శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర- 2026 అధికారికంగా ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జూలై 2న జమ్ములోని యాత్రి నివాస్ నుండి మొదటి భక్తుల బృందాన్ని జెండా ఊపి పంపించారు. ఈ వార్షిక పవిత్ర యాత్ర జూలై 3 ఉదయం నుండి పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల ద్వారా ప్రారంభమై, ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. భక్తుల భద్రత కోసం ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది.
ఈసారి అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉండవు. జూలై 1 నుండి యాత్ర ముగిసే వరకు పహల్గామ్, బాల్తాల్ రెండు మార్గాలను ప్రభుత్వం ‘నో ఫ్లైయింగ్ జోన్లు’గా ప్రకటించింది. పవిత్ర అమర్నాథ్ గుహను చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది సాంప్రదాయక పహల్గామ్ రూట్ (32 కి.మీ), ఇది జమ్ము, చందన్వారీ, శేషనాగ్, పంచతరిణి మీదుగా సాగుతుంది. దీని బేస్ క్యాంప్ నున్వాన్లో ఉంది. రెండవది బాల్తాల్ రూట్ (14 కి.మీ), ఇది తక్కువ దూరమైనప్పటికీ నిలువుగా ఉండే కొండల వల్ల సవాలుతో కూడుకున్నది. యాత్రికుల కోసం టెంట్లు, ఉచిత లంగర్ భోజన సదుపాయాలు, ఆర్మీ ఆధ్వర్యంలో వైద్య కేంద్రాలు, క్లోక్ రూములు, బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్లు అందుబాటులో ఉన్నాయి. నడవలేని వారి కోసం గుర్రాలు, పల్లకీలు కూడా లభిస్తాయి.
#WATCH | Jammu | J&K Lieutenant Governor Manoj Sinha flagged off the first batch of Shri Amarnathji Yatra 2026 pilgrims pic.twitter.com/tnTvzud1JH
— ANI (@ANI) July 1, 2026
ఈ యాత్ర కోసం భక్తులు అమర్నాథ్ జీ ష్రైన్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో జూలై 3 నుండి ఆగస్టు 12 వరకు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నంబర్పై గరిష్టంగా నలుగురు నమోదు చేసుకోవచ్చు, అధీకృత డాక్టర్ ఇచ్చిన హెల్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆఫ్లైన్లో జమ్మూలోని కేంద్రాల్లో లేదా దేశవ్యాప్తంగా ఎస్బీఐ, పీఎన్బీ, ఎస్ బ్యాంక్ బ్యాంక్ బ్రాంచ్లలో టోకెన్ పొందవచ్చు. యాత్రికుల కాన్వాయ్ భద్రత దృష్ట్యా జమ్ముకశ్మీర్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. కశ్మీర్ నుండి జమ్ము వెళ్లే వాహనాలు ఉదయం 11:30 గంటల కంటే ముందే నావియుగ్ టన్నెల్ దాటాలి. అలాగే జమ్ము నుండి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 3 గంటల తర్వాత టన్నెల్లోకి అనుమతించరు.


