సాక్షి, ముంబై: Disha Salian's Death Case దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పద మరణం కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని ఆదేశించింది. దర్యాప్తు అధికారికి ఎవరిపైనైనా తగిన ఆధారాలు లభిస్తే తప్ప, వారిని నిందితులుగా పరిగణించ కూడదని కోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు హత్య అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా కేవలం ప్రమాదవశాత్తు మృతి (ADR) గా మాత్రమే ఎందుకు పరిగణించారని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, ఐదేళ్లు గడుస్తున్నా పోస్టుమార్టం నివేదికను కుటుంబానికి అందజేయక పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాలని కూడా బాంబే హైకోర్టు ఆదేశించింది.
దిశ తండ్రి సతీష్ సాలియాన్ తన పిటిషన్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమార్తె దిశపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధారంగా, కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా, ధర్మాసనం పోలీసుల ప్రవర్తనపై దృష్టి సారిస్తూ ఈ క్రింది ముఖ్యమైన అంశాలను లేవనెత్తింది.రాజకీయ నాయకులపై వచ్చిన ఫిర్యాదులు లేదా రాజకీయ ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నిస్సహాయుడైన ఒక తండ్రి మనోభావాలను, న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై చట్టబద్ధమైన, శాసనబద్ధమైన, పారదర్శకమైన విచారణ జరిపి, సరైన ముగింపు ఇవ్వడం అవసరమని పేర్కొంది.
ఇదీ చదవండి : లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
మాల్వాణి పోలీసు స్టేషన్ పరిధిలోని సంబంధిత కేసు రికార్డులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. సరిపడా ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించవద్దని, ఆధారాలు లభించిన వారిపైనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ నెగెటివ్ రిపోస్ట్ ఇస్తే, దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ప్రోటెస్ట్ పిటిషన్' దాఖలు చేసే హక్కు పిటిషనర్కు ఉంటుందని తెలిపింది.
కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ వద్ద మేనేజర్గా పనిచేసిన సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియాన్, 2020 జూన్ 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని నివాస భవనం 14వ అంతస్తు నుండి కిందపడి కన్నుమూసింది. ఆమె మరణించిన ఆరు రోజులకే (2020, జూన్14న) సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా తన నివాసనంలో అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం 2022 నాటి మహారాష్ట్ర శాసనసభలో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో, నితేష్ రాణే ఆదిత్య థాకరేకు నార్కో పరీక్ష చేయాలని కూడా షిండే వర్గం డిమాండ్ చేసింది.


