ఎక్కడో మారు మూలగ్రామంలో పుట్టిన ఒక సాధారణ యువకుడు రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ల అధినేతగా ఎదగడం అంటే మాటలు కాదు. ఈ సక్సెస్ వెనుక ఎంతో కఠోర శ్రమ, అంతకుమించిన పట్టుదల చాలా అవసరమని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగాలే కానీ, అనుకోని విజయాలను అందుకోవచ్చని 28 ఏళ్ల సూరజ్ బిస్వాస్ (Suraj Biswas) స్ఫూర్తిదాయకమైన కథ ద్వారా మనకు అవగతమవుతుంది.
భారతదేశంలోని అందరికీ ఒకే విధానం అనే విద్యా వ్యవస్థపై తనకున్న తీవ్ర నిరాశే 2021లో తన స్టార్టప్ను నిర్మించడానికి ఎలా ప్రేరణగా నిలిచింది అంటారు. సూరజ్. జీవనోపాధి కోసం జొమాటో రైడర్గా షిఫ్టులు చేస్తూ, తన భారీ టెక్ ఆశయాలను సమతుల్యం చేసుకుంటూ, ఒక డెలివరీ బాయ్ని సీరియస్గా తీసుకోడానికి నిరాకరించిన పెట్టుబడిదారుల ముందు ఈ రోజు టెక్ వ్యవస్థాపకుడిగా సగర్వంగి నిలబడ్డాడు.
పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాకు చెందిన చక్దహా అనే ఒక చిన్న పట్టణంలో సూరజ్ జన్మించారు. సాధారణంగా స్టార్టప్ వ్యవస్థాపకులు పుట్టుకొచ్చే మేజర్ సిటీలు లేదా నేపథ్యం తనది కాదని ఆయన గర్వంగా చెబుతారు. కోల్కతాలోని గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఆయన జెనెటిక్స్ (Genetics) లో బీఎస్సీ పూర్తి చేశారు. చిన్నప్పుడు డాక్టర్ కావాలనేది ఆయన కల, కానీ పరిస్థితుల ప్రభావంతో ఆ దారి మారింది. డిగ్రీ పూర్తయ్యాక, తన తదుపరి లక్ష్యం ఏమిటో ఆలోచించుకునే లోపు ఆర్థిక అవసరాల కోసం జొమాటోలో డెలివరీ బాయ్గా చేరారు.
అదే పునాది
నగరమంతా తిరుగుతూ ఆహారాన్ని డెలివరీ చేస్తున్న సమయంలోనే ఆయనలో ఒక ఆలోచన మొదలైంది. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థను గమనించినప్పుడు, వేర్వేరు సామర్థ్యాలు ఉన్న విద్యార్థులందరినీ ఒకే పద్ధతిలో చదవమని ఎలా ఒత్తిడి చేస్తారనే ప్రశ్న ఆయనలో తలెత్తింది. "వ్యవస్థ ప్రతి మనిషిని ఒకేలా చూస్తోంది. అందరికీ ఒకే కొలత (One size fits all) అన్నట్టుగా ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఇద్దరు మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు," అంటారు సూరజ్.
ఈ ఆలోచన విద్యావ్యవస్థ నుండి టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన AI టెక్నాలజీ, మనుషుల నమూనాలను గుర్తిస్తుందే తప్ప ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకతను, వారి జీవక్రియలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? అనే ప్రశ్న ఆయన మెదడులో రేగింది. దీనికి పరిష్కారంగానే 2021లో ఎలాంటి పెట్టుబడిదారులు ఆఫీస్ లేదా భాగస్వాములు, లేకుండానే 'అసెస్లీ' (Assessli) అనే స్టార్టప్ను స్థాపించారు. ఆ తర్వాత 'డాట్స్-ఇన్' (Dots-in) అనే మరో సంస్థను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఈ రెండు కంపెనీలకు వ్యవస్థాపకుడిగా , సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నో సవాళ్లు
తన ఆలోచనను వ్యాపారంగా మార్చడం అంత సులువు కాలేదంటారు సూరజ్. ఒక చిన్న పట్టణం నుండి వచ్చి, పెద్దగా గుర్తింపు లేని కాలేజీలో చదివి, బైక్పై ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి చెప్పే ఐడియాలను మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు, సీరియస్గా తీసుకోలేదు. దీనికి తోడు ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంవత్సరాల పరిశోధన, మౌలిక వసతులు అవసరం. తక్షణ లాభాల కోసం ఆశపడకుండా మార్కెట్లో గుర్తింపు వచ్చే వరకు పట్టుదలతో నిలబడటం పెద్ద సవాలుగా మారింది.
కోలుకోలేని విషాదం
తన స్టార్టప్ కల సాకారమవుతున్న సమయంలోనే సూరజ్ జీవితంలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఇళ్లల్లో రంగులు వేసే (House Painter) ఆయన తండ్రి, తన కొడుకు భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడ్డారు. ఐఎస్ఐ కోల్కతా (ISI Kolkata) గ్రాంట్ ఫార్మాలిటీస్ పూర్తయిన రెండు రోజులకే, అంటే 2024,జనవరిలో ఆయన కన్నుమూశారు. ఆయన త్యాగానికి ప్రతిఫలంగా తాను అందుకున్న విజయాన్ని తండ్రికి చూపించ లేకపోయాననే బాధ సూరజ్ను తీవ్రంగా కలిచివేసింది. ఇందుకోసం తన తల్లిదండ్రుల విజయాన్ని చూడలేకపోయిన ప్రతీ బిడ్డ కోసం 'ఇన్డాట్స్' (Indots) అనే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలా తండ్రి రుణం తీర్చుకున్నట్టుగా భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
లక్ష్యాలను సాధించడానికి సరైన సమయం కోసం వేచి చూడకండి. విజయం అనేది కేవలం ప్రతిభపైనే ఆధారపడి ఉండదు, సవాళ్లను ఎదుర్కొంటూ, భయాన్ని వీడి ముందుకు సాగేతత్వంలో ఉంటుంది. మనం ఎక్కడ పుట్టామనేది దాన్ని బట్టి భవిష్యత్తును నిర్ణయించలేం. చిన్న గ్రామంనుంచి వచఇచనా, బైక్పై ఫుడ్ డెలివరీ చేసినా, అవేవీ తన ఎదుగుదలను ఆపలేక పోయాయి. పట్టుదలగా సాగితే ఆకాశమే హద్దు అంటారు సూరజ్ బిశ్వాస్.
‘‘నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను జీవశాస్త్రం వైపు, శరీరం ఎలా పనిచేస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది అనే విషయాలను అర్థం చేసుకోవడం వైపు ఆకర్షితుడయ్యాను. కానీ విచిత్రంగా, ఎల్బిఎం (LBM) అనేది ఆ కల అత్యంత ఉన్నతమైన రూపంగా మారింది. నేను ఎప్పుడూ డాక్టర్ కాలేను, కానీ ఆరోగ్యం, ప్రవర్తన, మానవ సామర్థ్యాన్ని మానవాళి అర్థం చేసుకునే విధానాన్ని పెద్ద ఎత్తున మార్చగల విజ్ఞానాన్ని నిర్మిస్తున్నాను.” అని గర్వంగా చెబుతారు.
ఇదీ చదవండి: Citizenship16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పు


