న్యూఢిల్లీ: గత ఏడాది దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదికపై ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదానికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో తీవ్ర లోపాలు ఉన్నాయంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) సంచలన లేఖ రాసింది. ఈ నివేదికలోని కాలక్రమం (టైమ్లైన్) పూర్తిగా తప్పుగా ఉందంటూ తరిగి విచారణకు డిమాండ్ చేసింది.
ఆ 18 సెకన్ల మిస్టరీ.. పైలట్ల అనుమానాలు
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానంలో ఇంధన సరఫరా నిలిచిపోయిన తర్వాతే అత్యవసర ‘రామ్ ఎయిర్ టర్బైన్(ఆర్ఏటీ) యాక్టివేట్ అయిందని ప్రభుత్వ దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే పైలట్ల సంఘం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఫ్లైట్ సిమ్యులేటర్ డేటా ప్రకారం ఇంధన సరఫరా ఆగిపోయిన తర్వాత ఆర్ఏటీ విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి కనీసం 18 సెకన్ల సమయం పడుతుంది. కానీ అధికారిక నివేదికలో మాత్రం ఇది కేవలం 4 నుండి 5 సెకన్లలోనే జరిగినట్లు చూపించారు. సాంకేతికంగా ఇది సాధ్యం కాదని, విమానంలో అంతకంటే ముందే ఏదైనా విద్యుత్ లోపం తలెత్తి ఉండవచ్చని పైలట్లు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ విజువల్స్.. రన్వే పైనే బయటపడ్డ లోపం
ఈ ప్రమాదానికి సంబంధించి అహ్మదాబాద్ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే మరో షాకింగ్ నిజం బయటపడిందని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం తెలిపింది. విమానం రన్వే పైనుంచి గాల్లోకి లేవడానికి (రొటేషన్) ముందే ఈ అత్యవసర ఆర్ఏటీ సిస్టమ్ తెరుచుకున్నట్లు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇంధన స్విచ్ మార్చడం వల్ల కాకుండా, విమానంలో అంతకుముందే వ్యవస్థాగత లోపం ఉందనడానికి ఇదే బలమైన ఆధారమని వారు వాదిస్తున్నారు.
పేలుడు శబ్దం.. డిమ్ అయిన లైట్లు
విమానం టేకాఫ్ కావడానికి ముందే క్యాబిన్ లోపల లైట్లు డిమ్ అవ్వడం, ఓ పెద్ద పేలుడు వంటి శబ్దం రావడం, అలాగే పైలట్లకు ముందే అందిన మల్టిపుల్ మెయింటెనెన్స్ అలర్ట్ మెసేజ్లను ఈ నివేదికలో విస్మరించారని ఎఫ్ఐపీ ఆరోపించింది. విమానం వెనుక భాగంలోని ఫ్లైట్ రికార్డర్ దెబ్బతిన్న తీరును, ఈ సంకేతాలను కలిపి విశ్లేషించాల్సి ఉందని పేర్కొంది. విమాన నివేదికలోని వేగ పరిమితి (యాక్సిలరేషన్) డేటాను స్వతంత్రంగా పునఃపరిశీలించాలని, హైడ్రాలిక్ పవర్ ఉత్పత్తికి, ఇంధన నియంత్రణకు ఉన్న లింక్ను తేల్చాలని దర్యాప్తు సంస్థను పైలట్లు డిమాండ్ చేస్తున్నారు.


