జూలై 14న ప్రయోగం
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (49) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానున్నాడు. ఈ నెల 14న కజకిస్తాన్లోని బైకనూర్ కోస్మోడ్రోమ్ నుంచి రోస్కోస్మోస్ సోయుజ్ ఎంఎస్29 వ్యోమనౌకలో రష్యన్ కొస్మోనాట్లు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. అక్కడ ఎనిమిది నెలలపాటు గడపనున్నాడు.
దీర్ఘకాలంపాటు అంతరిక్ష ప్రయాణం చేస్తే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మీనన్ ఐఎస్ఎస్లో ప్రయోగాలు నిర్వహించనున్నారు. అతితక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో శరీరంలో రక్త ప్రసరణతోపాటు సిరల నిర్మాణం, రక్తసాంద్రతల్లో వచ్చే మార్పులను పరిశీలిస్తారు. అంతరిక్ష కేంద్రంలోని తాగునీటి వ్యవస్థతో ఐవీఫ్లూయిడ్స్ను తయారు చేసేందుకు సిద్ధం చేసిన టెక్నాలజీలను పరీక్షిస్తారు.
ఇలాంటి మిషన్లలో భూమి నుంచి ఎలాంటి వైద్యసాయం అవసరం లేకుండానే ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఐలతో పనిచేయగల టెక్నాలజీలను పరీక్షిస్తారు. కంప్యూటర్లు, ఏఐ, వైద్య పరికరాలకు అవసరమైన సెమీకండక్టర్ స్ఫటికాల తయారీ పద్ధతులను సమీక్షిస్తారు. కేరళ నుంచి అమెరికా వలస వెళ్లిన శంకరన్, ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోల సంతానమైన అనిల్ మినియాపోలిస్లో జని్మంచారు.


