తిరంగా యాత్రకు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు
రాంచీ: జార్ఖండ్లో ప్రభుత్వ నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ ఉద్యమిస్తూ నిరాహార దీక్షకు దిగిన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో శనివారం రాంచీలోని సదర్ ఆస్పత్రి అత్యవసర చికిత్స విభాగంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా రాంచీ స్టేడియంలో తిరంగా ర్యాలీకి పాల్గొనేందుకు ఆయన సిద్ధంకాగా ఆస్పత్రి ఐసీయూ విభాగం ఆవరణలో విధుల్లో ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మహతోనూ వెంట తీసుకెళ్లేందుకు అప్పటికే అక్కడికి చేరుకున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా(జేకేఎల్ఎం) సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది.
త్రివర్ణపతాకం పట్టుకుని మహతో ఎలాగైనా ఆస్పత్రి గది నుంచి బయటపడేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఛాతికి గాయమైనట్లు మహతో ఆరోపించారు. ‘‘80 ఏళ్లు పూర్తయినా ఇంకా నామమాత్రంగానే స్వాతంత్య్రం వచ్చినట్లుంది. తిరంగా ర్యాలీలో పాల్గొనే హక్కు నాకు లేదా?. రాజ్యాంగంలోని ఏ చట్టం ప్రకారం నన్ను అడ్డుకుంటున్నారు? చికిత్సలో ఉండగా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవద్దని ఏ వైద్యుడైనా సూచించారా? ఆ సూచనా పత్రం చూపించండి?’’అని పోలీసులతో మహతో వాగ్వాదానికి దిగినా ఫలితంలేకుండా పోయింది. 14 రోజులుగా మహతో నిరాహార దీక్షచేస్తున్న విషయం తెల్సిందే.


