రంలోనే ఆయన మాస్టర్ అబ్యూజర్(ఎంఏ). కాబట్టి ప్రధానమంత్రికి ఎంఏ డిగ్రీ ఉండటంలో ఆశ్చర్యం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు.


