సుభాష్ చంద్ర కేసులో ట్విస్ట్.. నెట్‌వర్త్‌పై CBI దర్యాప్తు! | CBI Case Against Subhash Chandra Over Rs 980 Crore Loans | Sakshi
Sakshi News home page

సుభాష్ చంద్ర కేసులో ట్విస్ట్.. నెట్‌వర్త్‌పై CBI దర్యాప్తు!

Sep 6 2026 7:48 AM | Updated on Sep 6 2026 8:00 AM

CBI Case Against Subhash Chandra Over Rs 980 Crore Loans

మాజీ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతో పాటు.. పలువురిపై రూ.980 కోట్ల రుణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. ఈ కేసు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. ఇందులో నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, అక్రమంగా లాభం పొందడం వంటి ఆరోపణలను సీబీఐ పరిశీలిస్తోంది.

నికర ఆస్తుల విలువ
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం సుభాష్ చంద్ర నికర ఆస్తుల విలువ. ఈ వ్యవహారంలో రెండు వేర్వేరు రుణాలు ప్రధానంగా ఉన్నాయి. మొదటిది వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని కో-బారోయర్ పాన్ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన సుమారు రూ.500 కోట్ల రుణం. వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ రుణాన్ని 'టేకోవర్ అండ్ టాప్-అప్ ఫెసిలిటీ'గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మంజూరు చేసింది. ఈ రుణానికి సుభాష్ చంద్ర గ్యారంటర్‌గా నిలిచారు.

రుణం మంజూరు సమయంలో సమర్పించిన నికర ఆస్తుల సర్టిఫికెట్‌లో సుభాష్ చంద్ర ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సీబీఐ ఫిర్యాదులో ఉంది. 2018 మార్చి 28న సమర్పించిన ఆ సర్టిఫికెట్ ప్రకారం, 2017 మార్చి 31 నాటికి ఆయన నికర విలువ 6,197.62 మిలియన్ డాలర్లు, అంటే అప్పటి లెక్కల ప్రకారం సుమారు రూ.59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు చూపించారు.

ఇక రెండో రుణం డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించినది. దాని కో-బారోయర్ అయిన స్పిరిట్ ఇన్‌ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సుమారు రూ.480 కోట్ల రుణం మంజూరైంది. ఈ రుణానికి కూడా సుభాష్ చంద్ర గ్యారంటీ ఇచ్చారు. ఈ సందర్భంలో సమర్పించిన మరో నికర విలువ సర్టిఫికెట్‌లో ఆయన నికర ఆస్తుల విలువ రూ.40,000 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది.

అంటే.. రెండు రుణాలను కలిపితే సుమారు రూ.980 కోట్లు. రుణాలు తీసుకునే సమయంలో సుభాష్ చంద్ర ఆర్థికంగా వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగిన వ్యక్తిగా పత్రాల్లో చూపించారు.

ఈ రెండు రుణాలు తరువాత డిఫాల్ట్ అయ్యాయి. అంటే.. రుణాలను తిరిగి చెల్లించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో విషయం మరింత తీవ్రంగా మారి, సుభాష్ చంద్రపై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) కింద వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.

పత్రాల్లో వేలకోట్లు
రుణాలు తీసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లో సుభాష్ చంద్ర నికర విలువ వేల కోట్ల రూపాయలుగా చూపించబడింది. అయితే తర్వాత జరిగిన ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఆయన ఆ స్థాయి ఆస్తులు తనకు లేవని పేర్కొన్నట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ముఖ్యంగా, 2024 సంవత్సరానికి తన నికర విలువ సుమారు రూ.31.79 కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నట్లు ఫిర్యాదులో వెల్లడైంది. అంతేకాకుండా.. 2017-18 కాలంలో కూడా తన నికర విలువ రూ.40,000 కోట్లకు మించలేదని ఆయన చెప్పినట్లు సీబీఐ పేర్కొంది.

ఇక్కడే సీబీఐ దర్యాప్తు ప్రధానంగా కేంద్రీకృతమవుతోంది. ఒకవైపు రుణాలు తీసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లో సుభాష్ చంద్ర నికర విలువ రూ.40,000 కోట్ల నుంచి రూ.59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఆయన ఆస్తుల విలువ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నట్లు సీబీఐ చెబుతోంది. కాబట్టి.. రుణం పొందేందుకు నికర ఆస్తుల విలువను కావాలనే ఎక్కువగా చూపించారా? అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.

ఇదీ చదవండి: SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement