తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వై జంక్షన్ సమీపంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం , జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
చంద్రబాబు పార్టీ అంటే.. వెన్నుపోటు పార్టీ.. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ మినహా ఇంకేమైనా ఉందా..?
రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు సగటు ధర రూ.289.. బాబు ప్రభుత్వంలో రూ.214 మాత్రమే
ప్రతి కిలోపై రైతు రూ.75 నష్టపోతున్నాడు
ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్సార్సీపీ
హయాంలో కిలో పొగాకు సగటు ధర రూ.326
ఇప్పుడు అక్కడ రూ.236కి పడిపోయింది
2023–24లో రాష్ట్రవ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలో రూ.411.. ఇప్పుడు రూ.214 మాత్రమే
ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు.. కేంద్రానికి చెందిన ‘పీఐబీ’ 2025లో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు విడుదల చేసిన గణాంకాలే
ఓ వైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం పెరుగుతున్నాయి
మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు
పంట వేయండి.. మేం కొంటామని టొబాకో బోర్డు రైతులకు హామీ ఇచ్చింది
ఆ హామీని నమ్మి రైతులు సాగు చేస్తే ఇప్పుడు ఆ మేరకు కొనుగోళ్లు జరగడం లేదు
నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించాక గత వారం, పది రోజులుగా కిలోకు సుమారు రూ.10 పెరిగింది.. పొగాకు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు
ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం రిజెక్ట్ చేస్తున్నారు
దళారులు సిండికేట్ అయినా బాబు సర్కార్ నో యాక్షన్
బాబు హయాంలో గంజాయి మినహా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
అది సాగు చేసేది చంద్రబాబు వెన్నుపోటు పార్టీ మనుషులే
రైతులకే కాదు.. మహిళలకూ సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు
రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది
ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న లాంటి కుటుంబాలను మన ప్రభుత్వం రాగానే రెట్టింపు సాయం అందించి ఆదుకుంటాం
దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి గిట్టుబాటు ధర, సమస్యలపై నేరుగా రైతులతో మాట్లాడిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో సుమారు 21 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి ఇది. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా.
– వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు నాయుడు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితులే నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు ధర సగటున రూ.289 ఉంటే ఇప్పుడు రూ.214 మాత్రమే పలుకుతోందని.. ప్రతి కిలోపై రైతు రూ.75 చొప్పున నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలో రూ.411 పలికితే.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే ఉందని, ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పీఐబీ’ అధికారికంగా విడుదల చేసిన గణాంకాలని తెలిపారు. ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతుంటే.. మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదన్నారు.
పొగాకు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని.. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం రిజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగా సర్కారు తీరుతో నష్టపోతున్న పొగాకు రైతులతో స్వయంగా మాట్లాడేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారు. దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. పొగాకు సాగు, కొనుగోళ్ల పరిస్థితి, రైతులకు అందుతున్న ధర, ఎదుర్కొంటున్న సమస్యలను వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల ఇక్కట్లు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చించారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...
అన్నింటా విధ్వంసం.. ప్రశ్నిస్తే అరెస్టులు
చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనలో అన్ని వర్గాలూ నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు.. మహిళా సాధికారత.. సుపరిపాలన.. అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. బాబు పాలనలో పొద్దున లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే.. ఎవరైనా అన్యాయానికి గురైన పరిస్థితుల్లో ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే కనిపిస్తాయి.
రోడ్డెక్కుతున్న రైతులు..
చంద్రబాబు నాయుడు పార్టీ అంటే.. వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా మిగిలిందా..? అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా..? వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ.. చివరకు ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ రోజు నేను దేవరపల్లికి వచ్చి పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నా. పొగాకు పంటను తీసుకున్నా.. ఇవాళ కనిపిస్తున్నది సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డున పడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 
ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శ లేదు
జంగారెడ్డిగూడెం సమీపంలోని బుట్టాయగూడెం మండలానికి చెందిన వెంకటేశ్వరరావు అన్న కుటుంబం నా కళ్ల ఎదుటే నిలబడి ఉంది. ఆ అన్నకు రెండు బ్యారెన్లు ఉన్నాయి. పది ఎకరాల్లో పంట సాగు చేసి.. గిట్టుబాటు ధర రాక, పంటను అమ్ముకునే పరిస్థితి లేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ అన్న భార్య ఈ రోజు నా ఎదుట నిలబడి ఉంది. ఆ అమ్మ ఆక్రందన వినేందుకు, పరామర్శించేందుకు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ వెళ్లలేదు. రేట్లు అన్యాయంగా పడిపోతున్నా.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కనీసం పరామర్శ కూడా చేయని ప్రభుత్వం ఇది.
నాడు పొగాకుకు అత్యధికంగా రూ.411.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే
ఒక్కసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిస్థితిని గుర్తు చేసుకుందాం. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి పొగాకు సగటు ధర కిలోకు రూ.289 చొప్పున లభించింది. అత్యధిక ధర కిలో రూ.411 చొప్పున కొనుగోలు జరిగింది. ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) 2025 జనవరి 1న అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విడుదల చేసిన గణాంకాలివీ. ఇవాళ పరిస్థితి చూస్తే.. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి రాష్ట్రంలో కిలో పొగాకు సగటు ధర కేవలం రూ.214 మాత్రమే. ఎక్కడ రూ.289?.. ఎక్కడ రూ.214? అంటే.. ఒకప్పుడు రూ.289 వచ్చిన చోట ఇప్పుడు రూ.214 మాత్రమే వస్తోంది. ప్రతి కిలోపై రైతు సుమారు రూ.75 నష్టపోతున్నాడు. ఇదే ఉత్తరాది ప్రాంతంలో, ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో పొగాకు కిలో సగటు ధర రూ.326 పలికింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆ సగటు ధర కేవలం రూ.236కి పడిపోయింది.
ఖర్చులు పెరిగాయి.. ధరలు పతనం
ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతున్నాయి. మరోవైపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు. పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.
ఉత్తరాదిలో 12 శాతమే కొనుగోలు..
ఈ ఉత్తరాది ప్రాంతంలో సుమారు 83 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. 105 రోజుల వేలం ముగిసే సమయానికి కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే పండించిన పంటలో సుమారు 12 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. టొబాకో బోర్డు రైతులకు గ్యారెంటీ ఇస్తూ లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చింది. పంట వేయండి, మేం కచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పింది. 49.70 మిలియన్ కిలోలు టార్గెట్గా నిర్థారించి కొనుగోలు చేస్తామని చెప్పింది. వాళ్లు కొంటామని చెప్పిన తరువాతే రైతులు పంటలు వేశారు. ఆ హామీని నమ్మి సాగు చేశారు. ఇప్పుడు హామీ ఇచ్చిన మేరకు కొనుగోలు జరగడం లేదు. 
దేవరపల్లి వై జంక్షన్ వద్ద వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టిన అశేష జనవాహినిలో ఓ భాగం
పొగాకు రైతులకు దుర్భర పరిస్థితి..
రాష్ట్రంలో రైతులు నమ్మి పంట వేస్తే.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? టొబాకో బోర్డు లిఖితపూర్వకంగా రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మి రైతులు పంట వేశారు. కానీ చివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే హామీ ఇచ్చిన పరిమాణంలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. 105 రోజుల వేలం ప్రక్రియ ముగిసిపోయినా రైతుల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రైతులకు ఎంతటి దుర్భర పరిస్థితిని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
నా పర్యటన ప్రకటనతో రూ.10 పెంపు
నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించిన తర్వాత గత వారం, పది రోజులుగా కిలోకు సుమారు రూ.10 ధర పెరిగింది. లేదంటే ఆ పెంపు కూడా ఉండేది కాదు. సిండికేట్ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ అత్యధిక ధర రూ.260 నుంచి రూ.262 వరకు మాత్రమే ఉంది. సగటు ధర రూ.174 వరకు పడిపోయింది. ఈ ధరలతో రైతు ఎలా బతుకుతాడు? ఎలా అప్పులు తీర్చుకుంటాడు? ఎలా మళ్లీ పంట వేస్తాడు?
దళారులు సిండికేట్ అయినా నో యాక్షన్..
పొగాకు పంట కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం వరకు పొగాకును రిజెక్ట్ చేస్తున్నారు. ‘నో బిడ్స్‘ పేరుతో వేలంలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దళారీ వ్యవస్థ పేట్రేగిపోయి అంతా సిండికేట్గా మారినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కొనుగోలుదారుడిని కూడా బ్లాక్లిస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయలేదు.
చంద్రబాబు కంటితుడుపు మాటలు..
మరో తమాషా ఏమిటంటే.. పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు ఇప్పుడు గమనించారట! రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు మూడేళ్ల పాటు ఇస్తామని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబునాయుడూ మా ప్రభుత్వ హయాంలో రూ.లక్ష వరకు సున్నా వడ్డీ పంట రుణాలు పథకం ఉండేది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీకే అందించాం. 84.66 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్ల మేర సున్నా వడ్డీ కింద ఇచ్చి ఆదుకున్న చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. మరి మీరు ఏం చేశారు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. రైతులకే కాదు, మహిళలకూ సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. అందరినీ రోడ్డు మీద పడేసి.. కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లుగా, రూ.50 వేల వరకు ఇస్తామని, ఇక పండుగ చేసుకోమని డ్రామాలు ఆడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని చంద్రబాబును నిలదీస్తున్నా.
ఆదుకుంటాం.. రెట్టింపు సాయం చేస్తాం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఒత్తిడి తెస్తుంది. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న లాంటి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అండగా ఉంటాం. ఇది ప్రభుత్వ తప్పిదం కాబట్టి.. ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి.. ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా రూ.7 లక్షలు ఇవ్వడం లేదు కాబట్టి.. ఇవ్వని కారణంగా, ఆ రూ.7 లక్షలను డబుల్ చేసి, ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేస్తాం.
మన ప్రభుత్వంలో ఏం చేశామంటే..
అదే మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్ఫెడ్ను వెంటనే రంగంలోకి దింపాం. మార్క్ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించగానే ప్రతి గ్రేడ్కు కనీస ప్రారంభ ధర నిర్ణయించాం. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. రైతులకు మంచి ధర వచ్చింది. రిజెక్ట్లు, ‘నో బిడ్స్‘ పరిస్థితి తగ్గింది. ఇదీ గతంలో జరిగింది! అంతే కాదు.. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో రూ.7,800 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఆదుకుంది.
దేవరపల్లిలో హెలిప్యాడ్ సమీపాన వైఎస్ జగన్ను చూడటానికి భారీగా తరలివచ్చిన జనసందోహంలో ఓ భాగం
ఇప్పుడు చేతులెత్తేసిన సర్కారు...
ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తోంది ఏమిటంటే.. దళారులతో రాజీ పడింది. నాకింత.. నీకింత అని కంపెనీలతో సర్దుబాట్లు చేసుకుంది. చేసుకుంది కాబట్టే.. మార్క్ఫెడ్ను పోటీ కొనుగోలుదారుగా మార్కెట్లోకి తీసుకురాలేదు. రైతును పూర్తిగా దళారుల దయాదాక్షిణ్యాలకే వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మరో అన్యాయం ఏమిటంటే.. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల పొగాకు పండితే, ప్రభుత్వం కేవలం 94 మిలియన్ కిలోలకు మాత్రమే మద్దతు ఇస్తామని చెబుతోంది. అంటే.. మిగతా పంటను కొనుగోలు చేయబోమని చెప్పకనే చెబుతోంది. కంపెనీలకు కిలోకు రూ.20 సబ్సిడీ ఇస్తామని ప్రకటిస్తోంది. అంటే కంపెనీలు.. ఇప్పుడున్న ధర కంటే రైతులకు మరో రూ.20 తగ్గించి ఇచ్చేందుకు దారులు తెరిచింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సింది పోయి..
రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం పనిచేయాల్సింది పోయి, కంపెనీల ప్రయోజనాల కోసం విధానాలు రూపొందిస్తోంది. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా. వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి. ప్రతి గ్రేడ్కు కనీస మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్లో పోటీ వాతావరణం తీసుకురావాలి. అప్పుడు మాత్రమే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మా ప్రభుత్వం హయాంలో ఇదే విధానాన్ని అమలు చేసి పొగాకు రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు అదే మార్గం మాత్రమే రైతును కాపాడగలదు.
రెండేళ్లుగా రైతులకు దగా..
రైతులను రెండేళ్లుగా అన్ని విధాలా చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల సమయంలో పీఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ‘ పేరుతో ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి చంద్రబాబు ప్రతి రైతుకు రూ.60 వేలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రావాల్సిన రూ.41 వేలు ఇవ్వకుండా ఎగరగొట్టారు. పైగా సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం జాబితా నుంచే తొలగించారు. కౌలు రైతులను తీసేశారు. అటవీ హక్కుల చట్టం కింద భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులను కూడా పథకం నుంచి తప్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని సైతం చంద్రబాబు రద్దు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగినా, అదే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? మొంథా తుపాను వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు గతంలో అందిన సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యవసాయ పరీక్షా ల్యాబ్లను బలహీనపర్చారు.
రైతులకు అవసరమైన ఎరువుల ధరలు
రెండేళ్లలో విపరీతంగా పెంచేశారు. మరోవైపు బ్లాక్లో దళారీల వద్ద రైతన్నలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉంది.
ఆ ఒక్క పంటకే గిట్టుబాటు ధర.. సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే..
చంద్రబాబు హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా..? అది గంజాయి!
బాబు వింత మాటలు.. అంతా ఢమాల్
చంద్రబాబునాయుడు అంటాడు.. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేసే కార్యక్రమం చేశాడు. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట! కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేశాడు. మామిడి తింటే షుగర్ వస్తుందట! అందుకే మామిడి పంటను ఢమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులను రోడ్డు మీదకి తెచ్చారు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బ తింటుందట! పొగాకుకు మంచి రేటు వస్తే బాగుండదని చెప్పి, పొగాకు రైతులను కూడా ఢమాల్ చేశాడు. కాబట్టి చంద్రబాబు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం అన్నట్లుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులున్నాయి.


