భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన త్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టులో దాఖలు చేసిన తొలి ఛార్జ్షీట్లో త్విషా ఎదుర్కొన్న మానసిక వేధింపుల వెనుక ఉన్న ఆర్థిక కోణాన్ని, చైనా షేర్ మార్కెట్ బెట్టింగ్ గుట్టును సీబీఐ విప్పింది.
ఆర్థిక పరమైన ఒత్తిడితో పాటు, త్విషా ఉద్యోగం కోల్పోయిన తర్వాత భర్త ఆమెను తీవ్రంగా అవమానించేవాడని సీబీఐ తెలిపింది. ‘నీకు ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదు.అందుకే నీ ఉద్యోగం ఊడింది’ అంటూ భర్త సమర్థ్ సింగ్ ఆమెను నిరంతరం మానసికంగా వేధించేవాడని దర్యాప్తులో తేలింది.
అత్తగారింట్లో తనపై ఇద్దరు నిందితులు నిరంతరం నిఘా ఉంచినట్లు త్విషా గతంలో తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడింది. సీబీఐ నివేదిక ప్రకారం.. త్విషా శర్మకు ఉన్న ఒక డీమ్యాట్ ఖాతాలో సుమారు రూ. 20 లక్షల విలువైన ఈక్విటీ పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్.. ఆ డబ్బును తమకు బదిలీ చేయాలంటూ త్విషాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక జాయింట్ అకౌంట్ను కూడా తెరిచారు.కానీ, ఆ డబ్బు తన తండ్రికి చెందిందని చెబుతూ త్విషా దాన్ని బదిలీ చేయడానికి నిరాకరించడంతో అత్తాకోడళ్ల వేధింపులు మరింత పెరిగాయి.
త్విషా శర్మ మరణించిన ఈ ఏడాది మే 12 రాత్రి 7:51 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి, చైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భర్త సమర్థ్ తనపై ఒత్తిడి తెస్తున్నాడని వాపోయింది. తాను తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు స్నేహితురాలికి చెప్పిన కొన్ని గంటల్లోనే త్విషా అనుమానాస్పద స్థితిలో మరణించింది. కట్నం వేధింపులు,అనుమానాస్పద మృతి కోణాల్లో సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.


