పూర్తి వందేమాతరం సోనియా వద్దన్నారు | BJP says Sonia objected to full Vande Mataram | Sakshi
Sakshi News home page

పూర్తి వందేమాతరం సోనియా వద్దన్నారు

Aug 16 2026 6:36 AM | Updated on Aug 16 2026 6:36 AM

BJP says Sonia objected to full Vande Mataram

ఆరోపించిన బీజేపీ..ఖండించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై ఆ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారని శనివారం బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)బీఎల్‌ సంతోష్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు.

 ‘తల్లి(సోనియాగాం«దీ), కుమారుడు(రాహుల్‌ గాం«దీ), కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ ఖర్గే వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై నిరాశ చెందినట్లు కనిపిస్తున్నారు’అంటూ సంతోష్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి కొందరి మనస్తత్వాలు స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం కూడా ఏమార్పూ లేకుండా ఒకేలా ఉన్నాయన్నారు. వందేమాతర గేయం ఆరు చరణాలను ఆలపించేందుకు సోనియా గాంధీ విముఖత చూపడం సిగ్గు చేటని బీజేపీ ప్రతినిధి గోపాల్‌ కృష్ణ అగర్వాల్‌ అన్నారు. ‘కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ మైండ్‌ సెట్, ఇటువంటి మైండ్‌సెట్‌ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. ఇకపైనా తిరస్కరిస్తూనే ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. 

వాస్తవంగా జరిగిందిదే: బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. బీజేపీ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో సోనియా గాంధీ వందేమాతర గేయంపై అభ్యంతరం తెలపడం లేదని, కేవలం ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గేకు కుర్చీ ఇవ్వాలని మాత్రమే ఆమె కోరుతున్నారని వివరించింది. 1937 అక్టోబర్‌ 28వ తేదీన కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో మహాత్మా గాం«దీ, నేతాజీ, పటేల్, అబుల్‌ కలాం ఆజాద్, నెహ్రూ, గోవింద్‌ వల్లభ్‌ పంత్, రాజగోపాలాచారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ ఇచ్చిన సూచనల మేరకు వందేమాతరం ఆరంభం చరణాలను మాత్రమే కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆలపించాలని నిర్ణయించారు’అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అప్పటి చారిత్రక ఘటనను గుర్తు చేశారు.

 ‘అప్పట్నుంచి మా పార్టీ ప్రతి సెషన్‌లోనూ, సేవాదళ్‌ కార్యక్రమాల్లోనూ ఇలాగే ఆరంభ చరణాలను ఆలపిస్తున్నాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. శనివారం ఇందిరాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాత్రం పూర్తి గేయాన్ని ఆలపించాం, ఇది వాస్తవం’అని ఆయన వివరించారు. వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై పార్లమెంట్‌లో 16 గంటలపాటు జరిగిన చర్చల్లోనూ తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించామన్నారు. తాజాగా, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement