దొడ్డబళ్లాపురం: బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్డబ్ల్యూఎమ్ఎల్) వారు చికెన్ వ్యర్థాలపై విధిస్తున్న పన్నును వ్యతిరేకిస్తూ కర్ణాటక ఫౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 3, 4 తేదీల్లో బెంగళూరులో చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. సుమారు 7 వేల చికెన్ దుకాణదారులు రెండు రోజుల పాటు ఫ్రీడం పార్క్లో ఆందోళన చేపట్టనున్నారు. బెంగళూరులో రోజుకి 7 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. ఒక్కో దుకాణం నుంచి సుమారు రోజుకు 30 కేజీల వ్యర్థాలు వెలువడుతున్నాయి.
బీఎస్డబ్ల్యూఎమ్ఎల్ వారు కేజీ వ్యర్థానికి రూ.5 పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.5 వేల వరకూ పన్ను చెల్లించాల్సి రావడంతో దుకాణదారులకు ఇబ్బందిగా మారిందని కర్ణాటక ఫౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఈ పన్ను తక్షణం రద్దు చేయాలని డిమాండు చేస్తూ రెండు రోజుల పాటు చికెన్ దుకాణాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.


