ఐదు నిమిషాలు లేట్‌.. ఫోన్‌ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి.. ఆపై బిగ్‌ ట్విస్ట్‌! | Man slaps And kicks delivery agent in Meerut Video Viral | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాలు లేట్‌.. ఫోన్‌ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి.. ఆపై బిగ్‌ ట్విస్ట్‌!

Aug 16 2026 9:28 AM | Updated on Aug 16 2026 9:28 AM

Man slaps And kicks delivery agent in Meerut Video Viral

ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్‌కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్‌ లేట్‌గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్‌పై కస్టమర్‌ దాడికి దిగాడు. ఫోన్‌ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కస్టమర్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గంగాసాగర్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్‌ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ కస్టమర్‌ యమన్‌తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్‌ ప్రకారం ఆర్డర్‌ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్‌ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్‌ తెలిపాడు.

ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్‌.. అమిత్‌ ఫోన్‌ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్‌ ఫిర్యాదు ప్రకారం.. యమన్‌ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్‌ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

డెలివరీ ఏజెంట్ల బంద్‌..
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్‌కు కస్టమర్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్‌ కొన్ని నిమిషాలు ఆలస్యమైతే దాడి చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 34 ఏళ్ల యమన్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని భవన్‌పూర్‌ పోలీసులు తెలిపారు. ఐదు నిమిషాల ఆలస్యం.. ఆపై గొడవ.. చివరకు సీసీటీవీలో బయటపడిన దాడి! ఈ ఘటన ఇప్పుడు డెలివరీ ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement