జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్స్
పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేసిన ఎన్టీఏ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ జాతీయ స్థాయి ప్రవేశ, అర్హత పరీక్షల క్యాలెండర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ–నెట్, జేఈఈ మెయిన్ (సెషన్1), సీయూఈటీ–పీజీ, సీఎమ్ఏటీ, ఎన్ఐఎఫ్టీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల తాత్కాలిక క్యాలెండర్ను ప్రకటించింది. జేఈఈ మెయిన్స్–2027 సెషన్ 1 జనవరి 22 నుంచి 24, 28 నుంచి 30 తేదీల మధ్య జరగనుంది. దీనికి జనవరి 31ని బఫర్ తేదీగా కేటాయించారు. యూజీసీ నెట్ పరీక్ష డిసెంబర్ 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ పరీక్షలకు డిసెంబర్ 20, 21 బఫర్ తేదీలుగా నిర్ణయించారు.
జాయింట్ సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ పరీక్షను డిసెంబర్ 20, 21 తేదీల్లో, నిఫ్ట్ ప్రవేశ పరీక్షను జనవరి 10న, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీఎమ్ఏటీ)ను ఫిబ్రవరి 7న, సీయూఈటీ పీజీ పరీక్షలను మార్చి 1 – 25 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని, పరిపాలనాపరమైన, విద్యాపరమైన లేదా ఏదైనా లాజిస్టికల్ కారణాలుంటే ఈ తేదీల్లో మార్పులుంటాయి. అధికారిక నోటిఫికేషన్లు, దరఖాస్తు ప్రక్రియ, ఇతర సమగ్ర వివరాలకోసం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను సందర్శించొచ్చు.


