భారత మెడికో మృతి.. గాయాల గుర్తులతో మిస్టరీగా మరణం! | Kerala Student Savariya Mystory Death In Uzbekistan | Sakshi
Sakshi News home page

భారత మెడికో మృతి.. గాయాల గుర్తులతో మిస్టరీగా మరణం!

Jul 11 2026 9:10 AM | Updated on Jul 11 2026 9:10 AM

Kerala Student Savariya Mystory Death In Uzbekistan

తిరువనంతపురం: కేరళకు చెందిన విద్యార్థిని ఉజ్బెకిస్థాన్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, తమ కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, మత మార్పిడికి ఒత్తిడి చేయడం కూడా ఘటనకు కారణమై ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో భారత అధికారులు, ఉజ్బెకిస్థాన్ దర్యాప్తు సంస్థలు కలిసి కేసును పరిశీలిస్తున్నాయి. దీంతో, ఆమె మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన సవారియా బసంత్ (22) ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు సమాచారం. ఆమె అక్కడ తన వైద్య విద్య కొనసాగిస్తుండగా ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె మృతదేహం స్వదేశానికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అనుమానాలు వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, సవారియాను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక వ్యక్తి ఆమెపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. అందుకు ఆమె నిరాకరించడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఇది సాధారణ మరణం కాదని కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కోణంతో పాటు కుటుంబం చేసిన ఇతర ఆరోపణలను కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌కు చెందినది కావడంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు.. ఉజ్బెకిస్థాన్‌లోని స్థానిక అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. అసలు విద్యార్థిని ఎలా మృతి చెందింది, దానికి కారణాలు ఏమిటి, కుటుంబం చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది.

కాగా, ఈ ఘటన విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ విద్యార్థులు వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ వారి భద్రత, స్థానిక చట్టాలపై అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే వ్యవస్థలపై మరింత దృష్టి అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement