గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఇరాన్-ఖతార్ మధ్య పైలట్ల వివాదం తెరపైకి వచ్చింది. ముగ్గురు ఇరాన్ యుద్ధ విమాన పైలట్లను ఖతార్ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఇరాన్ వర్గాలు ప్రకటించగా ఖతార్ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.
ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కథనం ప్రకారం, మార్చిలో ఖతార్లోని ఒక సైనిక స్థావరంపై దాడి చేసే మిషన్లో పాల్గొన్న మూడు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలోని పైలట్లు విమానాల నుంచి బయటకు దూకిన అనంతరం ఖతార్ బలగాలకు చిక్కారని ఇరాన్ సైనిక అధికారి పేర్కొన్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం అంతర్జాతీయ రెడ్క్రాస్ సహాయం కోరినట్లు ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ఖతర్ కథనం పూర్తిగా భిన్నంగా ఉంది.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం, ఆ ఇరాన్ పైలట్లు ఖతార్ గగనతలంలోకి ప్రవేశించారు. వారిని సంప్రదించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. అనంతరం చేపట్టిన గాలింపు, రక్షణ చర్యల్లో ఒక పైలట్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించినట్లు ఖతార్ వెల్లడించింది. అంతేకాదు, ఆ మృతదేహాన్ని ఇరాన్కు అప్పగించే అంశంపై కూడా ఖతార్ సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ఇరాన్ను ఆహ్వానించినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని ఆరోపించింది.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ముగ్గురు పైలట్లు సజీవంగా ఖతార్ అదుపులో ఉన్నారా? లేక ఒక పైలట్ మాత్రమే మరణించాడా?. ఈ వివాదం కేవలం ముగ్గురు సైనికుల ఆచూకీకి సంబంధించినది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ప్రాంతంలో ఇరాన్, ఖతార్ మధ్య ఈ ఆరోపణలు కొత్త రాజకీయ, సైనిక పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇరాన్పై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలకు ఉపయోగించుకుంటున్నాయని ఇరాన్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. అందుకే ఈ పైలట్ల వ్యవహారం ఇప్పుడు ఒక కీలక ప్రశ్నగా మారింది.


