breaking news
Success Story
-
చేదుకట్టు..! చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ తలలో
కొత్తగా పనిలో చేరిన సావిత్రి మాటతీరు చూసిన రేవతి ‘‘దీనికి ఎంత తెలివో?’’ బుగ్గలు నొక్కుకుంటూ ఆశ్చర్యపోయింది. ఆమె తెలివైన మాటల వెనుక జీవితాన్ని తీర్చిదిద్దుకునే ధ్యాస తప్ప మరో ఆలోచన కనబడలేదు రేవతికి. పనిలో చలాకీతనం, శ్రద్ధ చూసి ముచ్చట వేసింది. కోనసీమలో ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్ అపార్టుమెంటు కాపలాపనికి మొగుడు సూరిబాబుని తీసుకుని రావడమే తరవాయి, ఫ్లాట్స్ అన్నీ తిరిగి తనని పనిలో పెట్టుకొమ్మని కోరింది సావిత్రి.అశోకా పౌడర్ ముఖానికి రాసుకుని, ముప్పేట కొబ్బరికాయలా ఉన్న తలకు కొబ్బరినూనె పాముకుని, తలలో మందార పువ్వు పెట్టుకుని, నుదుట సన్నని తిలకం దిద్దుకుని, పొట్టిగా, సన్నగా, శుభ్రంగా ఉన్న సావిత్రి మొదటి చూపులోనే నచ్చేసింది రేవతికి.‘‘చక్కని గాలి, బోల్డు నీళ్ళు, పచ్చని వరిచేలతో కోనసీమ బావుంటుంది కదే అక్కడే సుఖంగా ఉండక, సామాన్యుడు బతకలేని ఈ మహానగరానికి ఎందుకు వచ్చావు?’’ అడిగింది ఆరాగా.‘‘మా వూళ్ళో పనులేం ఉండడం లేదమ్మా. ఈ మధ్య పొలం పనులు కూడా బాగా తగ్గిపోయాయి. సేలన్నీ రొయ్యల సెరువులవడంతో సానా కట్టంగా ఉంది పని దొరకడం. దానికి తోడు మా వోడు బద్ధకస్తుడు, అన్నీ ఒళ్ళోకి వచ్చి వాలాలను కుంటాడు. మగాడని గోరోజనం. మా వూళ్ళో ఉంటే కట్టబడి కూడబెట్టిన డబ్బులతో తాగడం తిరగడం తప్ప, పిల్లల ఆలనా పాలనా సూడడం లేదు. దొరికిన ఈ కాపలా పనైనా జాగ్రత్తగా సేసుకోమని బతిమాలి ఇక్కడకు లాక్కొచ్చాను, పిల్లల్ని కూడా సక్కని బళ్ళో ఎయ్యొచ్చు కదమ్మా,’’ మంచి భవిష్యత్తు ఊహిస్తూ చెప్పింది.‘‘అమ్మా! సెల్లి కొడతందే’’ అంటూ కీచులాడుకొంటూ ఏడుస్తున్న పిల్లల చేతుల్లో బిస్కెట్లు పెట్టి ఊరుకోబెట్టింది రేవతి. సావిత్రి రాకతో రేవతికి ఇంటి పని చాలా తగ్గింది. రోజూ రేవతి ఆ చిరు కుటుంబం కోసం తమతో పాటే కాసిని బియ్యం పోసి అన్నంతో పాటు కాస్త కూర, పచ్చడి లాంటివి ఇవ్వడంతో, రేవతి పట్ల సావిత్రి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.∙∙ అపార్ట్మెంట్లో పనులన్నీ అయిపోయాక, విశ్రాంతి తీసుకోకుండా ఏదో పని చేసి డబ్బులు సంపాదించడం అలవాటుగా మారింది సావిత్రికి. ‘‘వయసున్నప్పుడే ఒళ్ళొంచి పనిచెయ్యాలి, నాలుగు డబ్బులు కూడబెట్టుకోవాలే సాయిత్రి!’’.. అమ్మ రాజేశ్వరి మాటలు ఆమె మస్తిష్కంలో ఇంకా సజీవంగా ఉన్నాయి.సావిత్రి పుట్టుక ఒక విషాదం. రాజేశ్వరి వయసులో ఉన్నప్పుడు ఆమె ఎంతగానో నమ్మిన మగాడు మోజు తీరిపోయాక తల్లినీ, పసిగుడ్డుగా ఉన్న సావిత్రినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఊళ్ళో బంధువులు ఎన్ని సూటిపోటి మాటలన్నా, కన్నకూతుర్ని ఎంతో ధైర్యంతో పెంచిన తన తల్లి మనోబలమే సావిత్రికి ఆమె నుంచి వచ్చిన ఆస్తి. తన కంటే పెద్దదైన కూతురున్న వాడిని మారుమనువాడింది తల్లి. పెంపుడు తండ్రి ప్రేమ పొందకపోయినా, సవతి అక్క, బావ ఆమెను బానే చూసుకోవడం కాస్త ఊరట.ఇద్దరు కూతుళ్ళకు ఏదో రకంగా సాయపడవచ్చని, వాళ్లకు భారం కాకూడదని నడి వయస్సులో ‘కొయిటా’ వెళ్ళిన తల్లి మరికాస్త ఆలంబన సావిత్రికి. ఇళ్ళల్లో పనులన్నీ గబా గబా అవగొట్టుకుని, చాప పరుచుకుని, జనుముతో తయారుచేసిన పేపర్లతో వంద కవర్లు పూర్తి అయ్యాక వాటిని ఎండలో ఆరబెట్టి, గదిలోకి వెళ్లి గోధుమ పిండి, పెనం, స్టవ్వు, గిన్నెలు సర్దుకుంది. సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది. ఇంతలో స్కూల్ నుంచి పిల్లలు రావడంతో వాళ్ళకు స్నానాలు చేయిస్తాడేమోనని ఆశతో సూరిబాబు కేసి చూసింది. బయట కుర్చీలో దర్జాగా కూర్చుని ఆమెకేసి తల కూడా తిప్పకుండా మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చొన్నాడు.‘‘పిల్లల్ని దగ్గరకు తీసుకుని, తానం సేయిద్దారని కూడా లేదు’’ ఉసూరుమంటూ, వాళ్ళకి నీళ్ళు పోసి, ఉతికిన బట్టలు వేసి, చేతుల్లో చిరుతిళ్ళు పెట్టింది. కాస్త చీకటి పడగానే, గోధుమపిండి, సామాన్లు, సంచిలో పెట్టుకుని కాలనీలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్దకు బయలుదేరడానికి సిద్ధం అయ్యింది. ఆమె వైపు తల కూడా తిప్పకుండా మొబైల్ చూసుకుంటున్న మొగుడిని చూడగానే ఆమెకు చిర్రెత్తు కొచ్చింది.‘‘ఎప్పుడు సూసినా పోనట్టుకుని ఆడుకోడమేనా, కాంత సాయం సెయ్యలేవా’’ అతని చేతిలో ఫోన్ లాక్కోడానికి ప్రయత్నం చేసింది. ఆమెని పక్కకు తోసేసి, ‘‘ఉండేహే ఆట మంచి రంజుగా ఉంది, నీ పని నువ్వు సూసుకో, మద్దెలో అడ్డం రాకు! ఎన్నాళ్ళు ఈ సిన్నా సితకా పనులు సేత్తాం డబ్బుల కోసం? కొట్టేదేదో గట్టిగా కొట్టాలి’’ అంటూ బెట్టింగ్ గేమ్స్లో దూరిపోయాడు. ఉసూరుమంటూ సంచీని మోసుకుని వెళ్లి, నాలుగు రోడ్ల జంక్షన్లో ఒక పక్కగా సామాను చేర్చి గోధుమ రొట్టెలు కాల్చి అమ్మడం మొదలుపెట్టింది. అలా రాత్రి తొమ్మిది వరకూ అమ్ముకుంది. ఇంతలో సూరిబాబు నుంచి ఫోన్ రాగానే, ‘‘అయిపోయింది వత్తన్నా!’’ అంటూ అన్నీ సర్దుకుని ఇంటికి బయలుదేరింది. తనకున్న చిన్నపాటి తెలివితో, చిరు సంపాదనకి చిన్న చిన్న మార్గాలు వెతకడం, ఎంత చిన్న ఆలోచన వచ్చినా దాన్ని అమలుపరచడం నిరంతరం చేసేదామే. పండగలు వస్తే వినాయక చవితికి మట్టి వినాయక బొమ్మలు, దీపావళికి మతాబులు చేసి అమ్ముకునేది.∙∙ ఒకరోజు ఆమె చేసిన కవర్లు తీసుకువెళ్ళడానికి వచ్చినతను, ‘‘సాయిత్రి! మా సేటుకి యాపారం మంచిగ లేదుట, ఆయన దుకాన్ బంద్ జేస్తుండు, ఇంగ కవర్లు వద్దుట, నీకివ్వలసిన పైసల్ తీసుకో’’.. చేతిలో పెట్టి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు.హఠాత్తుగా ఆధరువు పోవడం ఆమె చిన్న జీవితానికి తగిలిన పెద్ద దెబ్బ. దాన్ని తట్టుకునే లోపు మరో దెబ్బ ఆమె జీవనానికి మరింత గట్టిగా తగిలింది. రోడ్డుపక్కన రొట్టెలు అమ్ముకునే ప్రదేశంలో కంకర గుట్టలు పోసేశారు. అక్కడ ఆకాశ హర్మ్యం నిర్మాణం మొదలైంది. ఆమె ఆశల భవంతి కూలిపోయింది. ఎక్కడైనా ఖాళీ ఉన్న చోటు దొరికితే, అమ్ముకుందామని తిరిగి తిరిగి ఎక్కడా దొరక్క, దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది. సూరిబాబు ఆమెను చూసి, ‘‘అప్పుడే వచ్చేశావే, ఎంత గిరాకి అయ్యింది ఇయ్యాల’’ వెటకారంగా అన్నాడు నవ్వుతూ. రోడ్డు మీద కంకర పోశారనే విషయం తెలిసి కూడా చెప్పలేదని, కోపంగా చూసింది అతనికేసి. అతను నిర్లక్ష్యంగా తల విసిరి, కంచంలో అన్నం కలుపుకుంటూ, పక్కనున్న మొబైల్ చూసుకుంటున్నాడు. నిద్రపోతున్న పిల్లల్ని లేపి, అన్నాలు పెట్టే పనిలో పడింది సావిత్రి.మర్నాడు ఉదయం అన్యమనస్కంగా పనిచేస్తున్న సావిత్రిని గమనించిన రేవతి, ‘‘ఏంటే ఇవ్వాళ నీరసంగా ఉన్నావు? టీ తాగుతావా?’’ అడిగింది. చేస్తున్న రెండు పనుల ప్రవాహానికి గండి పడిందని నిరాశగా చెప్పింది.‘‘అయ్యో! బాధపడకు. నువ్వు తెలివైనదానివి, వేరే ఏదైనా దొరుకుతుందిలే, కష్టించి పని చేసేవాళ్ళకు ఎదో కొత్త దారి దొరుకుతూనే ఉంటుందిలే’’ ఓదార్చింది.ఖాళీగా ఉండడం అంటే సావిత్రికి భయం. తమ ఊళ్ళో ఏ పనీ చేయకుండా కాళ్ళ దాకా వచ్చింది, నోటి దాకా రాకుండా పోతుందా అనే ధీమాతో బతికేస్తూండే చాలామందిని చూస్తే చాలా భయం. కాళ్ళదాకా వచ్చేది హఠాత్తుగా ఆగిపోతే భవిషత్తులో ఎలా జీవించాలో అనే భీతి లేకుండా బ్రతికేవాళ్ళని చూస్తే మరీ భయం. భర్తను చూశాక, ఆ భయం మరీ ఎక్కువైంది. అతని సోమరితనం, జీవితం పట్ల నిర్లక్ష్యం చూసి, అతనంటే అసహ్యం మరింత పెరిగింది. ఎవ్వరిమీద ఆధారపడకుండా, తన కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలనే తపన ఆమెను మరిన్ని కొత్త ఆలోచనలకు పురికొల్పుతూ ఉంటుంది.∙∙ ధనుర్మాసం వచ్చింది. కాలనీలో ఉండే వెంకటేశ్వరస్వామి గుడిలో తిరుప్పావై వైభవంగా జరుగుతోంది. గుడి ప్రాంగణంలో ప్రవచనం వినడానికి రేవతి సావిత్రిని కూడా తీసుకుని వెళ్ళింది. ప్రవచనకర్త చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు సావిత్రికి అర్థం కాలేదు. కానీ ఆయన చెప్తున్న ఉపన్యాసంలో జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, కష్టాలని ఎలా అధిగమించాలో, ఎలా పోరాడాలో చెప్పడం మాత్రం ఆమెకు బాగా నచ్చింది. ఇంతలో ఆయన ధనుర్మాసం అంతరార్థం చెప్తూ, రాబోయే పండుగలు చాలా విశిష్టమైనవని, ఇంటి ముందు ముగ్గులు వెయ్యడం శరీరానికి మంచి వ్యాయామం అని, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంటిలో కొలువై ఉంటుంది అని భక్తిని మేళవించి చెప్పడం వలన ఆ కాలనీ వాసుల బుర్రలోకి ఆయన వాక్కులు బాగా ఎక్కాయి.కాలనీ వాసులలో పెళ్లి కాని అమ్మాయిలకు ముగ్గుల పోటీ పెట్టాలనే ఆలోచన మహిళా కార్పొరేటర్ బుర్రలో మొలకెత్తింది. ఆ వార్త విన్న సావిత్రి బుర్రలో రెండు కొత్త ఐడియాలు పురుడు పోసుకున్నాయి. కాలనీలో ఇంటింటికీ వెళ్లి, తనకు ముగ్గులు వేయడం బాగా వచ్చని, ముగ్గు చేతకాని ఆడపిల్లలకు నేర్పి కొన్ని డబ్బులు సంపాదించింది. అలాగే గుడి పక్క గోశాలకు వెళ్లి ఆవు పేడ తెచ్చుకుని, గొబ్బెమ్మలు చేసి, అందంగా బంతి పూలు అమర్చి అమ్మింది. కనుమ పండుగ నాడు ముగ్గుల పోటీలో బహుమతి వచ్చిన అమ్మాయి, సావిత్రి కష్టానికి జాలిపడి, తనకి వచ్చిన క్యాష్ బహుమతిలో కొంత ఇచ్చేసింది. ఆ డబ్బులు కూతురి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని బ్యాంకులో డిపాజిట్ వేసింది. ఆ విషయం తెలిసిన రేవతి సావిత్రిని అభినందిస్తూ, ‘‘చూశావా సావిత్రి! దేనికీ నిస్పృహ చెందకుండా కాస్త ఆలోచిస్తే ఇలాంటి పనులు సంవత్సరమంతా ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయి’’ అంది రేవతి.‘‘అవును అమ్మగారు!’’ ఆనందం వ్యక్తపరచింది. ఇలాగే డబ్బులు సంపాదిస్తున్న సావిత్రి ముందు ముందు తనని లెక్కచేయదేమోననే అనుమానం జెర్రిగొడ్డులా సూరిబాబు మనసులో ప్రవేశించింది.∙∙ వేసవికాలంలో అక్క, బావలతో కలిసి తిరుపతి మొక్కు తీర్చుకుందామని వెళ్ళింది సావిత్రి. తిరుపతి నుంచి సావిత్రి తిరిగి రాగానే, సూరిబాబు, ‘‘మా యమ్మకి సానా తేడా సేసిందంట, మనం కొన్ని రోజులు అక్కడే ఉండాలి’’ స్వంతవూరికి బయలుదేరదీశాడు. అత్తకి సుస్తీ అన్నది అబద్ధం, అతనికి పనిచేయడం ఇష్టం లేదు అన్నది నిజమని తెలుసుకున్న సావిత్రి అతన్ని నిలదీస్తే, ఆమె కంఠ శోష గోదావరి రైలు వంతెన ఘోషలో కలిసిపోయింది. సావిత్రి కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ సూరిబాబు చేతిలో పడి బెట్టింగ్ పాలైపోయాయి. సావిత్రికి గుండె మండిపోయింది. గట్టిగా నిలదీస్తే, ‘‘దర్జాగా హైడ్రాబాడ్ లో తిరుగుదారని అనుకుంటున్నావేమో! మనతో కుదరదు, సిటీ ఓళ్ళ మాటలు బాగా సెవికెక్కి నన్ను పట్టించుకోవడమే మానేహావు’’ అంటూ ప్రతీరోజూ మాటలతో మానసికంగా హింసించేవాడు. పెల్లుబుకుతున్న కన్నీటి గోదారిని అదుపుచేసుకుంటూ..‘నానేం తప్పు సెయ్యలేదే, నానెందుకు ఏడవాలి? సదువు సంజలులేని మొరటోడు, జీవితం ఇలువ తెలియని సన్నాసి ఆడేదో అన్నాడని ఏడవడం ఏంటి? నాను సావిత్రి! ఐదో కలాసు. ఆడు నిసానీ గాడు’ మనసుకు నచ్చ చెప్పుకుంది. అలా అనుకోవడమే తడవుగా గుండెల్లో కలిగిన బాధ మటుమాయం అయ్యింది. గబ గబా అన్నం వండి పిల్లలలకి పెట్టి, నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని, కొబ్బరిచెట్టు కింద నులకమంచం వాల్చుకుని, పక్కలో పిల్లల్ని వేసుకుని ఆలోచిస్తూ నడుం వాల్చింది. కొబ్బరి ఆకుల మీద నుంచి ఆమెపై పడుతున్న కొబ్బరి పువ్వుల్లా ఆలోచనలకు రూపం వచ్చి ఒక్కటి ఒక్కటీ ఆమె ముందు సాక్షాత్కారిస్తున్నాయి.‘అవును ఆ పని చేస్తాను, కొబ్బరిసెట్టులా నిబ్బరంగా నిలబడతాను’ మనస్సుకి ధైర్యం చెప్పుకుని, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రి వేళ హఠాత్తుగా వచ్చిన అంతు తెలియని కడుపు నొప్పి తీవ్రమై సొమ్మసిల్లి పడిపోయింది. ఆసుపత్రిలో జాయిన్ చేశారు సావిత్రి అక్క, బావ. చేతిలో ఒక్క పైసా కూడా లేని సూరిబాబు చేతులు నలుపుకుంటూ బయట కూర్చున్నాడు. జీవితంలో ఎంతో పైకి ఎదుగుదామనుకున్న సావిత్రికి, ఆమె కడుపులోని చేదుకట్టుకి వచ్చిన రోగం యముడిలా ఆమె ఆశలకు అడ్డుకట్టు వేసింది. ఆపరేషన్ చేసి చేదుకట్టు తొలగిస్తే గాని బతకదని డాక్టర్ చెప్పాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది సావిత్రి.సావిత్రి ఎందుకు తిరిగి రాలేదో కనుక్కోవడానికి రేవతి ఫోన్ చేసింది. సావిత్రి బావ ఫోన్ ఎత్తి, ‘‘సావిత్రికి సానా తేడా సేసింది ఆపరేసన్ సేసి సేదుకట్టు తీసేశారు’’ అన్నాడు. ‘‘చేదుకట్టు అంటే’’ అడిగింది ? అదేనమ్మ గాల్... గాల్ అని తడుముకుంటుంటే, గాల్ బ్లేడరా ? ‘‘అవునమ్మా అదే’’ అన్నాడు. చాలా బాధపడింది రేవతి. కొంత డబ్బు పంపించింది.శల్యం మీద కోత వలన పార్వతి చిక్కి శల్యమయ్యింది. బలం పుంజుకొని తన పని తాను చేసుకోవడానికి మూడు నెలలు పట్టింది. రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. దాచిన డబ్బులన్నీ అనారోగ్యానికి, ఇల్లు గడవడానికి ఖర్చు అయిపోయాయి. తల్లి, బావ చాలారోజులు సాయం చేసి, ఇంక మీ బాధలు ఏవో మీరే పడండని వదిలేసారు. పిల్లలకి కడుపునిండా అన్నం పెట్టలేకపోతోంది. అయినా సూరిబాబు ధోరణి మారలేదు. కష్టమైన పనైనా, కొబ్బరి వలుపు తీసే కొట్లో చేరింది. రోజంతా పని ఉండడం వలన శరీరం కష్టపడుతున్నా, మనసు మటుకు హాయిగా ఉంది. పనంతా చక్కబెట్టి, ఇంటికి వచ్చి పెరట్లో బట్టలు ఆరేస్తూ ఆలోచనలో పడింది. ఇంతలో ఇంటి గోడను వొరుసుకుంటూ వడివడిగా ప్రవహిస్తూ వెడుతున్న గోదావరిలో పయనిస్తున్న పడవను చూశాకా, రేవతి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ‘నది ప్రయాణంలో నావకు తగులుతున్న నీటి దెబ్బలను, ఒడిదుడుకులు చూస్తే అవతలి ఒడ్డుకి చేరగలదా అని మొదట కంగారు పడతాం. కానీ అది చేరుకున్నాక, ఇంతేనా అనిపిస్తుంది. జీవితం కూడా అంతే!’ ఆ మాటలు తలుచుకోగానే ఉత్సాహం వచ్చింది. మెదడులో మరో కొత్త ఆలోచన ఉదయించింది.∙∙ నిన్ను ఈ స్థాయిలో చూస్తుంటే చాలా గర్వంగా ఉందే సావిత్రి! అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది రేవతి.‘‘ఆ రోజు మీరన్న మాటలే నన్ను కట్టంలో కూడా దైర్యంగా నిలబడమని సెప్పేయమ్మా! లోకంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు, ప్రతీది మనకి ఉపయోగ పడేదే అని గుడిలో ఆ రోజు గురువుగారు సెప్పిన మాటలు నన్ను ఈ యాపారం సెయ్యమని సెప్పినట్టు అనిపించి ధైర్యంగా దిగిపోయాను.’’ అంది వినయంగా...‘‘అది సర్లే గానీ, కొబ్బరి పెంకులతో, పీచుతో చేసిన బొమ్మలు, గ్రామీణ ఉత్పత్తుల మార్కెటింగ్ మటుకు భలే కొత్త తరహాలో యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలో నీ పిల్లలతో చేయిస్తున్నావు చూడూ! అదీ నీ తెలివి. భలేగా ఉందే నీ ఐడియా’’ అంటూ అభినందించింది రేవతి.‘‘మీరు ఇచ్చిన పాత ఫోన్లో అయన్నీ నేర్సుకున్నాను అమ్మా’’ చెప్పింది వినయంగా.ఇంతలో శిల్పారామం దర్శించడానికి వచ్చిన వాళ్ళు సావిత్రి, పిల్లలను గుర్తుపట్టి ఫొటోలు తీయించుకుంటున్నారు.‘‘నాకు కూడా ఒక సెల్ఫీ ఇవ్వవే నువ్వు ఇంకా పైకి ఎదిగిపోతే మాకు దొరకవు కూడానూ’’ నవ్వుతూ అంది రేవతి . ‘‘అయ్యో అమ్మగారు! మిమ్మల్ని మర్చిపోవడమా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పినది మీరే.’’ అంటూ ఇద్దరినీ ఫ్రేములోకి బిగించి క్లిక్మనిపించింది. సావిత్రి మొహంలో చిరుగర్వం, ఆత్మవిశ్వాసం.. ఎదురుదెబ్బలెన్ని తగిలినా, గండాలు వచ్చినా స్థిరంగా తన కాళ్ల మీద నిలబడగలిగాననే చిరుగర్వం! రేవతి మొహంలో సంతృప్తి... తన కళ్లెదుటే మారాకు తొడిగిన మొక్క, మహావృక్షంగా ఎదిగిన క్రమంలో తాను కూడా కొంత చేదోడు కాగలిగాననే సంతృప్తి! ఆ ఆనందసమయంలో సూరిబాబు గురించి అడగలేకపోయింది రేవతి.పని చేయలేని అశక్తుడితో, చేతకానివాడితో సర్దుకుపోవచ్చు. పని చేయదలచుకోని వాడితో ఎంతకాలం సర్దుకుపోగలం?బాధ్యత తెలియని వాడితో సర్దుకుపోవచ్చు. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూసేవాడితో ఎలా సర్దుకుపోవడం?సుఖపడేవాళ్లను చూసి ఓర్వలేని వాడి నైచ్యం అర్థం చేసుకోవచ్చు. కానీ కష్టపడేవాళ్లని చూసి కూడా ఓర్వలేని వాడిని ఎలా సహించడం? ఆస్పత్రి పాల్జేసి మంచం పట్టించిన అనారోగ్యం సావిత్రికి ఓ బతుకుపాఠం నేర్పింది! చేదుకట్టు దేహానికి అవసరమే! అది ఎందుకూ కొరగాకుండా పోయినప్పుడు, ఉపేక్ష కూడా కూడా ప్రమాదమే... కత్తిరించి తీసేయడమే దేహానికి రక్ష! బతికినంత కాలమూ కొన్ని జాగ్రత్తలు తప్పవు. నిజమే, తాళికట్టిన పెనిమిటే. జీవితానికి అవసరమే. కాని, ఒక నిర్ణయానికి వచ్చింది సావిత్రి. సావిత్రి చేసింది తప్పో ఒప్పో ఎవరు చెప్పగలరు? ఆమె అనుభవించిన ఆనందమైనా, బాధైనా ఆమె స్వంతం కదా మరి.- చాగంటి ప్రసాద్ -
తిరస్కరణలే పునాదిగా బిలియన్ డాలర్ల సామ్రాజ్యం
జీవితంలో ఎదురయ్యే తిరస్కరణలు ప్రయాణానికి ముగింపు కాదని, అవి మహోన్నత విజయానికి బాటలు వేసే గుణపాఠాలని నిరూపించారు చెన్నైకి చెందిన 32 ఏళ్ల టెక్ వ్యవస్థాపకుడు, పర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ శ్రీనివాస్. నేడు ప్రపంచ కృత్రిమ మేధ రంగాన్ని శాసిస్తున్న పర్ప్లెక్సిటీ వెనుక ఉన్న ఆయన ప్రయాణం.. వరుస వైఫల్యాలను దాటుకుని శిఖరాగ్రానికి చేరుకున్న ఒక అసాధారణ పోరాటం.ఐఐటీ నుంచి ఎంఐటీ వరకు.. వరుస నిరాశలే!చిన్నప్పటి నుంచీ కంప్యూటర్ సైన్స్పై మక్కువ ఉన్న అరవింద్కు ఐఐటీ మద్రాస్లో సీఎస్ సీటు లభించలేదు. దీంతో ఆయన డ్యూయల్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో చేరాల్సి వచ్చింది. మొదటి సంవత్సరం ప్రతిభ ఆధారంగా బ్రాంచ్ మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 0.01 సీజీపీఏ (CGPA) స్వల్ప తేడాతో ఆ అవకాశం చేజారింది. ఆపై ఎలక్ట్రికల్ విద్యార్థిననే కారణంతో మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరేందుకు కూడా మొదట్లో ప్రొఫెసర్ల నుంచి నిరాకరణ ఎదురైంది. ఐఐటీ పూర్తయ్యాక పీహెచ్డీ కోసం ప్రపంచ ప్రఖ్యాత మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి దరఖాస్తు చేయగా అక్కడా తిరస్కరణే లభించింది.వైఫల్యమే విజయ సూత్రమై..ఈ తిరస్కరణలకు కుంగిపోకుండా యూసీ బార్కిలీలో పీహెచ్డీ పూర్తి చేసిన అరవింద్.. ఓపెన్ ఏఐ, గూగుల్, డీప్మైండ్లలో పరిశోధకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం సొంతంగా ప్రారంభించిన తొలి స్టార్టప్ (ఎక్స్ ఆధారిత సెర్చ్ టూల్) ప్లాట్ఫామ్ ఏపీఐ మార్పుల వల్ల విఫలమైంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా 2022 మధ్యలో డెనిస్ యారట్స్, జానీ హో, ఆండీ కాన్విన్స్కీలతో కలిసి పర్ప్లెక్సిటీ ఏఐకి శ్రీకారం చుట్టారు.ప్రపంచ స్థాయిలో సంచలనంసాంప్రదాయ సెర్చ్ ఇంజిన్లకు భిన్నంగా యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు వెతికి ఇచ్చే ఆన్సరింగ్ టూల్గా పర్ప్లెక్సిటీ ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల పెట్టుబడులతో కోట్లాది డాలర్ల మూలధనాన్ని సమకూర్చుకున్న ఈ సంస్థ బిలియన్ డాలర్ల వాల్యుయేషన్కు చేరుకుంది. ఈ ఘనతతో అరవింద్ శ్రీనివాస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో చోటు దక్కించుకుని భారత్లోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ
కొన్ని సక్సెస్లు అనూహ్యంగా రావచ్చు. కానీవిజయాలన్నీ ఎవ్వరూ ఊహించని కష్టాల నుండే సాధ్యమవుతాయి. ఆ విజయానికి కన్నీళ్లు, సవాళ్లే శక్తివంతమైన సోపానాలుగా మారతాయి. ప్రతీ ఎదురు దెబ్బ ఒక్కో మెట్టుగా అసాధారణ విజయానికి పునాది అవుతుంది. అలా కష్టాల నుంచి కోట్లతో వ్యాపార సామ్రాజ్యాన్ని ష్టించిన అభిషేక్ కుమార్ , మోహిత్ కుమార్ సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే ఈ మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి.'వేల్స్టేస్' (ValeStays) వ్యవస్థాపకుల స్ఫూర్తిదాయక కథ ఇదీ. హిందూస్థాన్టైమ్స్.కామ్ కథనం ప్రకారం ఎన్నో కఠిన సవాళ్లనెదుర్కొని, అపజయాలను అధిగమించిన ఇద్దరు యువకులు 'వేల్స్టేస్' అనే మల్టీ-కోర్ల సర్వీస్డ్ అపార్ట్మెంట్ వ్యాపారాన్ని విస్తరించారు అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్ ద్వయం. వీరిద్దరుకో పౌండర్లుగా అవతరించకముందు డబుల్ షిఫ్టులు చేశారు. ఎన్నో ఆర్థిక నష్టాలను తట్టుకున్నారు.అభిషేక్ కుమార్: బిహార్లోని భాగల్పూర్ జిల్లా నౌగాచియాకు చెందిన అభిషేక్, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉదయం 7:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్పొరేట్ ఉద్యోగం. రాత్రి వేళల్లో అర్ధరాత్రి వరకు ఓలా క్యాబ్/బైక్ డ్రైవర్గా పనిచేసేవారు. ఇలా రోజంతా కష్టపడినా వచ్చేది కేవలం రూ. 400 నుంచి రూ. 1,100 మాత్రమే. కొన్నిసార్లు పెట్రోల్ ఖర్చులు పోను ఏమీ మిగిలేది కాదట.మోహిత్ కుమార్: ఉత్తరప్రదేశ్, మైన్పురికి చెందిన మోహిత్, 10వ తరగతి తర్వాత ఢిల్లీ వచ్చారు. 16-17 ఏళ్ల వయస్సులోనే (11వ తరగతి చదువుతున్నప్పటి నుంచి) నెలకు రూ. 1,000 ఫీజుతో ఇంటింటికీ హోం ట్యూషన్స్ చెప్పేవారు.వెళ్లి ట్యూషన్లు చెప్పేవారు. ఐదేళ్ల పాటు దాదాపు 60 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి, ఒక్కో రూపాయి కూడబెట్టి రూ. 20 లక్షల పొదుపు చేశారు. ఆ డబ్బుతో సొంతంగా రెడీమేడ్ దుస్తుల దుకాణం ప్రారంభించాడు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆ వ్యాపారం ఘోరంగా దెబ్బతింది. సంపాదనంతా తుడిచిపెట్టుకుపోయింది.వేల్స్టేస్ పుట్టుక ఎలా అంటే..2022 నాటికి అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్ ఇద్దరూ షేర్డ్ ఇంట్లో అద్దెకు ఉండేవారు.ఇద్దరూ ఆర్థికంగా దెబ్బతిని కష్టాల్లో ఉన్నారు. దీంతో తమ వద్ద ఉన్న కొద్దిపాటి వనరులతో ఏదైనా కొత్తది ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.తొలి అడుగుఎవరు తీసుకోని ఒక పాత ప్లాట్ను అద్దెకు తీసుకున్నారు. OLX లో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనుగోలు చేశారు.వాటిని స్వయంగా బాగుచేసి, శుభ్రం చేసి, సర్వీస్డ్ అపార్ట్మెంట్గా మార్చారు. కొన్ని రోజుల్లోనే మొదటి బుకింగ్ వచ్చింది. అలాఒక ఫ్లాట్తో ప్రారంభమైన వీరి ప్రయాణం, ఏడాదికి 18 ఫ్లాట్లకు, నాలుగేళ్లలో ఢిల్లీ-NCR వ్యాప్తంగా 72 సర్వీస్డ్ అపార్ట్మెంట్లకు విస్తరించింది. ప్రస్తుతం కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారంగా మారింది. ఈ వ్యాపార బాధ్యతల నిర్వహణలో అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్ బాద్యతలను పంచుకుని మరీ విజయవంతంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతగెస్ట్ మేనేజ్మెంట్, సేల్స్, వ్యాపార విస్తరణ బాధ్యతలను అభిషేక్ చూసుకుంటారు. ఇక హౌస్ కీపింగ్, వెండార్స్ మేనేజ్మెంట్, రోజువారీ క్షేత్రస్థాయి (Ground-level) పనుల పర్యవేక్షణ మోహిత్ పని.సౌకర్యవంతమైన జీవితానికి అలవాటుపడితే సరికొత్తగా ఏదీ సాధించలేమని, ఒడిదొడుకులు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకూడదని అభిషేక్ తన లాంటివారికి సూచిస్తోంటే, వ్యాపారంలో నమ్మకమైన భాగస్వామి దొరకడం అన్నింటికంటే గొప్ప ఆస్తి అని మోహిత్ సంతోషం వ్యక్తం చేయడం విశేషం. ఇదీ చదవండి: పాపులర్ క్రైమ్ సిరీస్ ప్రేరణతో భార్య హత్య, రూ. 13 లక్షలతో పరార్ -
రైతు బిడ్డ ఘనత..జస్ట్ ఆరేళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగాలు! కానీ అతడు..
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. ప్రతి ఏడాది వేలాదిమంది సివిల్ సర్వెంట్ కావాలని ఆకాంక్షించినప్పటికీ..కొందరే సక్సెస్ అవ్వగలరు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి ఒకటి రెండు కాదు ఎన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధించాడో తెలిస్తే విస్తుపోతారు. అక్కడితో ఆగిపోకుండా అత్యంత కఠినతరమైన పరీక్షలో సైతం సత్తా చాటి శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరైన ఓ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధించగానే కాలర్ ఎగరేస్తారు..కానీ ఈ వ్యక్తి మాత్రం తన సక్సెస్కి స్టాప్ ఉండదు అన్నట్లుగా సాగి..కొండలాంటి సివిల్స్నే ఢీ కొట్టి..యువతకు ప్రేరణగా మారారు. అతడే రైతు కుటుంబానికి చెందిన ప్రేమ్ సుఖ్ దేలు. రాజస్థాన్లో బికనీర్ జిల్లాలోని రైసర్ గ్రామానికి చెందిన ప్రేమ సుఖ్దేలు..చిన్న నాటి నుంచి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చూస్తూ పెరిగారు. తండ్రి కుటుంబాన్ని పోషించడానికి రైతుగా పనిచేస్తూనే, ఒంటెల బండిని కూడా నడిపేవారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రేమ్ కూడా ఒక పక్క పాఠశాలలో చదువు సాగిస్తూనే..పశువులు మేపడం, వంటి ఇంటి పనుల్లో కూడా సహాయం చేసేవాడు. పేదరికాన్ని ప్రత్యక్షంగా చూడటం వల్ల, మంచి భవిష్యత్తుకు చదువే ఏకైక మార్గమని అతను నమ్మాడు. అందుకే అతడు ఎంతలా కష్టపడి చదివేవాడంటే..మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత రెవెన్యూ అధికారిగా ఉద్యోగం సంపాదించాడు. అలా ఒకపక్క పట్వారీగా పనిచేస్తూనే వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడు. చివరికి అతని కఠోర శ్రమించి..జస్ట్ ఆరేళ్ల వ్యవధిలోనే ఏకం 12 ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించాడు. ఆ తర్వాత రాజస్థాన్ గ్రామ సేవక్ పరీక్షలో రెండవ ర్యాంకు సాధించి, రాజస్థాన్ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుకు అర్హత సాధించాడు. ఆ తర్వాత రాజస్థాన్ అసిస్టెంట్ జైలర్ పరీక్షలో సైతం ఉత్తీర్ణుడయ్యాడు. పలు పదవులకు ఎంపికైనప్పటికీ, సివిల్ సర్వీసెస్లో చేరాలనే తన పెద్ద ఆశయాన్ని అతను కొనసాగించాడు. అయితే అతడు రెండో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్లో ఆల్ ఇండియా 170వ ర్యాంకు సాధించి..ఇండియన్ పోలీస్ సర్వీస్లో స్థానం పొందాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కూడా పట్టుదల, దృఢచిత్తంతో అధిగమించి ఉన్నత స్థానాన్ని చేరుకోగలమని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు ప్రేమ్ సుఖ్ దేలు.(చదవండి: సైన్యంలోకి డెన్మార్క్ యువరాణి!) -
ఉద్యోగానికి గుడ్బై.. సేవే అసలైన విజయం!
స్విట్జర్లాండ్లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని, ఆర్థిక భద్రతను, సకల సౌకర్యాలనూ వదిలి ఇండియాను వెదుక్కుంటూ వచ్చిన సాండ్రా లావి గోజ్కోవిచ్ ఇక్కడ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతోంది. ‘ఇండియాలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అని లావి ఒక ప్రణాళిక వేసుకొని రాలేదు. ఇక్కడ ఆమె అడుగు పెట్టిన తరువాత ఊహించని ప్రణాళిక పుట్టింది. ఆ ప్రణాళికలో నుంచే తన జీవిత లక్ష్యం రూపుదిద్దుకుంది..పశ్చిమబెంగాల్లోని ఒక గ్రామంలో ఒక స్కూల్ ప్రారంభించి పేద పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టిన లావి సాండ్రా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేసింది. మానవ అక్రమరవాణ, గృహహింసకు వ్యతిరేకంగా గళం విప్పింది. తమ కుటుంబాల్లో మార్పు తెచ్చే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.తాజా విషయానికి వస్తే...తన జీవితంలోని కొన్ని విశేషాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది లావి సాండ్రా. కార్పొరెట్ బోర్డ్ రూమ్ను వదిలి భారతదేశంలోని మారుమూల ప్రాంత స్కూల్ రూమ్లోకి ఎలా వచ్చిందో వివరించింది. గ్రామస్తుల నమ్మకాన్ని చూరగొనడం లాంటి సవాళ్లు ఎన్నో ఆమెకు ఎదురయ్యాయి.ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటైన జ్యూరీచ్లో పెరిగిన లావి తన బాల్యం చాలా సంతోషంగా గడిచింది అని చెబుతుంటుంది. తల్లిదండ్రులు ఏది కాదనకుండా ఇచ్చారు. అందులో ఒకటి... ప్రపంచాన్ని చూసే అవకాశం.‘ప్రయాణాల వల్ల ఎన్నో సంస్కృతులను చూసే అవకాశం వచ్చింది. తల్లిదండ్రులు నాకు ఇచ్చిన విలువైన బహుమానం... ప్రయాణించే అవకాశం’ అంటుంది లావి. ఆ ప్రయాణాలలో ఒక జ్ఞాపకం ఆమె మదిలో స్థిరంగా నిలిచిపోయింది. చెప్పులు లేకుండా నడిచి వెళుతున్న ఒక పేద బాలికను చూసి బాధ పడిన లావి తన బూట్లను ఆ అమ్మాయికి ఇచ్చేసింది.‘పంచడంలోని ఆనందం నాకు తొలిసారిగా తెలిసొచ్చిన క్షణం అది’ అని గుర్తు తెచ్చుకుంటుంది లావి.‘ఎంతోమందికి కనీస సౌకర్యాలు లేవు. నాలాంటివారికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. సామాజిక సేవ రూపంలో కొత్త మార్గాన్ని చూపింది.‘కెరీర్కు సంబంధించిన విజయం నాకు ఆర్థిక సౌకర్యం ఇచ్చింది కానీ, లక్ష్యాన్ని మాత్రం ఇవ్వలేదు అనే విషయాన్ని గ్రహించాను. ఈ క్రమంలోనే నా గురించి కాదు సమాజం గురించి ఎంతో కొంత పని చేయాలనుకున్నాను. అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు చొక్కాలు, రెండు ప్యాంట్లు సర్దుకొని ఇండియాకు వన్–వే టికెట్ కొనుక్కున్నాను’ అంటోంది లావీ. -
ఉద్యోగం కోల్పోవడం, మూడుసార్లు వ్యాపారంలో నష్టం..చివరికి ఏకంగా రూ. 100 కోట్లు..
ఎడతెగని వైఫల్యాలు మరింత బలోపేతం కావడానికే...పదేపదే ఓటమి పలకరిస్తోందంటే ఎవ్వరూ ఊహించనంత ఎవరెస్ట్ అంత ఎత్తుకు వెళ్తున్నామని అర్థం... ఇక్కడ కావాల్సింది ఒక్కటే బలహీనమవుతున్న మనసుని స్ట్రాంగ్గా మార్చుకుని ధైర్యంగా ముందుకు సాగడం. అది తెలిసినవాడిని ఓటమి మట్టికరింపించలేదు..ఎందుకంటే అచంచలమైన పట్టుదల ముందు ఆకాశమంత గెలుపుని తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణ ఈ మహిళ. ఆమె తాను ఎదుర్కొన్న సవాళ్లను, కష్టాలను ఎంతో నిజాయితిగా సోషల్మీడియా పోస్ట్లో వివరించి, నెటిజన్ల మనసును దోచడమే కాదు..గెలుపు పోరాటంపై అద్భుతమైన పాఠం నేర్పించింది.ఆ మహిళే సింగపూర్కి చెందిన పారిశ్రామికవేత్త మిజా నజిలి. ఆమె సోషల్మీడియా వేదకగా వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాల గురించి వివరించి వైరల్గా మారింది. ఆమె ఆ పోస్ట్లో ప్రస్తుతం అందరూ తన సక్సెస్ని మాత్రమే చూస్తారు తప్ప ఆ మార్గంలో తనకు ఎదురైన ఎదురుదెబ్బలు, త్యాగాలు పెద్దగా ఎవ్వరూ గమనించారు అంటూ తన సక్సెస్ జర్నీని వివరించింది ఇలా. ఒకప్పుడు తాను పూర్తికాలపు ఉద్యోగం నుంచి తొలగించబడినట్లు తెలిపారు. ఆ తర్వాత చేసిన మూడు వ్యాపారాల్లోనూ తీవ్ర నష్టం చవిచూసినట్లు వెల్లడించింది. ఒకానొక సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ సైతం రూ. 2 వేలుకి మించి లేదని ఆవేదనగా చెప్పారు. అంతేగాదు వ్యాపారాల్లో నష్టం కారణంగా సుమారు రూ. 70 లక్షలదాక అప్పులుపాలైనట్లు తెలిపారు. తన వ్యాపారం ప్రారంభ దశలో మెరుగైన లాజిస్టిక్స్ మద్దతును పొందలేకపోయినందున, సరుకును తీసుకెళ్లడానికి దాదాపు ప్రతిరోజూ జోహోర్ బహ్రూకు ప్రయాణించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రిటైల్ అవకాశాలను పొందడానికి ప్రయత్నించినప్పుడు మరో సవాలు ఎదురైందంటూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఒక ప్రముఖ రిటైలర్కు తన ఉత్పత్తులను మొదటిసారిగా అందించినప్పుడు, ఎలా తిరస్కరించారో ఇప్పటికీ మర్చిపోనన్నారు. కానీ ఇవాళ తన ప్రొడక్ట్స్ వందకు పైగా వాట్సన్స్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని గర్వంగా చెప్పారామె. కేవలం పట్టువదలని ప్రయత్నంతో తన వ్యాపారాన్ని నిలబెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పోర్ట్ఫోలియోలో 5 వివిధ బ్రాండ్లు ఉన్నాయని, వాటి నుంచి ఏడాదికి ఏకంగా దాదాపు రూ. 100 కోట్లుపైనే ఆర్జిస్తానని చెప్పారు. అంతేగాదు రెండు భవనాల్లో ఆరు అంతస్థుల ప్రధాన కార్యాలయాన్ని నిర్మించానని కూడా అన్నారు. అలాగే ఇటీవలే తానొక కొత్త పోర్షే కారుని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనను అందరూ బహుళ బ్రాండ్లను నడుపుతున్న ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చూస్తున్నారని, ఒకప్పుడు తల్లిదండ్రులు సైతం చిరాకుపడ్డ అమ్మాయిగా కానీ, చదువు మధ్యలోనే మానేసిన మొద్దుదానిలా గానీ చూడరని చెప్పుకొచ్చింది. ఇదంతా గెలుపు గొప్పతనం అంటూ తన పోస్ట్ని ముగించింది. అంతేగాదు ఆమె ప్రతి ఒక్కరిని ఇతరుల విజయాలతో పోల్చుకుని అస్సలు చూసుకోవద్దని అది మనల్ని వెనక్కి లాగేస్తుందని అన్నారు. అలాగే తాను ఇన్ని ఎడతెగని ఓటములు చవిచూసినా ఎన్నడూ భయపడలేదని, ఎందుకంటే ఓటమి భయం కంటే పేదరికంలో ఉండిపోతానన్న భయమే ఎక్కువ అంటూ సరికొత్త గెలుపు పాఠాన్ని చెప్పింది మిజా నజిలి. View this post on Instagram A post shared by Miza Nazili (@mizanazili) (చదవండి: నో ఐఐటీ/ఎన్ఐటీ, 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ..కట్చేస్తే..) -
రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ఏకంగా రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సక్సెస్ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్ఫారమ్పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్పూర్లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు. 18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి. రాజస్థాన్లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్కు చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్ఫారమ్పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.చిన్న అడుగుతో మొదలైన వ్యాపారంబల్హార్షాలో నువాల్కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.#WATCH | Solar Group Chairman Satyanarayan Nuwal receives Padma Shri award from President Droupadi Murmu for his contribution to India's defence manufacturing ecosystem pic.twitter.com/xEuTePY74k— ANI (@ANI) May 25, 2026త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.'సోలార్ ఇండస్ట్రీస్' అద్భుత ప్రగతి1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.2006 IPOఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.'మేక్ ఇన్ ఇండియా' మిషన్లో భాగంగా కంపెనీ ఎక్స్ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిపద్మశ్రీ పురస్కారం2026, మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
స్విగ్గీ రైడర్గా వైద్యవిద్యార్థి..! కట్చేస్తే కోటీశ్వరుడిగా..
లాక్డౌన్ కొన్ని జీవితాలను చిన్నాభిన్నం చేసింది గానీ..వాళ్ల విజయాన్ని ఆపలేకపోయింది. బహుశా ఆ మహమ్మారి ఇంట్లోనే బంధీగా చేసిందేమో గానీ విజేత కానివ్వకుండా నిలువరించలేకపోయింది. అందుకు ఉదాహారణే రచయితగా మారిన ఈ వైద్య విద్యార్థి కథ. నిజానికి కరోనా టైంలో ఎందర్ని నిరుద్యోగులుగా చేసి రోడ్డుమీదకు తీసుకొచ్చేసంది. అప్పటిదాక సంతోషంతో ఉన్న కొందరి జీవితాలు తలకిందులైపోయాయి. అలాంటి వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన అజిత్ కుమార్ కూడా ఒకడు. ఫరిదాబాద్లోని రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చదువుకుంటున్న అజిత్ కుమార్ లైఫ్ కరోనాతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. తన చదువు కోసం చేసిన అప్పులు ఒకవైపు..చదువు కొనసాగన్వివకుండా మహమ్మారి ఇంకోవైపు. దాంతో చదువుని మధ్యలోనే ఆపేసి ఉపాధి వెతుక్కుంటూ స్విగ్గీ డెలివరీ ఏజెంట్గా మారాడు. రోజుకు 16 గంటలు పనిచేస్తూ..ఏకంగా వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుండేవాడు. ఆ క్రమంలో ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఒక పక్క తీర్చాల్సిన అప్పులు నిద్రపట్టనివ్వకుండా చేస్తుండటంతో మళ్లీ ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు. అప్పుడే పాకెట్ ఎఫ్ఎమ్లో రచయిత ఉద్యోగ ప్రకటన అతడి కంటపడింది. దాంతో అతడి పరిస్థితులన్నీ మారిపోయాయి. అనూహ్యంగా మూడు నెలల్లో అతని కథలలో ఒకటి పాకెట్ ఎఫ్ఎమ్ఎమ్ రచనల పోటీలో అగ్రస్థానంలో నిలిచింది. వెంటనే అతనికి రూ. 20 వేలు పారితోషికం లభించింది. ఆ తర్వాత రూ. 52 వేలు పారితోషకం లభించింది. అలా నెమ్మదిగా అతడికి అందే చెక్కులపై అంకెలు పెరగడం ప్రారంభించాయి. ఒక నెలలో అతనికి ఏకంగా రూ. 6.29 లక్షల పారితోషకం లభించింది. ప్రస్తుతం ఆయన పాకెట్ ఎఫ్ఎమ్ 'బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' కార్యక్రమానికి ప్రధాన రచయితగా పనిచేస్తున్నారు. దీనికోసం ఏకంగా వెయ్యికిపైగా ఎపిసోడ్లు రాశారు. అలా అజిత్ ఇవాళ కోట్లు గడించే రచయితగా మారాడుఅతని లింక్డ్ఇన్ బయో ప్రకారం, 3 మిలియన్లకు పైగా వీక్షణలతో ప్రేక్షకుల ఆదరణను పొందారు. ఆ అకౌంట్లో అజిత్ కుమార్ తన గురించి ఇలా రాసుకొచ్చారు. "పురాణాల ఆధారిత కల్పనా కథలు రాసే చయితను. ప్రాచీన గాథలను భవిష్యత్ కాలపు మహాయోధుల ఇతివృత్తాలతో మేళవించి ఇతిహాస గాథలను రచించడం నా అభిరుచి. ప్రస్తుతం నేను బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' అనే ఒక భారీ సీరియల్కి పనిచేస్తున్నాని, అది సుమారు 5 వేలకు పైగా ఎపిసోడ్లు కొనసాగనుందని అజిత్ రాసుకొచ్చారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఆడియో-ఫిక్షన్ ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. అంతేగాదు తన చేతిలో ఐదు పెద్ద నవలల కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నిజంగా అజిత్ కుమార్ని చూస్తే పడిలేచిన కెరటం అనొచ్చు కదా. అందరం కెరీర్ నిర్మించుకునే క్రమంలో కిందపడిపోతాం, కుదేలవుతాం..కానీ తట్టుకుని తిరిగి లేచి నిలదొక్కుకున్నవాడే విజేత అని నిరూపించాడు కదూ..!.(చదవండి: మెరిసే చర్మం కోసం న్యూటెల్లా జార్..! ఆ నటి బ్యూటీ సీక్రెట్..) -
స్కామ్ని జామ్ చేసే షీల్డ్ ఇది..!
అకస్మాత్తుగా అపరిచిత వ్యక్తి నుంచి కాల్ రావడం. బంపర్ ప్రైజ్ వచ్చిందని, మొబైల్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే సరిపోతుందని చెప్పి మోసం చేసిన ఘటనలు మన దేశంలోనే వేలల్లో ఉన్నాయి. వయసులో పైబడ్డవారు, టెక్నాలజీ మీద అవగాహన లేనివారే ఇలా ఆన్లైన్ స్కామర్ల చేతిలో మోసపోతుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు రూపొందించిందే షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్. దీనిని రూపొందించింది అమెరికాలోని టెక్సాస్కు చెందిన 17 ఏళ్ల యువతి.ఆమె పేరు తేజస్వీ మనోజ్, భారతీయ సంతతికి చెందిన ఈమె రెండేళ్ల కిందట ఆన్లైన్ మోసగాళ్ల వల్ల తన తాతయ్య మోసం పోవడం గమనించింది. చిన్నప్పటి నుంచి కోడింగ్ మీద ఇష్టం ఉండడంతో ఆన్లైన్ స్కామర్లను అడ్డుకునేందుకు ఒక భద్రతావలయాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. అప్పుడు వచ్చిందే ఈ షీల్డ్ సీనియర్ వెబ్సైట్. దీని ద్వారా కాల్స్, మెసేజెస్, సైట్ డొమైన్... ఇలా ప్రతి దాన్ని జల్లెడ పట్టి అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవచ్చు. తేజస్వీ ప్రతిభని గుర్తించిన టైమ్స్ మేగజైన్ 2025లో ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. -
ఒక్క ఐడియా = 650 మంది కోటీశ్వరులు
బాగా చదువుకుని ఉద్యోగం చేసో, లేక వ్యాపారం చేసో డబ్బు సంపాదించాలని అనుకోవడం సహజం. కాని తాను వ్యాపారం చేస్తూనే తనతో పాటు క్లైంట్లను కూడా కోటీశ్వరులను చేసిన యువకుడి కథ ఇది. అమెరికాకి చెందిన 22 ఏళ్ల స్టీవెన్ ష్క్వార్జ్ మాత్రం చిన్న వయసులోనే వ్యాపారం గురించి ఆలోచించాడు. చిన్నప్పుడు నీటి సీసాలు అమ్ముతూ మొదలైన వ్యాపారం అతనిలో కొత్త ఆలోచనని పుట్టించింది. అదే వూప్(whop). ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ ప్లేస్.ఈ ప్లాట్ఫాం ద్వారా కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలను విక్రయించుకోవచ్చు. అచిర కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం వల్ల అనేక మంది తమ కోట్ల డాలర్ల లావాదేవీలను వూప్ ద్వారా నిర్వహించారు. ఈ పరిణామంతో వూప్ సంస్థ బిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు సాగించే 650 మంది మిలియన్ల కొద్దీ ఆర్జించినట్టు ప్రముఖ గ్లోబల్ బిజినెస్ మేగజైన్ ఫార్చూన్ పేర్కొంది. -
నింగిని వదిలి.. మట్టితో మమేకమై!
ఆమె చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం శాటిలైట్ పేలోడ్స్ తయారు చేసే ఏరోస్పేస్ సంస్థలో ఉద్యోగం. కెరీర్ పరంగా ఎంతో ఉన్నతమైన స్థానం. కానీ, ఆ ఏసీ ల్యాబ్లు, కంప్యూటర్ స్క్రీన్లు ఆమెకు ఏ మాత్రం తృప్తినివ్వలేదు. తన మూలాల్లోకి తిరిగి వెళ్లాలని అనుకుంది. ఉద్యోగాన్ని వదిలేసి, మట్టితో మమేకమై, పర్యావరణానికి మేలు చేసే ఒక అద్భుతమైన ‘జీరో–వేస్ట్ కేఫ్’ను ప్రారంభించింది 27 ఏళ్ల నిష్ఠా చౌహాన్....నిష్ఠా చౌహాన్ ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో పెరిగింది. ఆమె తాత చిరుధాన్యాలను పండించేవారు. అలా ఆమె తన చిన్నతనంలోనే రాగులు, జొన్నలు, సజ్జల వంటి సంప్రదాయ ఆహార ప్రాముఖ్యతను తెలుసుకుంది.అహ్మదాబాద్లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్’ ప్రాంగణంలో నిష్ఠా మొదటి కేఫ్ను ప్రారంభించింది. ఈ కేఫ్లో మిల్లెట్ వంటకాలు మాత్రమే ఉంటాయి. ప్లాస్టిక్, డిస్పోజబుల్ వస్తువులు ఇక్కడ పూర్తిగా నిషేధం. గాజు పాత్రల్లోనే ఆహారాన్ని అందిస్తారు. పార్సిల్స్ కోసం అరెకా లీవ్స్, చెరకు పిప్పితో చేసే పాత్రలను వాడుతున్నారు. ఇక్కడ పర్యావరణానికి హాని చేసే ఎయిర్ కండిషనర్లకు బదులుగా, కేఫ్ను చల్లబరచడానికి వాటర్–కూలింగ్ సిస్టమ్స్, మిస్టింగ్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు.పిల్లలకు ఎకో వర్క్షాప్స్!నిష్ఠా చౌహాన్ పలు ఇంటర్నేషనల్ స్కూల్స్తో కలిసి 5 నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా ఎకో–వర్క్షాప్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలు నేరుగా తోటలోకి వెళ్లి మట్టిని తాకడం, మొక్కలను గుర్తించడం, కూరగాయలను స్వయంగా కోయడం నేర్చుకుంటారు. ఆపై వంటింట్లోకి వెళ్లి సొంతంగా మిల్లెట్ సలాడ్లు, జ్యూస్లు తయారు చేస్తారు. సంప్రదాయక ఆహారానికి, జంక్ ఫుడ్కి గల తేడాని గమనిస్తారు. -
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..) -
లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?
జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులు మాత్రమే కాదు. ఎందుకంటే.. ఒకప్పుడు గణితంలో కేవలం 51 మార్కులు మాత్రమే సాధించిన విద్యార్థి, నేడు భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించి చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'పవన్ కుమార్ చందన'.. చిన్నప్పటి నుంచే యంత్రాలు ఎలా పనిచేస్తాయనే విషయంపై ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అయితే.. చదువులో ముఖ్యంగా గణితంలో మాత్రం ఆశించిన ప్రతిభ కనపరచలేకపోయేవారు. ఒక పరీక్షలో ఆయనకు లెక్కల్లో కేవలం 51 మార్కులే వచ్చినట్లు సమాచారం.లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని.. ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఆ తరువాత మ్యాథ్స్, సైన్స్ మీద ప్రత్యేక శ్రద్ద చూపించి.. తొలి ప్రయత్నంలోనే ఐఐటీ జేఈఈలో విజయం సాధించిన ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజినీరింగ్ చదివే అవకాశం పొందారు.ఇస్రోలో జాబ్ఐఐటీ పూర్తి చేసిన తరువాత.. చాలామంది విద్యార్థులు అధిక వేతనాలు ఇచ్చే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎంచుకున్నప్పటికీ, పవన్ కుమార్ చందన మాత్రం భారత అంతరిక్ష రంగంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఇస్రోలో చేరారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురంలో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ఇస్రోలో పనిచేస్తున్న సమయంలో.. అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనం జీఎస్ఎల్వీ మార్క్-III (GSLV Mk III) రూపకల్పన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఇస్రోలో ఉద్యోగం వదిలేసి.. భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో ముందుకు రావాలనే ఆలోచనతో పవన్ కుమార్ చందన, తన సహచరుడు నాగ భరత్ డాకాతో కలిసి 2018 జూన్లో హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ స్థాపించారు.🚨 𝗟𝗶𝗳𝘁𝗼𝗳𝗳 𝗼𝗳 𝗦𝗸𝘆𝗿𝗼𝗼𝘁 𝗔𝗲𝗿𝗼𝘀𝗽𝗮𝗰𝗲'𝘀 𝗩𝗶𝗸𝗿𝗮𝗺-𝟭 𝗿𝗼𝗰𝗸𝗲𝘁 𝗮𝘁 𝟭𝟮:𝟬𝟱 𝗣𝗠 𝗜𝗦𝗧 𝗳𝗿𝗼𝗺 𝘁𝗵𝗲 𝗙𝗶𝗿𝘀𝘁 𝗟𝗮𝘂𝗻𝗰𝗵 𝗣𝗮𝗱 𝗮𝘁 𝗦𝗛𝗔𝗥! 🚀The era of commercial spaceflight has begun in India 🇮🇳#Skyroot | #Vikram1 pic.twitter.com/yba2WRW1Ck— ISRO Spaceflight (@ISROSpaceflight) July 18, 20262018లో ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్థాపించడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని అనే చెప్పాలి. పెట్టుబడులు సమకూర్చడం కష్టమైంది. అయితే ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ సంస్థపై నమ్మకం ఉంచి తొలి పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కారణంగా నిధుల సేకరణ కష్టతరమైనా, గ్రీన్కో సంస్థ ఆర్థిక సహాయం అందించడంతో స్కైరూట్ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. రూ వేలకోట్ల విలువైన కంపెనీగా అవతరించింది.స్కైరూట్ విజయాలు2020లో స్కైరూట్ భారతదేశంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థగా.. రామన్-1 రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. 2021లో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడంతో, ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ నిలిచింది.2022 నవంబర్ 18న స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-ఎస్ అనే భారత తొలి ప్రైవేట్ సబ్-ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక కీలక మలుపు.ORBIT ACHIEVED. 🚀 Vikram-1 Test Flight-1 has reached orbit. India's first privately developed orbital rocket has completed its final burn and injected its payloads into a ~450 km orbit, making India the third country in the world with private orbital launch capability.…— Skyroot Aerospace (@SkyrootA) July 18, 2026విక్రమ్-1 చారిత్రక విజయంఇక నేడు (జూలై 18న) స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా భూమి కక్ష్యలోకి చేరి, తనతో తీసుకెళ్లిన అన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్గా విక్రమ్-1 చరిత్ర సృష్టించింది. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. స్వదేశీ సాంకేతికత, భారత యువత ప్రతిభ, ప్రభుత్వ సహకారం కలిసి ప్రపంచానికి భారత సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.పవన్ కుమార్ చందన ప్రకారం.. విజయం సాధించడానికి కేవలం డిగ్రీలు లేదా విదేశీ విద్య మాత్రమే అవసరం కాదు. బలమైన పునాది, సరైన ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా గొప్ప విజయాలను సాధించగలరు. యువతకు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన చెబుతారు. అప్పుడే దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది.ఇదీ చదవండి: కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్పై ఆందోళన! -
తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీ
లక్నో: లక్నోలోని గోమతి నగర్కు చెందిన డిగ్దిగా గ్రామానికి చెందిన నీలు సకాలంలో వైద్య చికిత్స అందించే స్థోమత లేకపోవడంతో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది..అత్యంత బాధాకరమైన ఆ క్షణమే ఆమె జీవితానికి కొత్త లక్ష్యాన్ని చూపించింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ఉత్తీర్ణత సాధించి తన సాకారం వైపుగా తొలి అడుగు వేసింది.నీలు 8వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మరణించడంతో వారి కుటుంబ ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు పడింది. అయితే, ఈ కష్టాలు, నష్టాలు ఆమెను ఆమెను కృంగ దీయలేదు. వైద్యం అందక పేదరికం వల్ల ఎవరూ తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే లక్ష్యంతో డాక్టర్ కావాలని ఆమె నిశ్చయించుకుంది. మరోవైపు కుటుంబానికి ఏకైక సంపాదనపరురాలైన ఆమె తల్లి, ఆసుపత్రి లోనూ, ఇటు గృహ సహాకురాలిగా పనిచేస్తుంది. కూతుళ్ల చదువును మాన్పించి, వారికి పెళ్లిళ్లు చేయమని బంధువులు, ఇతరులుఎంత ఒత్తిడి చేసినా బిడ్డల్ని చదివించేందుకు నిర్ణయించుకుంది.తండ్రి మరణంతో సంకల్పంఆర్థిక ఇబ్బందుల కారణంగా తన తండ్రికి సరైన వైద్యం అందించలేకపోయామని, చివరికి అనారోగ్యంతో కన్నుమూశారని నీలు చెప్పింది. పేదరికంతో సరైన చికిత్స అందించలేక నాన్నను కోల్పోయాను. అందుకే పేదరికం వల్ల మరే కుటుంబం కూడా ఇలాంటి నష్టాన్ని అనుభవించకూడదని ఆ రోజే తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను అని నీలు తెలిపింది. అట్టడుగు వర్గాల బాలికల కోసం స్టడీ హాల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (SHEF) నడుపుతున్న ప్రేరణ బాలికల పాఠశాలలో నీలు తన విద్యను ప్రారంభించి, ఆ తర్వాత 11, 12 తరగతుల కోసం స్టడీ హాల్ పాఠశాలలో స్కాలర్షిప్ సంపాదించింది. కష్టపడి చదివి నీట్లో ఉత్తీర్ణత సాధించి తన కల వైపు మొదటి పెద్ద అడుగు వేసింది. పట్టుదలతో చదివి నీట్ పరీక్షను విజయవంతంగా క్లియర్ చేసింది. ఈ ఏడాది సిబిఎస్ఇ క్లాస్ 12 బోర్డు పరీక్షల్లో నీలు 94 శాతం మార్కులు సాధించింది. . ప్రస్తుతం ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించేందుకు సిద్ధ మవుతోంది. భవిష్యత్తులో కార్డియాలజీ (గుండె జబ్బుల విభాగం) లో స్పెషలైజేషన్ చేసి, ఆర్థికంగా వెనుకబడిన రోగులకు సరసమైన ధరకే వైద్యం అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.నీలు అకడమిక్ ప్రతిభను గుర్తించి ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'వహానీ స్కాలర్షిప్' లభించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 50 మంది మాత్రమే ఎంపికైన తుది జాబితాలో నీలు చోటు దక్కించుకుంది. ఈ స్కాలర్షిప్ ఆమె వైద్య విద్యకు అయ్యే ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను భరిస్తుంది.స్ఫూర్తిగా నిలిచిన నీలుస్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఊర్వశి సాహ్ని మాట్లాడుతూ... సరైన అవకాశాలు, సాయం లభిస్తే విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చెప్పడానికి నీలు విజయమే నిదర్శనమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ మీనాక్షి బహదూర్ కూడా నీలును ఎంతో కష్టపడే, పట్టుదల గల విద్యార్థిగా అభివర్ణిస్తూ, ఆమె విజయం ఎంతో మంది యువతులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
‘నీట్’లో ఇటుక బట్టీ కార్మికుడి పిల్లల జయకేతనం
నవాదా: బీహార్లోని నవాదా జిల్లా, పక్రిబరావాం ప్రాంతానికి చెందిన రివ రంజన్ కుమార్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇటుక బట్టీలో పనిచేస్తూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, తన పిల్లలు రితేష్ కుమార్, రిచా కుమారీలను ఉన్నత చదువులు చదివించాలన్న తండ్రి పట్టుదల ఫలించింది. ఇద్దరూ ఈ ఏడాది జరిగిన ‘నీట్ యూజీ 2026’ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వైద్య విద్యకు అర్హత సాధించారు.తొలి ప్రయత్నంలో విఫలమైనా వెనకడుగు వేయకుండా, రెండో ప్రయత్నంలో కోటాలో శిక్షణ పొంది ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రితేష్ కుమార్ 720 మార్కులకు గానూ 655 మార్కులు సాధించి 1160 ఆల్ ఇండియా ర్యాంకును కైవసం చేసుకోగా, రిచా కుమారి 622 మార్కులతో 4685వ ర్యాంకును సాధించారు. తల్లి శోభా కుమారి ప్రోత్సాహం కూడా తోడవడంతో వారు డాక్టర్లు అయ్యేందుకు సిద్ధమయ్యారు. వీరి విజయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ఇదే జిల్లాకు చెందిన ఆయుష్ భలోటియా ఆల్ ఇండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి బీహార్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.ఇది కూడ చదవండి: ‘మందు కొట్టి మొగుడిని చావగొడతా’ -
నీట్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కుర్రాడు..! ఆమె మరణమే..
NEET UG 2026 Toppers List: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) రీటెస్ట్ ఫలితాలు గురవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 11 లక్షల మందికి పైగా అర్హత సాధించారు. వారిలో మొత్తం 138 మందికి 690కి పైగా మార్కులు రాగా, 19 మంది 700పైగా మార్కులు సాధించి, గొప్ప మైలురాయిని చేరుకున్నారు. రాష్ట్రాల వారిగా చూస్తే వారిలో ఆల్ ఇండియా 1వ ర్యాంకుతో పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా టాపర్గా నిలిచాడు. అతడు నీట్ యూజీ పరీక్షలో మొత్తం 720 మార్కులకు 715 మార్కులు సాధిచడం విశేషం. ఈ మేరకు ఆర్యన్ మాట్లాడుతూ..నెంబర్ వన్ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన కల నిజమైనట్లుగా అనిపించిందన్నాడు. తన తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే కావడంతో ఈ సక్సెస్ వాళ్లకెంతో గర్వంగా ఉందన్నారు. తాను ప్రిపరేషన్ సమయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరించినట్లు తెలిపాడు. చదువకోవడానికే ఎక్కువ సమయం కేటాయించానని చెప్పాడు. రోజుకు సుమారు 16 నుంచి 17 గంటలు చదివినట్లు వెల్లడించాడు. ఒక్కోసారి అస్సలు నిద్రపట్టేది కాదని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ దిశగా ముందుకు సాగానని చెప్పాడు. ఈ విజయం తన తన చిన్ననాటి నష్టం, తన కెరీర్ ఆశయాలను నుంచి పుట్టుకొచ్చిందని చెప్పాడు. తాను మూడో తరగతిలో ఉండగా అమ్మమ్మ కేన్సర్తో చనిపోవడంతో ఈ రంగంలో పనిచేయాలని ఆ రోజే స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా తన పేరెంట్స్, ఉపాధ్యాయులు, తనను నమ్మిన ప్రతిఒక్కరిదని అన్నాడు. అలాగే తాను జీవితంలో చేయాల్సింది చాలా ఉందని, ప్రస్తుతం తాను ఆంకాలజిస్ట్ కావలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కాగా అతడి కుటుంబం ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అంతేగాదు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, శిరోమణి అకాలీ దళ్ నాయకుడు విక్రమ్ సింగ్ మజీతియాతో సహా పలువురు రాజకీయ నాయకుల నుంచి కూడా ఆర్యన్కి అభినందన సందేశాలు అందాయి.అలా జరగడంతో చాలా ఏడ్చా..ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో, మొదటి పరీక్ష తర్వాత నీట్ యూజీ 2026 రద్దు కావడంతో తాను కూడా మొదట్లో తీవ్రంగా కుంగిపోయినట్లు తెలిపాడు. ఆ సమయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యానని అన్నారు. ఇలా కేవలం నా ఒక్కడికే కాదని, అందరిదీ ఇదే పరిస్థితని అంగీకరించి, అధిగమించే ప్రయత్నం చేశానని అన్నాడు. అయితే తాను రెండో ప్రయత్నంలో తన ప్రతిభను మెరుగుపరుచుకుని అగ్రస్థానంలో నిలవగలిగానంటూ సంతోషం వ్యక్తం చేశాడు ఆర్యన్ గుప్తా. VIDEO | Ludhiana: Punjab's Aryan Gupta topped the NEET-UG for medical admissions.He says, "I secured AIR 1, I scored 715 out of 720, my father and mother are doctors... I worked hard, I would not get sleep, but it is feeling surreal now, looking like a dream, everyone is happy,… pic.twitter.com/wwsNL8QNeX— Press Trust of India (@PTI_News) July 16, 2026 (చదవండి: కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి) -
వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ డ్రైవింగ్ ..
