మౌనం – అది అద్భుతం, వాస్తవికం! | Children's Inspirational Funday Story Written By Mandalaparthi Kishore | Sakshi
Sakshi News home page

మౌనం – అది అద్భుతం, వాస్తవికం!

Jul 12 2026 8:26 AM | Updated on Jul 12 2026 8:26 AM

Children's Inspirational Funday Story Written By Mandalaparthi Kishore

మో యాన్‌

లిట్‌వరల్డ్‌

‘రచయితలు తమకు తెలిసింది మాత్రమే రాయగలరు; అది కూడా, తమకు సహజమైన పద్ధతిలో మాత్రమే రాయగలర’న్నారు ప్రపంచ ప్రసిద్ధ చైనీస్‌ రచయిత మో యాన్‌. అది ఆయన అసలు పేరు కాదు– పెట్టుకున్న కలంపేరు. దానికి ‘మాట్లాడ వద్దు!’ అని అర్థం. మో బతికి బట్టకట్టిన వ్యవస్థలో, పాలకులకు భజన చేసేవారికి తప్ప మరెవరికీ మాట్లాడే హక్కు లేదు. నిజానికి కొద్దిపాటి మినహాయింపులతో, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొని వుందిప్పుడు! చైనా ఆర్థిక– సామాజిక– సాంస్కృతిక వ్యవస్థలోనూ అదే పరిస్థితి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది.

‘ప్రజా రిపబ్లిక్‌’ పేరుగొప్ప, ఊరుదిబ్బగా మిగిలింది. 1980 దశకంలో, ఇందులో కొద్దిపాటి మార్పులు రాకపోలేదు– కానీ, మానవ హక్కుల కోసం ఆజన్మాంతం పోరాడిన లియూ జియావ్బో లాంటి వాళ్ళు కన్నుమూయడానికి కొద్దికాలం ముందువరకూ కారాగారంలోనే గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఓ రచయిత పెట్టుకోదగిన కలంపేరునే, మో యాన్‌ ఎంచుకున్నాడు! అంతటి విచక్షణ ఉన్నందువల్లనే 2012లో మో నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకోగలిగాడు. అప్పటికే ఆయన స్వదేశంలోనూ, విదేశాల్లోనూ సుప్రసిద్ధుడు!

మనం నివసించే వ్యవస్థలో, చెప్పే మాటకూ చేసే పనికీ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడిన నేపథ్యంలో రచయితలూ కళాకారులూ ఏం చెయ్యగలుగుతారు? అది రష్యాలోనైనా సరే, చైనాలోనైనా సరే, లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లోనైనా సరే –మరే దేశంలోనైనా సరే– ఇలాంటి విరోధాభాస పాతుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చెయ్యగలరు పాపం? అద్భుత వాస్తవికత అనే కాల్పనిక వటవృక్షం నీడలో రవంత ఊరట పొందగలుగుతారంతే! మిహయీల్‌ బుల్గాకఫ్‌ రచనల్లో చేసిందే ఆంద్రెయ్‌ తార్కఫ్సి్కయ్‌ సినిమాల్లో చేశాడు. గాబ్రియల్‌ గార్సియా మార్కెజ్‌ మెక్సికోలో చేసిందే జిగ్మండ్‌ స్కూజి¯Œ ‡్ష లాత్వియాలో చేశాడు. మో యాన్‌ అదే పని చైనాలో చేశాడు! నోరు తెరవని మౌనిగా ఉంటూనే, తను చెప్పదల్చుకున్న కథలన్నీ చెప్పేశాడు మో.

చైనా చరిత్రను– ముఖ్యంగా  మో యాన్‌ లాంటి రైతుబిడ్డల జీవితాలను– 1966 నాటి చైనా సాంస్కృతిక విప్లవం పెనుమలుపు తిప్పింది. మలుపులన్నీ మంచి వైపే తిరగాలన్న రూలేం లేదని చదువుకున్న పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చైనా చరిత్ర చదువుకున్న వాళ్ళెవరూ, సాంస్కృతిక విప్లవం తెచ్చిపెట్టిన మార్పులన్నీ మంచివేనని అనుకోరు, అనలేరు! ఆ సంవత్సరమే మో బడి వదిలిపెట్టి మడిలోకి దిగాల్సివచ్చింది. అప్పటికి ఆయన అయిదో తరగతి చదువుతూండేవాడు. తన కుటుంబానికి సొంతమైన ఓ మడిచెక్కలో, పశువులను మేపుకుంటూ ఆరేడేళ్ళపాటు అలాగే గడిపేశాడు మో. బళ్ళో ఒంటబట్టించుకున్న అక్షరమ్ముక్కల్ని మర్చిపోకుండా వుండేందుకు మో‘షిన్‌ హువా నిఘంటువు’ను రోజంతా తిరగేస్తూవుండేవాడు. ఒంటరితనం శాపమే అతని పాలిట వరమైంది. తనలోకి తాను తొంగిచూసుకోగల రచయితకు పురుడుపోసిన మంత్రసాని ఆ ఒంటరితనమే! పల్లెపదాలు వింటూ పల్లెప్రజలు ఆడే బొమ్మలాటలూ, బయలాటలూ చూస్తూ పెరగడం వల్లనే మో మాటకు ఆ మట్టివాసన అంత గట్టిగా అంటుకుంది. అద్భుత వాస్తవికతను కూడా చైనా వాసులకు సొంతంచేసింది ఈ మట్టివాసనే!

తనలాగే అర్ధాంతరంగా చదువులు మానేసిన మరికొందరు రైతుబిడ్డలతో కలిసి, మో యాన్‌ 1973లో ఓ నూలుమిల్లులో కూలిపనికి చేరాడు. అప్పటికే వాళ్ళలో కొందరికి కళలూ, సాహిత్యంలో వైవిధ్యంతో పరిచయం ఉంది. వాళ్ళ సాహచర్యం మో జీవనాన్ని మరో మలుపు తిప్పింది. విలియం ఫాక్నర్, మార్కెజ్‌ లాంటి అద్భుత వాస్తవిక వాదులను చదువుకున్న తరమది. మో యాన్‌కు వాళ్ళను పరిచయం చేసింది ఈ చదువుకున్న అబ్బాయిలే! చైనా ఆర్థిక వ్యవస్థను ‘సోషలిస్ట్‌ మార్కెట్‌ వ్యవస్థ’గా మార్చిన పుణ్యం కూడా ఈ చదువుకున్న అబ్బాయిలకే దక్కుతుంది. సదరు సోషలిస్ట్‌ మార్కెట్‌ వ్యవస్థే, చైనా పారిశ్రామిక రంగంలో స్వెట్‌ షాప్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందని చరిత్ర చెప్తోంది. అది వేరే విషయం అనుకోండి!!

మో యాన్‌ రచనల విషయానికి వస్తే, 1984లో ఆయన రాసిన ‘గాజు ముల్లంగి’, నవలిక అతనికి రచయితగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ యేడాదే, మో ‘చైనా ప్రజా విమోచన సైన్యం లలితకళాక్షేత్రం’లో చేరిన మాట నిజమే. అయితే, అతగాడు అంతకు ముందునుంచీ రాస్తూవున్న మాటా నిజమే! మరో రెండేళ్ళకు మో రాసిన ‘ఎర్రజొన్నలు’ నవల సంచలనాన్ని రేకెత్తించింది. కాలక్రమంలో నడవని ఈ కథను, ఓ గొర్రెల కాపరి కుర్రాడు చెప్తాడు. అది రచయితేనని విమర్శకుల నమ్మకం.

ఈ నవలను మూలకథగా చేసుకుని జ్షాంగ్‌ యిమో దర్శకత్వంలో రూపొందిన సినిమాకు బర్లినాల్‌ (బర్లిన్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం)లో గోల్డెన్‌ బేర్‌ పురస్కారం దక్కింది. ఈ రెండు రచనలకూ మధ్యలో మో ‘ఆనందం’ అనే నవలిక రాశాడు కానీ, అది పాలకుల కన్నెర్రకు గురైంది. అలాగే, 1987లో చైనా మార్కెట్లను ముంచెత్తిన వెల్లుల్లి సంక్షోభాన్ని ఇతివృత్తంగా తీసుకుని మో ‘వెల్లుల్లి వీరగాథ’ అనే నవల రాశాడు. పాలకులు ఈ రచనను– మొదట్లో– చూసీ చూడనట్లు వదిలేశారు. తీరా 1989లో తియానాన్మెన్‌ స్క్వేర్‌ అణచివేత నేపథ్యంలో ‘వెల్లుల్లి వీరగాథ’ నవలను నిషేధించారు. ఈ నిషేధాన్ని చైనాకు మాత్రమే పరిమితం చెయ్యడం గమనార్హం!

ఇలాంటి అనుభవాలు మో యాన్‌కు మంచి పాఠమే నేర్పించాయి. దాంతో మో కాస్తో కూస్తో లౌక్యం ఒంటబట్టించుకున్నారు. 2012 మే నెల్లో యానాన్‌ ప్రసంగానికి నూరు ప్రతులు తయారు చేసే బృందంలో చేరి తన ‘బుడతా భక్తి’ ప్రదర్శించాడు. అంతటి లౌక్యుడికి నోబెల్‌ సాహిత్య పురస్కారం ఏమిటి, దేశాధ్యక్ష పదవి దక్కినా ఆశ్చర్య పడనక్కర్లేదు!
- మందలపర్తి కిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement