సోషల్ మీడియాలో ఒక అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె భారత్ vs అమెరికా మధ్య ఆరోగ్య సేవల ఖర్చులను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో చర్చకు దారితీశాయి. వీడియోలో ఆమె అమెరికాలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని, అదే సమయంలో భారతదేశంలో మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో అమెరికన్ మహిళ ఈ విధంగా చెప్పారు. ''మా అత్తకు ఒక రకమైన రక్త క్యాన్సర్ ఉంది. ఆమె రెవ్లిమిడ్ అనే మందు తీసుకుంటుంది. ఈ మాత్ర ధర అమెరికాలో సుమారు 900 డాలర్లు (దాదాపు రూ.85,000), అదే మందు భారత్లో సుమారు 30 సెంట్స్ నుంచి 3 డాలర్ల వరకు (రూ.35-రూ.300 మధ్య) లభిస్తుందని ఆమె వివరించారు''. ధరల మధ్య భారీ తేడా చూసి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కామెంట్లు పెట్టారు. కొందరు అమెరికా ఆరోగ్య వ్యవస్థపై విమర్శలు చేస్తే, మరికొందరు భారత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా తక్కువ ఖర్చుతో చికిత్స అందుతుందని కూడా గుర్తుచేశారు.
ఇంకొక అమెరికన్ మహిళ విక్టోరియా కూడా ఇదే తరహా అనుభవాన్ని కొన్ని రోజులకు ముందు పంచుకున్నారు. ఆమె అమెరికా ఆరోగ్య వ్యవస్థను స్కామ్ అని అభివర్ణించారు. అమెరికాలో సుమారు 1000 డాలర్ల ఖరీదైన మందును భారత్లో కేవలం 25 డాలర్లకు కొనుగోలు చేయగలిగానని ఆమె తెలిపారు. అమెరికాలో సాధారణ ప్రజలు భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని ఆమె వ్యాఖ్యానించింది.


