జీవితాంతం జిమ్‌, స్కూల్‌కు వెళ్లొద్దు.. చిత్రహింసలు అనుభవించొచ్చు.. | What the Taliban achieved and failed to achieve in five years | Sakshi
Sakshi News home page

జీవితాంతం జిమ్‌, స్కూల్‌కు వెళ్లొద్దు.. చిత్రహింసలు అనుభవించొచ్చు..

Aug 15 2026 7:33 PM | Updated on Aug 15 2026 7:43 PM

What the Taliban achieved and failed to achieve in five years

అఫ్గానిస్థాన్‌లో 2021 ఆగస్టు 15న తాలిబాన్‌ అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకుంది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత కాబూల్‌ తాలిబాన్‌ అధీనంలోకి వెళ్లింది. తాలిబాన్‌ అధికారంలోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తాలిబాన్‌ కాబూల్‌లో భారీ స్థాయిలో విజయోత్సవాలు నిర్వహించింది.

అంతర్జాతీయా మీడియా కథనాల ప్రకారం.. తాలిబాన్‌ తన పాలనలో యుద్ధం, అస్థిరత తగ్గి దేశంలో భద్రత పెరిగిందని చెబుతోంది. ప్రస్తుతం తాలిబాన్‌ అఫ్గానిస్థాన్‌ మొత్తం భూభాగంపై నియంత్రణ కలిగి ఉంది. ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసాన్‌ వంటి సాయుధ ముప్పులను తాలిబాన్‌ బాగా బలహీనపరిచింది.

ఐదేళ్లలో ఏం సాధించింది? 
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ, 2021లో విదేశీ సహాయం భారీగా తగ్గిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా తాలిబాన్‌ నిలబెట్టింది. పన్నులు, సుంకాల వసూళ్లు పెరగడం, విదేశాల్లో ఉన్న అఫ్గాన్ల నుంచి వచ్చే డబ్బు, పొరుగు దేశాలతో వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతమిచ్చాయి. ఖోష్‌ తేపా కాలువ, టీఏపీఐ గ్యాస్‌ పైప్‌లైన్‌, విద్యుత్‌ ప్రసార మార్గాలు, రహదారులు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులపై తాలిబాన్‌ దృష్టి పెట్టింది. అయితే ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించింది. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడంలో తాలిబాన్‌ విఫలమైంది.

మహిళలను మనుషుల్లా చూడట్లేదు..
తాలిబాన్‌ పాలనలో అతిపెద్ద వైఫల్యం మహిళలు, బాలికలపై విధించిన ఆంక్షలు. బాలికలు 6వ తరగతి తర్వాత అధికారిక విద్య కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. యునెస్కో ప్రకారం ప్రస్తుతం సుమారు 2.4 మిలియన్‌ అఫ్గాన్‌ బాలికలు మాధ్యమిక విద్యకు దూరమయ్యారు. మహిళలకు విశ్వవిద్యాలయ విద్య కూడా నిషేధించారు. దీంతో అఫ్గానిస్థాన్‌ మహిళల ఉన్నత విద్యపై అధికారిక నిషేధం ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశంగా నిలిచింది.

తాలిబాన్‌ అధికారంలోకి రాకముందు 2021 నాటికి దాదాపు 10 లక్షల బాలికలు మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ విద్యా పురోగతి ఇప్పుడు తీవ్రంగా వెనక్కి వెళ్లింది. మహిళలపై విద్యా ఆంక్షల ప్రభావంతో మహిళా ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మంత్రసానుల కొరత పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. మహిళలకు విద్య లేకపోవడం వల్ల భవిష్యత్తులో అవసరమైన మహిళా వైద్య నిపుణులను తయారు చేయడమే కష్టమవుతోంది. మహిళలను ఉద్యోగాలు, ప్రజా జీవితం, క్రీడలు, ఉద్యానవనాలు, వ్యాయామశాలలు వంటి అనేక రంగాల నుంచి దూరం చేశారు.

చిత్రహింసలు, అక్రమ హత్యలు 
మహిళలు దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే పురుష సంరక్షకుడు వెంట ఉండాలనే ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్‌ బెన్నెట్‌ ప్రకారం, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభంగా మారింది. మహిళలపై జరుగుతున్న వ్యవస్థీకృత వివక్షను బెన్నెట్‌ మానవత్వానికి వ్యతిరేకమైన లింగ ఆధారిత హింసగా అభివర్ణించారు. మహిళల సమస్యలకే పరిమితం కాకుండా ఏకపక్ష అరెస్టులు, చిత్రహింసలు, అక్రమ హత్యలు, బలవంతపు అదృశ్యాలు, భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, జర్నలిస్టులపై దాడులు కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మత, జాతి మైనారిటీలపై వివక్ష, పౌర సమాజం పనిచేసే స్థలం తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా కొనసాగుతున్నాయి.

తాలిబాన్‌ అంతర్జాతీయ గుర్తింపు సాధించడంలో ఆశించినంతగా విజయవంతం కాలేదు. రష్యా మాత్రమే తాలిబాన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇతర దేశాలు మాత్రం వివిధ స్థాయుల్లో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తాలిబాన్‌ అధికారాన్ని గట్టిగా నిలబెట్టుకున్నప్పటికీ ప్రజల్లో అసంతృప్తి నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుత స్థిరత్వాన్ని శాశ్వత రాజకీయ పరిష్కారంగా భావించలేమని, మహిళల హక్కులు, అంతర్జాతీయ ఒంటరితనం, ప్రజల అసంతృప్తి భవిష్యత్తులో తాలిబాన్‌కు పెద్ద సవాళ్లుగా మారవచ్చని విశ్లేషించింది.

మొత్తంగా 5 ఏళ్ల తాలిబాన్‌ పాలనలో భద్రత, భూభాగంపై పూర్తి నియంత్రణ, కొన్ని మౌలిక వసతులు సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు. కానీ బాలికల విద్య, మహిళల హక్కులు, సమగ్ర పాలన, అంతర్జాతీయ గుర్తింపు, ప్రజల స్వేచ్ఛ విషయంలో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement