మూలీ పరాఠా
కావలసినవి: ముల్లంగి తురుము: 2 కప్పులు, గోధుమ పిండి: 3 కప్పులు, పచ్చిమిర్చి తరుగు: టీస్పూన్, అల్లం తురుము: టీస్పూన్, కారం: 1/2 స్పూన్, వాము: 1/2 స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, గరం మసాలా: పావు చెంచా, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె: పరాఠాలు కాల్చడానికి.
తయారీ: ముల్లంగి తురుములో కొద్దిగా ఉప్పు కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఉప్పు వేయడం వల్ల ముల్లంగిలోని నీరంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక కాటన్ బట్టలో లేదా చేతులతో ముల్లంగి తురుమును గట్టిగా పిండి, నీటిని పూర్తిగా వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, ఒక చెంచా నూనె వేసి, ముల్లంగి తురుమును పిండగా వచ్చిన నీటిని ఉపయోగించి చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత నీరు తీసేసిన ముల్లంగి తురుములోకి పచ్చిమిర్చి, అల్లం తురుము, వాము, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చిన్న పూరీలా ఒత్తి, దాని మధ్యలో రెండు చెంచాల ముల్లంగి మిశ్రమాన్ని ఉంచాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని పైకి తెచ్చి స్టఫింగ్ను పూర్తిగా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా తయారుచేసుకున్న వాటిని పెనంపై వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. కాల్చేటప్పుడు నెయ్యి లేదా నూనె రాస్తే పరాఠాలు రుచిగా వస్తాయి.
స్టఫ్డ్ డేట్స్
కావలసినవి: ఖర్జూరాలు: 15–20, బాదం పప్పులు: 10, జీడిపప్పు: 10, పిస్తా పప్పులు: స్పూన్ (సన్నని తరుగు), పీనట్ బటర్ లేదా
ఆల్మండ్ బటర్: 4 స్పూన్లు, డార్క్ చాక్లెట్: 1/2 కప్పు,
సీ సాల్ట్ : ఒక చిటికెడు, (టేస్ట్ పెంచడానికి)
తయారీ: ముందుగా ఖర్జూరాలను తడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ప్రతి ఖర్జూరాన్ని ఒక వైపు మాత్రమే చాకుతో నిలువుగా కట్ చేసి, లోపల ఉన్న గింజను జాగ్రత్తగా తీసేయాలి. ఖర్జూరం రెండు ముక్కలుగా విడిపోకుండా కేవలం మధ్యలో పాకెట్ లాగా ఓపెన్ అవ్వాలి. ఒక చిన్న పాన్లో నూనె లేదా నెయ్యి లేకుండా బాదం, జీడిపప్పులను లో–ఫ్లేమ్పై దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు గింజ తీసేసిన ప్రతి ఖర్జూరం మధ్యలో పావు చెంచా పీనట్ బటర్ను నింపాలి. ఆ తర్వాత దానిపై ఒక వేయించిన బాదం పప్పు, ఒక జీడిపప్పు ముక్కను గట్టిగా నొక్కి పెట్టాలి. చివరగా పైభాగంలో సన్నగా తరిగిన పిస్తా ముక్కలు, ఒక చిటికెడు సీ సాల్ట్ చల్లాలి. చివరిగా ఈ స్టఫింగ్ చేసిన ఖర్జూరాలను కరిగించిన డార్క్ చాక్లెట్లో ముంచి, ఒక ప్లేట్లో పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. చాక్లెట్ గట్టిపడిన తర్వాత ఇది హోమ్మేడ్ క్యాండీ బార్ లాగా మారుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి.
కుర్కురీ భేండి
కావలసినవి: శెనగపిండి: 4 స్పూన్లు, వరిపిండి: 2 చెంచాలు, కారం: స్పూన్, పసుపు: పావు చెంచా, ధనియాల పొడి: స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, నిమ్మరసం: స్పూన్, వాము: 1/2 స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: డీప్ ఫ్రైకి తగినంత.
తయారీ: ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి కాటన్ బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వాటికి ఇరువైపులా తొడిమలు తీసేసి, నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని, ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, వాము వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో శెనగపిండి, వరిపిండి చల్లి చేతులతో కలుపుతూ పిండిని బెండకాయ ముక్కలకు బాగా పట్టించాలి. బెండకాయలో ఉండే సహజమైన తేమ వల్ల పిండి ముక్కలకు అంటుకుంటుంది.
ఇపుడు బాండీలో నూనె పోసి బాగా కాగాక, సిద్ధం చేసుకున్న బెండకాయ ముక్కలను విడివిడిగా వేస్తూ, మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. బెండకాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి, కరకరలాడే వరకు వేయించి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే వేడివేడి కుర్కురి భేండి సిద్ధం. ఈ ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని, కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది.


