మా పిల్లాడు ఎక్కడంటూ ఆమదాలవలస పోలీస్స్టేషన్ ఎదుట అన్నెపు సంజయ్ తల్లి ఆందోళన
ఎస్ఐ ప్రవల్లికపై హత్యాయత్నానికి పాల్పడినట్లు అతడిపై అక్రమ కేసు
శ్రీకాకుళం క్రైమ్/ఆమదాలవలస : ‘ఆమదాలవలస పోలీసులమని చెప్పి గాజువాకలో నా కుమార్తె ఇంటికెళ్లి అర్ధరాత్రి నా కొడుకుని తీసుకెళ్లారు. ఒక్కగానొక్క పిల్లాడిని ఇప్పటికీ పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. టీవీల్లో చూపినట్లు పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. నా పిల్లాడు ఎక్కడ?’.. అంటూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ ఐజే నాయుడు కాలనీలో ఉంటున్న అన్నెపు రాజు అనే మహిళ ఆమదాలవలస పోలీస్స్టేషన్ ఎదుట బుధవారం కన్నీరుమున్నీరైంది. తమకేమీ తెలీదని అక్కడి పోలీసు సిబ్బంది చెప్పడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ..
ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన రోజు కొత్తరోడ్డులో విధులు నిర్వర్తిస్తున్న బూర్జ మహిళా ఎస్ఐ ఎం. ప్రవల్లికను చుట్టుముట్టి ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆమదాలవలస మున్సిపాలిటీ ఐజే నాయుడు కాలనీకి చెందిన అన్నెపు సంజయ్పై పోలీసులు అక్రమ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఆమదాలవలస పోలీసులమంటూ విశాఖ గాజువాక పోలీస్స్టేషన్ పరిధి కుంచుమాంబ కాలనీలో ఉంటున్న కూన దీపిక (సంజయ్ సోదరి) ఇంటికెళ్లారు.
అక్కడే ఉన్న సంజయ్ను ఆమదాలవలస పోలీస్స్టేషన్లో నీపై కేసు ఉన్నందున తీసుకెళ్తున్నామని చెప్పి అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో గార ఎస్ఐ ఉన్నట్లు సమాచారం. ఇక అక్కడ నుంచి రాత్రి 3 దాటాక పైడిభీమవరం సిస్కో స్టేషన్లో విచారణ నిమిత్తం ఉంచారు. ఉ.10 గంటల తర్వాత సంజయ్ను పోలీసులు ఎక్కడికి తరలించారన్నది ఎవ్వరికీ అంతుచిక్కడంలేదు.
పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన..
కొడుకుని పోలీసులు పట్టుకుపోయిన విషయాన్ని బుధవారం ఉదయాన్నే కుమార్తె దీపిక ఫోన్ ద్వారా తల్లికి తెలపడంతో ఆమదాలవలస పోలీస్స్టేషన్కు బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి సంజయ్ తల్లి వెళ్లి అక్కడి సిబ్బందిని ప్రశ్నించింది. అప్పటికే వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగాయి. తమకేమీ తెలీదని పోలీసులు చెప్పడంతో స్టేషన్ ఆవరణలోనే కన్నీరుమున్నీరయ్యారు. ‘భర్తలేని తనకు కొడుకే దిక్కని.. నా పరిస్థితి ఏం కావాలి’ అంటూ కన్నీరుమున్నీరైంది.


