ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పేరు చేర్చడం సంచలనం సృష్టించింది. దీనిపై ఉద్ధవ్ థాక్రే స్పందించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.
మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఘటన చాలా బాధాకరమైందని, కానీ తమను ఇందులో ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. మాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య. రేపు మీ పేర్లను కూడా ఇలాగే లాగొచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ విచారణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి సంబంధం లేని వ్యక్తుల వరకు వెళ్లొచ్చని ఎద్దేవా చేశారు. సీబీఐ వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని, లేదంటే తాము న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దిశా సాలియన్ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదిత్య థాక్రే కూడా ఖండించారు. తాను దిశను ఎప్పుడూ కలవలేదని, కొద్దిమంది రాజకీయ, వ్యక్తిగత స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.


