న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జంతర్మంతర్లో జరిగిన ఆందోళన సందర్భంగా ఒకవ్యక్తిపై దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్కు న్యూఢిల్లీ కోర్టు మంగళవారం మూడు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ మూడు వారాల్లో స్వతంత్ర ప్రవర్తనను పరిశీలించిన తరువాత అతడి సాధారణ బెయిల్పై విచారణ చేపడతామని కోర్టు తెలిపిందని సమాచారం. ‘‘న్యాయస్థానం విశ్వాసానికి ఈ బెయిల్ ప్రతీక. అంతేకానీ అది అందరికీ చూపేలా ప్రదర్శించే ట్రోఫీ కాదు’’ అని న్యాయమూర్తి బెయిల్ ఇస్తూ స్పష్టం చేసినట్లు తెలిసింది.
అత్యంత హీనాతిహీనమైన కేసులో బెయిల్ దక్కడంపై ఉత్సవాలు, ఊరేగింపులు జరపడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం సమాజం, శాంతి భద్రతలకు అంతగా సరిపోయే అంశం కాదని అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత, కస్టడీలో ఉన్న దాదాపు పదిరోజుల్లో భరద్వాజ్ ఆత్మపరిశీలన చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు న్యాయమూర్రిత తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. భరద్వాజ్ విచారణ కూడా పూర్తయిందని, అతడిపై మోపిన అభియోగాలకు ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం ఆందోళన ప్రధానంగా ఫిర్యాదుదారు, అతడి కుమార్తె మైనర్ బాలిక విషయంలో ఉందని, తగిన షరతులతో వారి భద్రతను కాపాడవచ్చునని వ్యాఖ్యానించింది.
‘‘బాధితుల రక్షణ, ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యతలను పూర్తి చేయండం రెండూ కఠినమైన షరతుల కింద అప్లికెంట్కు మధ్యంతర బెయిల్పై విడుదల చేయడం ద్వారా సాధ్యమవుతాయి’’ అని పేర్కొన్నారు. ఈ కాలంలో అతడి ప్రవర్తనను గమనించాలని, దాని ఆధారంగానే అతడి సాధారణ బెయిల్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జూన్ 23 నాటి ఘటనకు సంబంధించిన ఏ నిర్ణయమైనా న్యాయస్థానాల్లో సాక్ష్యాల ఆధారంగా జరగాలని, బహిరంగంగా సోషల్ మీడియాలో కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
భరద్వాజ్ను రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీ, పలు షరతులతో మధ్యంతర బెయిల్పై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసు గురించి చర్చించడం, తనకు మద్దతుగా పోస్టులు పెట్టడం, లేదా ఫిర్యాదుదారుల కుటుంబానికి వ్యతిరేకంగా ఏ రకమైన మీడియాలోనూ వ్యాఖ్యలు చేయకపోవడం వంటివి మధ్యంతర బెయిల్కు పెట్టిన షరతుల్లో కొన్ని. బాధితుడిని, అతడి కుమార్తెను లేదా సాక్షులను సంప్రదించే ప్రయత్నం అసలు చేయకూడదు. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం విదేశాలకు పారిపోయే యత్నమూ చేయకూడదు. విచారణకు సహకరించాలి. చిరునామా, ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇవ్వడంతోపాటు మధ్యంతర బెయిల్ సమయం ముగిసిన తరువాత లొంగిపోవాలి. తదుపరి విచారణ అక్టోబరు ఆరవ తేదీ జరగనుంది. మంగళవారం నాటి బెయిల్ విచారణ ఇన్ కెమెరా జరిగిన విషయం తెలిసిందే.


