ధర్మస్థల కేసులో మలుపు
కర్ణాటక, యశవంతపుర: ధర్మస్థలలో అపరిచిత అస్థిపంజరాల కేసులో ఓ మిస్టరీ వీడిపోయింది. గతంలో బంగ్ల గుడ్డలో సిట్ అధికారులు తవ్వకాలు జరిపి మూడు అస్థిపంజరాలను కనుగొన్నారు. వాటికి డీఎన్ఏ పరీక్షలను నిర్వహించగా, మూడు కుటుంబాల నమూనాలతో సరిపోలాయి. మృతుల్లో కొడగు జిల్లా విరాజపేట తాలూకా టి శెట్టిగేరి గ్రామవాసి యు.బి. అయ్యప్ప(70), తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా దాసరకల్లహళ్లికి చెందిన ఆదిశేష (27), కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా మీసగానహళ్లికి చెందిన కృష్ణప్పలుగా తేలింది. అందరూ పురుషులేనని, మహిళలపై అత్యాచారం చేసి హత్యలు చేసి పూడ్చిపెట్టారనే ఆరోపణలతో సంబంధం లేదని సిట్ అధికారులు తెలిపారు. ఈ నెల 15న బెళ్తంగడి కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నారు.
ఇలా మిస్సింగ్
2017, జూన్ 25న యుబీ అయ్యప్ప మైసూరు ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి ఇంక తిరిగి రాలేదు. గుబ్బికి చెందిన ఆదిశేష బెంగళూరులోని బార్లో పని చేసేవాడు, 2013 అక్టోబర్ 2న ఇంటికెళ్లి మొబైల్ను వదిలేసి ఎక్కడికి వెళ్లాడో తెలియదు. కృష్ణప్ప 2024 అక్టోబర్ 22న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు కేసుల్లోనూ కుటుంబీకులు మిస్సింగ్ కేసులు పెట్టారు. అలా వెళ్లినవారు బంగ్ల గుడ్డలో ఎలా శవాలయ్యారన్నది తేలాల్సి ఉంది.


