డాక్టర్ శైలా తాళ్లూరి పెట్టిన పోస్టు
లోకేశ్కు ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు, ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్లూరి పోస్టు
డల్లాస్లో మీ మంత్రి ఒకరు వెధవ వేషాలు వేయాలనుకున్నాడు
పేద పిల్లల కోసం సాయం అడగబోతే అసభ్యంగా ప్రవర్తించాడు
ఆయన పేరు ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను
కావాలంటే మంత్రి నీచ ప్రవర్తనపై ఆధారాలు ఇస్తాను
నా వద్ద సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి
ఆ మంత్రి వద్దా ఇవి ఉంటాయి.. ఫోన్ తీసుకుని చూడండి.. ఇలా ఎంత మందిని ఇబ్బంది పెట్టాడో..
ఒంటరిగా రమ్మంటే సాకు చెప్పి తప్పించుకున్నా
పేద పిల్లలకు సాయం ఆగుతుందనే భయంతో ఇన్నాళ్లూ భరించా
సాక్షి, అమరావతి : ‘మా సంస్థ పేద పిల్లల కోసం పని చేస్తుంది. మా బృందంతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.. అంటే బృందంగా వద్దు.. మీరు మాత్రమే ఒంటరిగా కాఫీ షాప్కు రండి. అక్కడ మనిద్దరం మాట్లాడుకుందాం’ అంటూ చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రి వెదవ వేషాలు వేయబోయాడంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఎక్కడ నలుగురు కలిసినా ఎవరా మంత్రి అంటూ చర్చించుకుంటున్నారు. ఓ ఎన్ఆర్ఐ మహిళతో ఏమిటీ బరితెగింపు అని విస్తుపోతున్నారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరు అంటూ టీడీపీ నేతలు సైతం పరస్పరం ఫోన్లు చేసుకుంటున్నారు.
ఇద్దరు అమ్మాయిలున్న ఆ మంత్రి ఎవరబ్బా.. అంటూ వాకబు చేస్తున్నారు. లోకేశ్కు చెప్పినా చర్యలు తీసుకోలేదంటే ఆయనకు బాగా కావాల్సిన మంత్రి కాబోలు అంటూ మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ శైలా తాళ్లూరి అనే మహిళ ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆమె పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను అందిస్తూ, మహిళా సాధికారత పెంపొందించడానికి కృషి చేస్తున్నారు.
భారతదేశంతో పాటు కెన్యా, సియెర్రా లియోన్, అమెరికా వంటి పలు దేశాలలో ప్యూర్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈమె సేవలకు పలు పురస్కారాలు కూడా లభించాయి. ఈ క్రమంలో అమెరికాలోని డల్లాస్లో జరిగిన నాటా కార్యక్రమంలో డాక్టర్ శైలా తాళ్లూరి చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రిని కలవడానికి ప్రయత్నించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అమాత్యుడు ఆమెను లోబరుచుకునేందుకు విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె కీలక మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు సదరు మంత్రిని ఉద్దేశించి కూడా నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారంటూ ఓ పోస్టు పెట్టారు.
మీరు ఏం పీకారు?
‘నారా లోకేశ్.. క్లీన్ అప్ యువర్ కేబినెట్ బ్రో.. నీ మంత్రుల్లో ఒకడి నీచ ప్రవర్తన గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించు. అన్ని అధారాలు ఇస్తాను. గతంలో అమెరికాలోని డల్లాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ మంత్రి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అపాయింట్మెంట్ పేరుతో నాకు మెసేజ్లు పంపారు. బృందంగా వచ్చి కలుస్తామంటే.. కాదు కాదు కాఫీ షాప్కు ఒంటరిగా రమ్మన్నాడు. ఏదో సాకు చెప్పి తప్పించుకున్నా. అసభ్య మెసేజ్లు, ఫొటోలతో నన్ను విసిగించాడు.
ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లల కోసం వచ్చే సాయం ఇలాంటి బ్రోకర్ల వల్ల ఆగిపోతుందనే భయంతో అవమానాన్ని దిగమింగి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. ఇప్పుడిక తప్పడం లేదు. ఆ మంత్రి ఎవరనేది నేను ఫొటో సహా నేరుగా చెబుతాను. కాకపోతే మాకు ఒకమాట చెప్పి ఉండాల్సిందని తర్వాత మీరు అంటారు. అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఫలానా వారికి చెప్పి ఉండాల్సింది కదా.. మాకు చెప్పి ఉండాల్సింది కదా.. అంటారు. అందుకే ఆ మంత్రి ఎవరో ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను. ఒక్క ‘సారీ యూ హ్యాడ్ టు గో త్రూ దిస్’ అనే మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెస్పెక్టబుల్గా అడుగుతున్నాను.
ఇలాంటి ఘటనల్లో మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏమి పీకుతున్నారు? పీకారు సో ఫార్??!! ఆ భోగాపురం పీపుల్ బెటర్.. చెట్లు పీకి ఇంకో చోట నాటారు. నా వద్ద ఉన్న చాట్ హిస్టరీ, స్క్రీన్షాట్లు ఆ మంత్రి వద్ద కూడా ఉంటాయి. మీకు ఫోన్లో పేరు చెప్పానుగా.. ఆయన ఫోన్ తీసుకుని చూడండి.. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది. మీరు విచారణ నిర్వహిస్తే నా వద్ద ఉన్న ఆధారాలు అన్నీ ఇస్తాను. ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ డాక్టర్ శైలా తాళ్లూరి డిమాండ్ చేశారు. కాగా, ఈ పోస్టుపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.


