ఆయుష్ ఆస్పత్రుల నిర్వహణ ముసాయిదా నిబంధనలు విడుదల
రెండు వారాలపాటు ప్రజలు, వైద్యులు, నిపుణుల నుంచి అభిప్రాయాల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ ఆయుర్వేద, హోమియో, యునానీ, సిద్ధ, యోగా–ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న క్లినిక్లు, పాలీక్లినిక్లు, నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణకు వైద్య శాఖ నిబంధనలు రూపొందించింది. చిన్న క్లినిక్ నుంచి 200 పడకలకు పైబడిన ప్రతి ఆయుష్ ప్రైవేట్ వైద్య సంస్థకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. సలహాలు, సూచనలకోసం ముసాయిదా నిబంధనలను ఆయుష్శాఖ అధికారిక వెబ్సైట్ ayush.ap.gov.in లో అందుబాటులో ఉంచామని ఆయుష్ కమిషనర్ ఆర్.గోపాలకృష్ణ ప్రకటించారు. commr-apayush@ap.gov.in ద్వారా ప్రజలు, ఆయుష్ వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్య సంఘాలు, నిపుణులు రెండు వారాల్లో అభ్యంతరాలను తెలియజేయవచ్చని సూచించారు.
ఇప్పటి వరకు అల్లోపతి ప్రైవేట్ వైద్య సంస్థలకు మాత్రమే వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–2002ను ప్రభుత్వం సవరించింది. చట్టం నంబరు 18/2026 ద్వారా ఆయుష్ వైద్య విధానాలను కూడా దీని పరిధిలోకి తెస్తూ ఏప్రిల్ 10న గెజిట్ నోటిఫికేష్ విడుదల చేసింది. సవరించిన చట్టాన్ని అమలుకు ఏపీ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రూల్స్–2026 పేరుతో ఆయుష్ విభాగం నిబంధనలు తయారు చేసింది.
ఏడు విభాగాలుగా వర్గీకరణ
సింగిల్ డాక్టర్ క్లినిక్, పాలీక్లినిక్, 20 పడకలలోపు ఆస్పత్రులు, 21 నుంచి 50 పడకలు, 51 నుంచి 100 పడకలు, 101 నుంచి 200 పడకలు, 200 పడకలకు పైబడిన ఆస్పత్రులు... ఇలా ఏడు విభాగాలుగా ఆస్పత్రులను వర్గీకరించారు. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తు చేసిన వెంటనే 90 రోజులపాటు చెల్లుబాటయ్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ చేస్తారు. పది రోజుల్లోపు వైద్య నిపుణులతో కూడిన బృందం సంబంధిత వైద్య సంస్థను తనిఖీ చేస్తుంది. అన్ని ప్రమాణాలు ఉంటే ఐదేళ్ల కాలవ్యవధితో శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించినా, అర్హత లేని వ్యక్తులతో వైద్యసేవలు అందించినా, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు రుజువైనా రిజిస్ట్రేషన్ను తాత్కాలికంగా/పూర్తిగా రద్దు చేస్తారు.


