ఎన్‌ఆర్‌సీ? లేదా జనగణన?.. మణిపూర్‌లో కొత్త రచ్చ! | Manipur Census Halted Behind the Unprecedented Push for NRC | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌సీ? లేదా జనగణన?.. మణిపూర్‌లో కొత్త రచ్చ!

Sep 2 2026 7:06 AM | Updated on Sep 2 2026 7:06 AM

Manipur Census Halted Behind the Unprecedented Push for NRC

ఈశాన్య భారతంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌ల ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మణిపూర్‌లో రాబోయే 2027 జనాభా లెక్కల సేకరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను పకడ్బందీగా అమలు చేసి, అక్రమ చొరబాటుదారులను గుర్తించిన తర్వాతే జనాభా గణన చేపట్టాలన్న డిమాండ్‌కు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

జనగణనపై అభ్యంతరాలు: అసలు చిక్కు ఎక్కడ?
రాష్ట్రంలో జనగణనను నిలిపివేయాలనే డిమాండ్ వెనుక మూడు ప్రధాన కారణాలు ముడిపడి ఉన్నాయి. మయన్మార్ తదితర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనసాగుతున్న అక్రమ చొరబాట్లు రాష్ట్ర జనాభా సమతుల్యతను దెబ్బతీశాయని లోయ ప్రాంత మైతేయిలు, కొండ ప్రాంత నాగాల ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. ముందుగా స్థానిక పౌరులను గుర్తించి, చొరబాటుదారులను వేరు చేశాకే లెక్కలు తీయాలని వారు పట్టుబడుతున్నారు. దీనికితోడు 2023 నుంచి చెలరేగిన జాతి హింస కారణంగా వేలాది మంది ప్రజలు నిర్వాసితులై ఇంకా పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. ప్రజలు తమ సొంత ప్రాంతాలకు చేరకముందే గణన చేపడితే అది వాస్తవ జనాభాను కాక, కేవలం స్థానభ్రంశాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌ఆర్‌సీ డిమాండ్‌కు ఏళ్ల చరిత్ర
ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలన్న ఆందోళనలు కేవలం ఇటీవల మొదలైనవి కావు. 2022 జూన్‌లో మైతేయి సంస్థల సమాఖ్య ‘కోకోమి’, యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ)సంయుక్తంగా రాష్ట్ర జనాభా కమిషన్, ఎన్‌ఆర్‌సీల కోసం వినతిపత్రం సమర్పించాయి. 1971 నుంచి 2001 మధ్య కొండ ప్రాంత జిల్లాల జనాభా 153.3 శాతం, 2001 నుంచి 2011 మధ్య 250.9 శాతం అనూహ్యంగా పెరగగా, లోయలో ఈ పెరుగుదల వరుసగా 94.8, 125.4 శాతంగానే నమోదైంది. ఈ భారీ వ్యత్యాసం ఆధారంగా 2022 ఆగస్టులో, అనంతరం 2024 మార్చిలో మణిపూర్ అసెంబ్లీ ఎన్‌ఆర్‌సీ కోసం తీర్మానాలు చేసింది. 2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత పెద్దఎత్తున శరణార్థులు సరిహద్దు దాటి రావడం ఈ పరిస్థితులను మరింత సున్నితంగా మార్చింది.

బీజేపీ, కాంగ్రెస్‌ల అనూహ్య కలయిక
సాధారణంగా పరస్పరం తీవ్రంగా విభేదించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ అంశంలో అనూహ్యంగా ఒకే తాటిపైకి వచ్చాయి. 1951ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని ఎన్‌ఆర్‌సీని ప్రకటించిన తర్వాతే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని యూఎన్‌సీ తేల్చిచెప్పడమే కాక, క్షేత్రస్థాయి సిబ్బందికి సహాయ నిరాకరణ పిలుపునిచ్చింది. రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి మాజీ ముఖ్యమంత్రి, మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్రామ్ ఇబోబి సింగ్ సైతం జనగణనకు ముందే ఎన్‌ఆర్‌సీ జరగాలని స్పష్టమైన మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా భద్రతా కారణాల దృష్ట్యా మయన్మార్‌తో ఉన్న ‘ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్’ (ఎఫ్‌ఎంఆర్‌)ను రద్దు చేయడంతో ఈ డిమాండ్‌కు మరింత ఊపొచ్చింది.

కుకీ-జో కౌన్సిల్ తీవ్ర వ్యతిరేకత
మరోవైపు కుకీ-జో వర్గాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అధికారిక డేటా లేకుండా కేవలం తమపై తప్పుడు ఆరోపణలతోనే ఎన్‌ఆర్‌సీని ముందుకు తెస్తున్నారని ‘కుకీ-జో కౌన్సిల్’ పేర్కొంది. ఎన్‌ఆర్‌సీ అనేది దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టాల్సిన ఒక సమగ్ర ప్రక్రియ అని, ఏదో ఒక వర్గం లేదా రాష్ట్రం తన ఇష్టానుసారంగా వేరుగా అమలు చేయడానికి చట్టంలో ఆస్కారం లేదని వారు స్పష్టం చేశారు. తరతరాలుగా భారత్‌లోనే స్థిరపడినప్పటికీ, సరిహద్దుల ఇరువైపులా విస్తరించి ఉన్న తమ సామాజిక వర్గాలను పాత తేదీల పత్రాల పేరిట వేధించే ప్రమాదం ఉందని, శాస్త్రీయమైన జనగణన తర్వాతే పునర్విభజన జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అసెంబ్లీ సీట్లపై పునర్విభజన నీడలు
ప్రస్తుతం మణిపూర్ శాసనసభలో మొత్తం 60 స్థానాలు ఉండగా, లోయ ప్రాంతానికి 40, కొండ ప్రాంతాలకు 20 సీట్లు కేటాయించారు. ఈ పంపకం 1971 జనాభా ఆధారంగా 1973లో నిర్ణయించిన పరిమితి ప్రకారమే కొనసాగుతోంది. జనాభా గణనలో కొండ ప్రాంతాల సంఖ్య పెరిగితే, భవిష్యత్ డీలిమిటేషన్‌లో లోయ ప్రాంతం తన రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఉన్న 40:20 నిష్పత్తి కాస్తా 35:25 లేదా 30:30కి మారవచ్చని మైతేయి నాయకులలో భయాందోళనలు ఉన్నాయి. అందుకే జనాభా లెక్కల నమోదు, ఎన్‌ఆర్‌సీ, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు పరస్పరం అత్యంత క్లిష్టంగా మారాయి.

చట్టబద్ధంగా మణిపూర్‌లోనే ఎన్‌ఆర్‌సీ సాధ్యమా?
సాధారణంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్‌) పునరుద్ధరణ జరిగిన తర్వాతే దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ మొదలవుతుంది. అయితే భారత పౌరసత్వ చట్టం 1955 లోని సెక్షన్ 14A ప్రకారం దేశంలోని ఏ నిర్దిష్ట రాష్ట్రం లేదా సరిహద్దు ప్రాంతానికైనా ప్రత్యేకంగా పౌరుల తప్పనిసరి నమోదు ఆదేశాలను జారీ చేసే పూర్తి చట్టబద్ధమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేవలం ఎన్‌ఆర్‌సీ మాత్రమే కాకుండా, అక్రమ చొరబాట్లను కట్టడి చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు, ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన (సర్‌), సరిహద్దు నిఘా పెంపు, బయోమెట్రిక్ నమోదు వంటి ప్రత్యామ్నాయ కఠిన చర్యలను కేంద్రం పరిశీలిస్తోంది.

ఇది కూడా చదవండి: భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్‌వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement