పరీక్షల నిర్వహణ వ్యవస్థలో దిద్దుబాటు చర్యలు
అధికారులతో మంత్రి ప్రల్హాద్ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం, లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యా శాఖలో కదలిక మొదలైంది. కీలకమైన పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసుకునే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో ముఖ్యమైన అధికారులు సహా మొత్తంగా ఇప్పటిదాకా 50 మంది సిబ్బందిని తొలగించినట్లు ఎన్టీఏ సోమవారం వెల్లడించింది.
ఉన్నతావిద్యా విభాగ అధికారులతో నూతన విద్యామంత్రి ప్రల్హాద్ జోషి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఎన్టీఏ ఈ వివరాలను బహిర్గతంచేసింది. నీట్–యూజీలో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్ట్ పేపర్లలో తప్పులు దొర్లాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సెపె్టంబర్ 9 నుంచి మళ్లీ రీ–ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో మంత్రి ప్రల్హాద్æ సమావేశమై పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై కీలక ఆదేశాలిచ్చారు.
ఎన్టీఏలో ఇకపై కొత్తగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, సీఐఎస్ఓ, టెస్టింగ్ సెక్యూరిటీ జనరల్మేనేజర్, ఆర్ అండ్ డీ, సైకోమెట్రిక్స్లో జనరల్ మేనేజర్ తదితర కీలక పదవుల్లోకి అత్యంత వృత్తి నైపుణ్యమున్న వ్యక్తులను నియమించాలని నిర్ణయించారు. ఈ పదవుల్లోకి నియామక ప్రక్రియను ఆరంభించినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ వివరాలను విద్యాశాఖ తర్వాత తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. మూడు సబ్జెక్ట్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో చాలా తప్పులు దొర్లడం, అవే ప్రశ్నలు పదేపదే అడగడంతో విమర్శలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా 50 మందిని ఎన్టీఏ తొలగించిందని వార్తలొచ్చాయి.
యుద్ధ ప్రాతిపదికన సంస్కరణల అమలు
సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల్లోకి అవసరమైతే ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను నియమించుకోనున్నారు. ప్రశ్నల ఎంపిక మొదలు ప్రశ్నాపత్రాల రూపకల్పన, డిజైన్, ముద్రణ, నిఘా, నిల్వ, రవాణా తదితర కీలక విభాగాలన్నింటిలో సంస్కరణలు తీసుకురానున్నారు. క్వశ్చన్ పే పర్ల కోసం ప్రత్యేకంగా గదుల కేటాయింపు, వాటిని భద్రపరిచే కంప్యూటర్ వ్యవస్థలకు ఇంటర్నెట్ లాంటి ఎలాంటి బయటి వ్యవస్థలతో అనుసంధానం లేకుండా చూసుకోవడం, సబ్జెక్ట్ నిపుణులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత మొబైల్, పెన్డ్రైవ్, ల్యాప్టాప్ వంటి డిజిటల్ ఉపకరణాలను స్వా«దీనంచేసుకోవడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన అమలుచేయనున్నారు. ఎన్టీఏ పరిధిలో జరిగే అన్ని ఎగ్జామ్లకు సంబంధించిన సమగ్ర స్థాయి ఆడిటింగ్తోపాటు ఎప్పటికప్పుడు నివేదికలను సమీక్షించనున్నారు.


