మూడుముళ్ల వేడుకతో జీవితాంతం సంతోషంగా గడపాల్సిన యువ జంట పెళ్లికి ముందే ప్రాణాలు వదిలారు. మైసూరు జిల్లాలోని హుణసూరులో వివాహ నిశ్చయం చేసుకున్న యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, కాబోయే భర్త కేరళలోని ఎర్నాకుళంలో ఉసురు తీసుకున్నాడు.
ఇద్దరూ ఉద్యోగులు..
వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని కాసరగోడ్ జిల్లా, హోస దుర్గ తాలూకాలోని పల్లకెరెకు చెందిన చందన్ పెద్ద కుమార్తె అనుశ్రీ (26), హుణసూరులో స్టేట్ బ్యాంకులో పనిచేస్తుంది. కేరళలోని కన్నూర్ జిల్లా, ఎరట్టి తాలూకా మదతి గ్రామవాసి సుధాకర్ కుమారుడు, అమల్ (30) అక్కడే ఉద్యోగం చేస్తుంటాడు. అనుశ్రీ, అమల్కు పెద్దలు ఇటీవల నిశ్చితార్థం చేసి, డిసెంబరు 26న పెళ్లి ఖాయం చేశారు. ఇద్దరూ తరచూ మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు.
శుక్రవారం రాత్రి మొబైల్లో మాట్లాడుకుంటూ గొడవపడ్డారు. దీంతో అనుశ్రీ అమల్కు వీడియో కాల్ చేసి గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. అది చూసి అమల్ భయాందోళనతో ఓ లాడ్జికి వెళ్లి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనుశ్రీ తండ్రి చందన్ హుణసూరుకు చేరుకుని కూతురిని చూసి బోరున విలపించాడు. స్థానిక పోలీసులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అమల్ ఫోన్లో వేధించడం వల్లనే తన కూతురు చనిపోయిందని తండ్రి చెప్పాడు.


