నిప్పుల కొలిమిలో నగరాలు | Cities On Fire, Oxford Study Reveals India’s Growing Heat Danger As Ahmedabad Ranks 2nd Globally, Read Story Inside | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమిలో నగరాలు

Jul 10 2026 8:40 PM | Updated on Jul 11 2026 11:46 AM

ahmedabad-worlds-2nd-most-dangerous-heat-risk-city-oxford-study

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల తీవ్రతకు నగరాలు ఎలా నిప్పుల కొలిమిలా మారుతున్నాయో తెలియజేస్తూ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా విశ్లేషణాత్మక అధ్యయనాన్ని విడుదల చేశారు. ‘సస్టైనబుల్ సిటీస్ అండ్ సొసైటీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. విపరీతమైన వేడి కారణంగా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నగరాలు ప్రమాదంలో ఉన్న నాలుగు దేశాల్లో భారతదేశం ముందుంది. తర్వాత పాకిస్థాన్‌, నైజీరియా, ఘనా దేశాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 205 ప్రధాన నగరాలను పరిశోధకులు విశ్లేషించగా ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పు పొంచి ఉన్న నగరాల్లో 95 శాతానికి పైగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోనే ఉన్నాయి.

ప్రపంచంలోనే రెండో స్థానంలో అహ్మదాబాద్‌

ఈ అంతర్జాతీయ విశ్లేషణలో ఇరాక్‌కు చెందిన అల్ బస్రా నగరం ప్రపంచంలోనే అత్యధిక హీట్-రిస్క్ (0.83 స్కోరు) కలిగిన నగరంగా మొదటి స్థానంలో నిలవగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ (0.79 స్కోరు) ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రమాదకర నగరంగా నమోదైంది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన మరో రెండు నగరాలు టాప్-10లో చోటు సంపాదించడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ 4వ స్థానంలో, తమిళనాడులోని మదురై 7వ స్థానంలో నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ముప్పు ఉన్న టాప్-10 నగరాలు

ర్యాంకునగరం / దేశం
1అల్ బస్రా (ఇరాక్)
2అహ్మదాబాద్ (భారత్)
3బమాకో (మాలి)
4నాగ్‌పూర్‌ (భారత్)
5క్యూజన్ సిటీ (ఫిలిప్పీన్స్)
6బాగ్దాద్ (ఇరాక్)
7మదురై (భారత్)
8ఫైసలాబాద్ (పాకిస్థాన్‌)
9లాగోస్ (నైజీరియా)
10హైదరాబాద్ (పాకిస్థాన్‌)

కేవలం ఉష్ణోగ్రతలే కారణం కాదు!

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకురాలు నెత్మి జయరత్నే కరియవాసమ్, ప్రొఫెసర్ రాధికా ఖోస్లా, ప్రొఫెసర్ జీసస్ లిజానా నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. కేవలం థర్మామీటర్‌లో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు మాత్రమే ఒక నగరాన్ని ప్రమాదంలోకి నెట్టవని ఈ పరిశోధన స్పష్టం చేసింది. వారి పరిశోధన ప్రకారం.. సూర్యుడి వేడి, వేడి గాలుల ప్రభావం, నగరంలో నివసించే ప్రజల వయసు (వృద్ధులు, పిల్లలు), ఆర్థిక స్థితిగతులు, ఆరుబయట పనిచేసే కూలీల సంఖ్య, నగరాల్లో ఏసీలు, కూలర్లు వంటి మౌలిక వసతులు అందరికీ అందుబాటులో లేకపోవడం, చెట్ల విస్తీర్ణం వేగంగా క్షీణించడం.. వంటివి కారణాలుగా ఉన్నాయి.

జెడ్డా, బ్యాంకాక్ వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ తట్టుకునే ఆర్థిక రక్షణ వలయాలు, మౌలిక వసతులు మెరుగ్గా ఉండటం వల్ల వాటి రిస్క్ స్కోరు తక్కువగా ఉంది. కానీ భారతీయ నగరాలలో అధిక జనాభా, తక్కువ పచ్చదనం, తక్కువ ఆదాయ వర్గాలు ఎక్కువగా ఉండటం వల్ల ముప్పు తీవ్రత పెరిగింది.

ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement