ఆల్కహాల్‌ శాతం ఎక్కువుండే ఔషధాలపై  ఇకపై కఠిన నిబంధనలు  | India Tightens Rules On Alcohol-Containing Medicines, Require Licenses | Sakshi
Sakshi News home page

ఆల్కహాల్‌ శాతం ఎక్కువుండే ఔషధాలపై  ఇకపై కఠిన నిబంధనలు 

Jul 11 2026 6:30 AM | Updated on Jul 11 2026 6:30 AM

India Tightens Rules On Alcohol-Containing Medicines, Require Licenses

12 శాతానికి మించి ఉంటే లైసెన్స్‌ తప్పనిసరి 

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తోనే విక్రయాలకు అవకాశం 

డ్రగ్స్‌ రూల్స్‌–1945కు కేంద్ర కీలక సవరణలు

సాక్షి, న్యూఢిల్లీ: అధిక శాతం ఆల్కహాల్‌ కలిగిన ఔషధాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన డ్రగ్స్‌ రూల్స్‌–1945కు కీలక సవరణలు చేసింది. దీని ప్రకారం, ఇప్పటి వరకు షెడ్యూల్‌–కె కింద లైసెన్స్‌ మినహాయింపు పొందుతున్న కొన్ని ఆల్కహాల్‌ ఆధారిత ఔషధాలపై ఇకపై కఠిన నియంత్రణలు అమలు కానున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఇందుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

కొత్త నిబంధనల ప్రకారం 12 శాతం కంటే ఎక్కువ ఇౖథెల్‌ ఆల్కహాల్‌ ఉండి, 30 మిల్లీలీటర్లకు మించిన పరిమాణంలో విక్రయించే అన్ని ఔషధాలకు లైసెన్స్‌ తప్పనిసరి చేసింది. అంతేకాదు, ఈ మందులను షెడ్యూల్‌–హెచ్‌1 పరిధిలోకి తీసుకురావడంతో రిజిస్టర్డ్‌ వైద్యుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే విక్రయించాల్సి ఉంటుంది. ఔషధ విక్రేతలు విక్రయ వివరాలను నిర్దిష్ట రిజిస్టర్లలో నమోదు చేసి భద్రపరచాల్సి ఉంటుందని అందులో తెలిపింది. 

ఆ మినహాయింపులకు చెల్లుచీటి 
ఇప్పటివరకు షెడ్యూల్‌–కె కింద టింక్చర్‌ ఆఫ్‌ కార్డమమ్, టింక్చర్‌ ఆఫ్‌ జింజర్‌తో పాటు మరికొన్ని అరోమాటిక్‌ ఔషధాలకు లైసెన్స్‌ మినహాయింపు ఉండేది. అయితే వీటిలో కొన్ని తయారీల్లో 80 నుంచి 90 శాతం వరకు ఇౖథెల్‌ ఆల్కహాల్‌ ఉండటంతో వాటిని మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో మినహాయింపును ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

సవరణలతో ఇటువంటి ఔషధాల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయం పూర్తిగా నియంత్రిత ఔషధ సరఫరా వ్యవస్థలోకి రానుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం, కేవలం ఏలకులు, అల్లం, ఇతర మసాలా దినుసులు ఉన్నాయనే కారణంతో 12 శాతం కంటే ఎక్కువ ఇౖథెల్‌ ఆల్కహాల్‌ కలిగిన ఔషధ తయారీ దారులు ఇకపై షెడ్యూల్‌–కె’ కింద మినహాయింపు కోరేందుకు వీలుండదు. 

పలు సంప్రదాయ వైద్య విధానాల్లో ఆల్కహాల్‌ పరిమితులను ఇప్పటికే నిర్దేశించామని, ఈ విషయంలో ఒకే విధమైన నియంత్రణ విధానాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపింది. మత్తు కోసం అక్రమ వినియోగం, అక్రమ మళ్లింపులకు గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. అదే సమయంలో నిజంగా వైద్య అవసరాల కోసం ఈ మందులు వినియోగించే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement