కఠ్మాండు: వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని చిలిమె, లాంగ్టాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద భారత ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం సహాయక చర్యల్లో ముందడుగు వేసింది. ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నేపాలీ సైన్యంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేసింది.
చిలిమె ప్రాజెక్టు టన్నెల్లోకి బృందం విజయవంతంగా ప్రవేశించి లోపల భద్రతా తాళ్లను ఏర్పాటు చేసిందని, లాంగ్టాంగ్ వద్ద టన్నెల్లో దాదాపు 185 మీటర్ల మేర లోపలికి వెళ్లి గాలింపు చేపట్టిందని నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సాంకేతిక బృందాలతో సోమవారం సమావేశమైన ఆయన, అక్కడ జరుగుతున్న పురోగతిని సమీక్షించారు.
Indian and Nepali rescue teams work side by side inside the Chilime tunnel in Nepal's Rasuwa district, searching for people who may still be trapped after the devastating floods pic.twitter.com/4zNZYwi8xC
— WION (@WIONews) September 1, 2026
ఆగస్టు 26న నేపాల్లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. వరదల అనంతరం వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఆచూకీ లేకుండా పోయిన సిబ్బంది, కార్మికులను గుర్తించేందుకు భారత్, చైనా నిపుణుల బృందాలు నేపాల్కు సహకారం అందిస్తున్నాయి.
రసువా ప్రాంతంలో సహాయక చర్యలకు కేంద్రంగా ఉన్న నువాకోట్లోని బిదూర్ వద్ద గల నేపాలీ సైనిక స్థావరాన్ని రాయబారి సందర్శించారు. అనంతరం నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్, ఇంధన-జలవనరుల శాఖ మంత్రి బిరాజ్ భక్త శ్రేష్ఠలతో సమావేశమై భారత్ తరఫున అందిస్తున్న సహాయ సహకారాలపై చర్చించారు. మరోవైపు, నేపాల్ పోలీసుల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీతో కలిసి భారత ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం ఖాట్మండులో విధులు నిర్వహిస్తూ వివిధ పద్ధతులు, డాక్యుమెంటేషన్ ప్రక్రియల సమన్వయంలో తోడ్పడుతోందని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ఎన్ఆర్సీ? లేదా జనగణన?.. మణిపూర్లో కొత్త రచ్చ!


