జానకి మామయ్య చంద్రశేఖర్ ‘ఫన్ డాక్టర్’. ఆయన సూచన మేరకు చెన్నై చేరుకుని, గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు జానకి. ఇదిలా ఉంటే... ఒక వేదికపై జానకి పాడిన పాట విని, ముగ్ధులయ్యారు వి. రామ్ప్రసాద్. కాగా, ఓసారి చంద్రశేఖర్ జేబులోంచి ఒక ఫొటో కింద పడితే, ఆ ఫొటోలోని వ్యక్తిని ఇష్టపడ్డారు జానకి. ఆ వ్యక్తి ఎవరో కాదు... వి. రామ్ప్రసాద్. కానీ, ఆ ప్రేమను బయపెట్టలేదు.
అయితే ఒక సందర్భంలో చంద్రశేఖర్ స్వయంగా జానకిని రామ్ప్రసాద్కి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ ఇద్దరి వివాహం 1959లో జరిగింది. 1997లో రామ్ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటివరకూ కూడా జానకి ఏ పాటల రికార్డింగ్కి వెళ్లినా ఆమె వెన్నంటే ఉండేవారు. జానకిని బాగా ప్రోత్సహించారు. భర్త మరణానంతరం జానకి ‘రంగు’ చీరలు కట్టుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారు.
‘‘ఆయనకు నా ప్రతి పాట ఎంతో ఇష్టం. నా రికార్డింగ్ సెషన్ ్సలో కూడా ఆయన నన్ను అస్సలు వదిలిపెట్టేవారు కాదు. నేను కూడా ఆయన్ను వదిలి ఉండలేకపోయేదాన్ని. ఆయన తన జీవితమంతా నా కోసమే గడిపారు. ఆయన మద్దతు లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఆయన నాతో ఉన్నారు, నాతోనే ఉన్నారు, ఇకపై కూడా నా ఆలోచనల్లో ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు!’’ అంటూ భర్త దూరమైన తర్వాత ఓ సందర్భంలో జానకి ఎంతో భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ దంపతుల కుమారుడు మురళీకృష్ణ భరతనాట్యంలో ప్రవీణుడు. కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు కూడా. ఈ ఏడాది జనవరిలో మురళీకృష్ణ మరణించారు. అలాగే కొన్ని రోజుల క్రితం అమెరికాలోని తన మనవడు చనిపోవడంతో జానకి చాలా మనోవేదనకు గురయ్యారు.


