వైఎస్ జగన్ పర్యటనలో సర్కారు పెద్దల కుతంత్రం
ఫలితంగా అడుగడుగునా భద్రతా వైఫల్యం
హెలిప్యాడ్ వద్ద ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించని వైనం
బారికేడ్లను తోసుకుని వైఎస్ జగన్ వద్దకు దూసుకొచ్చిన జనం
పొగాకు కొనుగోలు కేంద్రం వద్దా అదే పరిస్థితిసంబంధం లేనట్టు పక్కకు తప్పుకున్న ఖాకీలు
ఉద్దేశపూర్వకంగానే రక్షణ కల్పించలేదని తేటతెల్లం
కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామన్న వైఎస్సార్సీపీ
సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనను విఫలం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. హెలిప్యాడ్ వద్ద, పొగాకు వేలం కేంద్రంలో పోలీసుల వైఫల్యం కళ్లకు కట్టింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే సెక్యూరిటీని తగ్గించి.. తద్వారా గందరగోళం సృష్టించి.. తొక్కిసలాట జరిగితే జగన్ పైకి అపవాదు నెట్టేయాలన్నది ప్రభుత్వ పెద్దల కుతంత్రం అని స్పష్టమవుతోంది. అయితే వైఎస్సార్సీపీ నేతల పర్యవేక్షణతో ప్రభుత్వ పన్నాగం బెడిసికొట్టింది.
వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.27 గంటలకు దేవరపల్లి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు నామమాత్రంగా సిబ్బందిని కేటాయించారు. వారు దూరంగా ఉండటంతో ఒక్కసారిగా జనం బారికేడ్లను తోసుకుని హెలీప్యాడ్ వద్దకు దూసుకుపోయారు. అప్పుడు అక్కడ కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా లేడు. దీంతో అతి కష్టం మీద వైఎస్ జగన్ కారు వద్దకు చేరుకుని.. ఎక్కారు. అప్పటికే చాలా మంది ఆ వాహనం చుట్టూ చేరిపోయారు.

ఇటీవల మరణించిన పొగాకు రైతు పాల వెంకటేశ్వరరావు భార్య సీతారత్నం, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె వెంకటరత్నం తమ సమస్యలు విన్నవించుకోగా.. నేనున్నానని భరోసా ఇస్తున్న వైఎస్ జగన్
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు నేతలు, కార్యకర్తలు కింద పడిపోయారు. వెంటనే పలువురు నేతలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ చేరుకోగానే, అక్కడా భారీగా జనం దూసుకొచ్చారు. వారిని నియంత్రించేందుకు లోపల పోలీసులు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు ఉన్నతాధికారులు ఇలా ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితిని సృష్టించారని తెలుస్తోంది.
ఇది ముమ్మాటికీ కుట్రే
‘వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు హెలిప్యాడ్, ఇతర పరి్మషన్లు, సెక్యూరిటీ గురించి కలెక్టర్కు, ఎస్పీకి లేఖల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఇస్తామని చెప్పి, అర్ధరాత్రి హుటాహుటిన ఆ సంఖ్యను సగం కంటే ఎక్కువగా తగ్గించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య ప్రజలకు ఇంకేమి రక్షణ కల్పిస్తుంది? జగన్కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రభుత్వం పెద్దలే కుట్రపూరితమైన ఆలోచనతో సెక్యూరిటీని తగ్గించారు. ఇది ముమ్మాటికీ కుట్రే. ఈ విషయమై అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది.
జన సందోహం వల్లేతోపులాట
దీనితో వైఎస్సార్సీపీకి సంబంధం లేదు
స్పష్టం చేసిన హోటల్ నిర్వాహకులు
ఓ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
దేవరపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ప్రజలు విశేష సంఖ్యలో రావడం, వారిలో చాలా మంది తమ హోటల్కు రావడం వల్ల రద్దీ ఏర్పడి, స్వల్ప నష్టం జరిగిందని, ఈ ఘటనకు వైఎస్సార్సీపీకి సంబంధం లేదని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య తెలిపారు. తమ కుటుంబం వైఎస్ జగన్ అభిమానులమని, ఆయన వల్ల ఎంతో లబ్ధి పొందామని వరలక్ష్మి చెప్పారు.

తమ హోటల్ పొగాకు వేలం కేంద్రం గేటు పక్కన ఉండడం, పలువురు హోటల్లోకి రావడం వల్ల స్పల్ప తోపులాట జరిగి, కొంత నష్టం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు హోటల్ను ధ్వంసం చేసినట్టు ఓ టీవీ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. హోటల్లో వీడియో తీయవద్దని, తమకు నష్ట పరిహారం వద్దని చెప్పామని, అయినా ఆ ఛానల్ ప్రతినిధి వీడియో తీసి తప్పుగా ప్రచారం చేశాడని మండిపడ్డారు. తాము ఎప్పటికీ జగన్ అభిమానులమేనని వరలక్ష్మి స్పష్టం చేశారు.


