వివాదాల వేళ ప్రక్షాళనకు కేంద్రం కసరత్తు?
రేసులో అజయ్ నంది, భజరంగ్ లాల్, నీరజ్ దౌనేరియా
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఇటీవల ట్రస్ట్ వ్యవహారాలపై వస్తు న్న అవకతవకల ఆరోపణలు, పలువురు కీలక వ్యక్తులు, నిర్వాహకుల రాజీనామాల నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. భక్తుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు ట్రస్ట్ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.
నష్ట నివారణకు చర్యలు
ట్రస్ట్ అంతర్గత వ్యవహారాలు, నిధుల నిర్వహణపై వస్తున్న విమర్శల కారణంగా ఆలయ ప్రతిష్టకు మరింత భంగం వాటిల్లరాదని కేంద్రం భావిస్తోంది. అందుకే, వివాదాస్పద నేతలను పక్కనబెట్టి, క్లీన్ ఇమేజ్ ఉన్న వారితో బోర్డును ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్లకు చెందిన కీలక నేతలకు కొత్త ట్రస్ట్లో సముచిత స్థానం కల్పించబోతున్నారనే వార్తలు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
నమ్మకమైన, గట్టి పట్టున్న నాయకులను రంగంలోకి దించడం ద్వారా ట్రస్ట్ను మళ్లీ గాడిలో పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ముగ్గురి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. వీరు..ఆర్ఎస్ఎస్ మాజీ ప్రాంతీయ సంఘ్చాలక్ అయిన అజయ్ కుమార్ నంది. ఈయనకు సంఘ్ పరివార్తో పాటు క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. విశ్వహిందూ పరిషత్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న భజరంగ్ లాల్ బాగ్డా. ఈయనకు కూడా కొత్త బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. భజరంగ్ దళ్ జాతీయ కనీ్వనర్గా ఉన్న నీరజ్ దౌనేరియా. ఈయన పేరు కూడా ట్రస్ట్ సభ్యత్వ రేసులో బలంగా వినిపిస్తోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన?
ట్రస్ట్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి స్థానంలో ఈ కొత్త ముఖాలను తీసుకురావడం ద్వారా వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ్ దళ్ నేతల చేరికతో రామాలయ నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుందని అనుకూల వర్గాలు చెప్తుండగా, దీనిపై అధికారిక ముద్ర పడటమే తరువాయి అని హస్తిన వర్గాలు అంటున్నాయి.


