ఒక చుక్క నీరు కూడా వృథా కాకూడదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. చేతుల్లో ఎలాంటి భారీ యంత్రాలు లేవు.. కోట్ల రూపాయల ప్రాజెక్టులు లేవు.. కానీ ఒకే లక్ష్యం ఉంది.. వర్షపు నీటిని కాపాడాలి. ఆ సంకల్పంతో వేలాది మంది గ్రామస్తులు కదిలారు. ఫలితం.. కేవలం 15 రోజుల్లో ఏకంగా 31 కోట్ల లీటర్ల నీటిని సంరక్షించిన అరుదైన విజయగాథ ఇది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది.
ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో మొదలైన ఈ జల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వర్షాలు కురిసినప్పుడు నీరు వేగంగా ప్రవహించి గ్రామాల నుంచి బయటకు వెళ్లిపోకుండా, ప్రతి చుక్కను భూమిలోకి చేర్చాలనే ఆలోచనతో గ్రామస్తులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ‘మోర్ గావ్, మోర్ పానీ 2.0’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వందలాది గ్రామాల్లో ప్రజలు శ్రమదానం చేశారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, రైతులు, యువత కలిసి నీటి నిల్వ నిర్మాణాల పనుల్లో పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు, సోక్పిట్లు, చిన్న నీటి నిల్వ గుంతలు, వర్షపు నీటిని మళ్లించే కాలువలు వంటి అనేక నిర్మాణాలను తక్కువ సమయంలో పూర్తి చేశారు.
ఈ ప్రయత్నంలో వేలాది చిన్న చిన్న పనులు కలిసి ఒక పెద్ద ఫలితాన్ని ఇచ్చాయి. మొత్తం 3 లక్షలకు పైగా జల సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు కావడంతో వర్షపు నీరు నేరుగా భూగర్భ జలాల్లోకి చేరే అవకాశం పెరిగింది. సాధారణంగా వాగులు, కాలువల ద్వారా వెళ్లిపోయే కోట్లాది లీటర్ల నీరు ఇప్పుడు గ్రామాల భవిష్యత్తుకు నిల్వగా మారింది. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి ప్రజల భాగస్వామ్యం. కేవలం ప్రభుత్వం చేసే పనిగా కాకుండా, తమ గ్రామానికి తామే నీటి రక్షకులుగా మారిన ప్రజల ఆలోచనే ఈ విజయానికి కారణమైంది. నీటి సమస్యను ఎదుర్కోవడానికి పెద్ద ప్రాజెక్టుల కోసం ఎదురుచూడకుండా, చిన్న చిన్న చర్యలతోనే పెద్ద మార్పు తీసుకురావచ్చని గ్రామాలు నిరూపించాయి.
ఈ కార్యక్రమం కేవలం నీటి నిల్వకే పరిమితం కాలేదు. భవిష్యత్తులో తాగునీటి సమస్యను తగ్గించడం, రైతులకు సాగునీటి భరోసా కల్పించడం, భూగర్భ జలాలను పునరుద్ధరించడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు బలమైన పునాది వేసింది. ప్రభుత్వ పథకం ఉన్నప్పటికీ, దీనిని విజయవంతం చేసింది ప్రజలే. ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి పనిచేయడం, ప్రతి గ్రామం దీన్ని తమ బాధ్యతగా తీసుకోవడంతో ఇది ప్రభుత్వ కార్యక్రమం కంటే ప్రజా ఉద్యమంగా మారింది.
వాతావరణ మార్పులు, కరవు, నీటి కొరత ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. ప్రజలు ఒక్కటైతే ప్రకృతిని కాపాడటమే కాదు, భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కూడా అందించవచ్చని ఈ గ్రామాలు నిరూపించాయి. ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకుండా కాపాడాలనే సంకల్పం.. నేడు 31 కోట్ల లీటర్ల జలసంపదగా మారింది. ఇదే మహాసముంద్ గ్రామాల అసలైన విజయం.


