ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా | Indonesia Shaken by Quake: Buildings Collapse Aftershocks Trigger Panic | Sakshi
Sakshi News home page

ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా

Aug 15 2026 10:58 AM | Updated on Aug 15 2026 11:19 AM

Indonesia Shaken by Quake: Buildings Collapse Aftershocks Trigger Panic

అత్యంత శక్తివంతమైన భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా ఒరిగిపోతూ నేల కూలాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో అలజడి రేగడంతో సునామీ వస్తుందేమోనని వణికిపోయారు. మరోవైపు.. అగ్నిపర్వతం బద్దలు కావడం గమనార్హం. ఫ్లోరెస్‌ దీవి, మరికొన్ని చోట్ల రికార్డైన భయానక దృశ్యాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ వేకువ జామున 7.7 తీవ్రతతో వచ్చిన ప్రధాన భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్టర్‌షాక్స్‌ భయపెట్టాయి. 6.1, 5.9, 5.6 తీవ్రతలతో వరుస ప్రకంపనలు కొనసాగడంతో ఫ్లోరెస్‌ తీర ప్రజలు భయం భయంగా గడిపారు. ఎండె నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదు కాగా.. తూర్పు నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో సైతం జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదే గడిపారు. బలమైన ప్రకంపనలు పలు ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.

కుప్పకూలిన భవనాలు.. వీధుల్లోకి పరుగులు
భూకంపం తీవ్రతకు ఫ్లోరెస్‌ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్‌ వెయిటింగ్‌ రూమ్‌ కూలిపోయింది. భవనాల శిథిలాలు పడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. “భూకంపం చాలా తీవ్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశాం” అని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఆసుపత్రుల్లో కలకలం.. బయటే చికిత్స
ప్రకంపనలతో ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సిక్కా ప్రాంతంలోని సెయింట్‌ పీటర్‌ మేజర్‌ సెమినరీలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. అందులోని విద్యార్థులు, నన్స్‌ భయంతో పరుగులు తీశారు. పాస్టర్‌ ఒకరు రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయపడ్డారు.

సునామీ హెచ్చరిక.. ఎత్తివేత
ఫ్లోరెస్‌ సముద్ర గర్భంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే  కొన్ని గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించారు.

మరింతగా మృతులు?
ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టం అంచనా వేస్తున్నాయి. ప్రాణ నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని ఓ అధికారి అంటున్నారు. ఇక ఆస్తి నష్టం భారీగానే జరగొచ్చని తెలుస్తోంది.

బద్ధలైన అగ్నిపర్వతం.. బూడిద మేఘాలు
హల్మహెరా దీవిలోని మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం బద్దలై.. భారీగా బూడిదను వెదజల్లింది. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి.

రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌..
భూకంపాలు, అగ్నిపర్వతాలకు ఇండోనేషియా అత్యంత ప్రమాదకర ప్రాంతం. పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ పరిధిలో ఉండటంతో అక్కడ తరచూ భారీ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 1992లో ఇదే ఫ్లోరెస్‌ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో సుమత్రా సమీపంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సునామీల్లో ఒకదానికి కారణమైంది. ప్రస్తుతం ఫ్లోరెస్‌ దీవిలో ఆఫ్టర్‌షాక్స్‌ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement