విజయ్‌పై అభిమానం.. ఆమె ఉద్యోగానికే ఎసరు! | Vijay Fandom Costs Headmistress Her Job | Sakshi
Sakshi News home page

విజయ్‌పై అభిమానం.. ఆమె ఉద్యోగానికే ఎసరు!

Jul 11 2026 12:12 PM | Updated on Jul 11 2026 12:16 PM

Vijay Fandom Costs Headmistress Her Job

చెన్నై: అభిమానం ఉండొచ్చు.. కానీ ఆ అభిమానం హద్దులు దాటితే మూల్యం చెల్లించక తప్పదు. తొలినాళ్ల నుంచే విజయ్‌కు వీరాభిమానిగా ఉన్న ఒకావిడ విధి నిర్వహణలో చేసిన పని.. చివరకు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ ఆగ్రహానికి గురి చేసింది. అభిమాని అయినా డోంట్‌కేర్‌ అని అనేసింది. ఫలితంగా ఆమె ఉద్యోగమే ప్రమాదంలో పడింది. 

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై ఉన్న అభిమానంతో ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మిస్ట్రెస్‌ తీసుకున్న నిర్ణయం.. చివరకు ఆమె సస్పెన్షన్‌కు దారితీసింది. తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులకు సీఎం విజయ్‌ కరూర్‌ సభను ప్రొజెక్టర్‌పై ప్రత్యక్ష ప్రసారం (లైవ్‌ స్ట్రీమింగ్‌) చేసి చూపించడంతో తమిళనాడు ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుంది.

కరూర్‌ జిల్లాలోని పంచాయతీ యూనియన్‌ మిడిల్‌ స్కూల్‌లో హెడ్‌మిస్ట్రెస్‌గా పనిచేస్తున్న ఎస్‌. మల్లిగా విజయ్‌కు వీరాభిమాని. శుక్రవారం తరగతి గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి సీఎం విజయ్‌ కరూర్‌ సభను ప్రొజెక్టర్‌పై ప్రత్యక్షంగా వీక్షించేలా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వివాదం చెలరేగింది.

విషయం తెలిసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌ మోహన్‌ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఇది హెడ్‌మిస్ట్రెస్‌ వ్యక్తిగత నిర్ణయమేనని తేలడంతో ఆమెను తక్షణమే సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు. ఇదే తరహాలో జరిగిన మరో ఘటనపైనా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

"పాఠశాలల్లో రాజకీయాలకు ఎలాంటి స్థానం లేదు. విద్యాసంస్థలు రాజకీయ వేదికలు కావు.. అవి భావితరాలను తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలు" అని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మినహా పుట్టినరోజు వేడుకలు, రాజకీయ సభలు లేదంటే ఇతర ప్రభుత్వేతర కార్యక్రమాలకు పాఠశాలల్లో అనుమతి ఉండదని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రైవేట్‌ సంస్థల సభ్యులు నేరుగా విద్యార్థులతో సమావేశాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కరూర్‌ జిల్లా ప్రాథమిక విద్యాధికారి జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో.. విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ మార్గదర్శకాల ఉల్లంఘన, జూలై 9న విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను పాటించకపోవడం వంటి ఆరోపణలను ప్రస్తావించారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు హెడ్‌మిస్ట్రెస్‌ మల్లిగా సస్పెన్షన్‌లోనే కొనసాగనున్నారు.

ఇటీవల సీఎం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు పాఠశాల ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం కూడా వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలై ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాసంస్థల్లో రాజకీయ కార్యకలాపాలపై తమిళనాడు ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement