అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు
సమర్ధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్: 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు చెందిన 38 మందికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు 2022లో ఇచి్చన చరిత్రాత్మక తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. మరో 11 మందికి విధించిన జీవిత కాల జైలు శిక్షలు సైతం సరైనవేనని స్పష్టం చేసింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ మంగళవారం జస్టిస్ ఏవై కోగ్జె, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.
ఒకే కేసులో అత్యధికులకు మరణ శిక్షలు విధిస్తూ 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు దేశ న్యాయచరిత్రలోనే మొట్టమొదటిది. మరణ శిక్ష పడిన వారిలో నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)మాజీ నేత సఫ్దర్ నగోరీ కూడా ఉన్నాడు. అప్పటి పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన 56 కుటుంబాల వారికి రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున 2027 మార్చి 30వ తేదీలోగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అయితే, హైకోర్టు తీర్పును తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.