జీవితాన్ని మార్చే కొన్ని నిర్ణయాలు తగరతి గదుల్లోనో లేక పెద్ద పెద్ద సమావేశాల్లోనో కాదు భరింపరాని దుఃఖం నుంచి మొదలవుతుంది. మనకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయిన తీవ్ర దుఃఖం ఒకవైపు.. ఒక్కసారిగా మీదపడ్డ కుటుంబ బాధ్యతలు ఇంకోవైపు.. ఆ తరుణంలో తీసుకునే సరైన నిర్ణయాలే ఆ మనిషి గొప్పతనాన్ని చాటుతాయి. అందుకు నిదర్శమే ఈ గుజరాత్ ధీరవనిత కథ. ఆ మహిళే గుజరాత్లోని కచ్ జిల్లాలో నివశిస్తున్న శాంతాబెన్. భర్త మరణంతో ఒక్కసారిగా పిల్లల చదువులు, కుటుంబాన్ని పోషించడం వంటి బాధ్యతలు ఆమె మీద పడిపోయాయి. అప్పటి వరకు ఇంటి పట్టున భర్త నీడలో బతికిన ఆమెకు ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఎందుకంటే వ్యవసాయ పనులు గురించి గానీ, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలన్న దానిపై గానీ ఏ మాత్రం ఆలోచన, అవగాహన లేదు. ఆ క్లిష్ట సమయంలో తనముందుకు ఉన్న ఒకే ఒక్క దారి.. కుటుంబానికి ఆధారమైన వ్యవసాయ క్షేత్రాన్ని భర్త తదనంతరం తానే స్వయంగా నిర్వహించడం ఒక్కటే. నిజానికి ఆ పనులు ఏవీ ఆమెకు తెలియదు. కనీసం వ్యవసాయ పనిముట్లు ఎలా వాడాలో కూడా తెలియదు. ప్రతీది నేర్చుకోవాల్సిందే. అయినా వెనకడుగు వేయలేదు. భావిని తవ్వడం నుంచి, ఎలాంటి ఎరువులు కొనాలి, ఎలాంటి పురుగులు మందులు ఉపయోగించాలి అన్నింటిని వేగంగా నేర్చుకుంటూ వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అంతేగాదు ఆఖరికి 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ని నడపడం కూడా స్వయంగా నేర్చుకుంది. అయితే ఇంతలా కష్టపడుతున్నా.. అప్పటికే ఇంటి మీద ఉన్న అప్పులు, కారణంగా కుటుంబ నిర్వహణ మరింత కష్టంగా మారిపోయింది. చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఇక ఉన్న ఆ ఒక్క పొలం అమ్మితే కానీ పరిస్థితి చక్కబడేట్లు కనిపించని దస్థితి. కానీ ఆమె ఆ సమయంలో ఎంతో సమన్వయంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం కుటుంబ సభ్యులు పొలాన్ని అమ్మేద్దామని అంటున్నా..అందుకు ఆమె నిరాకరించింది. తానే ఎలాగోలా కష్టపడి అప్పులు తీరుస్తాని హామీ ఇచ్చి మరీ.. వ్యవసాయం చేసేందుకే మొగ్గు చూపింది. అలా శాంతాబెన్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ఏడింటి వరకు పొలంలోనే ఉంటూ కష్టపడేది. ఆమె కష్టానికి ఫలితం లభించింది.. పొలం చక్కగా పండటం మొదలైంది. దాంతో ముందుగా ఇంటి మీద ఉన్న అప్పులు తీర్చేసి, పిల్లలను చదివించడం మొదలు పెట్టింది. అప్పటి వరకు బ్యాంకు ఖాతా తెలియని ఆమె..తనలాంటి మహిళా రైతులకు బ్యాంకులు అప్పులు ఇస్తాయని తెలుసుకుని, దాని సాయంతో మరింతగా వివిధ రకాల పంటలు వేసి పండించి ఆదాయం గడించటం మొదలు పెట్టింది. చివరికి పిల్లలను మంచి చదువులు చదివించే స్థాయికి చేరుకుని ఆదర్శంగా నిలిచింది. ఆమె కష్టానికి ఫలితంగా కుమారుడు సివిల్ ఇంజనీర్ అయ్యాడు. ఇప్పడు అతను అమ్మకు పొలంలో సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. శూన్యం నుంచి జీవితాన్ని మొదలు పెట్టి శిఖరాగ్రానికి చేరుకునేలా జీవితాన్ని అందంగా మలుచుకుంది శాంతాబెన్. విషాదం అనేది తన మిగిలిన జీవితానికి ముగింపు కాదని ధైర్యంగా ముందుకు సాగితే మంచి రోజులు ఉంటాయనే చెప్పే స్ఫూర్తిదాయక కథ ఆమెది. అంతేగాదు కష్టకాలంలో తప్పుడు నిర్ణయాలు కాదు..వాటిని అధిగమించేలా ధైర్యంగా నిలబడాలని నొక్కి చెబుతోంది ఆమె కథ.(చదవండి: ఆ డీఆర్డీఓ శాస్త్రవేత్త అడిగిన ఒకే ఒక్క ప్రశ్న..లైఫ్నే మార్చేసింది!) -
రూ.13,000తో రూ.20,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
విజయానికి డిగ్రీలు అక్కర్లేదు. కేవలం పట్టుదల, వ్యాపార దార్శనికత ఉంటే చాలని నిరూపించిన పారిశ్రామికవేత్త ఆర్జీ చంద్రమోగన్. గణితంలో ఫెయిల్ అయి నెలకు కేవలం రూ.65 జీతానికి అప్రెంటిస్గా పనిచేసిన ఒక సాధారణ యువకుడు.. నేడు దేశంలో ప్రముఖ ప్రైవేట్ డెయిరీ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదగడం ఒక అద్భుత ప్రయాణం. కేవలం రూ.13,000 ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఆయన వ్యాపారం నేడు దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’గా రూపాంతరం చెందింది.వైఫల్యం నుంచి పాఠాలుతమిళనాడులోని గ్రామీణ కుటుంబంలో జన్మించిన చంద్రమోగన్ బాల్యం ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికి తోడు, పాళయంకోట్టైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదువుతున్న సమయంలో ఆయన గణితంలో ఫెయిలవ్వడంతో చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చెన్నైకి 160 కిలోమీటర్ల దూరంలోని విలుప్పురంలోని ఒక కలప డిపోలో నెలకు రూ.65 జీతానికి అప్రెంటిస్గా చేరారు. అక్కడ శారీరక శ్రమ చేస్తూ ఆర్డర్లు తీసుకునే క్రమంలోనే.. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన వ్యాపార కాంక్ష చిగురించింది.రూ.13,000తో ‘అరుణ్’ బ్రాండ్సొంత వ్యాపారం ప్రారంభించాలనే కొడుకు ఆశయానికి తండ్రి అండగా నిలిచారు. కుటుంబానికి ఉన్న పూర్వీకుల భూమిని రూ.13,000కు విక్రయించి పెట్టుబడి పెట్టారు. ఎలాంటి అధికారిక వ్యాపార ప్రణాళికలు లేదా ఇన్వెస్టర్ల సాయం లేకుండా 1970లో చెన్నైలోని రాయపురంలో 250 చదరపు అడుగుల చిన్న అద్దె గదిలో చంద్రమోగన్ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నలుగురు ఉద్యోగులు, ఒక ప్రాథమిక ఐస్ తయారీ యంత్రంతో రోజుకు 10,000 ఐస్ క్రీమ్ల సామర్థ్యంతో ‘అరుణ్’ (Arun Icecreams) బ్రాండ్ పుట్టింది. ప్రారంభ రోజుల్లో చంద్రమోగన్ స్వయంగా చెన్నై వీధుల్లో తోపుడు బండిపై ఐస్ క్రీమ్లు అమ్మడం గమనార్హం.ఐస్ క్రీమ్ నుంచి డెయిరీ వైపు అడుగులుదాదాపు దశాబ్దం పాటు ఐస్ క్రీమ్ రంగంలో నిలదొక్కుకున్న చంద్రమోగన్ కేవలం సీజనల్ వ్యాపారమైన ఐస్ క్రీమ్ల కంటే నిత్యం డిమాండ్ ఉండే పాలు, పాల ఉత్పత్తుల రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. అప్పటికే అసంఘటితంగా ఉన్న భారతీయ డెయిరీ మార్కెట్ను క్రమబద్ధీకరించేందుకు 1980ల్లో పాల ప్రాసెసింగ్లోకి అడుగుపెట్టారు.కంపెనీ క్రమంగా వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను జోడించి విస్తరించింది. వేగవంతమైన లాభాల కంటే.. నమ్మకమైన సరఫరా గొలుసు ఏర్పాటు, రైతులు, రిటైలర్లతో బలమైన సంబంధాలు, పంపిణీ నెట్వర్క్ బలోపేతం పైనే ఆయన దృష్టి సారించారు. ఈ దీర్ఘకాలిక వ్యూహమే ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’ను దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ డెయిరీ సంస్థగా నిలబెట్టింది.గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో స్థానంఐదు దశాబ్దాల కృషి ఫలితంగా హాట్సన్ ఆగ్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,000 కోట్ల మార్కును దాటింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం చంద్రమోగన్ నికర ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లు. ఆయన 2023లో భారత ధనవంతుల జాబితాలో 99వ స్థానంలో, 2026 నాటికి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 2,481వ స్థానంలో నిలిచారు. పాడి పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ 2018లో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నుంచి ‘ప్యాట్రాన్ అవార్డు’ (పోషక అవార్డు) అందుకున్నారు.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
పుస్తకం మార్చేసిన జీవితం.. స్కూల్ డ్రాపవుట్ నుంచి బిలియనీర్గా..
విజయం సాధించాలంటే.. మంచి చదువు, ఉన్నత విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం.. చాలామంది అనుసరించే మార్గం ఇదే. కానీ భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ అయిన జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రయాణం మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఎందుకంటే.. పాఠశాల చదువును మధ్యలోనే నిలిపివేసిన ఆయన, ఎలాంటి డిగ్రీ లేకుండానే దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఎదిగారు.కోట్ల రూపాయల సంపదను సృష్టించిన నిఖిల్ కామత్ జీవితంలో అత్యంత ప్రభావం చూపిన పాఠం వ్యాపారం కాదు.. ఒక పుస్తకం అని తెలిస్తే తప్పకుండా చాలామంది ఆశ్చర్యపోతారు.సుమారు 34 ఏళ్ల వయసులో నిఖిల్ కామత్, పులిట్జర్ అవార్డు గ్రహీత ఎర్నెస్ట్ బెకర్ రచించిన 'ది డినయల్ ఆఫ్ డెత్' (The Denial of Death) పుస్తకాన్ని చదివారు. మనిషి జీవితానికి పరిమితి ఉందనే వాస్తవాన్ని మాత్రమే కాకుండా.. అతని ఆశయాలు, లక్ష్యాలు, నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది.ఈ పుస్తకం చదివిన తరువాత నిఖిల్ కామత్ ఒక సాధారణ లెక్క వేసుకున్నారు. సగటు మనిషి ఆయుష్షును ఆధారంగా తీసుకుని తనకు ఇంకా దాదాపు 36 సంవత్సరాల జీవితం మాత్రమే మిగిలి ఉందని అంచనా వేశారు. అది డబ్బు లెక్క కాదు.. సమయం లెక్క. అదే ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. "డబ్బు కంటే సమయమే జీవితంలో అత్యంత విలువైన ఆస్తి" అనే భావనను ఆయన మరింత బలంగా అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయాన్ని కొలిచే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు, జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత అన్నీ మారిపోయాయని ఆయన పలుమార్లు చెప్పారు.ఆలోచనా విధానాన్ని మార్చిన పుస్తకాలునిఖిల్ కామత్ అభిప్రాయం ప్రకారం, పుస్తకాలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు.. మనుషులను, సమాజాన్ని, మనల్ని మనం అర్థం చేసుకునే దృక్పథాన్ని కూడా అందిస్తాయి. ఆయన సూచించిన పుస్తకాలలో మోర్గాన్ హౌసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ ముఖ్యమైనది. డబ్బు సంపాదించడంలో తెలివితేటల కంటే సహనం, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ ఎంతో కీలకమని ఈ పుస్తకం వివరిస్తుంది.ర్యాన్ హాలిడే రచించిన 'స్టిల్నెస్ ఈజ్ ది కీ' పుస్తకం.. ఒత్తిడి, అనిశ్చితి మధ్య ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తులే సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతుంది. రిచర్డ్ డాకిన్స్ రచించిన 'ది సెల్ఫిష్ జీన్' మానవ ప్రవర్తన వెనుక ఉన్న పరిణామ సిద్ధాంతాన్ని వివరిస్తే, ఇసాబెల్ విల్కర్సన్ రచించిన 'కాస్ట్' సమాజంలో అసమానతలు, సామాజిక వ్యవస్థలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది.పుస్తకాలు నేర్పే జీవిత పాఠాలుఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. నిఖిల్ కామత్ కథను చూసి చదువు అవసరం లేదని భావించడం సరైంది కాదు. ఆయన ప్రయాణం చెప్పే అసలు సందేశం ఏమిటంటే.. నేర్చుకోవడం అనేది పాఠశాల లేదా కళాశాలతో ముగిసిపోదు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, పుస్తకాలు చదివే అలవాటు, విభిన్న అంశాలపై అవగాహన పెంచుకోవడం వ్యక్తిగత వికాసానికి ఎంతో అవసరం. తరగతి గదిలో నేర్చుకోలేని ఎన్నో జీవన పాఠాలను పుస్తకాలు నేర్పగలవని ఆయన గట్టిగా నమ్ముతారు.డబ్బు కాదు.. సమయమే అసలు సంపదవిజయవంతమైన వ్యాపారవేత్తలను చూసినప్పుడు వారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఎలా బిలియనీర్లు అయ్యారు? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ నిఖిల్ కామత్ ఎక్కువగా మాట్లాడేది మరో పెట్టుబడి గురించి.. అదే సమయం.డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, వ్యాపారాన్ని మళ్లీ నిర్మించవచ్చు. కానీ ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎవరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే జీవితంలో నిజంగా విలువైన వాటిపై దృష్టి పెట్టాలని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: మరో పవర్ఫుల్ AI మోడల్ వచ్చేసింది! -
నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!
ఎక్కడో మారు మూలగ్రామంలో పుట్టిన ఒక సాధారణ యువకుడు రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ల అధినేతగా ఎదగడం అంటే మాటలు కాదు. ఈ సక్సెస్ వెనుక ఎంతో కఠోర శ్రమ, అంతకుమించిన పట్టుదల చాలా అవసరమని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగాలే కానీ, అనుకోని విజయాలను అందుకోవచ్చని 28 ఏళ్ల సూరజ్ బిస్వాస్ (Suraj Biswas) స్ఫూర్తిదాయకమైన కథ ద్వారా మనకు అవగతమవుతుంది.భారతదేశంలోని అందరికీ ఒకే విధానం అనే విద్యా వ్యవస్థపై తనకున్న తీవ్ర నిరాశే 2021లో తన స్టార్టప్ను నిర్మించడానికి ఎలా ప్రేరణగా నిలిచింది అంటారు. సూరజ్. జీవనోపాధి కోసం జొమాటో రైడర్గా షిఫ్టులు చేస్తూ, తన భారీ టెక్ ఆశయాలను సమతుల్యం చేసుకుంటూ, ఒక డెలివరీ బాయ్ని సీరియస్గా తీసుకోడానికి నిరాకరించిన పెట్టుబడిదారుల ముందు ఈ రోజు టెక్ వ్యవస్థాపకుడిగా సగర్వంగి నిలబడ్డాడు. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాకు చెందిన చక్దహా అనే ఒక చిన్న పట్టణంలో సూరజ్ జన్మించారు. సాధారణంగా స్టార్టప్ వ్యవస్థాపకులు పుట్టుకొచ్చే మేజర్ సిటీలు లేదా నేపథ్యం తనది కాదని ఆయన గర్వంగా చెబుతారు. కోల్కతాలోని గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఆయన జెనెటిక్స్ (Genetics) లో బీఎస్సీ పూర్తి చేశారు. చిన్నప్పుడు డాక్టర్ కావాలనేది ఆయన కల, కానీ పరిస్థితుల ప్రభావంతో ఆ దారి మారింది. డిగ్రీ పూర్తయ్యాక, తన తదుపరి లక్ష్యం ఏమిటో ఆలోచించుకునే లోపు ఆర్థిక అవసరాల కోసం జొమాటోలో డెలివరీ బాయ్గా చేరారు.అదే పునాది నగరమంతా తిరుగుతూ ఆహారాన్ని డెలివరీ చేస్తున్న సమయంలోనే ఆయనలో ఒక ఆలోచన మొదలైంది. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థను గమనించినప్పుడు, వేర్వేరు సామర్థ్యాలు ఉన్న విద్యార్థులందరినీ ఒకే పద్ధతిలో చదవమని ఎలా ఒత్తిడి చేస్తారనే ప్రశ్న ఆయనలో తలెత్తింది. "వ్యవస్థ ప్రతి మనిషిని ఒకేలా చూస్తోంది. అందరికీ ఒకే కొలత (One size fits all) అన్నట్టుగా ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఇద్దరు మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు," అంటారు సూరజ్.ఈ ఆలోచన విద్యావ్యవస్థ నుండి టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన AI టెక్నాలజీ, మనుషుల నమూనాలను గుర్తిస్తుందే తప్ప ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకతను, వారి జీవక్రియలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? అనే ప్రశ్న ఆయన మెదడులో రేగింది. దీనికి పరిష్కారంగానే 2021లో ఎలాంటి పెట్టుబడిదారులు ఆఫీస్ లేదా భాగస్వాములు, లేకుండానే 'అసెస్లీ' (Assessli) అనే స్టార్టప్ను స్థాపించారు. ఆ తర్వాత 'డాట్స్-ఇన్' (Dots-in) అనే మరో సంస్థను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఈ రెండు కంపెనీలకు వ్యవస్థాపకుడిగా , సీఈఓగా వ్యవహరిస్తున్నారు.ఎన్నో సవాళ్లుతన ఆలోచనను వ్యాపారంగా మార్చడం అంత సులువు కాలేదంటారు సూరజ్. ఒక చిన్న పట్టణం నుండి వచ్చి, పెద్దగా గుర్తింపు లేని కాలేజీలో చదివి, బైక్పై ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి చెప్పే ఐడియాలను మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు, సీరియస్గా తీసుకోలేదు. దీనికి తోడు ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంవత్సరాల పరిశోధన, మౌలిక వసతులు అవసరం. తక్షణ లాభాల కోసం ఆశపడకుండా మార్కెట్లో గుర్తింపు వచ్చే వరకు పట్టుదలతో నిలబడటం పెద్ద సవాలుగా మారింది.కోలుకోలేని విషాదంతన స్టార్టప్ కల సాకారమవుతున్న సమయంలోనే సూరజ్ జీవితంలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఇళ్లల్లో రంగులు వేసే (House Painter) ఆయన తండ్రి, తన కొడుకు భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడ్డారు. ఐఎస్ఐ కోల్కతా (ISI Kolkata) గ్రాంట్ ఫార్మాలిటీస్ పూర్తయిన రెండు రోజులకే, అంటే 2024,జనవరిలో ఆయన కన్నుమూశారు. ఆయన త్యాగానికి ప్రతిఫలంగా తాను అందుకున్న విజయాన్ని తండ్రికి చూపించ లేకపోయాననే బాధ సూరజ్ను తీవ్రంగా కలిచివేసింది. ఇందుకోసం తన తల్లిదండ్రుల విజయాన్ని చూడలేకపోయిన ప్రతీ బిడ్డ కోసం 'ఇన్డాట్స్' (Indots) అనే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలా తండ్రి రుణం తీర్చుకున్నట్టుగా భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీలక్ష్యాలను సాధించడానికి సరైన సమయం కోసం వేచి చూడకండి. విజయం అనేది కేవలం ప్రతిభపైనే ఆధారపడి ఉండదు, సవాళ్లను ఎదుర్కొంటూ, భయాన్ని వీడి ముందుకు సాగేతత్వంలో ఉంటుంది. మనం ఎక్కడ పుట్టామనేది దాన్ని బట్టి భవిష్యత్తును నిర్ణయించలేం. చిన్న గ్రామంనుంచి వచఇచనా, బైక్పై ఫుడ్ డెలివరీ చేసినా, అవేవీ తన ఎదుగుదలను ఆపలేక పోయాయి. పట్టుదలగా సాగితే ఆకాశమే హద్దు అంటారు సూరజ్ బిశ్వాస్. ‘‘నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను జీవశాస్త్రం వైపు, శరీరం ఎలా పనిచేస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది అనే విషయాలను అర్థం చేసుకోవడం వైపు ఆకర్షితుడయ్యాను. కానీ విచిత్రంగా, ఎల్బిఎం (LBM) అనేది ఆ కల అత్యంత ఉన్నతమైన రూపంగా మారింది. నేను ఎప్పుడూ డాక్టర్ కాలేను, కానీ ఆరోగ్యం, ప్రవర్తన, మానవ సామర్థ్యాన్ని మానవాళి అర్థం చేసుకునే విధానాన్ని పెద్ద ఎత్తున మార్చగల విజ్ఞానాన్ని నిర్మిస్తున్నాను.” అని గర్వంగా చెబుతారు.ఇదీ చదవండి: Citizenship16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పు -
డీఎస్పీగా రైల్వే గేట్మ్యాన్..! 12 గంటలు పనిచేస్తూనే..
చుట్టూ చిమ్మ చీకటి..మంచి జీవితం ఎలా పొందాలో తెలియని అయోమయం. ఒకపక్క తండ్రి మరణం..చాలిచాలని ఆర్థికస్థితి ఇలాంటి పరిస్థితుల నడుమ చదవు మీద ధ్యాస పెట్టడం అంత ఈజీ కాదు. అయినా చదువు తప్ప మరేది తన జీవితాన్ని మార్చేలేదని నమ్మి..కష్టపడి చదివి చిన్న రైల్వేగేట్మ్యాన్ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగిపోకుండా అత్యున్నత స్థాయి అధికారిగా ఉండాలన్న ఆకాశమంత లక్ష్యంతో ముందుకు సాగాడు..అనుకున్నట్లుగానే..డీఎస్పీ రేంజ్కు చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. చుట్టూ ఉన్న వనరులు, పరిమితులు అచంచలమైన ఆత్మవిశ్వాసం ముందు తలవంచుతాయని నిరూపించాడు.అతడే బిహార్కు చెందిన రాజు కుమార్. అతనికి 12 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. దాంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేది. చదువు కొనసాగించడం అత్యంత సవాలుగా ఉండేది. అయితే కజిన్ రాజేష్ కుమార్ సుమన్ అందించిన మద్దతుతో చదువుని కొనసాగించాడు. రాజేష్ రోసెరాలో ఉచిత BSS (బిహార్ సేవక్ సమాజ్)క్లబ్ను నడిపేవాడు, అక్కడ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఉచిత గైడెన్స్ ఇచ్చేవారు. ఈ మద్దతుతో రాజు చదువు కొనసాగిస్తూనే, రైల్వే గ్రూప్ డి పరీక్ష రాసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. అలా అతను రక్సౌల్లో గేట్మ్యాన్ పోస్టుకు ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం అతనికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చి, తన కుటుంబానికి సహాయపడటానికి వీలు కల్పించింది. అక్కడితో తన జర్నీని ఆపాలనుకోలేదు..ఎలాగైన అత్యున్నతాధికారి కావాలన్న ఆకాంక్షతో రైల్వేడ్యూటీని కొనసాగిస్తూనే గ్రాడ్యుయేషన్లో చేరి బీహార్ పోలీస్ సర్వీస్ కమిషన్(బీపీఎస్సీ)కు సిద్ధమయ్యాడు. ఉద్యోగాన్ని, పోటీ పరీక్ష ప్రిపరేషన్ని సమన్వయం చేసుకోవడం సవాలుగా ఉన్నా.. సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాడు. రాజు తన 12 గంటల పని షిఫ్టులు చేస్తూనే రాత్రిపూట కూడా చదువుకుంటూ గడిపాడు. సింపుల్గా చెప్పాలంటే తన రోజువారీ రైల్వే ఉద్యోగంతో పాటే అతని ప్రిపరేషన్ కూడా కొనసాగింది. చివరికి అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది. అలా తన తొలి ప్రయత్నంలోనే బీహార్ పోలీస్ సర్వీస్లో డీఎస్పీగా స్థానం సంపాదించాడు. ఈ విజయం సాధించిన తర్వాత కూడా రాజు తన ఉద్యోగ దినచర్యను కొనసాగించడం విశేషం. అతను ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు, రక్సౌల్లోని రైల్వే గేట్ నెం.33 వద్దకు తిరిగి వచ్చి, యధావిధిగా తన విధిని నిర్వర్తించాడు. ఇక్కడ రాజు కథ..కష్టాలనేవి అనివార్యం..వాటికి తలొగ్గక, భయపడక దొరికిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అభ్యున్నతి మార్గంలో ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని నేర్పిస్తోంది కదూ..!.(చదవండి: Serena Williams: చేతి ఉంగరం అన్ని కోట్లా..! ఆఖరికి నైల్స్కు కూడా..) -
ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామం నుండి ఆల్ ఇండియా 23వ ర్యాంకు వరకు డాక్టర్ సునీతా జాట్ జీవిత ప్రయాణం, సాధించిన అసాధారణ విజయం ఎంతోమందికి స్పూర్తిదాయకం. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామం నుండి UPSC CMS పరీక్షలో ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించే వరకు సునీత ప్రయాణం అంత ఆషామాషీగా ఏమీ సాగలేదు. వ్యక్తిగత విషాదాలు, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలను ఎదుర్కొని తన ఆశయాన్ని సాధించన ధీర మహిళ ఆమె.రాజస్థాన్లోని భిల్వారా జిల్లా ‘సువానా’ అనే చిన్న గ్రామంలో సునీత జన్మించారు. ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనలున్న ఆ ఊరిలో, సునీత తండ్రి మాత్రం భిన్నంగా ఆలోచించారు. బంధువులు, చుట్టుపక్కల వారి మాటలను పక్కనపెట్టి, ఆయన సునీతను డాక్టర్ చదివించడం కోసం కోటా పంపారు. ఆమె మెడికల్ ఎంట్రన్స్ పాసై, BAMS (ఆయుర్వేద వైద్యం) కాలేజీలో చేరారు.కానీ దురదృష్టం ఏమిటంటే ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే సునీత తండ్రి అకస్మాత్తుగా మరణించారు. ఆ వార్తతో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయారు సునీత. కానీ,అంతలోనే తేరుకుని, ధైర్యం తెచ్చుకుని, తన కోసం తండ్రి చేసిన త్యాగాలను గుర్తుచేసుకుని, డిగ్రీని విజయవంతంగా BAMS పూర్తి చేశారు. ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!పెళ్లి తరువాత ఒత్తిడిచదువు పూర్తయ్యాక, దేశానికి సేవ చేయాలనే తన ఆశయాన్ని పెళ్లికి ముందే భర్తకు, అత్తమామలకు స్పష్టంగా చెప్పారు. వారు మొదట ఒప్పుకున్నా, పెళ్లయ్యాక మాత్రం సునీతను ఉద్యోగం చేయనివ్వకుండా వంటింటికే పరిమితం కావాలని ఒత్తిడి తెచ్చారు. అయినే ఇంటి నుంచే పనిచేస్తూ వచ్చింది. అదే సమయంలో సునీత గర్శం దాల్చింది. దీన్నిసాకుగా చూపి సరిగ్గా ఆమె ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఉద్యోగమైనా వదులుకో.. లేదా సంసారమైనా వదులుకో అంటూ పెద్ద ఛాలెంజ్ విసిరారు అత్తింటి వారు. గర్భవతిగా ఉన్న సమయంలోనే ఒంటరిగా ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్2023 ఏప్రిల్ 20న, ఆమె భర్త ఆమెను వాళ్ళ అమ్మానాన్నల ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. సునీత చెప్పిన ప్రకారం, ఆ రోజు తర్వాత అతను ఆమెను బ్లాక్ చేశాడు. ఎలాంటి కాల్స్ లేవు, మెసేజ్లు లేవు, ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం లేదు, ఏమీ లేదు. దీంతో తండ్రి, తన ఆశయ సాధన కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సునీత తన ఆత్మగౌరవాన్ని, దేశానికి సేవచేయాలనే కల సాకారంకోసం కట్టుబడి ఉండేలా నిర్ణయించుకున్నారు. ఒంటరి తల్లిగా పోరాటంఒక పక్క విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగడం, చిన్న బిడ్డను పెంచడం, మరోపక్క సమాజం నుండి ఎదురైన సూటిపోటి మాటల వల్ల సునీత మళ్లీ తీవ్ర డిప్రెషన్కు లోనయ్యారు. ఆ సమయంలో ఆమె తల్లి కొండంత అండగా నిలిచారు. తల్లి బిడ్డను చూసుకుంటుంటే, సునీత రాత్రుళ్లు బాబును ఒడిలో పడుకోబెట్టుకుని గంటల తరబడి UPSC పరీక్ష కోసం చదివేవారు. ఆమె నిరంతర శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. కేంద్ర ప్రభుత్వ వైద్య సేవల రిక్రూట్మెంట్ (UPSC CMS) ఫలితాలు వచ్చినప్పుడు ఆమె ఏకంగా ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె దేశానికి సేవలందిస్తూ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు."జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకుంటే, ముందు మీకంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. సమస్యలను చూసి భయపడితే లాభం లేదు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. దారి కష్టంగా ఉన్నా, పట్టుదల ఉంటే విజయం మీ సొంతమవుతుంది." అంటారామె. -
జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈలో అతడు ఫెయిల్. కెమిస్ట్రీలో కేవలం ఒక్క మార్కు సంపాదించుకుని జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వ్యక్తి. అయితేనేం..కొన్నేళ్లకు అదే పరీక్షను నిర్వహించే స్థాయికి చేరి.. ఐఐటీ మద్రాస్కు డైరెక్టర్ అయ్యారు. ఆయన కథ ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నాం అని బాధపడే ఔత్సాహిక విద్యార్థులకు ఓ స్ఫూర్తి.ఆయనే ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి. ఆయన ఒకప్పుడు జేఈఈ గెలుపు కోసం ఆరాటపడ్డ విద్యార్థి. తనకు కెమిస్ట్రీలో ఒకే ఒక్క మార్కు రావడంతో జేఈఈ ఉత్తీర్ణత సాధించలేకపోయానని చెప్పారు. ఆ రోజు ఆ ఒక్క పరీక్ష తన విజయాన్ని డిసైడ్ చేయలేదని గట్టిగా అనుకున్నానని అన్నారు. అది తన ఇంజనీరింగ్ భవిష్యత్తు కాలరాయదని నమ్మారు. అదే నిజం చేశారు. ఇతర మార్గాల ద్వారా సాధారణ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుని కొనసాగించారు. ఆయన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ అండ్ పీహెచ్డీ రెండిటిని సంపాదించారు. అలా ఆయన 2001లో ఐఐటీ మద్రాస్లో అధ్యాపకుడిగా చేరారు. ఏళ్లు గడిచే కొద్దీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, వీఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాలలో విశేష కృషి చేశాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులతో సహా అనేక జాతీయ ప్రాముఖ్యత కలిగిన సాంకేతిక కార్యక్రమాలకు ఆయనే స్వయంగా నాయకత్వం వహించారు. విచిత్రమేమిటంటే, ఒకప్పుడు జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆయనే ఆ తర్వాత ఐఐటి మద్రాస్లో జేఈఈ విభాగానికి ఛైర్మన్ అయ్యారు. ఒకప్పుడు తనను తిరస్కరించిన అదే పరీక్షను పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నారు. పరిశోధకుడి నుంచి భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన విద్యావేత్తలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. జనవరి 2022లో తన మాతృసంస్థ అయిన ఐఐటి మద్రాస్కు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే, ఆయన ఆ సంస్థ మైక్రోప్రాసెసర్ అభివృద్ధి కార్యక్రమానికి నాయకత్వం వహించడం తోపాటుజాతీయ సమాచార భద్రతా కార్యక్రమాలకు అధిపతిగా కూడా ఉన్నారు. అంతేగాదు ఆయన ఆయన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కు కూడా అధ్యక్షత వహించారు. ఆయన చేసిన సేవలకు గానూ, డీఆర్డీఓ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డు, వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్, అలాగే భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. ఆయన ఎప్పుడు ర్యాకింగ్లు, అవార్డులకు అతీమైన విషయాలనే విద్యార్థులతో మాట్లాడుతారు. కేవలం భవిష్యత్తుకు అనుగుణంగా సిద్ధం అవ్వడమే ప్రధానమని బోధిస్తుంటారు. ఆయన దృష్టిలో ఇంజనీరింగ్ విద్య అంటే కేవలం పట్టభద్రులు అవ్వడం కాదని నిజ జీవిత సమస్యలను పరిష్కరించగల ఆవిష్కర్తలగా మారాలని అన్నారు. ఎల్లప్పుడూ అజేయమైన విజయాలే కాదు ఇలా ఎదురుదెబ్బల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన కథే అత్యంత ప్రేరణగా. ఇక్కడ కామకోటి గారి కథ ఒక పరీక్ష మనలన్ని నిర్ణయించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ.. వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే విజయం తథ్యం అని చెబుతోంది కదూ.(చదవండి: భార్య కోసం ఉద్యోగం వదిలేసి..!) -
AP: విద్యే వారి బలం.. ఉద్యోగాలే వారి గుర్తింపు
అన్నమయ్య జిల్లా : అది జిల్లాలోనే ఒక మారుమూల గిరిజన గ్రామం. కేవలం 345 కుటుంబాలు, 1,282 జనాభా, 1,120 ఓటర్లు ఉన్న చిన్న బంజారా తండా. కానీ, నేడు ఆ ఊరు అక్షరాస్యతలో, ఉద్యోగాల సాధనలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. అదే అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండల పరిధిలోని పెద్దబిడికి గ్రామం.కష్టం చిన్నది.. చదువు పెద్దదిఈ గ్రామంలోని వారంతా చిన్న, సన్నకారు గిరిజన రైతులే. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉన్నా, పిల్లల చదువుల కోసం ఆ తల్లిదండ్రులు పడిన శ్రమ వృధా కాలేదు. ప్రస్తుతం ఈ చిన్న ఊరి నుండి 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా, మరో 80 మందికి పైగా ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇక్కడి నుండి ఉద్యోగాలు సాధించిన వారంతా కలిసి పుట్టిన ఊరిని మర్చిపోకుండా, స్థానిక పాఠశాల పిల్లలకు నోటు పుస్తకాలు, బట్టలు అందిస్తూ, గ్రామాభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊరిలో ఎంతటి విద్యా చైతన్యం ఉందంటే.. ఏ ప్రభుత్వ పథకం గురించి అడిగినా ప్రజలు ఠక్కున సమాధానం చెప్పగలరు.నిబద్ధతతో ఏదైనా సాధ్యంమాది పేద కుటుంబం. తల్లిదండ్రుల కృషి, ఊరి పెద్దల సహకారంతోనే ఐఏఎస్ అయ్యాను. యువత నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు.– డాక్టర్ హరిజవహర్లాల్ దేవదాయశాఖ కమిషనర్, ఐఏఎస్ఊరంటే ఎంతో గౌరవంపేదరికాన్ని దగ్గరగా చూశాను. మా తల్లిదండ్రుల కష్టం వల్లే చీఫ్ ఇంజినీర్ స్థాయికి వచ్చాను. నా ఊరంటే నాకు ఎంతో గౌరవం, వీలున్నప్పుడల్లా ఊరి అభివృద్ధిపై చర్చిస్తుంటాను.– బి.బాలునాయక్ ఈఎన్సీ, పంచాయతీరాజ్, ఏపీపేద విద్యార్థులకు ప్రోత్సాహంనాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చా. సెలవులు దొరికితే చాలు ఊరికి వచ్చి పేద విద్యార్థులకు నా వంతుగా విద్యా ప్రోత్సాహకాలు అందిస్తున్నాను. – ఎం.మునీంద్రనాయక్ మండల విద్యాశాఖాధికారి, కలకడఉద్యోగావకావశాలపై అవగాహననిరుపేద కుటుంబం నుండి ఎన్నో కష్టాలు పడి చదువుకున్నాను. ఇప్పుడు గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కలి్పస్తున్నాను. ఊరి ప్రగతికి నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది.– ఎం.బాలునాయక్, డెప్యూటీ కమిషనర్, కారి్మక శాఖ, కర్నూలు -
ఐఐటీ టాపర్ టు ఐపీఎస్ ఆఫీసర్: అర్చిత్ సక్సెస్ స్టోరీ!
నాగపూర్: నేటి యువత కోట్లలో ప్యాకేజీలు, విదేశీ లగ్జరీ జీవితం కోసం పరిగెడుతుంటే, ఓ యువకుడు మాత్రం తనకు వచ్చిన భారీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడు. ఐఐటీ ఢిల్లీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివి, నెలకు లక్షల్లో జీతం ఇచ్చే జపనీస్ కంపెనీ ఉద్యోగాన్ని వద్దనుకుని, దేశసేవ కోసం ఖాకీ యూనిఫామ్ ధరించాడు. ఆయనే నాగపూర్కు చెందిన అర్చిత్ చాండక్. తనపై తనకు ఉన్న నమ్మకమే ఆయనను ఈరోజు అకోలా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) స్థాయికి చేర్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆయన విజయగాథ ఇదే..ఐఐటీ టాపర్ నుండి సివిల్స్ వైపుమహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన అర్చిత్ చాండక్ చిన్నతనం నుంచే చదువులో టాపర్. 2012లో జేఈఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించాడు. ఆ ప్రతిభతో ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. 2016లో బీటెక్ పూర్తి కాగానే, ఆయన ప్రతిభను గుర్తించిన ఒక ప్రముఖ జపనీస్ సంస్థ ఏడాదికి రూ.35 లక్షల భారీ ప్యాకేజీతో ఉద్యోగం ఆఫర్ ఇచ్చింది. ఏ ఇంజనీరింగ్ విద్యార్థికైనా ఇది ఒక కలల ఉద్యోగం. కానీ, అర్చిత్ మనసు కార్పొరేట్ ప్రపంచంలో స్థిరపడటానికి ఇష్టపడలేదు.మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ రికార్డుభారీ జీతాన్ని ఇచ్చే విదేశీ అవకాశాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించి, యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించాడు. కేవలం డబ్బు వెనుక పరిగెత్తడం కంటే, సమాజంలో మార్పు తీసుకువచ్చే ప్రజాసేవలోనే తనకు అసలైన సంతృప్తి లభిస్తుందని నమ్మాడు. అనుకున్నదే తడవుగా పట్టుదలతో శ్రమించి, 2018 లో తన మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 184వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లుప్రస్తుతం మహారాష్ట్రలోని అకోలా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్చిత్ ప్రయాణాన్ని వికాస్ అల్విస్ అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్గా మారింది. ‘నిజమైన విజయం అనేది కేవలం జీతం చూసి రాదు, మన ఆశయానికి తగ్గట్టు కెరీర్ను ఎంచుకున్నప్పుడే వస్తుంది’ అని నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్థిక భద్రతను వదులుకుని దేశసేవను ఎంచుకున్న అర్చిత్ చాండక్ కథ దేశంలోని ఎంతో మందికి నిజమైన స్ఫూర్తిని అందిస్తుంది. -
24 ఏళ్లకే పీహెచ్డీ.. రికార్డులను బద్దలు కొట్టిన లెజెండ్ : ఎవరీ సత్యం
సాంకేతిక రంగంలో భారతీయులు సాధిస్తున్న విజయాలు ఎంతోమందికి స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ శ్రమ, కృషి,అద్భుతమైన ప్రయాణమే ఇందుకు నిదర్శనం. బిహార్లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో 'సత్యం కుమార్' భారతదేశంలోనే అత్యంత పిన్న వయసులోప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ (IIT JEE) పరీక్షను పాసైన విద్యార్థిగాసత్యం కుమార్ చరిత్ర సృష్టించాడు .అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు అతణ్ణి వరించాయి. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ క్రాక్, 24 ఏళ్లకే పీహెచ్డీ! సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!1999, జూలై 20న బీహార్లో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సత్యం, చిన్న వయస్సు నుండే అసాధారణమైన విద్యా ప్రతిభను కనబరిచాడు. అతనిలోని తెలివితేటలను గుర్తించిన ఒక కుటుంబ స్నేహితుడు.. ఐఐటీ జేఈఈ కోచింగ్ కోసం అతడిని రాజస్థాన్లోని కోటాకు పంపించాల్సిందిగా తండ్రికి సలహా ఇచ్చాడు. అయితే ఒక చిన్న గ్రామం నుండి ఐఐటి వరకు, ఆపై అమెరికా వరకు సత్యం కుమార్ ప్రయాణం చాలా సాఫీగా సాగినట్లు అనిపించినా, అది అంత సులభమైనది కాదు. అతని జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అతని తండ్రి రైతు కావడంతో, సత్యంను చదువుల కోసం అమెరికాకు పంపించడం వారి కుటుంబానికి ఒక సవాలుగా మారింది. ఒకానొక సమయంలో అతని తండ్రి తన పొలాన్ని, ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. సత్యం ప్రతిభ, తెలివితేటల కారణంగా, అతనికి టెక్సాస్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ లభించింది. అలా సత్యం కుమార్ కేవలం 12 ఏళ్ల వయసులోనే మొదటిసారి ఐఐటీ జేఈఈ పరీక్షను క్లియర్ చేసి, దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఐటీయన్గా రికార్డు సృష్టించాడు. అయితే, ఆ ఫలితంతో సంతృప్తి చెందని అతను, మరుసటి ఏడాది (2013లో) మళ్లీ పరీక్ష రాసి.. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా 670వ ర్యాంక్ (AIR 670) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.తన విజయం గురించి ఐఐటీ కాన్పూర్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సత్యం మాట్లాడుతూ.. "నేను జేఈఈ క్రాక్ చేసినప్పుడు నా కల నిజమైంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకదానిలో చదువుకునే అవకాశం నాకు దక్కింది" అని పేర్కొన్నాడు.ఐఐటీ కాన్పూర్ర్యాంక్ సాధించిన తర్వాత సత్యం కుమార్ ఐఐటీ కాన్పూర్లో చేరి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డ్యూయల్ డిగ్రీ (BTech, MTech) పూర్తి చేశాడు. ఐఐటీలో ఉన్న సమయంలోనే అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) అడ్వాన్స్డ్ కంప్యూటింగ్పై పట్టు సాధించాడు. ఇది అతని భవిష్యత్తు సాంకేతిక రంగానికి బలమైన పునాదిగా మారింది.ఐఐటీ కాన్పూర్ వాతావరణం నన్ను పరిశోధనలు, ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించింది అంటారు సత్యం. కష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని తనకు ఇచ్చిందని గర్వంగా ప్రకటించారు.24 ఏళ్లకే పీహెచ్డీఆ తర్వాత సత్యం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే పీహెచ్డీ (PhD) పూర్తి చేశాడు. తన డాక్టరేట్ చదువు సమయంలోనే, అతను ప్రముఖ యాపిల్ (Apple) సంస్థలో మెషిన్ లెర్నింగ్ విభాగంలో ఇంటర్న్షిప్ చేసి, ఏఐ (AI) రీసెర్చ్లో మంచి అనుభవం సంపాదించాడు. ప్రస్తుతం అతను ప్రసిద్ధ 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' (Texas Instruments) సంస్థలో 'మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇంజనీర్'గా పని చేస్తున్నాడు. అక్కడ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల అభివృద్ధిపై దృష్టి పెట్టాడు.నెటిజన్ల ప్రశంసలుసత్యం కుమార్ స్ఫూర్తిదాయక కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు అతని అసాధారణ ప్రతిభను కొనియాడుతున్నారు. పల్లెటూరి బిహారీ పిల్లగాడు13 ఏళ్లకే ఐఐటీ సాధించి, ఇప్పుడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎమ్ఎల్ ఇంజనీర్గా రాణించడం అద్భుతం, ఎంతో స్ఫూర్తిదాయకమైన సంగతి అంటూ ఒకరు ప్రశంసించారు. మరొకరు.. "ఖచ్చితంగా, ఇది తరానికి ఒక్కరు మాత్రమే పుట్టే అద్భుతమైన ప్రతిభ" అని ప్రశంసించారు. అన్ని రికార్డులను, నిబంధనలను బద్దలు కొట్టిన ఒక లెజెండ్ అంటూ మరొకరు కొనియాడటం గమనార్హం. -
సక్సెస్ అంటే సంపాదన, పెళ్లి, మాృతత్వం కాదు..!
సాధరణంగా అమ్మాయిలు చక్కగా పెళ్లి చేసుకోవడం, మాతృత్వం స్వీకరించడం, ధనవంతుడైన భర్త రావడం, మంచి ఉద్యోగం సంపాదించడం తదితరాలను సక్సెస్గా భావిస్తారు. కానీ అది కాదు విజయం అంటూ సరికొత్త అర్థాన్ని ఇచ్చింది ఈ పోషకాహార నిపుణురాలు. ప్రతి మహిళ తనను తాను ఎలా అనుకుంటుందో..ఎప్పటి నుంచో మనపై రుద్దినట్టుగా మనం ఎలా జీవిస్తూ ఉండిపోతున్నామో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమే కాదు అమ్మాయిల దృక్పథం ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉండటంతో అందరు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతుండటం విశేషం.దుబాయ్కు చెందిన పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ని షేర్ చేశారు. "మనం విజయం అనగానే మంచి ఉద్యోగం, మంచి జీతం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటి ప్లాన్లు వేసేసుకుంటాం. కానీ జీవితం మన ప్రణాళికలను చెత్తబుట్టలో పడేసి వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేసేలా విచిత్ర మార్గాన్ని ఇస్తుంది. సరిగ్గా ఇలానే తనకు జరిగిందంటూ తన కథను పంచుకుంది. తాను 21 ఏళ్ల వయసున్నప్పుడూ ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని, అందమైన గృహిణిగా ఉండాలని, ఇద్దరు పిల్లలను కనాలని అనుకున్నాను. కానీ అవేమి జరగలేదు ప్రస్తుతం తనకు 41 ఏళ్లు అని, సుమారు 40 మందికి పైగా ఉద్యోగులతో రెండు వేర్వేరు వ్యాపారాలను నడుపుతున్నా. అయితే ఈ జర్నీలో నేనే ధనవంతురాలినయ్యానని, తన కెరీర్ ప్లాన్ ప్రకారం ఒకటి నిజమైంది. ఎందుకంటే 25 ఏళ్ల వయసు వచ్చేసరికి, ధనవంతురాలినయ్యా, అలాగే దుబాయ్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. బంధువులకు అసూయ కలిగించే విలాసవంతమైన జీవితం నాది. అయినా ఇది నాజీవితంలో ఎందుకు అనిపించడం లేదు. అసలు నా విజయాలను నేను ఎందుకు ఆస్వాదించలేకపోతున్నా. ఎందుకంటే అందరి అమ్మాయిల్లానే నన్ను ఎవరో శక్తిమంతమైన వ్యక్తి ఎంపిక చేసుకునే వ్యక్తిగా భావించడం లేదా నాకు ఏ శక్తిమంతమైన వ్యక్తి అవసరం రానంతగా సక్సెస్ అదుకోవడం. అనే రెండు ఆలోచనలతో పోరాడుతూ ఉండిపోయా. ఈ సందిగ్ధంలో అస్సలు మనకేం కావాలన్నిది మర్చిపోతాం అందువల్ల మన సాధించిన విజయాలను ఆస్వాదించడం మర్చిపోతుంటాం. ఇప్పుడు సక్సెస్ పట్ల నా దృక్పథం మారింది. నీకు ఏం కావాలో నిర్ణయించుకునే ధైర్యం కలిగి ఉండటమే అతి పెద్ద గెలుపు. అదే స్వేచ్ఛకు అసలైన అర్థం. కేవలం కెరీర్లో సక్సెస్ లేదా డబ్బు సంపాదన విజయం కాదని, అది అసలైన స్వేచ్ఛ కూడా కాదని చెప్పుకొచ్చింది రాశి చౌదరి." నెటిజన్లు కూడా నిజం మేడం మీరు చెప్పేది ముమ్మాటికీ కరెక్ట్ అంటూ మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rashi Chowdhary (@rashichowdhary) (చదవండి: ఆమె దృఢ సంకల్పం ముందు అనారోగ్యమే చిన్నబోయింది!) -
తలసేమియా, మోకాలి ఆపరేషన్.. ఆమెను ఆపలేకపోయాయి..!
అందరికీ ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఏవో కారణాలతో చేరుకోలేకపోతారు. కానీ ఈ మహిళ ఒకపక్క కుటుంబ బాధ్యతలు మరోవైపు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా తన కలను నెరవేర్చుకునేందుకు సన్నద్ధమైంది. అనుకున్నట్లుగానే విజయం అందుకుని..అనారోగ్యం వంటి కారణాలతో కలను నిజం చేసుకోలేకపోతున్నాం అని బాధపడే వాళ్లలో స్ఫూర్తిని నింపింది. ఇలా అనారోగ్యంతో ఇలాంటి సాహసం కృత్యం చేసిన మహిళగా ఘనత సృష్టించింది. ఆ మహిళే రాజస్థాన్లోని జైపూర్కు చెందిన నీలిమ అరోరా. ఇద్దరు పిల్లల తల్లి, తలసేమియా బాధితురాలు అయినా కలల శిఖరాన్ని అధిరోహించాలనే కలను నిజం చేసుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంది. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం వరకు ఆమెకు పర్వతారోహణతో ఎలాంటి సంబంధం లేదు. అప్పటి వరకు ఆమె కాలిఫోర్నియాలో సిలికాన్ వాలిడేషన్ ఇంజనీరింగ్ పనిచేస్తుండేది. అయితే ఆమెకు మెకాలి శస్త్ర చికిత్స తర్వాతనే శిఖరాలను అధిరోహించాలనే కోరిక కలగడం విశేషం. ఆ క్రమంలోనే 8,849 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి నీలిమ చరిత్ర సృష్టించింది. మొత్తం కఠినమైన 50 రోజుల యాత్రో ఆమె హై-ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడెమా (HAPE) అనే ప్రాణాంతకమైన పరిస్థితిని మూడుసార్లు ఎదుర్కొంది. నిజానికి ఇది ఊపిరితిత్తులలో ద్రవం చేరే ప్రాణాంతక పరిస్థితి. ఆఖరికి గుండె జబ్బులు లేని ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతే ఈ పరిస్థితే ఎదురవ్వుతుంది. అలాంటి ప్రాణాంతక పరిస్థితిని ఖాతరు చేయకుండా ఎవరెస్టు అధిరోహణకు సై అందామె. ఆఖరికి వైద్యులు వద్దని వారించినా..వెనక్కి తగ్గలేదామె. మే 25, 2026న మధ్యాహ్నం సుమారు 1 గంటకు తాను ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నప్పుడు, అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు ఒంటరిగా ఉన్నానని నీలిమ ఆ అనుభవాన్ని పంచుకుంది. ఆ క్షణం తన జీవితంలోని అద్భుత క్షణంగా పేర్కొంది. ఇలా తలసేమియా మైనర్ ఉండి, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహళగా చరిత్ర సృష్టించింది నీలిమ.ఇక నీలిమ ఎవరెస్ట్కు ముందు అప్పటికే మాంట్ బ్లాంక్, మాటర్హార్న్ (ఫ్రాన్స్), కోటోపాక్సి (ఈక్వెడార్), అకోన్కాగ్వా (అర్జెంటీనా), అమా దబ్లామ్ (నేపాల్) వంటి సవాలుతో కూడిన శిఖరాలను అధిరోహించింది. అంతేగాదు గతేడాది 40 ఏళ్లు పైబడిన వారిలో అమా దబ్లామ్ను విజయవంతంగా అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా నీలిమ నిలిచింది. కాగా, తన విజయాలన్నింటికి తన గైడ్ గస్మాన్ తమాంగ్, తన కుటుంబమే కారణమంటూ క్రెడిట్ అంతా వారికే ఇచ్చేసింది.(చదవండి: అల్కా యాగ్నిక్కి అరుదైన వినికిడి సమస్య..ఎందువల్ల వస్తుందంటే..) -
ఒకప్పుడు డెలివరీ బాయ్..ఇవాళ మెసేజింగ్ ప్లాట్ఫామ్కు గ్లోబల్ హెడ్గా!
చిన్నప్పుడే కష్టాలు, ఆర్థిక కష్టాలు కొందర్ని దృఢంగా ఎదిగేలా చేస్తాయి. పైగా ఆ సవాళ్లను తమ అభ్యున్నతికి బాటలుగా మలుచుకుని అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. హాయిగా చదువు సాగించిన వారికంటే..టాప్ పొజిషన్లో సెటిల్ అయ్యి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా కథ. అతడి స్టోరీ సినిమాని తలపించే కథలా ఉంటుంది. కునాల్ షా అరుదైన స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ కెరీర్ని ప్రారంభించారు. తండ్రి వ్యాపారం కుప్పకూలడంతో ఒక్కసారిగా కుటుంబం రోడ్డున పడిపోయింది. దాంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక చిన్నా చితక పనులు చేశారు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి డెలివరీ బాయ్గా, డేటా ఆపరేటర్గా, మెహందీ కోన్ల అమ్మకందారుడిగా, సైబర్ కేఫ్ ఆపరేటర్గా, పైరేటెడ్ సీడీల అమ్మకందారుడిగా, కంప్యూటర్ ట్యూటర్గా పనిచేస్తూ ఆర్థిక స్వేచ్ఛను సాధించారు. అలాగే ఆయన ఐఐటీ ఐఐఎం డిగ్రీలు లేదా కనీసం సాంకేతిక ఎడ్యుకేషన్ కాకుండా..ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీని ఎంచుకున్నారు. ఆ సబ్జెక్టుని ఆయన ఎంచుకోవడానికి రీజన్ ఉదయం 8 నుండి 10 గంటల వరకు మాత్రమే తరగతులు ఉండే ఏకైక కోర్సు కావడంతోటే అది ఎంచుకున్నారట కునాల్. మిగిలిన సమయంలో ఉపాధి చూసుకోవడం కోసం ఇలా చేశారు. ఆ తర్వాత ఎంబిఏలో చేరారు. కానీ దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారు. అలాంటి వ్యక్తి భారతదేశపు తొలి డిజిటల్ చెల్లింపుల స్టార్టప్లలో ఒకటైన ఫ్రీఛార్జ్ను నిర్మించారు. దీనిని 2017లో యాక్సిస్ బ్యాంకుకు సుమారు $60 మిలియన్లకు(రూ.56.68 కోట్లు) విక్రయించారు. 2018లో $1 మిలియన్ (రూ. 9.46 కోట్లు) వ్యక్తిగత పెట్టుబడితో క్రెడ్ను ప్రారంభించారు. క్రెడ్కు ప్రస్తుతం నెలకు 1.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కేవలం క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందించడం కోసం మాత్రమే ఉద్దేశించిన ప్లాట్ఫామ్గా రూపొందించిన యాప్ ఇది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ ఈ క్రెడ్ కంపెనీపై ప్రశంసల వర్షం కురిపించారు. షా దీనిని భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారని కొనియాడారు. అంతేగాదు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ను నడపడానికి అవసరమైన నిర్మాణ దృక్పథం, ప్రపంచ దృష్టికోణాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. క్రెడ్లో మెటా 20% వాటాను కొనుగోలు చేయడంతో, ఇప్పుడు ఆ కంపెనీ విలువ $4.5 బిలియన్లుగా(రూ.4 వేల కోట్లు) ఉంది. ప్రస్తుతం షా AI-ఆధారిత వినియోగదారు ఉత్పత్తులపై దృష్టి పెట్టడానికి మెటాలో ప్రస్తుత వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్కార్ట్ స్థానంలో షా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక క్రెడ్లో వ్యూహం, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించిన మిధున్ సంపత్ తాత్కాలిక సీఈఓ పాత్రను చేపట్టనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఉద్యోగ నియామకాల సమయంలో డిగ్రీలకు ప్రాధాన్యత ఇవ్వని బహుముఖ ప్రజ్ఞాశాలి కునాల్. లింక్డ్ఇన్ (LinkedIn)లో షాను నేరుగా ట్యాగ్ చేయడం ద్వారా క్రెడ్లో ఇంటర్న్షిప్లు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేగాదు తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎల్లప్పుడూ సీరియస్గా ఉండనివ్వరూ..అక్కడ అంతర్గత మీమ్ ఛానెల్స్ ఉంటాయి. వాటి సాయంతో అక్కడ షాతో సహా ఉద్యోగులు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారని కునాల్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే అక్కడ సీరియస్నెస్గా పనిచేసే వారిని కంపెనీ మెచ్చదట. కేవలం ఉద్యోగులు ఆహ్లాదభరితంగా పనిచేసే సంస్కృతికి పెద్దపీట వేయడం కునాల్ ప్రత్యేకతని సన్నిహిత వర్గాలు చెబుతుండటం విశేషం.(చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..) -
గొర్రెల కాపరి నుంచి దేశ నాయకుడు..
‘రోలిహ్లాహ్లా మండేలా’ చిన్నప్పుడు దక్షిణాఫ్రికాలోని ‘కును’ అనే పల్లెటూరిలో పెరిగాడు. చిన్నతనంలో రోజంతా పొలాల్లో గొర్రెలను, పశువులను మేపుతూ, చెప్పులు లేకుండా ఎండలో తిరుగుతూ తోటి పిల్లలతో కలిసి మట్టితో ఆడుకునేవాడు. మండేలాకు ఏడేళ్లు వచ్చాక వాళ్ల అమ్మ స్కూల్కి పంపింది. అక్కడే ఒక టీచర్ అతనికి ‘నెల్సన్’ అని పేరు పెట్టారు.తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాక, ఒక రాజప్రతినిధి ఆశ్రయంలో పెరిగి పెద్ద చదువులు చదివాడు. పశువులు కాసే రోజుల్లోనే ఆకాశం వైపు చూస్తూ ‘మా జాతి ప్రజలు ఎందుకు బానిసల్లా బతకాలి?’ అని ఆలోచించేవాడు. చిన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న ఆ పిల్లాడే, పెద్దయ్యాక వర్ణవివక్షపై పోరాడి 27 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడై, ప్రపంచానికే ‘స్వేచ్ఛ’ అంటే ఏంటో చూపించాడు. ఆలోచన గట్టిగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని దీనిని బట్టి అర్థమవుతోంది. -
వీక్లీ పోల్లో బీటీఎస్ ప్రభంజనం..
అంతర్జాతీయ పాప్ సంగీత ప్రపంచంలో కొరియన్ బ్యాండ్ ‘బీటీఎస్’ మరోసారి తన సత్తా చాటుకుంది. బిల్బోర్డ్ నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన కొత్త సంగీతం పోల్లో బీటీఎస్ సరికొత్త డిజిటల్ సింగిల్ ‘కమ్ ఓవర్’ భారీ మెజారిటీతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.జూన్ 12 న పారంభమైన ఈ పోలింగ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీటీఎస్ అభిమానులు భారీగా ఓట్లు వేయడంతో, ఏకంగా 86 శాతానికి పైగా ఓట్లతో ఈ పాట క్లీన్ స్వీప్ చేసింది. ఈ రేసులో హాలీవుడ్ పాప్ స్టార్ ఒలివియా రోడ్రిగో, జాక్ వైట్, బెబే రెక్సా, కాట్సే వంటి దిగ్గజ కళాకారుల కొత్త ఆల్బమ్లు పోటీలో ఉన్నప్పటికీ, బీటీఎస్ క్రేజ్ ముందు అవేవీ నిలవలేకపోయాయి. ఫలితంగా ‘కమ్ ఓవర్’ ఒకేపక్షంగా ల్యాండ్స్లైడ్ విజయాన్ని నమోదు చేసింది. రెండవ స్థానంలో ప్రముఖ పాప్ సింగర్ ఒలివియా రోడ్రిగో విడుదల చేసిన ‘యూ సీమ్ ప్రెట్టీ శాడ్ ఫర్ ఎ గర్ల్ సో ఇన్ లవ్’ ఆల్బమ్ నిలిచింది.‘కమ్ ఓవర్’ అనేది బీటీఎస్ గతంలో విడుదల చేసిన ‘అరిరంగ్’ ఆల్బమ్కు సంబంధించిన బోనస్ ట్రాక్. ఇప్పటివరకు కేవలం ఫిజికల్ డీలక్స్ వినైల్ ఎడిషన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంగ్ను, బీటీఎస్ వార్షిక వేడుక ‘ఫెస్టా’ సందర్భంగా అధికారికంగా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లోకి విడుదల చేశారు. కొరియన్, ఇంగ్లీష్ భాషల కలయికతో సాగే ఈ సాంగ్.. దూరమైన ్రపాణస్నేహితుడిని లేదా ప్రియమైన వారిని తిరిగి కలుసుకోవాలనే ఆరాటాన్ని, పశ్చాత్తాపాన్ని ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. బీటీఎస్ సభ్యులైన ఆర్ఎమ్, సుగా, జె–హోప్ స్వయంగా ఈ పాట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం గ్లోబల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్పై ‘కమ్ ఓవర్’ స్ట్రీమింగ్ రికార్డులను తిరగరాస్తోంది. -
లైవ్ ఆల్బమ్తో శ్రేయా ఘోషల్ రికార్డు..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. తన సుదీర్ఘ కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక ‘లైవ్ కాన్సర్ట్ ఆల్బమ్’ను విడుదల చేయబోతున్నట్లు సోనీ మ్యూజిక్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఆమె ప్రపంచవ్యాప్తంగా పూర్తి చేసిన ‘ఆల్ హార్ట్స్’మ్యూజికల్ టూర్ విశేషాలతో ఈ ఆల్బమ్ను రూపొందించారు.ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో జరిగిన ఈ మ్యూజికల్ టూర్లో.. ముంబై, లండన్, న్యూయార్క్, ఆమ్స్టర్డామ్ వంటి ప్రముఖ నగరాల కాన్సర్ట్ స్టేజీలపై శ్రేయ లైవ్గా పాడిన ఐకానిక్ సాంగ్స్ను ఇందులో చేర్చారు. ఈ ఆల్బమ్లో శ్రేయా ఘోషల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన బాలీవుడ్ పాటలు ఉండబోతున్నాయి.ఈ మ్యూజికల్ టూర్లో భాగంగా లండన్ లోని ప్రఖ్యాత ఓవో ఎరీనా వెంబ్లీ, కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఎరీనాల్లో శ్రేయ ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా డెట్రాయిట్లోని ‘ఫాక్స్ థియేటర్’లో గానకోకిల లతా మంగేష్కర్ తర్వాత ప్రదర్శన ఇచ్చిన రెండో భారతీయ కళాకారిణిగా శ్రేయా ఘోషల్ చరిత్ర సృష్టించారు. అలాగే లాస్ ఏంజిల్స్లోని ప్రసిద్ధ డాల్బీ థియేటర్ స్టేజ్పై పెర్ఫామ్ చేసిన ఏకైక భారతీయ సింగర్గా ఆమె రికార్డు సాధించారు. -
డ్యాన్స్ ఫ్లోర్ నుంచి మ్యూజిక్ మైక్ వరకు..
డ్యాన్స్ ఫ్లోర్ నుంచి మ్యూజిక్ మైక్ వరకు.. ఇన్స్టాగ్రామ్ రీమిక్స్ల నుంచి గ్లోబల్ గ్రామీ స్టేజ్ వరకు.. యశ్రాజ్ మెహ్రా ప్రస్థానం ఒక స్ఫూర్తిదాయక మారథాన్. హిప్–హాప్ అంటే కేవలం పాపులారిటీ మాత్రమే కాదు, గుండె లోతుల్లోంచి వచ్చే నిజాయితీ గల కథా కథనం అని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన ఈ యంగ్ మ్యుజీషియన్. కష్టాన్నే నమ్ముకుని, కళనే శ్వాసగా మార్చుకున్న ఈ యువకుడు నేడు గ్లోబల్ మ్యూజిక్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేసి దేశం గర్వించేలా చేశాడు.భారతీయ హిప్–హాప్ రంగానికి గ్లోబల్ గుర్తింపు తెస్తూ, యువ ర్యాపర్ యశ్రాజ్ మెహ్రా (Yashraj Mehra) ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు రేసులో నిలిచాడు. ‘సౌండ్స్ ఆఫ్ కుంభ’ ఆల్బమ్లో ఫీచర్ చేసిన ఆర్టిస్ట్గా ఆయన దక్కించుకున్న ఈ నామినేషన్, ప్రాంతీయ స్వరాలకు అంతర్జాతీయ వేదికపై దక్కిన అరుదైన గౌరవంగా నిలిచింది.డ్యాన్స్ ఫ్లోర్ నుంచి మ్యూజిక్ మైక్ వరకు..యశ్రాజ్ మెహ్రాకు తన బాల్యం నుంచే మ్యూజిక్పై ఆసక్తి ఉండేది. పాఠశాలలో తన స్నేహితులంతా క్రీడలలో పాల్గొంటూ, స్నేహితులతో గడుపుతుంటే, యశ్ మాత్రం తరగతి గదిలో ఓ మూలన కూర్చొని ర్యాప్ పాటలు, కవిత్వం రాసేవాడు. అలా బాల్యం నుంచే సంగీతం, పాటలపై సహజంగానే ఉన్న ఆసక్తి యశ్లో క్రమంగా కొనసాగుతూ వచ్చింది. ఇక తను స్థిరపడిన హిప్–హాప్ ప్రపంచం యశ్కు మొదట డ్యాన్స్ రూపంలో పరిచయమైంది. టీనేజర్గా ఉన్నప్పుడు మ్యూజిక్ బిట్స్కు డ్యాన్స్ చేయడం ్రపారంభించిన యశ్రాజ్, ఆ తర్వాత ఆ సంగీతం వెనుక ఉన్న పదాల లోతైన అర్థాన్ని, వాటిలోని కథా శైలిని గమనించాడు. అదే అతడిని ర్యాప్ వైపు నడిపించింది. మొదట్లో ఇన్స్టాగ్రామ్లో తన సొంత ర్యాప్ లైన్స్ను అప్లోడ్ చేస్తూ, పాపులర్ రీమిక్స్లతో ప్రయోగాలు చేస్తూ నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తను ఎంచుకున్న రంగంపై కుటుంబం నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ, తల్లి ఇచ్చిన సంపూర్ణ మద్దతుతో తన సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగించాడు.యువతని ఆకట్టుకున్న యష్2020లో విడుదలైన ‘ఆజాద్ హూ మే’ అనే ఎక్స్టెండెడ్ ప్లేతో యశ్రాజ్ అధికారికంగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత విడుదలైన హౌస్లా, ధుంధాలా, గబ్బర్ వంటి పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రస్థానంలో రిషి రిచ్, జేడెన్, అర్మాన్ మాలిక్, బాద్షా, రఫ్తార్ వంటి టాప్ ఆర్టిస్టులతో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే బాలీవుడ్ చిత్రాలైన ఖో గయే హమ్ కహా, మర్డర్ ముబారక్ సినిమాల్లోనూ తన గాత్రాన్ని అందించాడు. డివైన్, నేజీ, నాస్, జె కోల్, డ్రేక్ వంటి అంతర్జాతీయ కళాకారులను ఆదర్శంగా తీసుకునే యశ్రాజ్.. భారతీయ హిప్–హాప్ భవిష్యత్తు ప్రాంతీయ భాషలలోనే దాగి ఉందని బలంగా నమ్ముతాడు.గ్రామీ నామినేషన్తో రికార్డుయశ్రాజ్ కెరీర్లోనే గతేడాది ఊహించని అతిపెద్ద మలుపు. ‘సౌండ్స్ ఆఫ్ కుంభ’ ఆల్బమ్లో ఫీచర్ చేసిన ఆర్టిస్ట్గా యశ్రాజ్ ప్రపంచంలోనే అత్యున్నత సంగీత పురస్కారమైన ‘గ్రామీ’ నామినేషన్ ను దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం!జీవితాన్ని ఒక ‘స్ప్రింట్’ లాగా కాకుండా, ‘మారథాన్’ లాగా భావించే యశ్రాజ్.. నిరంతరం నేర్చుకుంటూ, ఒదిగి ఉండటమే తన విజయ రహస్యమని చెబుతాడు. తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించి, వారిని గర్వపడేలా చేయడమే తన అంతిమ లక్ష్యమని, అన్ని సమయాల్లో తన వెన్నంటే ఉండే తన టీమ్కు ఒక స్థిరమైన మార్గాన్ని చూపించడం తన ధ్యేయమని ఈ యువ సంచలనం స్పష్టం చేశాడు.పాఠశాల గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న ర్యాప్ అక్షరాలు.. నేడు ప్రపంచ అత్యున్నత సంగీత వేదిక ‘గ్రామీ’ నామినేషన్ వరకు చేరతాయని యశ్రాజ్ కూడా ఊహించి ఉండడు. ఆటంకాలు ఎన్ని ఎదురైనా పట్టువదలకుండా యశ్రాజ్ మెహ్రా సాధించిన ఈ అంతర్జాతీయ విజయం, భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సరికొత్త సంచలనం.'ప్రజలు నా సంగీతాన్ని ఇష్టపడటం, అభినందించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ఎంచుకున్న మార్గం కేవలం నా భ్రమ కాదని, నిజమని ఆ క్షణంలో నమ్మాను. అపుడే సంగీతం కోసం నా పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నాను. మనం నిజంగా నిజాయితీగా ఏదైనా రాస్తే, అది అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత శైలి కాకపోయినా, అది ప్రతిధ్వనిస్తుందని నా సంగీత ప్రయాణంలో నేను గ్రహించాను.' – యశ్రాజ్ -
జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ..
కొందరు సక్సెస్కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్ అలాంటి ఘనతనే సాధించింది.ఆ అమ్మాయే రాయ్పూర్కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్ గవర్నెమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్ టీచర్ లేదా లెక్చరర్ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.#WATCH | Raipur, Chhattisgarh: Charu Pandey, starting her journey at 23 with the dream of a government job, has inspired lakhs of young aspirants by clearing 19 competitive exams, says, "... My family is very happy with this achievement of mine. I am receiving an award for… pic.twitter.com/Zo21tNMxPs— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2026 (చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!) -
ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే..
జీరో నుంచి మొదలు పెట్టి కోట్లు గడించే రేంజ్కి చేరుకున్నాడు. అదికూడా తన చుట్టు ఉన్న అవసరాలే వ్యాపారంగా మలిచాడు. ఆఖరికి విలాసవంతమైన కారు కొన్నా..అది తన స్థాయి చూపించుకోవడానికి కాకుండా..సొంతూరు గర్వించే స్థాయిలో ఉన్నాను అని చూపేందుకు అని చెబుతుంటాడు. గెలుపుకి పెద్ద పెద్ద డిగ్రీలు, బ్యాగ్రౌండ్తో పనిలేదని చాటిచెప్పే అసామాన్యుడి కథ ఇది. సాధారణ ఆటో రిక్షా డ్రైవర్గా మొదలైన జీవితం ఏకంగా రూ. 900 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి యజమానిగా మారి యవతకు ప్రేరణగా నిలిచిన విజయగాథ ఇది. అతడే కర్ణాటకలోని బళ్లారికి చెందిన సత్య శంకర్. అతడు ఇంటర్ డ్రాపౌట్. తండ్రి సాధారణ పూజరి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దాంతో కుటుంబ పోషణ కోసం కష్టపడి డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి..ఆటో రిక్షా నడుపుతుండే వాడు. ఆ తర్వాత ప్రభుత్వ పథకం కింద రుణంపై సొంతంగా ఆటో కొనుక్కుని నడపడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు ఆ రుణాన్ని తీర్చేసి..వెంటనే తన ఆటోని కారుగా మార్చాడు.ట్యాక్సీ డ్రైవర్గా తనుండే జిల్లా చుట్టూనే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ముందుకెళ్లాడు. ఆ క్రమంలో తరచుగా విదేశీ పర్యాటకులను తన వాహనంలో తీసుకువెళ్లేవాడు. వాళ్లంతా ఎక్కడ నుంచి వచ్చినా..మొదటగా కొనేది ప్యాక్ చేసిన మంచినీటి సీసానే అని గమనించాడు శంకర్. తాను రోడ్డుపై దృష్టిపెడితే..విదేశీ పర్యాటకులంతా ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఇలా చేస్తున్నారని గ్రహించాడు. అప్పుడే ఇదేదో పనికొచ్చే బిజినెస్లా ఉందే అని అతడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. ఆ తర్వాత కారు నడపడం కంటే..కారు విడిభాగాలను అమ్మే వ్యాపారమే బెటర్ అని గ్రహించి ఆటోమొబైల్ వ్యాపారం ప్రారంభించాడు. విడిభాగాలు కొనే ప్రతి కస్టమర్కు టైర్ కూడా అవసరం అని గ్రహించి టైర్ల దుకాణాన్ని కూడా తెరిచాడు. అంతేగాదు తన వద్ద రైతులు, స్థానికులు అరువుపై వస్తువులు కొనుగోలు చేసేవారు. చిన్న చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించేవారు. దాంతో తను కూడా బ్యాంకుకు విడతల వారీగా డబ్బు చెల్లించొచ్చని తెలుసుకున్నాడు శంకర్. అలా 1994లో ప్రవీణ్ క్యాపిటల్ అనే ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. ఇతర ఫైనాన్షియర్లు పాత వాహనాలను పట్టించుకోనప్పటికీ, శంకర్ సెకండ్ హ్యాండ్ ఆటోలు,కార్లకు రుణాలు ఇచ్చాడు. అతను కూడా ఒక కష్టపడే డ్రైవరే కాబట్టి, కష్టాల్లో ఉన్న డ్రైవర్ను పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇక ఆ తర్వాత తనలో ఆనాడు విదేశీ పర్యాటకుల కారణంగా తన బ్రెయిన్లో తట్టిన ఆ వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాడు. భారీ వర్షాలు కురిసే పుత్తూరు సమీపంలోని నరిమొగేరు అనే గ్రామంలో అతను మంచినీటి ఫ్యాక్టరీని స్థాపించాడు. అతను ఆ బ్రాండ్కు బిందు (‘కన్నడలో చుక్క’) అని పెట్టారు. అక్కడితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆపలేదు. శంకర్ ఉత్తర్ భారత దేశ పర్యటనలో ఓ చిన్న సోడా దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ సర్వ్ చేసిన సోడా పానీయం అతడికి మరో వ్యాపారాన్ని నిర్మించేదుకు దారితీసింది. అలా తన సొంతూరు పుత్తూరులో బిందు ఫిజ్ జీరా మసాల అనే కూల్డ్రింక్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. మొదట్లో వంద సేల్ అవ్వడమే కష్టంగా ఉండేది. అయితే దేశీ రుచి కచ్చితంగా విజయవంతమవ్వుతుందన్న ఆశతో వెనక్కి తగ్గకుండా హైవేలపై ఉండే గోడలనే ప్రచార బోర్డులుగా మార్చి ఆ డ్రింక్ ప్రకటనలను ఇచ్చేవాడు. నోటి మాటతో దాని రుచి ప్రజలకు చేరువయ్యేలా చేశాడు. దాంతో గ్రామీణ శైలి ఆహారంతో ప్రజలు కోరుకునే పానీయంగా ప్రజల మదిలో నిలిచే చల్లని పానీయంగా బిందు ఫిజ్ని స్థిరపడేలా చేశాడు. మార్చి 2025 నాటికి 60 ఏళ్లు శంకర్కి. కానీ ఆయన వ్యాపార విస్తరణ ఆగలేదు. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో సాగిపోతున్నాడయన. అంతేగాదు ఆయన ఎస్జీ కార్పొరేట్స్, ఇప్పుడు రూ. 900 కోట్ల టర్నోవర్ ఆర్జిస్తుండగా, హౌస్ ఆఫ్ బిందు (పానీయాలు , స్నాక్స్) రూ. 570 కోట్ల ఆదాయం, ప్రవీణ్ క్యాపిటల్ (ఫైనాన్స్ విభాగం) రూ. 330 కోట్లను ఆర్జిస్తోంది. ఆయన ప్రసిద్ధ జీరా మసాలా నుంచి మామిడి రసాలు, స్నాక్స్ వరకు 55 రకాల ఉత్పత్తులను అమ్ముతారు. ఆయనకు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. పైగా ఆంధ్రలో కొత్తవి రానున్నాయి కూడా. ఆయన వద్ద ప్రస్తుతం రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. అది తన స్టేటస్ ఆఫ్ సింబల్ కోసం కాదని, బళ్లారికి చెందిన వ్యక్తి ఎంత దూరం వెళ్లగలడు అని చెప్పడానికని గర్వంగా అంటాడు శంకర్. తన వ్యాపారాలన్నీ..సామాన్య ప్రజలు కోరుకునేది, వారి అవసరాల దృష్టి నుంచి మొదలైనవేనని, అదే తన సక్సెస్మంత్ర అని అంటాడాయన. అంతేగాదు అంతా ఇంగ్లీష్ పానియాలతో వ్యాపారం చేస్తే..స్థానిక భాషకు ప్రాధాన్యత ఇచ్చి..దేశీ రుచిని అందించే పానీయాలను తీసుకొచ్చారు. ఓపిక, నిశిత పరిశీలన ఉంటే..ఎప్పటికైనా గెలుపు తథ్యం అంటాడు కర్ణాటకకు చెందిన సత్య శంకర్.(చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..) -
27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ.75 లక్షల టర్నోవర్
దృఢ సంకల్పానికి, స్ఫూర్తికి ప్రతీక ఆమె కథ. జీవితంలో అడుగడుగునా కష్టాలే అయినా పట్టుదలతో అద్భుతమైన విజయం సాధించింది. అచంచల కృషితో తన జీవితాన్ని మార్చుకోవడం మాత్రమే కాదు, తన తోటివారికి స్వీయ సాధికారత స్ఫూర్తి నందించిన మహిళ. కేవలం రూ. 500 పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం నేడు ఏటా రూ.75 లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది.ఎవరా మహిళ? ఆమె విజయ రహస్యం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోఅస్సాంలోని నల్బారి జిల్లాకు చెందిన కనికా తాలూక్దార్ కథ ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక ప్రయాణం. 27 ఏళ్ల వయసులోనే 2008లో ఒక రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు.ఉన్నత చదువులు లేవు, స్థిరమైన ఆదాయం లేదు. ఉన్నదల్లా నాలుగు నెలల కూతురు, అత్తామామలను పోషించేబాధ్యత. కానీ, ఆమె అధైర్యపడకుండా ఎదురొడ్డి నిలబడాలని నిర్ణయించుకుంది.ఆమె చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. 2014లో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. స్థానిక స్వయం సహాయక సంఘం (SHG)లో చేరారు. అక్కడ 'జీవిక సఖి'గా బాధ్యతలు చేపట్టడం వల్ల పొదుపు, బృందకృషి, చిన్న తరహా వ్యాపారాలపై ఆమెకు అవగాహన వచ్చింది.రూ.500 పెట్టుబడితో ప్రయోగంనల్బారిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ మనోషి చక్రవర్తి ఇచ్చిన వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ శిక్షణ కనికను ఎంతగానో ఆకర్షించింది. దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదని గ్రహించిన ఆమె, కేవలం రూ. 500లతో తన తల్లిదండ్రుల ఇంటి పెరట్లో ఒక కిలో వానపాములతో వర్మీ కంపోస్ట్ వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో, ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆవు పేడ ,ఆకుల వంటి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుంటూ, వర్మీకంపోస్టింగ్ తయారీ పనిని స్వీకరించింది.మొదట్లో అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కనిక పట్టుదల ఫలించింది. కొనేందుకు డబ్బుల్లేక చుట్టుపక్కల లభించే కూరగాయల వ్యర్థాలు, ఎండిన ఆకులను సేకరించి మొదటి బ్యాచ్ ఎరువును సిద్ధం చేసేది. ఇదే 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' సంస్థకు పునాది. రసాయన ఎరువులకు అలవాటు పడిన స్థానిక రైతులు మొదట్లో ఆమె సేంద్రియ ఎరువును కొనేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. కానీ కనిక వెనకడుగు వేయలేదు.2018 నుండి ఆమె స్వయంగా రైతులను కలిసి, చిన్న చిన్న సంఘాలను ఏర్పాటు చేసి వర్మీకంపోస్ట్ వల్ల నేల తల్లికి జరిగే మేలును వివరించడంతో పాటు, స్థానిక రేడియో ఛానళ్ల ద్వారా కూడా దీనిపై అవగాహన కల్పించేది. ఆమె పట్టుదలకు ఫలితంగా మెల్లమెల్లగా రైతులు ఆమె ఉత్పత్తులను నమ్మడం, కొనడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది, తన కార్యకలాపాలను విస్తరించింది. తన ఉత్పత్తులను వైవిధ్యపరిచింది. వర్మీకంపోస్ట్ వ్యాపారం నెలకు రూ. 3.5 లక్షల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది. అలా 2017లో 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' బ్రాండ్ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. 2019లో జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) మద్దతుతో ఆమె తన ఉత్పత్తులను Amazon, Flipkart , ప్రభుత్వ రంగ పోర్టల్ GeM (Government e-Marketplace) లలో విక్రయించడం ప్రారంభించింది. GeM పోర్టల్ ద్వారా ప్రభుత్వ శాఖల నుండి పెద్ద మొత్తంలో వార్షిక కాంట్రాక్టులు రావడంతో వ్యాపారం స్థిరపడింది.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ (NeedHub), IIM కలకత్తా, NRETP ల నుండి ఆమెకు రూ. 27.50 లక్షల బిజినెస్ గ్రాంట్లు లభించాయి. ఈ నిధులతో ఆమె మౌలిక సదుపాయాలను పెంచుకున్నారు. కేవలం ఒకటిన్నర బిఘాల సొంత స్థలం నుంచే ఈ వ్యాపారాన్ని నడుపుతుండటం విశేషం.ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!నెలకు ఏకంగా 70 టన్నుల వర్మీకంపోస్ట్ను ఉత్పతి చేస్తూ, ఈ విక్రయాల ద్వారా ఆమె ఏడాదికి రూ. 70 లక్షల నుండి రూ.75 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. వర్మీకంపోస్ట్తో పాటు ఆర్గానిక్ పురుగుమందులు, ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ (గోమయ అగర్బత్తి) కూడా తయారు చేస్తున్నారు. దీనికిగానూ 2019లో ICAR నుంచి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తన ఆన్లైన్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని, అలాగే తనలాంటి ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి, రసాయన రహిత స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కనిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సాధారణ మహిళ అనుకుంటే జీరో నుంచే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలదు అనేందుకు కనికా తాలూక్దార్ జీవితమే ఒక సజీవ సాక్ష్యం.ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం! -
పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్ ..! ప్రముఖ బ్రాండ్లకు..
ఒక సాధారణ నైపుణ్యంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా మారి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందామె. పరిమిత వనరులతో ప్రారంభించిన వ్యాపారం..చూస్తుండగానే నెమ్మదిగా వృద్ధి చెందడం ఒక ఎత్తైతే..ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలే వచ్చి కొనుగోలు చేసేలా పేరుగాంచడం మాములు విషయం కాదు. కేవలం ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన ఆమె చిన్న సాధారణ నైపుణ్యంతో ఉపాధి ఏర్పరుచుకుని ఉన్నతస్థాయికి ఎదగడమే గాక ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం విశేషం. మరి ఆ మహిళ స్ఫూర్తిదాయక కథేంటో చూద్దామా..!.ఆ మహిళే లూధియానాలోని సమ్రాలా సమీపంలో ఉన్న భగవాన్పురా గ్రామానికి చెందిన 54 ఏళ్ల చరణ్జిత్ కౌర్. పుట్టిన దగ్గర నుంచి పేదరికంలో పెరిగిన ఆమెకు డబ్బు విలువ గురించి బాగా తెలుసు. ముఖ్యంగా ఉపాధి విలువేంటో బాగా తెలుసామెకు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదో ఒకటి చేయాలనుకుంది. అందుకోసం జనపనార సంచులను తయారు చేయడం నేర్చుకోవాలని అనుకుంది. మొదట్లో చరణ్జిత్కు మద్దతు లభించలేదు. అయినా సరే ఎలాగైనా నేర్చుకుని తీరాలన్న పట్టుదలతో కృషి విజ్ఞాన్ కేంద్ర (KVK) కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలలో చేరింది. అది ఆమెకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికే కాకుండా వ్యాపారం గురించి మరింతగా అవగాహన ఏర్పరుచుకోవడాని వీలు కల్పించింది. అలా చిన్నగా వ్యాపారం ప్రారంభించింది. అయితే మొదట్లో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఆర్డర్లు రాక ఇబ్బందిపడ్డది కూడా. అలా నెమ్మదిగా ఆర్డర్లు దక్కించుకుంటూ చిన్నగా మొదలైన వ్యాపారం కాస్తా సంస్థగా మారింది. అంతేగదు ఏకంగా టాటా, జోంటీ ఆగ్రో వంటి కంపెనీలు నుంచి ఆర్డర్లు అందుకునేలా పేరు సంపాదించించుకుంది. అలా తన వ్యాపారం ద్వారా నెలకు దగ్గర దగ్గర రూ. 50 వేలు వరకు సంపాదించుకునే రేంజ్కి వచ్చింది. సాధారణ ప్రజలు కూడా కొనుగోలు చేసే ధర, అనుకున్న సమయానికి ఆర్డర్ ఇచ్చేలా ఆమె నిబద్ధత వ్యాపారానికి కీలకంగా మారి ప్రముఖ కంపెనీల నుంచి ఆర్డర్లు అందుకునేందుకు దారితీసింది. మరోవైపు ఆమె తన ఆదాయంతో కుటుంబ పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు ఇచ్చే స్థాయికి వచ్చారామె. అంతేగాదు ఆమె జనపనారతో సంచులు ఎలా తయారు చేయాలో చెబుతూ..స్వయంగా డబ్బులు సంపాదించుకునే మార్గాల గురించి ఇతర మహిళలకు వివరిస్తుంటుంది. విదేశాల నుంచి వచ్చి మరి ఆమె తయారు చేసే జనపనార సంచులను కొనుగోలు చేస్తుంటారట. మన్నిక, వినియోగం ఆధారంగా కొన్ని జనపనార సంచులు అధిక ధర పలుకుతాయని చెప్పుకొచ్చింది చరణ్జిత్ కౌర్. ఈ కథలో ఆర్థిక ఇబ్బందులు, చదువు లేకపోవడం వంటి సమస్యలు ప్రతిబంధకం కాదు..తనపై తనకు నమ్మకం ఉంటే..చిన్న నైపుణ్యంతో విజయం సాధించొచ్చు, కలలు నిజం చేసుకోవచ్చని నిరూపించింది చణ్జిత్ కౌర్.(చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..) -
చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!
చిన్నపాటి స్టోర్ మాదిరి రెస్టారెంట్ నుంచి ఏకంగా లగ్జరీ రెస్టారెంట్ల రేంజ్కి చేరుకోవడం అంత ఈజీకాదు. పైగా ఆతిథ్య రంగంలో తనకంటూ గర్తింపు తెచ్చుకుని ప్రసిద్ధ బాండ్ రెస్టారెంట్లతో కోట్లలలో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడు ఈ సక్సెస్ని ఎలా అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సిన ముఖ్య లక్షణమేంటో తప్పక తెలుస్తుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. అతడే ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థకు వ్యవస్థాపకుడు రియాజ్ ఆమ్లానీ. అతడు చిన్నగా మొదలు పెట్టిన రెస్టారెంట్ వ్యాపారం అనతికాలంలోనే సోషల్, స్మోక్ హౌస్ డెలి, పృథ్వీ కేఫ్, స్లింక్ అండ్ బార్డోట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్ల రెస్టారెంట్లు రన్ చేసే రేంజ్కిచేరుకున్నాడు. అంతేగాదు భారతదేశ ఆహార, పానీయాల పరిశ్రమలో తన పేరుని నిలిచేలా చేసుకున్నాడు. తన బ్రాండ్ల వెనుకు ఉన్న తన ఫుడ్ బేవరేజ్ సంస్థ ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థ సీఈవో రియాజ్ ఎలాంటి సక్సెస్ సూత్ర పాటించి ఈ రేంజ్కి వచ్చాడంటే..ప్రజల ఫీడ్బ్యాక్ని ఆధారంగా అని చెబుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లు ఇష్టపడే ప్రదేశాలు వంటి వాటిపై చర్చించి ఆ దిశగా తన రెస్టారెంట్లలో అవి ఉండేలా ఏర్పాట్లు చేశాడట. ముంబైకి చెందిన ఈ వ్యాపారవేత తన 35 ఏళ్ల వ్యాపార జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనని, అదే తన విజయ రహస్యమని అంటున్నారు. ప్రజలు ఆనందించగల ప్రదేశాలనే నిర్మిస్తా..అదే తన రెస్టారెంట్లను విజయవంతంగా నడిపిస్తుందని అంటున్నారు. ఆయన తన రెస్టారెంట్ల వ్యాపారం నుంచి దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తాడట. మన కళ్ల ముందే చాలా కంపెనీలు ఆతిథ్య రంగంలోకి వచ్చి ఇబ్బంది పడ్డాయి. తీవ్రమైన పోటీ ఉండే ఈ రంగంలో తను నిలదొక్కుకోవడానికి కీలకం కస్టమర్లే అంటాడు. మొదట కస్టమర్ల ప్రాధాన్యత, ఆ తర్వాత అవి అమలు చేయడంలో కలిగే సానుకూల, ప్రతికూల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తానని అంటున్నాడు. తన కుటుంబ వ్యాపారమైన బెర్రీస్ రెస్టారెంట్ నుంచి మొదలైందట. అక్కడ నుంచే మొరాకో-శైలి కేఫ్ అయిన 'మోచా' ద్వారా ఆతిథ్య వ్యాపారంలోకి వచ్చినట్లు తెలిపారు. అలా తన కుటుంబ వ్యాపారం అంచలంచెలుగా విస్తరించి ఆతిథ్య సంస్థగా ఎదిగిందన్నారు. చివరగా ఆయన ఎదగడానికి రెండు మార్గాలున్నాయన్నారు. మొదటిది విశ్రాంతి తీసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స చేసి ఎదగొచ్చు , రెండు పూర్తిగా పనికే ప్రాధాన్యత ఇచ్చి కెరీర్పై దృష్టి పెట్టొచ్చు. ఆ విధంగా నిబద్ధతతో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అటెన్షన్ పెడితే విజయం తథ్యం అని అన్నారు. (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!
ప్రతి వ్యక్తి కెరీర్లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏదీ అంత ఈజీగా దొరికేయదు కూడా. అలానే ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా చదువు అవ్వంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మంచి జాబ్ కొట్టేశాడు. కానీ అది వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తా అంటూ సివిల్స్ వైపుకి వచ్చాడు. అందులో వరుసపెట్టి వైఫల్యాలే, మధ్యలో వ్యక్తిగత జీవితంలో లవ్ బ్రేకప్ ఇలా.. వరుసపెట్టి ఎదురుదెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉన్నాయి అతడిని. కానీ చివరికి వాటన్నింటిని ఓర్చుకుంటూనే సక్సెస్ అందుకున్నాడు. చేతులెత్తేయకుండా చివరి వరకు పోరాడటం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఈ వ్యక్తి స్ఫూర్తిదాయక కథ వింటుంటే. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికాస్ అల్విస్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన తన ఫాట్మేట్ గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్లో వికాస్..తన ఫ్లాట్మేట్ 2012లో ఐఐటి మద్రాస్ నుండి కెమికల్ ఇంజనీరింగ్లో బీ.టెక్ పూర్తి చేసి, రూ. 10 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ను అందుకున్నాడు. తొందరగానే సెటిల్ అయిపోయాడు. కానీ అతడు దాన్ని వద్దనుకుని మరీ యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాడు. రెండో సారి మెయిన్స్లో తప్పింది. ఇక ఈ రెండు వైఫల్యాలు కారణంగా కాస్త విరామం తీసుకుని తనకిష్టమైన బ్యాడ్మింటన్పై దృష్టిసారించాడు. జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఆడటం ప్రారంభించాడు. అయితే మైదానంలో చాలా రాజకీయాలు ఉండేవి వాటిని చూసి విసుగొచ్చి బ్యాడ్మింటన్ వదిలేసి మరో ఏడాది వృధా చేసుకున్నాడు. మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. ఆ టైంలోనే ప్రేమలో పడ్డాడు. దాంతో మూడోసారి ప్రయత్నంపై ఎఫెక్ట్ పడి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక నాల్గో ప్రయత్నంలో లవ్ బ్రేకప్ అతడిని మరింత కుంగదీసింది. ఇక ఐదు, ఆరో ప్రయత్నాల్లో అంత సీరియస్నెస్తో ప్రిపేర్ కాలేక ఓటమిని చవిచూశాడు. అలా మొత్తం 12 ఏళ్లు చేజేతులారా వృధా చేసుకున్నాడు. అప్పటికీ అతనికి 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం కూడా లేదు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అతడు జీవితంలో పదే పదే ఎడతెగని వైఫల్యాలను చవిచూసినప్పటికీ..చివరికి అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. అతడు ఆన్లైన్ సాయంతో ట్రేడింగ్ నేర్చుకుని..ఏకంగా సెబీ సలహాదారుడుగా మారాడు. పైగా ట్రేడింగ్ ద్వారా నెలకు ఏకంగా రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవలే అతను పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు టెకీ వికాస్. నిజం చెప్పాలంటే అతడు ఈ స్థాయికి చేరకుంటాడని ఊహించలేదు కానీ చాలా సంతోషంగా ఉందంటూ తన పోస్ట్ని ముగించాడు టెకీ. ఈ కథ ఓటములు పలకరిస్తూనే ఉన్నా..గివ్ అప్ ఇవ్వకూడదని చెబుతోంది కదూ..!.There is a guy in my flat who completed his https://t.co/Ws1j7hoGgc in Chemical Engineering from IIT Madras in 2012. After graduation, he got a campus placement offer of 10 LPA, but he rejected it and started preparing for UPSC. He belongs to the general category.In the first…— Vikas Alwys (@VikasAlwys) May 27, 2026 (చదవండి: ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..) -
టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!
ఒక వ్యక్తి ఒకానొక టైంలో చదువుని మధ్యలోనే ఆపేసినా..పరిస్థితులు, కష్టాలు, అసామాన్య ప్రతిభను వెలికితీస్తాయి అనేందుకు ఈ కథే ఉదాహరణ. ఆర్థిక కష్టాలు పదోతరగతికి మించి ఉన్నత చదువుని అందుకునే పరిస్థితి కల్పించికపోతేనేం..అచంచలమైన దృఢ సంకల్పంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ.. వ్యవస్థాపకుడిగా మారాడు. అక్కడ నుంచి దేశమే గర్వించేలా రక్షణవ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపతేం చేసే పేలుడు పదార్థాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీని రన్ చేసే స్థాయికి చేరుకున్నాడు.అతడే రాజస్థాన్కి చెందిన సత్యనారాయణ్ నువాల్. రాజస్థాన్లోని భిల్వారా గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తండ్రి పదవీ విరమణతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పదితోనే చదువు ఆపేయాల్సిన వచ్చింది. దాంతో 1970వ దశకంలో నువాల్ జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న బల్హర్షాకు వెళ్లారు. కనీస వసతి లేక ఆయన రాత్రుళ్లు రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అనేక చిన్న చిన్న వ్యాపారాలు ప్రయత్నించారు. 18 ఏళ్ల వయసులో ప్రారంభించిన ఫౌంటెన్-పెన్ ఇంక్ తయారీలో నష్టం రావడం వంటి పలు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గక.. గెలుపు పిలుపు వినిపించ్చేదాక ఏదో ఒక చిన్న వ్యాపార ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే పేలుడు పదార్థాల వ్యాపారి అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ని కలిశారు. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. వెయ్యితో మొదలై..కోట్లకు విస్తరించేలా..ఆ వ్యాపారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన వద్ద నుంచి లైసెన్సు, నిల్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి నెలకు రూ. 1,000 చెల్లిస్తూ వ్యాపారం మెదలుపెట్టాడు. ఆయన రూ. 250లకు పేలుడు పదార్థాలు కొని వాటిని రూ. 800లకు అమ్మే వ్యాపార చతురత నువాల్లని ఎంతగానో ఆకర్షించింది. అలా ఆయన బ్రిటిష్ సంస్థ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI)లో పంపిణీదారుడిగా నియామకం పొంది కీలకమైన పరిశ్రమ అనుభవాన్ని సంపాదించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని పొందాడు. ఆ విధంగా 1995లో రూ. 60 లక్షల రుణంతో నువాల్ నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో ప్యాకేజ్డ్ పేలుడు పదార్థాలు, బల్క్ పేలుడు పదార్థాలు, డిటోనేటర్ల తయారీతో కార్యకలాపాలను ప్రారంభించింది. మొదట చిన్న తరహా సంస్థగా ప్రారంభమైన..కొద్ది కాలంలోనే విస్తరించి భారతదేశంలోనే అతి పెద్ద పేలుడు పదార్థాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఈ సంస్థ ఎదిగింది. రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం..నాగస్త్రకు అనుబంధంగా భార్గవస్త్ర అనే ఒక అధునాతన కౌంటర్-డ్రోన్ (C-UAS) వ్యవస్థ ఉంది. ఈ మైక్రో-క్షిపణి ఒకేసారి 60 లక్ష్యాల వరకు ఛేదించగలదు. ఈ సామర్థ్యం ఇతర దేశాలు మోహరించిన వ్యవస్థలను మించిపోయింది. మాములుగా ఇవి సాధారణంగా ఒకేసారి నాలుగు ప్రయోగాలను మాత్రమే నిర్వహించగలుగుతాయి. దీంతో 2010 నాటికి సోలార్ ఇండస్ట్రీస్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. అలా రక్షణ దళాల కోసం పేలుడు పదార్థాలను తయారు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన తొలి ప్రైవేట్ భారతీయ సంస్థగా ఇది నిలిచింది. ఆ లైసెన్స్ కాస్తా పేలుడు పదార్థాల నుంచి అత్యాధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థల వైపు మళ్లడానికి నాంది పలికింది. ఆ విధంగా నువాల్ నాయకత్వంలో సంస్థ అనూహ్యంగా వృద్ధి చెంది ఇప్పుడు భారతదేశం అంతటా 27 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అంతేగాదు ఎనిమిది దేశాల్లో ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉండటమే గాక సుమారు 75 నుంచి 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. 2023 నాటికి, సోలార్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 8వే కోట్లు ఆదాయంతో ప్రపంచంలోనే ఐదు అగ్ర పేలుడు పదార్థాల తయారీలో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్లను దాటి, దాదాపు రూ. 1.54 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందులో నువాల్ సుమారు 70 శాతం ఈక్విటీని కలిగి ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సదుపాయాలను సందర్శించి, కంపెనీ సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. అలా నువాల్ కంపెనీ రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. అంతేగాదు ఆపరేషన్ సింధూర్లో సైతం నాగాస్త్రంతో ఒక నిర్ణయాత్మక పోషించారు. అందుకుగాను భారత ప్రభుత్వం జనవరి 26, 2026న పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఒకప్పుడు చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి భారతదేశ రక్షణ ఉత్పాదక విప్లవంలో అగ్రగామిగా ఉన కంపెనీకి సారథ్యం వహించే స్థాయికి చేరడం నిజంగా స్ఫూర్తిదాయకం కదూ..!.(చదవండి: మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..! పేదింటి అమ్మాయి విజయగాథ) -
మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..!
జీవితం ఎలాంటిదంటే... ‘ఏమీ లేదు’ అని నిరాశతో అనుకుంటే... ఏమీ ఉండదు! ‘చాలా ఉంది’ అని ఆశాభావంతో అనుకుంటే... చాలా ఉంటుంది!! పగవాడికి కూడా ఇలాంటి పేదరికం వద్దు అనుకునే కటిక పేదరికంలో పుట్టిన షహీనా అత్తర్వాలా ఎప్పుడూ ఆశాభావంతో ఉండేది. ఆ ఆశాభావమే ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మురికివాడ నుంచి ప్రసిద్ధ కంపెనీలలో ఏఐ ఎక్స్పర్ట్గా పనిచేసే స్థాయికి తీసుకెళ్లింది. పేదింటి అమ్మాయిల చదువు కోసం వివిధ రూపాల్లో తన వంతుగా కృషి చేస్తోంది.ఉత్తర్ప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించింది షహీనా అత్తర్వాలా. ఆమె కుటుంబం బతుకుదెరువు కోసం ముంబైకి వచ్చింది. షహీనా తండ్రి చదువుకోలేదు. చిన్నాచితకా పనులు చేస్తూ బతుకుబండిని నడిపేవాడు. షహీన కుటుంబం ముంబైలోని దర్గా గల్లీ మురికి వాడలోని ఒక గుడిసెలో నివసించేది. దురదృష్టవశాత్తు ఆ గుడిసె కొన్నిరోజులకు అగ్ని ప్రమాదానికి గురైంది. సామాన్లు, ఉన్న కాస్తో కూస్తో డబ్బూ బూడిదయ్యాయి. ఆ తరువాత షన కుటుంబం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుతూ ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బతికేది.ఒక కల అలా మొదలైంది...పేదరికం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కుమార్తె చదువు విషయంలో తండ్రి నిర్లక్ష్యం వహించేవాడు కాదు. షహీనాను సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చేర్పించాడు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకుంది. తన ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది మహిళలు నిస్సహాయంగా పురుషులపై ఆధారపడడాన్ని షన గమనించేది. ఆమె దృష్టిలో వారు బతుకుతున్నారు. అంతే! వారిలా తాను ఇతరులపై ఆధారపడకుండా స్వంత కాళ్లపై నిలబడాలంటే బాగా చదువుకోవాలనుకుంది.అప్పు చేసి కంప్యూటర్ కోర్స్లో...సెయింట్ జోసెఫ్లో నీడిల్ వర్క్ లేదా కంప్యూటర్ ఆప్షన్ ఉండేది. షహీనాకు కంప్యూటర్లపై ఆసక్తి. అయితే తగిన మార్కులు లేకపోవడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఆ నిరాశలో... ‘ఇంటర్మీడియెట్ తరువాత కంప్యూటర్ కోర్స్లో చేరవచ్చా?’ అని ఎవరినో అడిగితే... ‘చేరవచ్చు’ అన్నారు. ‘అప్పటి వరకు ఓపిక పట్టాలి. తప్పదు’ అని తనకు తాను చెప్పుకుంది.షహీనాను కంప్యూటర్ కోర్సులో చేర్పించడానికి తండ్రి అప్పు చేశాడు. కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసిన తరువాత ఆ ఇన్స్టిట్యూట్లోనే ఇన్స్ట్రక్టర్గా పనిచేసింది షన. ఆ తరువాత... బుక్మై షో, షాదీ.కామ్, విగ్జో, జూమ్కార్లలో పనిచేసింది. 2020 సంవత్సరం షన ఉద్యోగ జీవితంలో కీలక మలుపు. ఆ సంవత్సరం మైక్రోసాఫ్ట్ డిజైన్ టీమ్లో చేరింది. డిజైన్ మేనేజర్ స్థాయికి చేరింది. డిజైన్ మేనేజర్గా ఎమర్జింగ్ మార్కెట్ టీమ్ కోసం డిజైన్ అండ్ రీసెర్చ్కు నాయకత్వం వహించింది. కొంత కాలం తరువాత ‘సేల్స్ఫోర్స్’లో ప్రిన్సిపల్ డిజైనర్గా చేరింది. సేల్స్ క్లౌడ్ కోసం జెన్–ఏఐప్రాజెక్ట్లకు నాయకత్వం వహించింది. అలా పని చేస్తూనే కామర్స్లో డిగ్రీ చేసింది. ఆ తరువాత లా చేసింది.మురికివాడ వదిలి...2021లో ముంబైలో తాను ఉంటున్న మురికివాడను వదిలి సొంత అపార్ట్మెంట్లోకి మారింది షన. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా’లో తాను చాలాకాలం పాటు నివసించిన దర్గా గల్లీ మురికి వాడను చూసింది. ఆ సిరీస్లో చూపించిన ఇళ్లలో ఒకటి తనదేనని సోషల్ మీడియాలో ΄ోస్ట్ చేసింది. తాము అక్కడ నివసించే రోజుల్లో పబ్లిక్ టాయిలెట్లు అత్యంత మురికిగా ఉండేవని, ఆ అపరిశుభ్రమైన టాయిలెట్లకు వెళ్లకుండా ఉండేందుకు చెత్తకుప్పలను బహిరంగ మలవిసర్జన కోసం ఉపయోగించేవారని, ఈ మురికివాడ నుంచి సౌకర్యవంతమైన జీవితంలోకి రావడానికి తన కఠిన శ్రమ, పట్టుదల కారణం అయ్యా యంటూ తన ΄ోస్ట్లో తెలియజేసింది. తన గెలుపు పాఠమే... వారికి పాఠం‘కష్టపడ్డాను. జీవితంలో పైకి వచ్చాను. ఇక చాలు’ అనుకోలేదు షన. పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారికి నా వంతుగా ఏదైనా చేయాలనుకుంది. నిరుపేద బాలికలకు చదువుప్రాముఖ్యతను తెలియజేస్తోంది. తన గెలుపు పాఠాన్నే వారికి పాఠంలా చెబుతోంది. సాంకేతిక విషయాలపై వారికి శిక్షణ ఇస్తోంది. బాలికల విద్యకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక బాలిక చదువు కోసం క్రౌడ్ఫండింగ్ ద్వారా సహాయం చేసింది. ఆమె సహాయం చేసిన బాలిక ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్సెస్ చదువుతోంది.ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది!ముంబై మురికివాడలో మేము నివసించిన పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది. అది అత్యంత కఠినమైన జీవితం. లింగ వివక్ష నుంచి లైంగిక వేధింపుల వరకు ఎన్నో చూశాను. ఈ నేపథ్యంలో నేను ఒక కొత్తజీవితం కోసం కల కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి కష్టపడ్డాను. అడుగడుగునా తల్లిదండ్రులు నాకు అండగా నిలవడం నా అదృష్టం. – షహీనా అత్తర్వాలా -
నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!
ఇవాళ భారతదేశంలో కాంపీటీటివ్ ఎగ్జామ్స్ సంస్కృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు, యువతకు అదే జీవిత పరమావధి అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకవేళ అది ఫెయిలైతే జీవితం అయిపోయినట్లుగా లేదా ముగిసిపోయినట్లుగా భావిస్తారు. మరికొందరు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేని పరాజితులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకో రంగంలో లేదా మరేదైన అభిరుచినో ఎంచుకుని గమ్యం చేరుకునే యత్నం చేయరు. కానీ ఈ కంటెంట్ క్రియేటర్ తన సక్సెస్ స్టోరీతో ఆ ఆలోచన విధానమే తప్పు అని నొక్కి చెప్పింది. ఆ ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మన జీవితాన్ని, సక్సెస్ని నిర్ణయించదని తన గెలుపుతో నిరూపించింది ఈ భారత సంతతి మహిళ. ఎవరంటే ఆమె..? అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రజ్ఞాగుప్తా. దాదాపు దశాబ్దం క్రితం నీట్ పరీక్షల్లో విఫలమవ్వడం ఆమెను ఊహించని విధంగా ఐవీ లీగ్ విద్యవైపు అడుగులు వేసి ఎలా బయోటెక్నాలజీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకునేలా చేసిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆమె కథ నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా భారతదేశంలో పోటీ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆమె కథ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. నిజానికి ప్రజ్ఞ 2016లో 17 ఏళ్ల వయసులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసింది, కానీ మెడికల్ లేదా డెంటల్ కళాశాలలో ప్రవేశం పొందడంలో విఫలమైంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ విద్యా వాతావరణంలో పెరిగిన ప్రజ్ఞ కూడా చాలా మంది విద్యార్థుల మాదిరిగానే, ఈ ఎదురుదెబ్బ బయాలజీ, హెల్త్కేర్ రంగాలలో తన కెరీర్ ఆశయాలను ముగించిందని చాలా బాధపడింది. ఆమె ఓటమి తన కుటుంబాన్ని సైతం తీవ్రగా ప్రభావితం చేసింది. సైన్స్ చదివే విద్యార్థులు నీట్ పరీక్షని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావిస్తారు. అయితే ప్రజ్ఞ ఆ పరీక్షను మరోసారి ప్రయత్నించి చూడటం వంటి వాటికి బదులుగా జీవశాస్త్రంపై ఉన్న ఆసక్తికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పయనమైంది. అక్కడ ప్రముఖ ఐవీ లీగ్ సంస్థలలో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది.ప్రస్తుతం ఆమె అమెరికాలోని కార్పొరేట్ బయోటెక్నాలజీ పరిశ్రమలో నిపుణురాలిగా పనిచేస్తోంది. అందరిలానే పాఠశాల విద్య తర్వాత డాక్టర్ అయ్యే సంప్రదాయ నీట్ ప్రవేశపరీక్ష వైపుకు వెళ్లింది..కానీ అనుకోని ఓటమి ఆ దారిని క్లోజ్ చేసింది. ఆ ఎదురుదెబ్బ తన జీవితాన్ని గొప్ప యూటర్న్ తిప్పే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్ పెట్టింది. అలాగే తాను కోరుకున్నట్లుగానే ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కెరీర్ని నిర్మించుకుంది. ఒక విద్యా పరీక్షలో వైఫల్యం ఒక వ్యక్తి భవిష్యత్తు విజయాన్ని లేదా ఆనందాన్ని నిర్ణయించదనే వాస్తవాన్ని తన గెలుపుతో చాటిచెప్పిందామె. కాగా, అత్యంత పోటీతత్వ, ప్రతిష్టాత్మకమైన ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల కలిగిన మానసిక వేదన..దాన్నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి డ్రీమ్ కెరీర్ని చేరుకోవడం వరకు సాగిన ఆమె కెరీర్ జర్నీ విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఉందంటూ నెటిజన్లు ప్రజ్ఞను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు సైన్స్, హెల్త్కేర్, బయోటెక్నాలజీ రంగాలలో కెరీర్లు కేవలం నీట్ ద్వారా డాక్టర్ అవ్వడం వరకే పరిమితం కావు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. View this post on Instagram A post shared by Pragya Gupta (@pragya.gupta) (చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
ఆమె ఐస్క్రీమ్ బ్రాండ్కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్క్రీమ్ బ్రాండ్తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్క్రీమ్లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్క్రీమ్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..) -
జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..
జీవితమంతా వైఫల్యాలు అడగడుగున పలికరిస్తూనే ఉన్నా వదలిపెట్టని ధీరుడి కథ. అదేంటి అన్ని పెయిల్యూర్స్ ఎదుర్కొటే ధీరుడు, శూరుడు అంటారేంటి అనుకోకండి. ఎందుకంటే గెలిస్తే వాట్ నెక్స్ట్ అంటూ సాగిపోతావు..అదే ఆపకుండా ఓటమి హగ్ ఇస్తూ ఉంటే..పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాలంటే అజేయమైన ఓర్పు, ఆత్మ విశ్వాసం కావాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు జాలిచూపులతో సానుభూతి చూపితే, మరికొందరు నీ వల్ల కాదు అన్న విమర్శల బాణాలు.. అయినా సరే డోంట్ కేర్ అంటూ ముందుకు సాగాలంటే ఆకాశమంత ధైర్యం కావలి. అందుకు ఉదాహరణ ఈ టెకీ. అతడి కథ వింటే..ఫెయిల్యూర్లు, రిజెక్ట్లు చూసినోళ్లే గొప్పోళ్లు అని కచ్చితంగా అంటారు. మరి అతడి కథేంటో చకచక చదివేద్దామా..!.చాలామంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రారంభ విద్యా మైలురాళ్లలా విజయానికి అంతిమ కొలమానంగా ఉంటే..హర్యానాలోని రోహ్తక్కు చెందిన రిజుల్ సింగ్ మాలిక్ విషయంలో మాత్రం అలా కాదు. ఎడతెగని ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో అందుకున్న గొప్ప గెలుపు రికార్డు అతడిది. అతడు పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. రిజుల్ తన పాఠశాల విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వసంత్ కుంజ్లో పూర్తి చేశాడు.ఆ తర్వాత అందరిలానే ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యాడు. మొదటిసారి ఓటమి ఎదుర్కొనడంతో మరోసారి ప్రయత్నించాడు. ఈ సారి హోమ్ ట్యూటర్, ఒక ఏడాది వృధా చేసుకుని లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని మరి ప్రిపేరయ్యాడు. అయినప్పటికీ ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కానీ ఇంతలా ప్రిపేరైనా..కనీసం కటాఫ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు రిజుల్. పైగా ఒక ఏడాది వృధా చేసుకోవడం బంధువులు, మిత్రులు అంతా ఒకటే విమర్శించడం ప్రారంభించారు. పాపం రిజుల్ ఆ అవమానం తట్టుకోవడం సాధ్యం కాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు కూడా. అయితే 18 ఏళ్ల వయసులో రాసే ప్రవేశ పరీక్ష కెరీర్లో రాబోయే 40 ఏళ్లను నిర్దేశించదని గ్రహించి బీటెక్ ఐటీ చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఆ జేఈఈ ఫెయిల్యూర్ తలుచుకున్నప్పుడల్లా అతడిని బాగా మెలిపెడుతుండేది. ప్రతీదాంట్లో.. రెండు మూడు సార్లు వైఫల్యమేఅయితే 2019లో జరిగిన బర్కిలీ సమ్మర్ స్కూల్ అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు. అక్కడ అతనికి డేటా సైన్స్తో మొదటిసారిగా గట్టి పరిచయం ఏర్పడింది. అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ (UC Irvine లేదా UCI)అమెరికాలో అకడమిక్ ప్రొబేషన్) ప్రవేశం పొందడం అతడి లక్ష్యంగా మారింది. అందుకోసం జీఆర్ఈఈకి సన్నద్ధమయ్యాడు. అయితే అది కూడా రిజుల్కు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఆ పరీక్షనురాశాడు. మొదటి ప్రయత్నంలో 303, రెండవ ప్రయత్నంలో 305, మూడవ ప్రయత్నంలో 307 దాటి, చివరకు నాల్గవ ప్రయత్నంలో 308 స్కోర్ చేశాడు. అన్నిసార్లు రాయడంతో మరోసారి జీఆర్ఈకి రెడీ అవుతున్నా అని చెప్పాలంటే భయపడేవాడు. అయితే అనుకోకుండా యూసీ ఇర్విన్ నుండి అంగీకారం రావడంతో ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. అయితే అక్కడి అధికారి స్కోరు నిజమైన విజయం కాదని, నువ్వు పట్టువదలకుండా రాయడమే అసలైన గెలుపు అని బదులిచ్చాడు. పాపం యూసీ ఇర్విన్లోని ఎంఎస్ ప్రోగ్రామ్ నుంచి కూడా మళ్లీ సవాళ్లు మొదలయ్యాయి. సరిగ్గా అమ్మ పుట్టిన రోజు అని భారత్కు వస్తే..తన GPA (Grade Point Average) అకడమిక్ ప్రతిభ 2.8కి పడిపోవడంతో, ఆ అకడమిక్ ప్రొబేషన్లో ఉంచేశామని, మెరుగుపడకపోతే తదుపరి చర్యలు ఎదుర్కొనక తప్పదని మెయిల్ వచ్చింది. దాంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఉత్సాహం కాస్తా ఉసురుమంది గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా అటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. పైగా అందరు ఉత్తీర్ణులయ్యారు, తానొక్కడినే పరాజితుడిగా ఉండిపోయానంటూ నాటి సంఘటనను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అదీగాక అమెరికాలో జాతివివక్ష వంటి పలు సవాళ్లు కూడా తోడవ్వడంతో తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. చివరికి తన జీపీఏను మెరుగుపరుచుకుని విజయవంతంగా తన అకడమిక్ని పూర్తి చేశాడు. ఇక తక్షణమే ఉద్యోగ వేట అందరి కంటే ముందు మొదలు పెట్టాను గానీ, ప్రతిది రిజెక్ట్ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడగా చివరికి ఓ ఇంటర్న్షిప్కి అర్హత లబించినట్లు తెలిపాడు. అలా ఈవై, వాల్మార్కట్ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ పనిసంస్కృతి గొప్ప పాఠాలే నేర్పాయి. తన సహోద్యోగులు, మేనేజర్ నుంచి చాలా తక్కవుమద్దతే లభించేదని పేర్కొన్నాడు. ఒక సందర్భంలో, తాను సహాయం కోసం ఒక సీనియర్ను సంప్రదించగా, ఆ విషయాన్ని తన మేనేజర్ వరకు తీసుకెళ్లి చివాట్లు, నిందలు పడేలా చేశాడంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. గూగుల్లో జాబ్ కొట్టడం కోసం..ఆ అనుభవం భవిష్యత్ కార్యాలయాల పట్ల ఎలా ఉంటే బెస్ట్ అనేది తెలుసుకోగలిగానని న్నారు. దాంతో మంచి పనిసంస్కృతి ఉండే ఉద్యోగ కోసం అన్వేషించే పనిలో పడ్డట్లు తెలిపాడు. ఆ క్రమంలోనే గూగుల్లో జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడట అందుకోసం ఏ పదో, 20 కాదు ఏకంగా 520 సార్లకు పైగా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తనని ప్రోత్సహించింది మాత్రం తన కాబోయే ప్రియురాలు, తల్లిదండ్రులేని అంటున్నాడు. వాళ్లిచ్చిన అండదండలతో వెనక్కి తగ్గకుండా గుగుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు వివరించాడు. అలా ఓ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో, తన వాల్మార్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ఆఫర్ లెటర్ పంపబడుతోందని ఫోన్ కాల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. గూగుల్లో జాబ్ రాగానే తన కాబోయే భార్య ఖుషీకే ఫోన్ చేశానని, ఆ తర్వాత అమ్మనాన్నలకు చేసినట్లు తెలిపాడు. ఎందుకంటే అన్ని రిజెక్షన్లు రావడంతో నాకే ఎందుకు జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిజుల్ ప్రియురాలు ఏంకాదు, కచ్చితంగా గెలుస్తావ్, ఆఫర్ లెటర్ అందుకుంటావ్ అంటూ ధైర్యం చెబుతూనే ఉండేది, ఒక్కసారి కూడా పోనీలే వదిలేయ్ అన్న మాట తన నోటినుంచి రాలేదంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇతడి కథ చూస్తుంటే హాలీవుడ్ మూవీలోని ఒక కొటేషన్ గుర్తొస్తోంది. జీవితం అంటే "ఎంత బలంగా కొట్టావన్నది కాదు, ఎన్ని ఎదురదెబ్బలు తగలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే" అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కదూ. ఎన్ని వైఫల్యాలు రానీ పట్టుదలతో సాగేవాడి ఎదురేలేదు, పైగా ఏదో ఒకనాటికి విజయం తథ్యం అనేది జగమెరిగిన సత్యం. View this post on Instagram A post shared by Rijul (@rijulsinghmalik_) (చదవండి: కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!) -
ఎవరీ ర్యాన్ కోహెన్..? కాలేజీ డ్రాపౌట్ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు..
కాలేజ్ డ్రాపౌట్ కాలిఫోర్నియాలో శాన్హౌస్ కేంద్రంగా పనిచేసే ఒక అమెరికన్ బహుళజాతి ఇ-కామర్స్ సంస్థ కొనడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అతడిపేరు హాట్టాపిక్గా మారింది. ఎవ్వరూ కొనమని కోరకపోయినా..నేరుగా బిడ్ వేయడంతో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతనెవరంటే..గేమ్స్టాప్ సీఈఓ ర్యాన్ కోహెన్ ఏకంగా 56 బిలియన్ డాలర్లు(రూ. 5 లక్షల కోట్లుపైనే) విలువ చేసే ఈబేను కొనడానికి బిట్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నగదు, స్టాక్ల 50-50 నిష్పత్తిలతో కలిపి ఒక్కో షేరుకు రూ. 11 వేలు చెల్లించేలా బంపర్ ఆఫర్ ఇస్తానంటూ ఈబే బోర్డుకు లేఖ రాశారు. దాంతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కాలేజ్ డ్రాపౌట్ బిలియనీర్ ఎవరా అంటూ అంత చర్చించుకోవడం మొదలుపెట్టారు. ర్యాన్ కోహెన్ ఎవరంటే..ఆయన స్వస్థలం కెనడాలోని మాంట్రియల్. ప్రస్తుతం సుమారు 4.2 బిలియన్ డాలర్లు(రూ. 39 వేల కోట్లు) సంపద కలిగిన 40 ఏళ్ల పారిశ్రామికవేత్త. కాలేజీ చదువును పూర్తిగా వదిలేసి, ఒక అసాధారణ మార్గంలో బోర్డు స్థాయికి చేరుకున్నారు. ఆయన రోవన్ యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ తర్వాత చదువు మానేశారు. డిగ్రీకి బదులుగా, అతను చ్యూయీని నిర్మించి, 2017లో దానిని పెట్స్మార్ట్కు 3.35 బిలియన్ డాలర్లు(రూ. 31 వేల కోట్లు)కు విక్రయించాడు. ఆ తర్వాత అతను గేమ్స్టాప్ మీమ్-స్టాక్ పునరుద్ధరణలో కీలకంగా మారారు. ఆయన నాయకత్వంలోనే గేమ్స్టాఫ్ రూ. 3 వేల కోట్ల నష్టం నుంచి రూ 4 వేల కోట్లకు పుంజుకుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ కంపెనీ 2026 ప్రారంభంలో మొత్తం 470 యూఎస్ స్టోర్లను కలిగి ఉంది. దాంతో ఇప్పుడు అతను గేమ్స్టాప్ కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఈబే కంపెనీని నడపాలని, దానిని అమెజాన్కు సరైన పోటీదారుగా మార్చాలని కోరుకుంటున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.అంతేగాదు కోహెన్ తాను రాబోయే కొన్నేళ్లపాటు, గేమ్స్టాప్ పునరుద్ధరణలో ఎంతగా దృష్టి పెట్టానో, అలాగే ఈబేపై కూడా దృష్టి పెడతానుని అన్నారు. తాను ఈబేను వందల బిలియన్ల డాలర్ల విలువైన సంస్థగా మార్చాలని చూస్తున్నా అని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈబే బోర్డు సోమవారం ఈ ఆఫర్ను సమీక్షిస్తానని తెలిపింది. ఇక కోహెన్ మాత్రం ఈబేను తాను ఇంటి నుంచి కూడా నడపగలనని ధీమా వ్యక్తం చేయడం విశేషం. అది 1995లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే కనిపిస్తుందని విమర్శించారు. తాను మార్కెటింగ్, ఉత్పత్తి అభివృద్ధి, ఇతర నిర్వహణ ఖర్చులను తగ్గించి లాభాల బాట పట్టించగలనని చెబుతుండటం విశేషం. (చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు ముగింపు..! ఆ కారణంతోనే..) -
జగన్ ను ఫాలో అయ్యి, TVK విజయ్ సక్సెస్ స్టోరీ
-
సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్లో టాపర్గా!
కొందరు ఎలాంటి శారీరక లోపం లేకుండా, సమస్త సౌకర్యాలు ఉండి విద్యలో పెద్దగా రాణించలేక చతికిలపడుతుంటారు. ట్యూషన్లని, స్పెషల్ క్లాస్లని చెప్పించినా.. కొందరికి వచ్చే మార్కులు అంతంత మాత్రమే. కానీ ఈ కుర్రాడు. సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..మొత్తం శరీరం తనకు సహకరించే పరిస్థితి లేకున్నా కూడా పదోతరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. పైగా తనకు ఈ పరిస్థితి లేకుంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాడిని అని చెబుతుండటం విశేషం. ఆ విద్యార్థే జార్ఖండ్లోని గొడ్డాకు చెందిన ఫైజాన్. తీవ్రమైన సెరిబ్రల్ పాల్సీ ఉన్నప్పటికీ, 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93.8 శాతం మార్కులు సాధించి, దివ్యాంగుల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. శరీర కదలికల సవాళ్లను అధిగమించి, నోటితో పెన్ను పట్టుకుని రాసి ఇన్ని మార్కులు తెచ్చుకోవడం విశేషం. తన అనారోగ్య పరిస్థితి వల్లే ఇంతకు మించి సాధించలేకపోయానని, లేదంటే ఇంకా ఎక్కువ మార్కులే వచ్చేవని అంటున్నాడు. అంతేగాదు ఫైజాన్ చేతితో రాసే విధానానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఫైజాన్ గురించి వివరించారు. ఇక ఫైజాన్ తాను కొన్ని పరీక్షల్లో బొమ్మలు గీయలేకపోయానని, ముఖ్యంగా రేఖచిత్రాలు నోటితో స్పష్టంగా గీయడంలో కాస్త తడబడ్డట్లు వెల్లడించాడు. కాగా, జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ (JAC) గురువారం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పరీక్ష ఫలితాలను ప్రకటించింది, మొత్తం ఉత్తీర్ణత శాతం 95.27గా నమోదైంది.సెరిబ్రల్ పాల్సీ అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ ప్రకారం, సెరిబ్రల్ పాల్సీ అనేది శిశువుగా ఉన్నప్పుడు లేదా చిన్నతనంలోనే కనిపించే ఒక మెదడు రుగ్మత. ఇది శరీర కదలికలు, కండరాల సమన్వయంపై శాశ్వతంగా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి కదలికలను నియంత్రించే, శరీర భంగిమ సమతుల్యతను కాపాడే మెదడు సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తుంది.VIDEO | Jharkhand boy overcomes cerebral palsy to top Jharkhand Class 10 boards. Holding a pen in his mouth, Faizan has overcome challenges that many regular physically able students would find difficult.He has topped the Class 10 board examinations in Jharkhand under the… pic.twitter.com/WXrfElGdCL— Press Trust of India (@PTI_News) April 24, 2026 (చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!) -
వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!
మురికివాడల్లో పెరిగే నిరుపేద బాలబాలికల్లో అపారమైనే తెలివితేటలు ఉంటాయనేందుకు మరో నిదర్శనం ఇది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ..ఊహకే అందని విధంగా బోర్డు ఎగ్జామ్లో టాపర్గా నిలవడం మామాలు విషయం కాదు కదా. బహుశా ఈ అమ్మాయి భవిష్యత్తులో మరో స్లమ్డాగ్ మిలియనీర్గా అవతరిస్తుందేమో..!. ఇంతకీ ఎవరా ఆ అమ్మాయ్ అంటే..బోఫాల్లోని భీమ్ నగర్ అనే ఒక మురికవాడకు చెందిన అమ్మాయి 18 ఏళ్ల చాందిని విశ్వకర్మ. మధ్యప్రదేశ్ బోర్డు ఎగ్జామ్2026లో కామర్స్ విభాగంలో ఆమెకు వచ్చిన మార్కులు తెలిస్తే విస్తుపోతారు. ఆ అమ్మాయి మురికివాడలకు చెందిందేనా అనే అనుమానం వస్తుంది. కటిక దారిద్య్రం మధ్య కష్టపడి చదివి విజయం సాధించిన ఆమె కథ ప్రతిఒక్కరికి స్ఫూర్తి. చాందిని తండ్రి రోజువారీ కూలీ. వడ్రంగి పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదన అరకొరగానే సరిపోతుంది ఇంటికి. చెప్పాలంటే కొద్దిపాటి అవసరాలకు కూడా అక్కరకు రాదు అతడి సంపాదన. ఇంట్లో ఇంతటి ఆర్థిక బాధలు ఉన్నా.. చదువుపైనే అచంచలంగా దృష్టి సారించింది. ఇంటర్లో విద్యార్థులంతా వివిధ కోచింగ్ సెంటర్లు, ఇతర వనరులపై ఆధారపడగా, ఆమె మాత్రం నిరుపేద పిల్లల కోసం ఉద్దేశించిన ఉచిత పాఠశాల అయిన గురుదేవగుప్త శిక్షా కేంద్రం చదువుకుంది. ఆమె అధ్వాన్నమైన జీవన పరిస్థితులు కారణంగా మిణుకుమిణుకుమనే వీధి దీపాలు, దోమల బెడద మధ్య అహర్నిశలు కష్టపడి చదివింది. ఆ కష్టమే ఆమెను మధ్యప్రదేశ్ ఇంటర్ బోర్డు ఎగ్జామ్లో 98.8% మార్కులతో టాపర్గా నిలిచేలా చేసింది. ఆమె కామర్స్ విభాగంలో 500 మార్కులకు 494 మార్కులతో (98.8%) అసాధారణమైన స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గెలుపు అసాధారణమైనది. పెద్దపెద్ద కాలేజీల్లో చదువుకునే విద్యార్థులందర్ని వెనక్కి నెట్టి మూరిక వాడల నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం మాటలకందని విజయం కదూ..!.(చదవండి: ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్గా..!) -
ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్గా..!
వైవాహిక జీవితంలో ముసిరిన చీకట్లు ఊపిరి సలపనివ్వలేదు. పోనీ పిల్లలు పుట్టాకన్నా.. తన స్థితి మారుతుందనుకుంటే మరింత నరకప్రాయమైంది. చేతిలో ఇద్దరు పిల్లలతో అక్కడే ఉండాలా? బయటకు వచ్చేయాలా? అన్న మీమాంస..ఇక తప్పని స్థితిలో ఇంటి నుంచి ఒంటరిగా ఇద్దరి పిల్లలతో బయటపడింది. అలా అనాడు నిస్సహాయ స్థితిలో అందరి జాలి చూపులతో కనిపించిన ఆ అభాగ్యురాలు.. ఇవాళ అందరు చేతులెత్తి సలాం కొట్టే పొజిషన్కి చేరుకుంది. ఓ జిల్లాకే అధికారిగా పాలన చేస్తూ..స్ఫూర్తిగా నిలిచారామె. పరిస్థితులు మన జీవితాన్ని తలకిందులు చేస్తాయేమో..కానీ మన మనః స్థితిని కాదు అని అంటారామె.ఆ అసామన్య ధీరురాలే సవితా ప్రధాన్. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లా మడై గ్రామంలో ఓ ఆదివాసి కుటుంబంలో పెరిగారు. తండ్రి వరి కోయడం, బీడి ఆకులు ఏరడం, మహువా పువ్వులు సేకరించడం వంటి పనులు చేస్తుంటాడు. ఓ పల్లెటూరి అమ్మాయిలా పెరిగినా సవితా ఇంటర్ పూర్తి చేసిన కొద్ది రోజులకే 16వ ఏటనే పెళ్లి చేశారు. అది కూడా తన కంటే పదకొండేళ్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేశారు. అయితే అత్తగారింట్లో ఆమె జీవితం నరకప్రాయంగా ఉండేది. భర్త, అత్తమామలు, ఆడపడచు వేధింపులకు తాళ్లలేకపోయింది. పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుందని నచ్చచెప్పేవారు తల్లిదండ్రులు. ఇద్దరు కుమారులు అథర్వ, యూజుస్లు పుట్టాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా, మరింత దిగజారింది. ఇక తన వల్ల కాదంటూ ఇద్దరు పిల్లలతో బయటకొచ్చేసింది. చాలా తక్కువ వస్తువులతో బయటకొచ్చిన ఆమె ఒక బంధువు ఇంట్లో చేరి స్థానిక బ్యూటీపార్లర్లో పనిచేసింది. అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న సవితకు ఎలాంటి భరోసా లేదు. కనీసం ఆర్థిక సాయం కూడా లేదు. పైగా ముందుకు సాగడానికి స్పష్టమైన మార్గం కూడా లేదు. తనకు తన పిల్లలకు ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలనే అచంచలమైన సంకల్పం మాత్రమే ఉంది. అదే ఆమెను ధైర్యంగా నడిపించేది. ఇంటర్తో ఆపిన చదువుని మళ్లీ కొనసాగించాలని నిశ్చయించుకుంది. ఎక్కువ గంటలు పనిచేస్తూ..మరోవైపు తన కుమారులను ఒంటరిగా పెంచుతూ చదువు కొనసాగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన పరీక్ష అయినా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరవ్వడం ప్రారంభించింది. అయితే ఎలాంటి కోచింగ్లు లేవు, కనీసం విద్యాపరమైన మద్దతు కూడా లేదు. తీరిక సమయంలోనే చదువుకోవడం ఒక్కటే తప్ప ఇంకే వెసులుబాటు లేదు. అయినప్పటికీ 2005 ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారామె. అప్పుడామెకు పోలీస్ సర్వీస్ స్థానంలో పోస్ట్ వచ్చింది. అయితే సవితకు పరిపాలన సేవ చేయడమే ఇష్టం అందుకని మరోసారి 2006లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తను కోరుకున్న పోస్ట్ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 83వ ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్ పరిపాలన సర్వీస్ అధికారిణిగా స్థానం పొందారు. ఆమె తన వృత్తి జీవితాన్ని నరసింగ్పూర్ జిల్లాలోని గోటేగావ్ మున్సిపల్ కౌన్సిల్లో ప్రారంభించారు. ఆ తర్వాత గ్వాలియర్లోని పట్టణ పరిపాలన అభివృద్ధి శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఐఏఎస్ కాదు..అయితే సవితా కథను పలు మీడియాల్లో ఐఏఎస్గా అభివర్ణించాయి. ఆ విషయాన్ని స్పష్టంగా చేసేందుకు మళ్లీ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. తాను మధ్యప్రదేశ్ పరిపాలనా సేవా అధికారిణి అయిన PCS అధికారిణిని మాత్రమేనని, భారత పరిపాలనా సేవ (IAS) సభ్యురాలిని కాదని స్పష్టం చేశారు. PCS అంటే ప్రధానంగా ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (Provincial Civil Service) అని అర్థం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్వహించే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక సవితా భవిష్యత్తులో ఐఏఎస్గా పదోన్నతి పొందే అవకాశం ఉన్నప్పటికీ..ప్రస్తుతానికి తాను ఏ హోదాలో ఉన్నానో దానికే గర్విస్తున్నానని క్లియర్గా చెప్పారు. అయితే పలు మీడియా కథనాల్లో తనను ఐఏఎస్ అధికారిగా చెబుతూ ఏవేవో రాసేశారని, అదంతా కరెక్ట్ కాదంటూ తన స్టోరీని చెప్పుకొచ్చారామె. ఇక సవితా ప్రధాన్ కథ అసంతృప్తికరమైన వైవాహిక బంధం, చేతిలో ఇద్దరి పిల్లల బాధ్యత అయినా జీవితంపై ఆశ వదులుకునేందుకు ఇష్టపడ లేదు. తనకెదురైన కష్టాలకు ఎదురెళ్లి మరీ..శివంగిలా పోరాడింది. పోనీ పుట్టింట వాళ్లు సైతం ఆదుకోలోని పరిస్థితే అయినా..తన తలరాతను చూసి తిట్టుకుంటూ కూర్చోలేదు. ఎలాగైన తన జీవితాన్ని కన్నీళ్లమయంగా కాదు కాంతిమయం మార్చుకోవాలి, ఆనందకరంగా జీవించాలి అని అనుకుంది. కోరుకున్నట్లుగానే సాధించింది, "దటీజ్ సవితా" అని అనిపించుకున్నారామె.(చదవండి: తొలి అంధ బధిర న్యాయవాది..! చిమ్మ చీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!) -
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..) -
నిజమైన ధైర్యం, తిరుగులేని శక్తికి కేరాఫ్ ఆమె..!
సకల సౌకర్యాలతో ఎటువంటి వైకల్యం లేకుండా సాధించిన విజయాలను ఎన్నో చూసి ఉంటాం. కానీ కడు పేదరికం, ఓ పక్క వైకల్యంతో సతతమతమై చిన్నారులు..ఏదో సాదించాలన్న ఆశతో బతుకుతున్న వైనం మనల్ని ఎంతగానో కదలిస్తుంది. పైగా అలాంటి వాళ్లు సాధించి విజయాలు అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, ప్రశంసనీయమైనవి కూడా. అలాంటి వ్యక్తులు అసామాన్య ధైర్యానికి, తిరుగలేని శక్తికి అర్థాన్నిచ్చేలా నిలబడతారు, గెలుస్తారు అని చెబుతున్నారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేరణాత్మక కథలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి కూడా మనసుని తాకే సరికొత్త స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకొచ్చారు. తనకు నిరాశనిస్ప్రుహలు కలిగినప్పుడల్లా అలాంటి మహోన్నత వ్యక్తుల వైపుకి చూస్తానంటూ ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అనే పారా ఆర్చరీ కథను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆనంద్ మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. రోజువారీ కూలీ అయిన ఒక మేస్త్రీ కుటుంబంలో జన్మించిన పాయల్ బాల్యం అంతా కష్టాలతో నిండిపోయింది. కేవలం ఎనిమిదేళ్ల వయసులో, విద్యుదాఘాతానికి గురై తన నాలుగు అవయవాలనూ కోల్పోయింది. నిజానికి ఆమె ఎదుర్కొన్న ప్రమాదం జీవితానికి ముగింపు పలికేలా చేసే దారుణమైన ఘటన. అయితే పాయల్ తన పరిస్థితిని ధిక్కరించేలా అద్భుతమైన ఆరంభానికి నాంది పలకడం విశేషం. ఆమె నేరుగా ఈ విలువిద్య శిక్షణలోకి రాలేదు. ఆమె మొదటగా తన ఐడెంటీటిని చిత్రీకరణతో తెచ్చుకుంది. అవయవాలు లేకపోయినా..పట్టుదలతో చిత్రాలు గీయాలన్న ఆమె తాపత్రయం అందర్నీ కట్టిపడేసేది. ఆ విలక్షణ ప్రతిభను శీతల్ దేవికి శిక్షణ ఇచ్చిన కుల్దీప్ వేద్వాన్ గుర్తించారు. ఆమె పట్టుదల, స్ఫూర్తిని గుర్తించి, పారా ఆర్చరీ శిక్షణతో ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గనిర్దేశం చేశారు. అలా అలుపెరగని పట్టుదలతో పాయల్ తన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. కాలక్రమేణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండిటిని పెంపొందించుకుంటూ..ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె సామర్థ్యాలు ప్రపంచానికే తెలిసేల చేసిన కీలక మలుపు ఏప్రిల్ 2026లో బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్. ఆ పోటీల్లో ఫైనల్కు చేరుకుని తన ఆరాధ్య దేవత అయిన శీతల్ దేవిని ఎదుర్కొని, ఓడించింది. అలా ఆ పోటీల్లో పాయల్ స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపైకి అద్భుతంగా అడుగుపెట్టింది. Here is that moment!! Payal Nag receives her GOLD medal at Bangkok and the national anthem plays.And right beside her, Sheetal - gracefully helping move her wheelchair.Two champions. One podium. One unforgettable frame.Pure inspiration. ❤️ pic.twitter.com/wrobtOCSIL— Manas Muduli (@manas_muduli) April 6, 2026 అంతేగాదు ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్గా ఘనత అందుకుంది పాయల్. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ కోచ్ కుల్దీప్ వేద్వాన్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృత్రిమ కాళ్లతో ఆపరేట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్లును తయారుచేశారు. ఇందులో భాగంగా, విల్లును పైకి ఎత్తడంలో సహాయపడటానికి ఆమె కుడి కృత్రిమ కాలుపై ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పరికరాన్ని, అలాగే శీతల్ మాదిరిగానే ఛాతీ నుంచి విల్లును విడుదల చేసే యంత్రాంగాన్ని కూడా అమర్చారు. ఆమెను ఆ పరికరాలకు అలవాటు చేయడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని వేద్వాన్ వెల్లడించారు. పాయల్ కేవలం 2023లో శిక్షణ ప్రారంభించి..జస్ట్ మూడేళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడే స్థాయికి ఎదిగి, విజయకేతనం ఎగరవేసింది. అని పోస్ట్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు తనకు ఎప్పుడైనా నిరాశగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు నిలదొక్కుకోవడానికి, సరైన దృక్పథాన్ని పొందడానికి పాయల్, శీతల్ సక్సెస్ జర్నీల వైపు చూస్తానని అన్నారు. వీళ్లు ఒక్కరోజుకే పరిమితమై స్ఫూర్తిప్రదాతలు కాదని, అసాధారణమైన అడ్డంకులను చేధించిన మహోన్నతమైన క్రీడాకారిణులని, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు మహీంద్రా.Payal Nag.Daughter of a daily-wage mason from Odisha. Electrocuted at the age of eight. Lost all four limbs.And then, found a bow.Spotted through her paintings by coach Kuldeep Vedwan, the same man who shaped world champion Sheetal Devi. Defeated her idol Sheetal Devi at… pic.twitter.com/KdWGcuAJ9X— anand mahindra (@anandmahindra) April 6, 2026 (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!
ఐఐటీ జేఈఈలో ఫెయిల్ అయ్యి యూట్యూబ్లో ఉద్యోగం సంపాదించే రేంజ్కు చేరుకున్న జర్నీని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నాడు ఓ భారత సంతత వ్యక్తి. అందుకు ఇద్దరు మహిళలు కారణమంటూ తన కథను పంచుకున్నాడు. అతడి కథ ప్రతిఒక్కరిని కదలించింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్న పోస్ట్లో అభిజయ్ అరోరా అనే వ్యక్తి తన కథను షేర్ చేసుకున్నారు. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా నగరాలు మారుతూ..తనను, తన చెల్లిని ఎలా పెంచిందో గుర్తుచేసుకున్నారు. సింగిల్ మదర్గా ఆమె పడ్డ కష్టం మర్చిపోలేనంటున్నాడు. కేజీ తరగతుల నుంచి ఐఐటీ ప్రవేశ పరీక్ష వరకు ప్రతి దశలోనూ తన తల్లి తనకు ఎలా సహాయం చేసిందో గుర్తు చేసుకున్నాడు. జేఈఈ టైంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి టీ పెట్టి ఇచ్చేదని అన్నారు. అంతలా ఆమె కష్టపడ్డా..ఫెయిల్ అవ్వడంతో తన ఆశయాలన్నీ నీరుగారిపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ ఓటమి అమ్మ త్యాగాలకి చేసిన ద్రోహంగా అనిపించేది, అందుకే మరో మార్గంలో ఎలాగైన సక్సెస్ అందుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఐఐటీ బెంగళూరులో హ్యాకథాన్లో గెలిచి మలేషియాలో ఉద్యోగం సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. బాగా సంపాదిస్తున్నప్పటికీ అదంత సంతృప్తినివ్వకపోవడంతో గూగుల్లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోరా పంచుకున్నాడు. తన అవకాశాలను మెరుపరుచుకోవడానికి ఐవీ లీగ్ ఎంబీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఐఐటి నేపథ్యం లేకుండా హార్వర్డ్ అసాధ్యమని కన్సల్టెంట్లు నవ్వారని నాటి పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ సందేహాలన్నింటిని పక్కనపెట్టి తన కలను సాకారం చేసుకోవడానికి రూ. కోటి రూపాలయ రుణం తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం పెద్ద పోరాటమే చేశానంటున్నాడు. ఉద్యోగం సంపాదించడానికి, దేశం విడిచి వెళ్లిపోవడానికి తన వద్ద 90 రోజుల సమయమే ఉన్న క్లిష్టతరమైన ఉద్యోగ మార్కెట్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాను వారానికి వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..జాబ్ సంపాదించలేకపోయానని చెప్పుకొచ్చాడు. అప్పుడే తన జీవితానికి రెండో ఆధారంగా తన భార్య రంగప్రవేశం చేసిందని చెప్పుకొచ్చాడు. తనను నిరుద్యోగిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, కొండంత తిరస్కరణల నడుమ అండగా నిలబడి తన కుటుంబాన్ని ఒంటరిగా పోషించిందని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఆమెకు తనపై ఉన్న నమ్మకమే తనను ఆవిష్కరణలు చేసేలా పురికొల్పిందని పేర్కొన్నాడు. అంతేగాదు అరోరా తన రెజ్యూమ్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ఏఐ ఆధారిత సాధానాన్ని రూపొందించి ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించిన కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించారు. చివరికి అరోరా చేసిన పని గూగుల్ దృష్టిని ఆకర్షించింది. అలా ఆయన గూగుల్లో యూట్యూబ్లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ పొందారు. ఆ ఫ్లాట్ఫాంలో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఒక కమ్యూనిటీనే ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఏఐ రంగంలోని సిలికాన్ వ్యాలీ నాయకులతో ఒక పాడ్కాస్ట్ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన తల్లిన కూడా గూగుల్ కార్యాలయానికి తీసుకువెళ్లానని పంచుకున్నారు. తన డెస్క్ గోడలపై యూట్యూబ్ లోగోని కన్నీళ్లతో అమ్మ తన వంక గర్వంగా చూసిన క్షణం మర్చిపోలేనంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. ఆ క్షణంలో తాను ఎదుర్కొన్న తిరస్కారాలు, నిద్రలేని రాత్రల కష్టం ఫలించదన్న ఆనందం కలిగిందన్నారు. తన విజయవంతమైన జర్నీని వివరిస్తూ..ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటుంటారు. కానీ తనకు ఇద్దరు మహిళలు ఉండటం అదృష్టం అని రాసుకొచ్చాడు. తనకు ఆరంబాన్ని ఇవ్వడం కోసం సర్వ త్యాగం చేసిన తల్లి, అలాగే తన ప్రస్థానాన్ని పూర్తి చేయడానికి సర్వ పణంగా పెట్టిన భార్య, ఈ ఇద్దరు లేకపోతే తాను లేనని అన్నారు. "ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఉంది. నిజానికి విజయం కష్టానికి ప్రతిఫలమే అయినా..దాని వెనుకు మన ప్రియమైన వ్యక్తుల నిశబ్ద బలం, త్యాగం, ప్రోత్సహం కచ్చితంగా ఉంటాయన్నది మీ కథ నొక్కి చెబుతోంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు". నెటిజన్లు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..! కారణం తెలిస్తే షాకవ్వుతారు) -
ప్రధాని మోదీని మెప్పించిన వంటలక్క యాదమ్మ..!
ఏదైన శుభకార్యానికి వెళ్లొస్తే మొదటగా అందరూ మాట్లాడుకునేది వడ్డించిన వంటల గురించే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. వంటకం ఎలా ఉంది..? ఎన్ని రకాలు వడ్డించారు? ఇలా ఓ చర్చే జరుగుతుంది. అయితే ఈ వంటలక్క చేయి పడితే రుచి చూడడం అవసరం లేదు. నాన్వెజ్లో బగారా, చికెన్, మటన్, ఫిష్, తలకాయ, బోటీతో పాటు వెజ్లో పచ్చిపులుసు, భక్షాలు, పప్పుచారు, పులిహోరాతో పాటు పంచభక్ష పరమాన్నాలు లొట్టలేసుకుని తింటారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్న కరీంనగర్లోని సప్తగిరికాలనీకి చెందిన ప్రముఖ క్యాటరింగ్ నిర్వాహకురాలు గూళ్ల యాదమ్మ చేతి వంటను రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ రుచిచూశారు. ఒకప్పుడు రూ.15కు దినసరి కూలీగా చేసి, ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్న యాదమ్మ చేతివంటపై సండే స్పెషల్..!!విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికైనా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు.మోదీ మెచ్చిన వంటలు2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు.వందలాది మందికి ఉపాధికిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు.ఈ జన్మలో కలిగిన భాగ్యంకరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
సక్సెస్కి చిరునామా అతడు..!
‘హాయిగా గడిచిపోతుంది కదా...రిస్క్ ఎందుకు!’ అనుకునే వాళ్లకు రిస్క్తోపాటు సక్సెస్ కూడా దూరంగానే ఉంటుంది! ‘సక్సెస్ దక్కాలంటే రిస్క్ చేయాల్సిందే’ అనుకునేవాళ్లే విజేతలవుతారు. రోహిత్ రేజి కొన్ని స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడు. ‘నేనే ఒక స్టార్టప్ ఎందుకు మొదలు పెట్టకూడదు’ అనే ఆలోచనతో నియోక్రెడ్ టెక్నాలజీస్ మొదలు పెట్టి అద్భుత విజయం సాధించాడు... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా చూసే సాంకేతికతను, సమస్యల పరిష్కారాలను ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’ రూపొందించింది. ఇది బి2బి2సి స్టార్టప్. నియోక్రెడ్ అనేది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేసే సంస్థ. మన దేశంలోని అగ్రశేణి బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, రేజర్పే, పేటీఎం వంటి ఫిన్టెక్లు ‘నియోక్రెడ్’ కస్టమర్లు.అసలైన సామర్థ్యం అదే!‘ఏఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుండి బీకామ్ పూర్తి చేసిన తరువాత ‘ఎక్స్పెడైట్’ అనే స్టార్టప్లో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు రోహిత్. ‘లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టి)’లో కొంతకాలం పనిచేసిన తరువాత టెడ్ఎక్స్ టాక్ షోలను నిర్వహించడానికి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ తరువాత బెంగళూరులో ‘ఎంఎస్ఎస్’ పేమెంట్స్ అనే స్టార్టప్లో చేరాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సొంత స్టార్టప్ గురించి ఆలోచించాడు.‘ఓపెన్ బ్యాంకింగ్ రంగంలో పరిష్కారాలను రూపొందించడంలోనే అసలైన సామర్థ్యం ఉందని గ్రహించాను’ అంటున్న రోహిత్ ఆ సమస్యల పరిష్కార వేదికగా ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’కు శ్రీకారం చుట్టాడు. ఓపెన్ బ్యాంకింగ్ అనేది సురక్షితమైన ఏపీఐలను ఉపయోగించే ఒక వ్యవస్థ. దీనిద్వారా అధీకృత థర్డ్–పార్టీ ప్రొవైడర్లు(ఫిన్టెక్ల వంటివి) కస్టమర్ల బ్యాంక్ డేటాను వారి అంగీకారంతో యాక్సెస్ చేస్తాయి.నమ్మకం ప్లస్ గుర్తింపుయెస్ బ్యాంక్తో కలిసి 2018–19లలో ప్రీపెయిడ్ కార్డులను ప్రారంభించింది నియోక్రెడ్. కోవిడ్ కల్లోల కాలం తరువాత ‘రూపే ఆన్ ది గో’ అనే పైలట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్స్ ఆఫ్ ఇండియా)తో కలిసి సహ–భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఇది మాకు నమ్మకాన్ని, గుర్తింపు రెండిటినీ ఇచ్చింది’ అంటాడు రోహిత్. కొన్ని సంవత్సరాల క్రితం రోహిత్ స్టార్టప్కు విరెంక్సియా, ఏంజెల్ ఇన్వెస్టర్ రాజేష్ జైన్ నుంచి ఎనిమిది కోట్ల సీడ్ ఫండింగ్ వచ్చింది. ప్రొడక్ట్స్లైన్స్ నియోక్రెడ్కు మూడు ఉత్పత్తి శ్రేణులు(ప్రొడక్ట్ లైన్స్) ఉన్నాయి. ఐడెంటీ మెనేజ్మెంట్ (ప్రొఫైల్ ఎక్స్), ప్రైవసీ(బ్లూటిక్), పేమెంట్స్ (కలెక్ట్ బాట్)‘నియోక్రెడ్’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు రోహిత్ రెజి,‘ఇతర దేశాలలో ఐడెంటిటీ ప్రొఫైలింగ్, ప్రైవసీ, పేమెంట్స్ ఫ్లాట్ఫామ్లను నిర్మించాలనుకుంటున్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి స్థానిక అవసరాలు తీర్చాలనుకుంటున్నాం’ అంటున్నాడు రోహిత్. దీనికి సంబంధించి సింగపూర్, దుబాయ్లోని పార్టీలతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నాడు. ‘నియోక్రెడ్’లో ప్రస్తుతం 140 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సగం మంది టెక్ నిపుణులు. ‘తమ లక్ష్యం గురించి నిరంతరాయంగా కష్టపడడం, నిబద్ధత నియోక్రెడ్ విజయానికి కారణం’ అంటున్నారు ‘అల్వారెజ్ అండ్ మార్సల్’ గ్లోబల్ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ భావిక్ హతి. సక్సెస్ అనేది కంఫర్ట్ జోన్ నుంచి రాదు. సవాళ్లను అధిగమించే శక్తి నుంచి వస్తుంది.'– రోహిత్ రెజి(చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుని ఐఏఎస్ అయ్యాడు..!
మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. మన లక్ష్యం దృఢంగా ఉండాలి. ఎంతలా పరిస్థితులు కుంగదీస్తున్నా..మన ధ్యేయం గురితప్పకూడదు. కష్టమే కష్టపెట్టలేక విసిగిపోయేలా..గెలుపు తీరాలని అందుకుని స్ఫూర్తిగా నిలవాలి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అన్షుమాన్ రాజ్.బిహార్కి చెందిన అన్షుమాన్ రాజ్ బాల్యం మొత్తం బక్సర్జిల్లా నవానగర్ బ్లాక్లో సాగింది. తండ్రి రైస్మిల్లు వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. దాంతో కనీసం ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేక ఇక్కట్లు పడుతుండేది. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన అతడి తల్లి ఒక్కరే కుటుంబానికి ఆధారంగా మారింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎంతో పట్టుదలతో చదువుకునేవాడు. నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను ప్రారంభించి అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. మెట్రిక్యులేషన్ తర్వాత, అతను జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో తన చదువును కొనసాగించి, 12వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సన్నద్ధం కావాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు. అన్షుమాన్ తన అచంచలమైన పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాడు గానీ మెయిన్స్లో సక్సెస్ కాలేకపోయాడు. ఆ ఎదురుదెబ్బకు నిరుత్సాహపడకుండా మరోసారి పయత్నించేందుకు ఢిల్లీకి మకాం మార్చాడు. రెండో ప్రయత్నంలో కూడా రాత పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాడు కానీ పర్సనాలిటీ టెస్ట్లో పాస్ కాలేకపోయాడు. దాంతో ముచ్చటగా మూడోసారి పరీక్ష రాశారు. ఆ ప్రయత్నంలో మొత్తం మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ ఐఏఎస్కు కాకుండా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పోస్ట్ పొందాడు. కానీ అన్షుమాన్ తన డ్రీమ్ని వదులుకోవడానికి ఇష్టపడక.. మరోసారి అకుంఠిత దీక్షతో సివిల్స్కు సన్నద్ధమై 2019 నాల్గో ప్రయంత్నంలో తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. 107 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. అతడి కథ..అకస్మాత్తుగా వచ్చిపడే కష్టాలకు లక్ష్యాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదని తెలుపుతోంది. ఎన్ని కష్టాలు వెంటాడినా..వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తే..కచ్చితంగా ఏదో ఒకరోజు విజయం పాదాక్రాంతం అవుతుందని ఐఏఎస్ అన్షుమాన్ కథ చెప్పకనే చెబుతోంది కదూ..!. (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!
మన చుట్టూనే ఎందరో కష్టజీవులు ఉన్నారు. తమ కష్టంతో తలరాతలనే మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నావారెందరో ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ యువకుడు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో పాడ్కాస్టర్ కుశల్ షేర్ చేసిన ఆ యవకుడి కథ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు, స్ఫూర్తిదాయకమైన కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. చుట్టూ పరిమిత వనరులు..నిరంతర శ్రమతో కూడిన జీవితం నుంచి పైకొచ్చిన యువకడి స్టోరీ ఇది.!.ఆ అబ్బాయే ముంబైకి చెందిన అభిషేక్ ఆర్ వైశ్య. టీనేజ్ వయసు నుంచే వృత్తి జీవితం మొదలైంది. సుమారు 13 నుంచి 20 సంవత్సరాల వయసులో అతను ముంబైలోని అత్యంత రద్దీప్రాంతమైన దాదర్లో కూరగాయలు అమ్ముతూ తండ్రికి చేదుడువాదోడుగా ఉండేవాడు. ప్రతిరోజు అతడి దినచర్య సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యేది. ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య కూరగాయల అమ్మకాలు చూసుకునేవాడు. ఆ తర్వాత ఏ మాత్రం విరామం లేకుండా సీఏ కోచింగ్ క్లాసులకు వెళ్లిపోయేవాడు. అలా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు క్లాసులతో సరిపోయేది. ఆ క్లాసులు ముగిశాక, అతను రోజంతా ఆర్టికల్ షిప్ శిక్షణకు కేటాయించుకునేవాడు. సీఏ కోర్సులో భాగంగా ప్రాక్టీకల్ అనుభవం కోసం చేసే సీనియర్ సీఏ వద్ద చేసే ట్రైనింగ్ ఈ ఆర్టికల్ షిప్. ఇక రాత్రి 11 గంటల టైంకి ఫ్రీ టైం దొరుకుతుంది. ఇక ఆ సమయంలో చదువుకోవడానికి సమయం కేటాయించుకునేవాడు. పైగా ఉండే గది కూడా కేవలం 150 చదరపు అడుగుల చిన్న గది. పరిమిత స్థలం, పరిమిత వనురులే అయినప్పటికీ..ఎదగాలన్న తాపత్రయం, కసి పుష్కలంగా ఉండేవి. అవి అతడిని..అంత కష్టాన్ని భరించే శక్తిని ఇచ్చేవి. అలా అతడు సీఏ ఉత్తీర్ణుడై..విదేశాలకు వెళ్లాడు. అలా ఒమన్కు వెళ్లి అక్కడ ఆరేళ్లు పనిచేసి, వృత్తిపరమైన అనుభవాన్ని పొందాడు. చివరికి వ్యవస్థాపకరంగంలోకి అడుగుపెట్టి.. సొంత వ్యాపారాలతో సంపదను పెంచుకున్నాడు. మంచి స్థాయిలోకి వచ్చాక చేసిన మొదటి పని తండ్రిని ఆ కూరగాయలు అమ్మే పని నుంచి మానిపించేయడం. ఆ తర్వాత భారత్, దుబాయ్, ఒమన్ వంటి చోట్ల మొత్త ఐదు ఫ్లాట్లు కొనుగులు చేశాడు. పైగా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్ల తోపాటు ఒమన్లో అతడికి అత్యంత ప్రజాదరణ పొందిన క్లౌడ్కిచెన్ వ్యాపారాన్ని కూడా రన్ చేస్తుండటం విశేషం. పట్టుదలతో చక్కగా కెరీర్ని తీర్చిదిద్దుకున్న అతడి కథను వివరిస్తూ..పాడ్కాస్టర్ కుశల్ ఇలా అన్నారు. అభిషేక్ను వ్యక్తిగతంగా కలవడం తనపై చెరగని ముద్ర వేసిందన్నారు. అతనిపై మరింత గౌరవం పెరిగిందని చెప్పారు. మనం కోరుకున్న లక్ష్యంవైపుకి వెళ్లడం కోసం ఎంతలా కష్టపడాలి, ఎంతటి పట్టుదల ఉండాలో తెలిసి వచ్చిందని కుశాల్లోధా అన్నారు. అతడితో సంభాషణ స్ఫూర్తిదాయకంగానే కాదు పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి ఆశయాన్ని అయినా పాదాక్రాంతం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.He used to sell vegetables at Dadar with his father from age 13-20.He used to sell vegetables early in the morning from 4 to 6 AM, then go for his CA Final classes from 7-10 AM, then go for articleship from 10 AM – 9 PM, study for a bit, and then sleep by 11 PM.He used to… pic.twitter.com/ihRK4OG39g— Kushal Lodha (@kushallodha548) March 19, 2026 (చదవండి: ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..) -
సివిల్స్లో సత్తా చాటిన దినసరి కూలీ కొడుకు..! 'ధురంధర్ 2' మూవీ..
ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్ అవ్వాలనేది ఎందరో యువత డ్రీమ్. అత్యంత కఠినతరమైన ఎగ్జామ్లో గెలుపుని అందుకోవడమే తమ ధ్యేయంగా ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అంత కష్టమైన ఎగ్జామ్లో తొలిప్రయత్నంలోనే అవలీలగా విజయఢంకా మోగించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు ఈ యువకుడు. ఇతడి గెలుపు 'ధురందర్ 2'మూవీ నటుడిని సైతం ఆకట్టుకుంది. అతడు మాములు స్ఫూర్తి కాదంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి మంచి వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఖుషీ చేసే హీరో మాధవన్ ఈసారి కూడా అలానే మంచి స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేశారు. ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో సత్తా చాటి సుబ్రమణ్య భారతి వీడియోని రీషేర్ చేస్తూ..ఆ యువకుడి అజేయమైన సక్సెస్ జర్నీని మెచ్చుకున్నారు. అందుకు సహకరించిన అతని తల్లిదండ్రులు, అతడికి లభించిన మద్దతు తదితరాలన్ని తనను ఎంతగానో కదిలించాయని, పైగా స్ఫూర్తిని పొందానని పేర్కొన్నారు. పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఎలా మార్పు తీసుకురాగలవో అనేందుకు ఆ యువకుడు సుబ్రమణ్య భారతినే ఉదాహరణ అంటూ పోస్ట్ని ముగించారు మాధవన్. హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోలో దినసరి కూలీ కుమారుడైన సుబ్రమణ్య భారతి ఉన్నారు. ఆయన తమిళనాడు ప్రభుత్వ 'నాన్ ముదల్వన్' పథకం సహాయంతో ఈ అధ్భుతమైన ఘనతను సాధించాడు. భారతి తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం విశేషం.తన సక్సెస్ జర్నీ అసాధారణమైనది అభివర్ణించాడు సుబ్రమణ్య భారతి. తాను క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను సివిల్ సర్వీసెస్ను ఎంచుకున్నానని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడానికి, ఈ పథకం, కోచింగ్ వంటి మద్దతే కారణమని పేర్కొన్నారు. తాను కేవలం 18 ఏళ్ల వయసులో, ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా ఈ సివిల్స్ ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అందుకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని, ఎందుకంటే వాళ్లు దేశానికి సాధ్యమైనంత ఉత్తమ రీతిలో సేవ చేసేలా వాళ్లు సదా ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. కాగా, భారతి తండ్రి మరియప్పన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం పేద కుటుంబమని, ఇటుకల తయారీ యూనిట్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటానని చెప్పారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన కుమారుడు ఈ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్కు సన్నద్ధమయ్యాడని అన్నారు. అందులో విజయం సాధించడానికి తమిళనాడు ప్రభుత్వ నాన్ ముదల్వన్ పథకం ఎంతగానో సహాయపడిందని అన్నారు. నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం:తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి (Skill Development), ఉపాధి అవకాశాలను పెంచే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది 18-35 ఏళ్ల యువతకు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు టెక్నాలజీ, భాషా నైపుణ్యాలు, ఇండస్ట్రీ-రెడీ కోర్సులలో శిక్షణ ఇస్తూ, ఉచిత కోచింగ్, స్కాలర్షిప్లను అందిస్తుంది. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)(చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
ఇంగ్లీష్... ఈజీగా!
ఇంగ్లీష్ అనేది హిందూ మహాసముద్రమంత పెద్దది. ఎంత నేర్చుకున్నా.... నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. కొద్దిమందికి ఇంగ్లీష్ బాగానే అర్థం అవుతుంది. కాని రెండు మూడు వాక్యాలు కూడా ధైర్యంగా మాట్లాడలేరు. కొందరు ఏదో రకంగా ఇంగ్లీష్ మాట్లాడతారుగానీ, ఆ భాషకు సంబంధించిన జ్ఞానం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అర్పిత్ మిట్టల్ ‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రూపకల్పన చేశాడు. తొలి అడుగుతోనే ఆదరణను సొంతం చేసుకున్నాడు...‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రెండు లక్షల సంఖ్యలో మంత్లీ యూజర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది చిన్న చిన్న పట్టణాలకు చెందినవారే. గూగుల్ ప్లేలో ఈ యాప్ డౌన్లోడ్లు కోటి దాటాయి. ‘స్పేస్ఎక్స్.ఏఐ’ ఫౌండర్ హోదాలో దిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నాడు అర్పిత్.‘ఎడ్టెక్ ప్లాట్ఫామ్లు ఏఐని ఫీచర్లా ఉపయోగిస్తున్నాయి. మా ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఏఐ అనేది యాంత్రికంగా ఉండదు. టీచర్లాగే వ్యవహరిస్తుంది’ అంటాడు అర్పిత్ మిట్టల్.ప్రాక్టికల్గా మాట్లాడేలా...యాప్ ఓపెన్ చేయగానే సుదీర్ఘమైన గ్రామర్ పాఠాలు వినిపించవు. ఇతరులతో సహజంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సంక్లిష్టమైన గ్రామర్ పాఠాలతో కాకుండా ప్రాక్టికల్గా, సులభంగా ఇంగ్లీష్ మాట్లాడేలా చేస్తుంది. ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్, వర్క్ప్లేస్ డిస్కషన్స్, కస్టమర్ కాల్...మొదలైన వాటి ద్వారా ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయిస్తాం. ఏ రకంగా చూసినా గురువుకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు. అయితే ప్రాక్టిస్ టైమ్పై పరిమితిని తొలగించడం ద్వారా గుడ్ టీచింగ్కు ఇది సరిౖయెన వేదిక అవుతుంది’ అంటున్నాడు అర్పిత్. అందరికి ఒకేలా అని కాకుండా ప్రతి సెషన్ పర్సనల్ యూజర్లకు అనుగుణంగా ఉంటుంది. ఈ లెర్నింగ్ యాప్ కోర్ లాజిక్ విషయానికి వస్తే....‘రిపిటీషన్ ద్వారా మాట్లాడడం అనేది మెరుగుపడుతుంటే, రిపిటేషన్లు కొనసాగనివ్వండి’ మరొకటి...‘ప్రతి లెర్నర్కు అపరిమితంగా మాట్లాడే సమయాన్ని ఇవ్వడం ద్వారా ప్రాక్టిస్ గ్యాప్ లేకుండా చూడడం’ఏ యాసలో మాట్లాడినా సరే!→ మన దేశంలో ఇంగ్లీష్ నేర్చుకునేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండు మూడు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడలేని వారి నుంచి, అనర్గళంగా మాట్లాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వారు ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యాసకుల స్థాయికి అనుగుణంగా మా జనరేటివ్ ఏఐ తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. శ్రద్ధగా నేర్చుకునేలా చేస్తుంది. వారు మాట్లాడే విధానం, ఉచ్చారణ, ఉపయోగించే పదాలు...మొదలైన వాటిని విశ్లేషిస్తుంది. ఉదాహరణకు... ఒక లెర్నర్ ప్రాథమిక వాక్యాలను సులభంగా చెప్పగలుగుతుంటే కొత్త పదాలు, జాతీయాలను ఉపయోగించి సంక్లిష్టమైన వాక్యాలు రాయడానికి ప్రయత్నించమని ఏఐ వారికి సలహా ఇస్తుంది. మన దేశంలో అనేక రకాల యాసలు ఉన్నాయి. అవి ఒకే రాష్ట్రంలో కూడా విభిన్నంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి సేకరించిన నిజమైన స్వరాలతో సిస్టమ్కు శిక్షణ ఇచ్చాం. దీనివల్ల లెర్నర్స్ పంజాబీ, బెంగాలీ, తమిళం, మరాఠీ... ఏ యాసలో మాట్లాడినా సరే, అది అర్థం చేసుకొని కచ్చితమైన ఫీడ్బ్యాక్ను అందిస్తుంది.→ పది మిలియన్ల డౌన్లోడ్ల స్థాయికి చేరుకోవడం రాత్రికి రాత్రి జరగలేదు. ఒకే ఒక్క చానెల్ ద్వారా సాధ్యపడలేదు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధించి లెర్నర్లు ఎదుర్కొంటున్న సమస్యలను 360 డిగ్రీల కోణంలో అర్థం చేసుకొని, విశ్లేషించుకొని ప్లాట్ఫామ్కు రూపకల్పన చేశాం. భయంభయంగా కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడేలా చేశాం. మన దేశంలో స్పోకెన్ ఇంగ్లీష్ సాధనాలకు భారీ డిమాండ్ ఉంది. అయితే ఎంత ఎక్కువమందికి చేరువ అవుతామనేదే అసలు సిసలు విజయం. మౌత్టాక్ మా విజయానికి ప్రధాన కారణం.→ మేము కేవలం కొన్ని భాషలను నేర్పించడానికో లేదా ప్రజలను ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం కోసం సిద్ధం చేయడానికో ప్రయత్నించడం లేదు. నిజజీవిత సంభాషణలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉదాహరణకు ఆఫీసులో మేనేజర్తో ఎలా మాట్లాడాలి, డాక్టర్కు అనారోగ్య లక్షణాలను ఎలా వివరించాలి, ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో తమను తాము ఎలా పరిచయం చేసుకోవాలి...మొదలైనవి. నిజజీవిత సందర్భాలను దృష్టిలో పెట్టుకొని పాఠాలను డిజైన్ చేయడం వల్ల లెర్నర్లు తమకు అలవాటైన వాతావరణంలో ఉన్నట్లు భావిస్తారు. దీంతో వారు ఉత్సాహంగా, వేగంగా నేర్చుకుంటారు.– అర్పిత్ మిట్టల్, ఫౌండర్, స్పేస్ఎక్స్.ఏఐ -
కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!
మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లోన్తో మేకప్ టీచర్గా... మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్ లోన్ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్ కిట్ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్లో ఉన్న మేకప్ స్టూడియోలో 12 మందికి టీచింగ్ చేస్తుంది. బ్యాచ్కు 12 మందికి టీచింగ్ ఇస్తూ వారిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్లు, పెళ్లిలకు మేకప్లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్ లోన్ తానేకడుతూ మేకప్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్ గీత మాధురికి కూడా మేకప్ వేసి ఔరా అనిపించింది. గోలీసోడా వ్యాపారంలో.. గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్నగర్కాలనీకి చెందిన ఎస్. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్ లోన్ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది. రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్ నడిపిస్తూ.. గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ మహిళ కార్యకర్తగా, సోషల్ మీడియా వారియర్గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ రూ. 35వేలతో కుట్టు మిషన్ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది. -
UPSC Topper జిన్నియా అరోరా సక్సెస్ జర్నీ గురించి తెలుసా?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 ఫలితాల్లో జిన్నియా అరోరా (Zinnia Aurora) టాప్ టెన్లో స్థానం సంపాదించి ఘన విజయం సాధించింది. శుక్రవారం (మార్చి 6, 2026) విడుదలైన ఈ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించారు. జిన్నియా అరోరా గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు:UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా మందికల. కానీ కొంతమంది మాత్రమే పట్టుదలతో తమ కలను సాకారం చేసుకుంటారు. తొలి ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ రాకపోవడంతో ఈ సారి ఆలిండియా 6వ ర్యాంకు (AIR 6). రోల్ నంబర్: 6410067. ఆమె గతంలో (UPSC 2024) 156వ ర్యాంకు సాధించారు. తన ర్యాంకును మెరుగుపరుచు కోవాలనే పట్టుదలతో మళ్ళీ పరీక్ష రాసి, ఈ సారి టాప్ 10లో నిలిచారు. అరోరా తన విజయం ద్వారా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు స్ఫూర్తిగా నిలిచారు.ఎవరీ జిన్నియా అరోరా జిన్నియా అరోరా హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఆమె కుటుంబం ప్రస్తుతం న్యూ ఢిల్లీలో స్థిరపడింది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండటంతో ఆమె పెరిగింది, చదువుకుంది అంతా ప్రధానంగా ఢిల్లీలోనే సాగింది. తండ్రి పంకజ్ అరోరా (Pankaj Aurora), ఈయన కూడా సివిల్ సర్వెంట్. తల్లి రీతూ అరోరా (Ritu Aurora).తన తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన జిన్నియా, చిన్నప్పటి నుండే ఐఏఎస్ (IAS) కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.జిన్నియా పాఠశాల విద్య ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్కృతి స్కూల్ (Sanskriti School)లో పూర్తి చేశారు. 2018-19 బ్యాచ్కు గానూ పాఠశాల టాపర్గా నిలిచారు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ వైపు మొగ్గు చూపారు. సివిల్స్లో జిన్నియా తన ఎంపికగా పొలిటికల్ సైన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ (PSIR)ను ఎంచుకుని విజయం సాధించింది.PeaceX కో ఫౌండర్ జిన్నియా పీస్ఎక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కూడా. 2020లో కోవిడ్ సమయంలో ఆమె PeaceX అనే స్వచ్ఛంద సంస్థ (NGO)తో కలిసి పనిచేశారు. ఇది ఐక్యరాజ్యసమితి (UN),వివిధ ప్రభుత్వాలతో కలిసి పనిచేసే సంస్థ. ఆమె తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆమెకు అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం, సామాజిక మార్పులపై మంచి అవగాహన ఉంది.ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని -
ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. దిగ్గజ పారిశ్రామికవేత్తల ముందు నిలబడి నా కంపెనీ విలువ రూ.300 కోట్లు అని చెప్పడం ఒక సాధారణ యువకుడికి పెద్ద సాహసమే!. డిగ్రీలు పూర్తిచేసి 30 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేస్తూ.. బరువు బాధ్యతలు మోసేవాళ్లే సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఎలాంటి డిగ్రీ లేకుండానే.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం స్థాపించండం అంటే మాటలా?, అయినా అలాంటిదే నిజం చేసి చూపించారు 'శుభం గుప్తా'. ఇంతకీ ఈయనెవరు, ఈయన స్టార్ట్ చేసిన బిజినెస్ ఏది? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.2011లో ముంబైలో ఏళ్ల యువకుడిగా 12వ తరగతి పూర్తి చేసిన శుభం గుప్తా.. అందరిలా డిగ్రీ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తండ్రి బట్టల వ్యాపారం దివాళా తీసింది. కష్టాలను ఎదుర్కోవడానికి.. జీవితంలో ఎదగడానికి కంకణం కట్టుకున్న శుభం, చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ.. బిజినెస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.యువతలో స్టైలిష్, కూల్ టీ-షర్టులపై పెరుగుతున్న ఆసక్తిని గమనించిన శుభం గుప్తా.. కొంత డబ్బుతో అక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్లలో టీ-షర్ట్స్ కొనుగోలు చేసి, విక్రయించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం గురించి బాగా తెలుసుకోవడానికి.. నేరుగా కస్టమర్లతో మాట్లాడి వారి అభిరుచులను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ఆన్లైన్ ఆర్డర్లను పంపించడం మొదలుపెట్టాడు.ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!2014లో శుభం గుప్తా చేస్తున్న వ్యాపారానికి 'బాంకర్స్ కార్నర్' (Bonkers Corner) అనే పేరు పెట్టాడు. దీనిద్వారా యువత అభిరుచికి తగిన బ్రాండెడ్ స్ట్రీట్ స్టైల్ దేశీ టచ్తో దుస్తులు విక్రయించాడు. పెద్ద మార్కెటింగ్, పెద్ద బడ్జెట్ లేకపోయినా.. కొత్త కొత్త డిజైన్స్ పరిచయం చేసి బ్రాండ్ అంచెలంచెలుగా ఎదిగింది. కాగా ఈయన కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. -
పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!
వైఫల్యం అనగానే అవమానంగా, బాధగా అనిపిస్తుంటుంది. మనకే ఎందుకిలా జరుగుతుందని నిరాశ నిస్ప్రుహలకు లోనైపోతుంటాం. అయితే ఈ వ్యక్తి వైఫల్యాలు మీద వైఫల్యాలు పకరించినప్పుడే..విజయం చేరువవ్వుతున్నట్లు లెక్క అని అంటున్నాడు. అందుకు తన అనుభవమే ఉదాహరణ అంటూ..తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడే సుమిత్ మిట్టల్ తన మొత్తం సక్సెస్ జర్నీని సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేస్తూ..తాను చేసిన జీవిత పోరాటాల గురించి భావోద్వేగంగా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ జేఈఈలో రెండుసార్లు ఫెయిలయ్యానని, అలాగే కెమిస్ట్రీ ప్రీ బోర్డు పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలిపాడు. మరోవైపు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైందని వివరించాడు. దాంతో కాల్సెంటర్లో పనిచేస్తూ..ఓ మారుమూల ప్రాంతంలో బీసీఏ పూర్తి చేశానని, ఓ చిన్న గదిలో విద్యార్థులకు బోధిస్తూ సాగిన ప్రస్థానం..నిమ్సెట్లో ఆల్ఇండియా 4వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక కాలేజ్లో ఎంసీఏ చేసే రేంజ్కు చేరుకుంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలుత ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తూ..కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడమే గాక, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే రేంజ్కు చేరుకున్నట్లు తెలిపాడు. చివరగా సుమిత్ పదేపదే వైఫల్యాలు పలకరిస్తున్నప్పుడు నిరాశ చెందకూడదని..ప్రతి ప్రయత్నం విజయాన్ని చేరువ చేసే మార్గంగా భావించాలని అంటున్నాడు. అలాగే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వైఫల్యాలనేవి..విజయాన్ని చేరువచేసే ప్రయత్నాలుగా మలుచుకుంటే..గమ్యానికి చేరుకోగలవు..అనుకున్నది సాధించగలవు అంటూ చేసిన పోస్ట్ అందరి హృదయాలను తాకింది..పైగా నెటిజన్లు నిస్సహయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.Yes, I failed IIT JEE twiceYes, I failed in chemistry pre board examYes, my family faced financial crisisYes, I worked at a call centerYes, I completed my BCA from a distant collegeYes, I just started with teaching 4 students in a very small roomBut, I got AIR 4 in NIMCET… pic.twitter.com/OOasjxAVhm— Sumit Mittal (@bigdatasumit) February 24, 2026 (చదవండి: హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!) -
నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్లో వేలమందికి ఉద్యోగం!
సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.మొదటి జీతందిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణికులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందారు. ఇదే అతని మొదటి జీతం.ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించారు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. తాను చేసిన పనికి యజమాని తన జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచారు.రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయంకున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసారు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నారు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.1700 మందికి ఉపాధి1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు! -
25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన బుక్
రాబర్ట్ కియోసాకి అంటే ముందుగా గుర్తొచ్చేది.. ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఈ బుక్.. తన జీవితాన్ని మార్చేసిందని, మిలియనీర్ను చేసిందని హెచ్బీ క్యాపిటల్ ఫౌండర్ & సీఈఓ 'హన్నా హామండ్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.13 ఏళ్ల వయసులో నా దగ్గర రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉండేది. ఈ పుస్తకం నా జీవిత దిశనే మార్చేసింది. చిన్నప్పుడే కియోసాకి నాకు హీరో అయ్యారు, అని హన్నా హామండ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. కష్టపడి పనిచేసి, ఆర్థిక జ్ఞానం పెంపొందించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాను. దీని ఫలితంగా 25 ఏళ్లకే మిలియనీర్ అయ్యానని ఆమె పేర్కొంది.నా జీవితంలో నేను ఊహించని విషయం ఏమిటంటే.. నా ఫ్రెండ్ జో పోలిష్ ద్వారా రాబర్ట్ కియోసాకిని కలుసుకోవడం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఇంటి దగ్గరలోనే కియోసాకి నివసిస్తున్నారని నాకు అప్పటి వరకు తెలియదు.ఈ సందర్భంలో ఆమె తన జీవితాన్ని తిరిగి ఒకేసారి నెమరు వేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం జీవితం దుర్భరంగా ఉండేది.ఇప్పుడు నా బాల్యంలో ఆశను నింపిన వ్యక్తి పక్కన నిలబడి ఉన్నాను. ఆ పుస్తకంలోని మాటలు నన్ను కష్టకాలంలో నిలబెట్టాయి, ముందుకు నడిపించాయని హన్నా హామండ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Hannah Hammond (@hannahbhammond) -
జిరాక్స్ షాప్ నుంచి ఏకంగా రూ.6 వేల కోట్ల బ్రాండ్..!
మనతోపాటు సామాన్యులుగా వచ్చి.. చూస్తుండగానే కోట్లకు పడగలెత్తి ఆదర్శంగా నిలుస్తారు కొందరు. వాళ్లు కూడా మనలానే పైకి ఎదిగే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొంటారు కూడా. కానీ ఆ సమయంలో కూడా ఎలాంటి తడబాటుకి లోనవ్వకుండా సరైన నిర్ణయాలతో.. ఉన్నతస్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే రామచంద్ర అగర్వాల్. వైకల్యం శరీరానికే గానీ..మనసుకు కాదంటూ..అచంచలమైన కృషితో వస్త్రపరిశ్రమలో గొప్ప సక్సెస్ని అందుకుని అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. అయనే కొల్కతాకు చెందిన రామ్ చంద్ర అగర్వాల్. 1965లో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారినపడి కింద శరీరం అంత చచ్చుబడిపోయింది. అయినా..అతడిలో కష్టపడేతత్వం..అత్యున్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష ప్రగాఢంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అధికారిక విద్యను పూర్తిచేసిన వెంటనే చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకున్నాడు. దీంతో త్వరితగతిన ఉన్నతస్థాయికి చేరుకోలేమని గ్రహించి..వస్త్రపరిశ్రమ వైపుకి అడుగులు వేశాడు. అలా కోల్కతాలో చిన్న బట్టల దుకాణం ప్రారంభించాడు. భారతీయ ఫ్యాషన్ వినియోగదారుల ట్రెండ్ని అర్థం చేసుకుంటూ..ఈ పరిశ్రమలో విజయం సాధించడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంబించాడు. అలా 2000 ప్రారంభంలో ఢిల్లీకి మకాం మార్చి..2001లో తన మొదటి విశాల్ మెగా మార్ట్ స్టోర్ని ప్రారంభించాడు. ఇది మధ్యతరగతి వ్యక్తులను ఎక్కువగా ఆకర్షించింది, చేరువైంది కూడా. దాంతో ఈ మార్ట్ కిరాణా సామాగ్రి, దుస్తులు..అనుకూలమైన ధరలకే కొనుగోలు చేసే హాట్స్పాట్గా మారింది. అలా చుట్టపక్కాల మహా నగరాల వరకు ఈ మార్ట్ బ్రాంచ్లు విస్తరించాయి. అలా తన దుకాణాన్ని విస్తరించే క్రమంలో దాదాపు భారీగా అప్పులు చేశాడు. సరిగ్గా ఆ టైంలో 2008-09లో ప్రపపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో అప్పు పెరిగిపోయింది, మరోవైపు కస్టమర్లు తగ్గిపోతున్నారు. చెప్పాలంటే రామ్చంద్రకు కఠినమైన సమయం ఇది. దాంతో 2011లో రూ. 2 వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని శ్రీరామ్ గ్రూప్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీకి దాదాపు రూ. 70 కోట్లకు అమ్మేశారు. కొత్త యజమాన్యంలోకి ఉన్నప్పటికీ విశాల్ బ్రాండ్ కొనసాగడం విశేషం. ఆ తర్వాత అగర్వాల్ వీ2 రిటైల్ లిమిటెడ్ రూపంలో కొత్త వెంచర్ ప్రారంభించాడు. మొదటి స్టోర్ జంషెడ్పూర్లో ప్రారంభించారు. అనతి కాలంలో వేగంగా పుంజుకుని లాభాల బాటలు పట్టింది. కొన్నేళ్లకు ఏకంగా వంద కోట్ల టర్నోవర్ని అందుకుంది. పైగా అనేక భారతీయ నగరాల్లో 150కి పైగా ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది. అలా 2025 కల్లా వీ2 రిటైల్ భారతదేంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ బ్రాండ్లో ఒకటిగా ఉద్భవించింది. పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6వేల కోట్ల టర్నోవర్కు మించిపోయింది. ఇంతటి బిజీ పరిస్థితుల్లోనూ ఆనందానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోడాయన. ఆయనకు అందమై భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ల సహాయ సహకారాలతోనే ఇంత పెద్దసక్సెస్ అందుకున్నానని చెబుతుంటాడు రామ్చంద్ర అగర్వాల్. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) (చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?) -
నెలకు రెండున్నర లక్ష : సొంత బిజినెస్, ఐటీ మేనేజర్ కంటే మేలే!
ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూచుంటే జీవితం ముందుకు సాగదు. అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకొని అడుగు ముందుకు వేయాలి. మన ప్రయత్నాలకు అదృష్టం కూడా కలిసి వస్తే..ఇంకేముంది విజయం మనముందు సాగిల పడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.. ఒక మధ్య తరగతి జంట ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పు గొప్ప విజయానికి నాంది పలికింది. ఎవరా జంట? ఏమా బిజినెస్ తెలుసుకుందాం.నళిని ఉనగర్ అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' వేదికగా తాను క్రమం తప్పకుండా సందర్శించే డ్రై-క్లీనింగ్ దుకాణం యజమానితో జరిగిన సంభాషణను వివరించారు. డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని భార్యాభర్తలిద్దరూ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మరో ఇద్దరు అదనపు ఉద్యోగులున్నారు. ఇండియాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్తో సమానమైన నెలవారీ ఆదాయాన్ని పొందుతున్నారని ఉనగర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి వారికి ఖర్చులన్నీ పోను నెలవారీ లాభం రూ.2.37 లక్షల లాభం వస్తుంది. సగటున, వారు ప్రతి నెలా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తారట.Yesterday, I was talking with the dry cleaning shop owner near my house, where I regularly go. He and his wife both work together, and they have two helpers on salary. I was shocked when they said they earn around ₹2,00,000 per month, which is equal to a 10+ years experienced… pic.twitter.com/BjPddpb9Me— Nalini Unagar (@NalinisKitchen) February 9, 2026నెటిజన్ల స్పందనహైదరాబాద్లోని ఇడ్లీ-దోస విక్రయించే అనేకమంది విజయగాథలను చూశాను. తన ఏరియాలో అలాంటి ఒక వ్యక్తి ఇంటి ఖరీదు కోటికిపైమాటేననీ, తాను గల్ఫ్లో దశాబ్దాలు కష్టపడినా అద్దె ఇల్లే. స్వంత వ్యాపారం చేయడం చాలా గ్రేట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. వైట్-కాలర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అనే చట్రంలో ఇరుక్కుపోయాం. కానీ ఇలాంటి కథలు చిన్నదో పెద్దదో ఒక వ్యాపారాన్ని కలిగి ఉండటం నిజమైన సంతృప్తితోపాటు, కొన్నిసార్లు చాలా ఎక్కువ ప్రతిఫలదాయకం కూడా అని ఒకరు, ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏముంది అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉంటే చిన్న వ్యాపారమైనా, లాభాలు మెండు అని మరొకరు కామెంట్ చేశారు. కాగా ఈ లెక్కలపై పెదవి విరిచిన వారు లేకపోలేదు. ‘‘నేను నా ఇంటి దగ్గర దుకాణం నడుపుతున్న నా డ్రై-క్లీనింగ్ భయ్యాతో కూడా మాట్లాడాను. అతను ఆ వైరల్ పోస్ట్ పూర్తిగా తప్పుదారి పట్టించేది అని చెప్పాడు. రూ. 2.37 లక్షల లాభం గురించి కలలు కనకండి. వాస్తవానికి, అన్ని ఖర్చుల పోనూ వాస్తవ లాభం నెలకు దాదాపు రూ. 60వేలు ఉంటుందని ఒక యూజర్ లెక్కలు చెప్పారు.ఇదీ చదవండి: ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!వైట్ కాలర్ జాబ్స్ అని, మంచి ఆదాయం అని మన గొప్ప వాళ్లం అని మురిసిపోవాల్సిన అవసరం లేదు. కష్టపడే తత్వం, వ్యాపార మెళకువలు ఉంటే ఏ పనైనా గౌరవప్రదమే, లాభదాయకమే. భారీ ఆదాయం మాట ఎలా ఉన్నా.. ఉద్యోగ భయం. ఆందోళన, అధికార్ల వేధింపులు. శని, ఆదివారాలు కూడా లాప్టాప్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు..! -
ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!
సినిమాలకు ప్రేరణ నిజ జీవిత గాథలు. కొన్ని విజయ గాథలకు ప్రేరణ సినిమాలు. అలా అచ్చం సినిమాలా సాగిన ఒక నిరుపేద జీవితం, ఆయన సక్సెస్ జర్నీ ఆ తరువాత సినిమాకు ప్రేరణగా నిలిచింది. పట్టుదల , కఠిన శ్రమతో, అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చనే స్పూర్తిని రగిలించింది. మరి ఆ విజయగాథ ఏంటో తెలుసుకుందాం పదండి.బిహార్లోని పాట్నాలోని విశున్పూర్ పక్రి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆదిత్య పాండే. ముగ్గురు సోదరీమణులలో అతను చిన్నవాడు. దృఢ సంకల్పంతో UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఈ విజయం వెనుక ఒక తిరస్కారం.. ఆ తిరస్కారంనుంచే విజయాన్ని వెదుకున్న తీరు గురించి తెలుసుకుంటే హృదయం ఉప్పొంగక మానదు.ఆదిత్య 8 , 9 తరగతులలో బాగానే చదివాడు. 10వ తరగతిలో ప్రేమ మొదలైంది. ఆ మైకంలో చదువును నిర్లక్ష్యం చేశాడు. ఫలితాల్లో వెనుకబడ్డాడు. ఫలితంగా తండ్రి అతన్ని పాట్నాకు తిరిగి పంపాడు. అటు ప్రియురాలు కూడా అవమాన పర్చింది. అది అతణ్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఎదురుదెబ్బతో తన జీవితాన్నిదిద్దుకోవడానికి వాడుకన్నాడు. ఆదిత్య తన శక్తిని కొత్త లక్ష్యం వైపు మళ్లించాలని అపుడు ప్రతిన బూనాడు. తాను కచ్చితంగా తాను ఐఏఎస్ చదవాలని.ఇంజనీరింగ్ నుండి IAS వరకు12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయ కంకర్బాగ్లో విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత, ఆదిత్య బాగా రాణించాడు. పంజాబ్లోని LPU నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిగ్రీ పొందినప్పటికీ, తన నిజమైన అభిరుచి ఇంజనీరింగ్లో లేదని ఆదిత్య గ్రహించాడు. విడిపోవడం వల్ల కలిగే బాధ అతన్ని వెంటాడు తున్నప్పటికీ, తన కోరికతో 2018లో IIT రూర్కీ నుండి MBA పట్టా పొందాడు. ICICI బ్యాంక్లో ఉద్యోగంలో చేరాడు.2020లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి UPSC పరీక్షకు సిద్ధమయ్యాడు. UPSC పరీక్షలో మూడుసార్లు విఫల మైనప్పటికీ, నిరాశపడలేదు. తత్వశాస్త్రం తన ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉండటంతో, అతను UPSC ఫలితం 2021లో కేవలం 2.5 మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఢిల్లీలో ఐచ్ఛిక సబ్జెక్టుల తయారీ కోసం మాత్రమే కోచింగ్పై ఆధారపడుతూ, ఇతర సన్నాహాల కోసం పూర్తిగా స్వీయ అధ్యయనంపై దృష్టి పెట్టాడు. అలా పూర్తి అంకితభావం, కృషి, దృఢ సంకల్పంతో తన మూడవ ప్రయత్నంలో UPSC పరీక్షలో 48వ ర్యాంకును సాధించగలిగాడు. అలా 2022లో కృషి, దృఢ సంకల్పం ఫలించింది.ఆదిత్య జీవితం స్ఫూర్తిదాయకమైన కథ. కష్టాలు,నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఎదురుదెబ్బలు, చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చినా కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పమే ధైర్యం. అదే గొప్ప విజయాలకు పునాదిని నిరూపించివాడు. అలాగే తన చదువుపై తండ్రికున్న ఎన్నో సందేహాలను పటా పంచలు చేసినవాడు. అంతేకాదు ఆదిత్య సీరియస్గా చదువితే.. మీసం గీసుకుంటానని సవాల్ చేసిన ఉపాద్యాయుడికి తన ఐఏఎస్ను సగర్వంగా చూపించాడు.షాదీ మే జరూర్ ఆనా2017లో విడుదలైన షాదీ మే జరూర్ ఆనా మూవీకి ఆదిత్య కథే స్ఫూర్తి. నటుడు రాజ్కుమార్ రావు సత్యేంద్ర మిశ్రా (సత్తు) పాత్రను పోషించారు, ఆర్తి శుక్లా (కృతి ఖర్బంద)తో విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత IAS అధికారి అవుతాడు. -
డాక్టర్ కల చెదిరి, యూట్యూబర్గా మారి..కట్ చేస్తే!
మనం విజయం సాధించాలంటే మనమీద మనకి నమ్మకం ఉండాలి. మన పనిమీద అసరామైన నమ్మకం, కొండంత ప్రేమ ఉండాలి. ఎంతటి కష్టమైనా దూది పింజలా తేలిపోతుంది. విజయం వంగా సలాం చేస్తుంది. రాజస్థాన్లోని కురి అనే చిన్న గ్రామానికి చెందిన 30 ఏళ్ల కౌశల్య చౌదరి సక్సెస్ జర్నీ ఇలాగే మొదలైంది. తనకసలే పరిచయం లేని విషయాలపై అవగాహన పెంచుకుంది. విజయం సాధించింది. పట్టుదల, స్వయం కృషితో ఎదిగిన కౌశల్య ఏం చేసింది. తెలుసుకుందాం.ఒక మూరుమూల గ్రామం. ఆడవాళ్లు గుమ్మం దాటి కాలు బయలుపెడితేపాపం అనుకునే రోజులు. అలాంటి సమయంలో తాను సృష్టించబోయే విప్లవాన్ని స్వప్నించింది. AI టూల్స్, రింగ్ లైట్, ఖరీదైన కెమెరా , అంతరాయాలు లేని ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఒక చిన్న వీడియో రికార్డు చేయాలంటే నానా కష్టాలు పడతాం. కానీ కేవలం సాధారణ స్మార్ట్ఫోన్, అస్తవ్యస్తమైన సిగ్నల్స్ మధ్య వంటకాల వీడియోతో పాపులర్ అయ్యిందామె. ఇక్కడే ఆమె నిబద్దతను, కృషిని అర్థం చేసుకోవవచ్చు.కౌశల్యకు వంటలంటే చాలా ఇష్టం. అలా తన వంటల్ని అందరికీ పరిచయం చేయాలనుకుంది. వంటపై అపారమైన ప్రేమతో, కౌశల్య తన గ్రామంలోని వంటగదిలో ఒక తాత్కాలిక స్టూడియోను ఏర్పాటు చేసుకుంది, చేతితో రాసుకున్న నోట్స్ ద్వారా వీడియో ఎడిటింగ్ నేర్చుకుంది. రాత్రంతా కష్టపడి, డాబాపై అష్టకష్టాలుపడి ఎ ట్టకేలకు ఒక యూట్యూబ్ వీడియోను అప్లోడ్ చేసింది.కేవలం స్వయంకృషితో ప్రియమైన డిజిటల్ క్రియేటర్ మాత్రమే కాదు. సాంప్రదాయరాజస్థానీ మసాలా దినుసులు,కోల్డ్-ప్రెస్డ్ నూనెలను అందించే 'సిద్ధి మార్వాడీ' అనే స్వచ్ఛమైన ఆహార బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా కూడా ఎదిగింది. తన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.బాల్యం: ఒక సామాన్య రైతు కుటుంబంలోపెరిగిన కౌశల్య జీవితం గ్రామీణ భారతదేశంలోని చాలామంది అమ్మాయిల జీవితంలాగే ఉండేది. ఉదయం పాఠశాల, సాయంత్రం ఇంటి పనులు. పొలానికి వెళ్ళేది, గొడ్డూ గొదా చూసుకునేది. నలుగురు తోబుట్టువులలో పెద్దది , పైగా తల్లి పొలం పనుతో బిజీగా ఉండేది.. అందుకే వంటగదికి అంకితమైపోయేది. ముఖ్యంగా తన తల్లి పొలంలో పనిలో ఉన్నప్పుడు ఆమె ప్రేమగా వండి పెట్టేది. అదితిన్నపుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందమే వంటపై ఆమెకు ప్రేమను పెంచింది. View this post on Instagram A post shared by Kaushalya Choudhary (@kaushalyaair)డాక్టర్ కావాలనే కలలు: డాక్టర్ కావాలనే కలలతోనే 12వ తరగతిలో సైన్స్ చదివింది. ఎలాగైనా కష్టపడి డాక్టర్ని కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అనీ అనుకున్నట్టే జరగవు కదా. ఇంటర్ పరీక్షలు అయ్యాయో లేదో పెళ్లి చేసేశారు పెద్దలు. తన తల్లి, ఇతర ఆడాళ్లలాగానే పొలం పనులు, ఇంటిపనులు. ఇంతోటి దానికి తాను ఇంటర్ దాకా ఎందుకు చదువుకున్నట్టు అని తనను తాను ప్రశ్నించుకుంది. ఏదో చేయాలనే ఆలోచన మొదలైంది. కానీ తన గ్రామంలో ఉద్యోగావకాలు తక్కువ. పైగా ఆడాళ్లకి సామాజిక కట్టుబాట్లు ఉండనే ఉన్నాయి. దీనికి తోడు బైటికిపోతే, ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇంటికి వచ్చే అతిథులను ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మ, అత్తగారిమాటలు. బోనులో చిక్కుకున్నట్లు ఫీలింగ్ కలిగేది ఆ ఇంటికి ఏకైక కోడలైన కౌసల్యకు. చిన్నప్పటి నుంచే కౌసల్య వంటగదిలోనే గడిపింది. ఈ అనుభవంతోనే నాలుగు గోడల మధ్యలోనే అయినా సరే ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్ వరంలా దొరికిందిఐదేళ్ల చిన్నారి యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నట్టు తెలుసుకుంది. అంతేక ఆలోచన తళుక్కున మెరిసింది. ఎంతో ఆశతో భర్త వీరేంద్ర కుమార్ను యూట్యూబ్ అంటే ఏమిటని అడిగింది. కొద్దిగా వివరాలు తెలుసుకుంది. ఆ సమయంలో ఆమె దగ్గర స్మార్ట్ఫోన్ కూడా లేదు. కౌసల్య మరో అడుగు ముందుకేసి మామగారిని ఫోన్ కొనివ్వమని అడిగింది. రూ 3 వేల విలువైన బటన్ ఫోన్ ఇంటికి తెచ్చి, ఇంతకంటే ఎక్కువ కొనలేనని చెప్పారట. తాను పొదుపు చేసుకున్న మూడు వేల, అమ్మ దగ్గర మూడు తీసుకుని రూ. 7500 పెట్టి శాంసంగ్ జె2ఎస్ ఫోన్ కొనుక్కుంది. 2017లో తన వంటగది నుండి వంటకాల వీడియోలను చిత్రీకరించడం ప్రారంభించింది. ట్యూటోరియల్స్ చూసి ఎడిటింగ్ నేర్చుకుంది. నేర్చుకున్నపాయింట్లను మర్చిపోకుండా ఉండేందుకు పాయింట్లు రాసుకునేది. ఇలా అన్ని అడ్డకుంలనూ అధిగమించి కౌసల్య తన యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించింది. బేసన్ బర్ఫీ,హల్దీ కీ సబ్జీ. తొలి వీడియో సంచలనం క్రియేట్ చేసింది. అష్టకష్టాలుపడి, నాణ్యమైన వంటకాల వీడియోలను పోస్ట్ చేయగలిగింది. ప్రస్తుతం ఆమె సిద్ధి మార్వాడి కిచెన్( Sidhi Marwadi Kitchen) అనే ఛానల్కు 10 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉండటం విశేషం. తన సబ్స్క్రైబర్ల కోసం కంటెంట్ను అందిస్తూ పాపులర్ అయింది. మొదటి రోజులు చాలా కష్టంగా ఉండేవి. ట్రైపాడ్ లేదు, కేవలం అల్యూమినియం తీగలను వంచి తాత్కాలిక స్టాండ్గా ఉపయోగించేది. స్టూడియో లైట్లు లేవు, వంటగది చుట్టూ బల్బులు వేలాడ దీసేది. నెట్వర్క్ లేక వీడియోలు అప్లోడ్ చేయడానికి గంటల తరబడి వేచి ఉండేది. మొత్తానికి ఏడాదిన్నర తరువాత యూట్యూబ్ నుండి వచ్చిన తొలి సంపాదన రూ. 7,500. ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూసింది లేదు. అంతేకాదు ఈమెపాపులారీటీ మాస్టర్ చెఫ్ ఇండియాదాకా చేరింది. 2023లో మాస్టర్ చెఫ్ ఇండియా పాల్గొని, రాజస్థాన్ నుండి 40,000 మంది పాల్గొనేవారిలో టాప్ 12లో చేరిన ఏకైక పోటీదారుగా నిలిచింది. తన YouTube ద్వారా వచ్చిన సంపాదన రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి "సిధి మార్వారీ" అనే క్లీన్-లేబుల్ ఫుడ్ స్టార్టప్ను ప్రారంభించింది. స్వచ్ఛమైన మసాలాలు, కోల్డ్-ప్రెస్ ఆయిల్స్తో 2024లో సిద్ధి మార్వాడి( Sidhi Marwari) బ్రాండ్ను స్థాపించింది. తన గ్రామంలో 35మందికి పైమహిళలకు ఉపాధినిస్తోంది. ఈ స్టేజికి రావడం అంత సులభంగా జరిగిపోలేదు. ఈ పని ఆపేయమనికుటుంబ సభ్యులు చాలా ఒత్తిడి చేశారు. ఇలా వీడియోలు తీయడం, నలుగురికీ కనిపించడం మంచిది కాదని వాదించారు, భయపడ్డారు. కానీ భార్య సంపాదనతో జీవిస్తోందన్న విమర్శలు ఎదుర్కొన్న భర్త వీరేంద్ర ఆమెకు సపోర్ట్గా నిలవడం విశేషం. ఇపుడు ఎంతోమంది గ్రామస్తులకు ఆమె స్ఫూర్తి. -
కనిపించని ఆ నాలుగో సింహమే..
అతను చూడగానే చిన్నపిల్లాడిలా అనిపిస్తాడు. అప్పుడే వస్తున్న నూనూగు మీసాలు అతని ముఖానికి కొత్తదనాన్ని తెచ్చాయి. అయితే కనిపించే ఈ రూపానికి భిన్నంగా అతని భుజాలపై మెరిసే నక్షత్రాల బ్యాడ్జీ, హుందాగా కనిపించే యూనిఫాం... ఇదంతా గమనిస్తే ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు అనే సందేహం అందరిలో మెదులుతుంది. అతనే రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అభిజీత్ పాటిల్.. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. దేశసేవలో భాగస్వామి అయిన ఈ 22 ఏళ్ల కుర్రాడి సక్సెస్ స్టోరీ..నమ్మి తీరాల్సిందే..దేశంలో అతి పిన్న వయసులో ఐపీఎస్ సాధించిన అభిజీత్ పాటిల్ను చూసిన వారు అతని రూపాన్ని చూసి తెగ ఆశ్చర్యపోతుంటారు. ఇంత చిన్న వయసులో శాంతిభద్రతల లాంటి క్లిష్టమైన బాధ్యతలను ఇతను నిర్వహిస్తున్నాడా? అని ముక్కున వేలేసుకుంటారు. మొదట ఎవరైనా ఇతనిని చూడగానే పోలీసు ఉన్నతాధికారి అంటే నమ్మలేరు. మహారాష్ట్రలోని థానేలో జన్మించిన అభిజీత్ 22 ఏళ్ల వయసులోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి, దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారు.తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్అభిజీత్ పాటిల్ విద్యాభ్యాసం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2022లో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే అభిజీత్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఆశ్చర్యకరంగా డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రాకముందే ఆయన ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత మెయిన్స్ కూడా క్లియర్ చేసి, 2022 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 470వ ర్యాంకు సాధించాడు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగకుండా, ఇంటి వద్దే ఉండి, ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.రోజుకు 8 గంటలు చదువుతూ..అభిజీత్ విజయ రహస్యం ఆయన సొంతంగా రూపొందించుకున్న ప్రణాళిక. లక్షల రూపాయలు వెచ్చించి, కోచింగ్ తీసుకునే స్తోమత లేని వారికి అభిజీత్ ఓ రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో ఒక టాపర్ వీడియో చూసి. అభిజీత్ తాను ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది నెలల పక్కా ప్రణాళికతో చదివాడు. రోజుకు 8 గంటల పాటు సిలబస్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడం, మాక్ టెస్టులు రాయడం ద్వారా విజయం సాధించారు. లక్ష్యంపై స్పష్టత ఉంటే సివిల్స్ లాంటి కఠినమైన పరీక్షలను కూడా సులభంగా ఛేదించవచ్చని అభిజీత్ నిరూపించాడు.సామాన్యుల గుండెల్లో 'యంగ్ హీరో'ప్రస్తుతం రాజస్థాన్లోని చురు జిల్లా రాజ్గఢ్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎఎస్పీ)గా అభిజీత్ విధులు నిర్వర్తిస్తున్నారు. 172 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నప్పటికీ, ఆయనకున్న ‘బేబీ ఫేస్’ కారణంగా అతనిని చూసినవారంతా ఆయనను చిన్నపిల్లాడిగా పొరబడుతుంటారు. విధి నిర్వహణలో అభిజీత్ పనితీరు ప్రజల్లో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఇటీవల రాజ్గఢ్కు చెందిన ఒక కూలీ తన కుమారుని పుట్టినరోజు నాడు అభిజీత్ వద్దకు వచ్చి, తన కుమారుడిని ఆశీర్వదించాలని కోరడం ఆయనకున్న క్రేజ్కు నిదర్శనం. ఆ పిల్లాడు కూడా భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నాడని తెలుసుకున్న అభిజీత్ ఎంతో సంతోషించారు.ఇది కూడా చదవండి: 40 ఏళ్లకే రిటైర్మెంట్? వణికిస్తున్న ‘లే-ఆఫ్’లు -
రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ఐఐటీ కాన్పూర్లో చదువు, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేతికి కాగానే భారీ ఆఫర్తో ఉద్యోగం ఖాయం. బీటెక్ ఆఖరి సంవత్సరంలోతన బ్యాచ్మేట్స్ అందరికి గ్లోబల్ దిగ్గజ సంస్థలనుంచి భారీ వేతనంతో ఉద్యోగ ఆఫర్లు అందుకున్నారు. కానీ ఒక యువకుడి ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. తన కలను సాకారం చేసుకునే ప్రయోగాల్లో బిజీగా ఉన్నాడు. ఎందరు నవ్వినా, హేళన చేసినా పట్టించుకోలేదు. ఆయనే బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీకి వ్యవస్థాపకుడిగానిలిచిన అంకుష్ సచ్దేవా కథ సాధారణ IIT మేధావి కథ కాదు. దానికంటే కఠినమైనది, మరింత మానవీయమైనది. ఎంతో ఇష్టంగా కష్టపడిన నిలిచి గెలిచినప్రయోగశీలి కథ. పదండి కథేంటో తెలుసుకుందాం.అంకుష్ సచ్దేవా కాన్పూర్ నుంచి పట్టభద్రుడయ్యాక మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంటర్న్గా తన వృత్తిని ప్రారంభించాడు. కార్పొరేట్ ప్రపంచం అతని అభిరుచిని మరిపించలేకపోయింది. వ్యవస్థాపకత మార్గంలో నడిచేలా చేసింది. సచ్దేవా తన కెరీర్ ప్రారంభ దశలో 17 విభిన్న స్టార్టప్ ప్రయత్నాల్లో వైఫల్యం చెందాడు. అవును..అతని గుండె గదుల్లోంచి ఉద్భవించిన ప్రతీ ఆలోచన ఇ-కామర్స్ నుండి యుటిలిటీస్ వరకు దాదాపు అన్నీ క్రాష్. కానీ వైఫల్యాలనే తన విజయానికి మెట్లుగా వాడుకున్నాడు. ఓటమి నుంచే నేర్చుకున్నాడు. ప్రతి వైఫల్యం ఒక ముఖ్యమైన డేటాపాయింట్. కట్ చేస్తే.. 18వ ప్రయత్నంలో ఇద్దరు సహచరులతో కలిసి అతను అసాధారణమైన దాన్ని సాధించాడు.2015లో తన IIT కాన్పూర్ స్నేహితులు ఫరీద్ అహ్సాన్ , భాను సింగ్ లతో జతకట్టాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగి తేలుతున్న సమయంలో ఇదొక విప్లవాత్మక ఆలోచన, స్థానికమైన భాషను మాట్లాడే సోషేల్ స్లేస్ షేర్చాట్ను నిర్మించారు. తొలుత హిందీతో ప్రారంభమైనప్పటికీ, ఆ తరువాత 15 భారతీయ భాషలలోకి వికసించింది. ఫేస్ బుక్, వాట్సాప్ కంటే కొత్త అనుభవాలను కోరుకునే వినియోగదారులకు వరంలా మారింది.ప్రాంతీయ భాషలే బలంఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఇంగ్లీష్పై దృష్టి పెడితే, షేర్చాట్ మాత్రం భారతదేశంలోని ప్రాంతీయ భాషల (తెలుగు, హిందీ, తమిళం మొదలైన 15 భాషలు) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. "మన భాషలో మన సోషల్ మీడియా" అనే నినాదమే విజయానికి పునాది వేసింది. షేర్చాట్ కంటే ముందు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ ముగ్గురు స్నేహితులు యూజర్లు ప్రాంతీయభాషల్లో కంటెంట్ను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారని గ్రహించారు. ఫలితంగా గ్లోబల్ కంపెనీలకు ధీటుగా సొంత ప్లాట్ఫారమ్ను నిర్మించుకోవచ్చని నిరూపించేలా షేర్చాట్ను తీసు కొచ్చారు. ప్రపంచ ఇంటర్నెట్కు కనిపించకుండా ఉన్న లక్షలాది మందిని, మూల మూలన ఉన్న వారిని ఏకం చేసింది. పంజాబ్లోని ఒక రైతును అస్సాంలోని ఒక కవితో కలిపింది. మధ్యప్రదేశ్లోని ఒక గృహిణి వంటకాల ఛానెల్ వైరల్ అయింది. కేవలం ఆరేళ్ళకు 2021 నాటికి, దీనికి 160 మిలియన్లకు పైగా యూజర్లు వచ్చి చేరారు. భారీ ఆదరణతో పాటు కంపెనీ విలువ కూడా పెరిగింది. షేర్చాట్ 2021లోనే 'యూనికార్న్' (1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీ) క్లబ్లో చేరింది. 2022 నాటికి ఇది అక్షరాలా రూ. 40,000 కోట్లకు (సుమారు 5 బిలియన్లు డాలర్లకు) చేరింది.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం సుమారు k రూ.723 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఇది ఏడాదికి₹1,000 కోట్ల ఆదాయ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది.కేవలం సోషల్ మీడియాగానే కాకుండా, ఇప్పుడు మైక్రో డ్రామా (Micro-dramas) ,లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ లాభాల దిశగా ప్రయాణిస్తోంది.అంకుష్ సచ్దేవా పేరు స్టార్టప్ పరిశ్రమలో అత్యంత స్ఫూర్తిదాయకమై పేరు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే తపనతో ఉన్న ఈ ప్రపంచంలో, ప్రతీ ప్రతికూలతనుంచి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఎంతో శ్రద్ధగా నిర్మించుకున్న వైభవం. దాని గొప్పతనానికి నిదర్శనమైన స్ఫూర్తి. -
రూ.21 వేల జీతం నుంచి ఏడాదికి కోట్లు గడించే రేంజ్కి..!
ఎన్నో సక్సెస్ స్టోరీలు నెట్టింట ఆకర్షిస్తుంటాయి. అలానే ఈసారి రెడ్డిట్లో వైరల్ అవుతున్న ఈ స్టోరీ వచ్చే అవకాశాలను ఒడిసిపట్టుకుంటే..ఆకామంత గెలుపుని పాదాక్రాంతం చేసుకోవచ్చని చూపించే గాథ ఇది. కనీస అవసరాలు తీర్చుకోలేక అల్లాడుతూ చాలీచాలని జీతంతో మొదలైన అతడి జీవితం..చార్టర్ అకౌంటెంట్ని కలవగానే ఎలా మలుపు తిరిగిందో షేర్ చేశాడు. ఈ కథ నెటిజన్లను..అమితంగా ఆకర్షించడమే కాదు..చాలా స్ఫూర్తిదాయకమైన కథ అంటూ కితాబిచ్చేశారు కూడా.అదేంటంటే..ఒక మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ రెడ్డిట్లో రూ.21 వేల నుంచి ఏడాదికి రూ. ఒక కోటి నుంచి రెండు కోట్లు వరకు ఆర్జించే రేంజ్కి ఎలా చేరుకున్నాడో పంచుకున్నారు. జాబ్ కెరీర్లో ఇంత పెద్ద సక్సెస్ని ఎలా సాధించాడో సవివరంగా తెలిపి..ప్రేరణగా నిలిచాడు. మొదట్లో అందరం చిన్నాచితకా ఉద్యోగాలే సంపాదిస్తూ..అక్కడ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ పోవాలి. ఆ క్రమంలో మనకు ఎదురయ్యే కష్టాలు, సవాళ్లే..గొప్ప పరిష్కారాన్ని, విజయాన్ని అందిస్తాయిని చెప్పేందుకే తన కథను షేర్ చేస్తున్నానంటూ తన విజయగాథను చెప్పుకొచ్చాడు. తాను పనిచేసిన తొలి ఉద్యోగాన్ని గుర్తు చేసుకుంటూ..ఒక ఆర్థిక సంస్థలో "డాక్యుమెంట్ ఎగ్జిక్యూటివ్" ఉద్యోగం సంపాదించానని, ఎందుకంటే కరోనా సమయం కావడంతో ఉద్యోగ మార్కెట్ సవ్యంగా లేని గడ్డుపరిస్థితుల్లో ఆ చిన్న ఉద్యోగమే తనకు ఆదారమైందని చెప్పుకొచ్చాడు.ఆ ఉద్యోగం దగ్గర దగ్గర డెలివరీ బాయ్లాంటిదని తెలిపాడు. అప్పుడు రూ. 18 వేలు వేతనం అందుకునేవాడినని చెప్పాడు. తన పని క్లయింట్ల నుంచి ఫైళ్లను సేకరించడం, డాక్యుమెంట్లను వెరిఫై చేసి బ్యాంకులకు సమర్పించడమని అన్నారు. తాను ఢిల్లీలో వేసవి, శీతాకాలపు పొగమంచులను లెక్కచేయకుండా పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. అంతలా నాలుగేళ్లకు పైగా కష్టపడితే తన జీతం కేవలం రూ. 2 వేలు మాత్రమే పెరిగిందని, దాంతో రూ. 21,000 వేతనం అందుకునేవాడినని వివరించాడు. ఆ క్రమంలో ఒక చార్టడ్ అకౌంటెంట్ని(సీఏ)ని కలవగా..తన లైవ్ ఊహించిన మలుపు తిరిగి ..స్వతంత్రంగా ఫంఢింగ్ కేసును నిర్వహించి, నెట్వర్క్ ద్వారా ప్రాసెస్ చేస్తూ..50 శాతం ఆదాయం పొందేలా డీల్ కుదుర్చుకున్నట్ల తెలిపాడు. అలా ఇవాళ వందల కోట్లు విలువైన డీల్స్ నిర్వహిస్తూ..ఏడాదికి ఒక కోటి నుంచి రెండు కోట్లు వరకు గడిస్తున్నట్లు తెలిపాడు. జాబ్ మార్కెట్కి మన డిగ్రీతో పనిలేదని అన్నాడు. తాను ఇంతకుమందులా డెలివరీ బాయ్లా ఫైళ్లను బ్యాంకులకు డెలివరీ చేయడం లేదని, పూర్తిస్థాయి ఆర్థిక సలహాదారుగా పనిచేస్తూ..కోట్లు గడిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను సంక్లిష్ట రుణ సాధనాలు నిర్వహిస్తానని,ప్రాజెక్ట్ ఫండింగ్ నుంచి ఈక్విటీ ఫండింగ్, పెట్టుబడులు, అధిక టికెట్ బీ2బీ రుణాలు వంటివి నిర్వహిస్తానని పోస్ట్లో తెలిపాడు. ప్రస్తుతం తాను వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి ఆతిధ్య రంగంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. ఆ నేపథ్యంలోనే హోటళ్లు, ఆస్పత్రులు కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేస్తున్నానని పోస్ట్లో రాసుకొచ్చాడు. నెటిజన్లు బ్రో చాలా బాగుంది మీ విజయగాధ..చాలా స్ఫూర్తిదాయకం, ప్రేరణ కూడా అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: బిర్యానీలలో హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్ రాయబారి సైతం..) -
ఆరేళ్ల న్యాయ పోరాటం.. అద్భుత విజయం!
అది ప్రపంచంలోనే పేరుమోసిన ఒక బహుళజాతి కన్సల్టింగ్ సంస్థ. అక్కడ ఉద్యోగం అంటే ఎంతో ప్రతిష్టాత్మకం. కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక భారతీయ మహిళను ‘నీ వల్ల కావట్లేదు’.. అంటూ ఆ సంస్థ బయటకు పంపేసింది. అవమానాన్ని భరించి మౌనంగా ఉండిపోలేదు ఆ మహిళ. ఆరేళ్లపాటు అలుపెరగని న్యాయపోరాటం చేసింది. చివరకు బ్రిటన్ హైకోర్టు మెట్లెక్కి.. కార్పొరేట్ దిగ్గజాన్ని తలవంచేలా చేసింది. ఆమే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎన్నారై ప్రొఫెషనల్ సంజు పాల్.ఏమిటా కథ?సంజు పాల్ ప్రముఖ సంస్థ ’యాక్సెంచర్’ లో మేనేజర్గా పనిచేసేవారు. ఆమె ఎండోమెట్రియోసిస్ అనే దీర్ఘకాలిక గర్భాశయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల తీవ్రమైన నొప్పి ఉంటుంది. అయితే, ఆమె పనితీరు బాలేదంటూ, సీనియర్ మేనేజర్గా పదోన్నతి పొందే సామర్థ్యం లేదంటూ 2019లో సంస్థ ఆమెను తొలగించింది. ‘అప్ ఆర్ ఔట్’పై సవాల్! దీనిపై ఆమె ఎంప్లాయిమెంట్ అప్పీల్ ట్రిబ్యునల్ (ఈఏటీ)ను ఆశ్రయించారు. బ్రిటన్ ఈక్వాలిటీ యాక్ట్ 2010 ప్రకారం, దీర్ఘకాలిక అనారోగ్యాన్ని వైకల్యంగా పరిగణించాలని, దాని ఆధారంగా వివక్ష చూపడం చట్టవిరుద్ధమని ఆమె వాదించారు. కార్పొరేట్ సంస్థల్లో ఒక వివాదాస్పద నిబంధన ఉంది. అదే ‘అప్ ఆర్ అవుట్’.. అంటే నిర్ణీత సమయంలో పదోన్నతి సాధించకపోతే ఉద్యోగం వదిలి వెళ్లాలి. దీన్ని సంజు పాల్ సవాలు చేశారు. అనారోగ్య సమస్య ఉన్నప్పుడు దాన్ని సాకుగా చూపి ఎలా తొలగిస్తారని ఆమె ప్రశ్నించారు. వెనక్కి తగ్గని సంజు మొదట కింది కోర్టు ఆమెకు కేవలం 4,275 పౌండ్ల నామమాత్రపు పరిహారం ఇచ్చి కేసు ముగించాలని చూసింది. కానీ సంజు పాల్ వెనక్కి తగ్గలేదు. దీంతో హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచి్చంది. ఎండోమెట్రియోసిస్ వ్యాధిని విస్మరించడం తప్పని కోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఆమెకు వ్యతిరేకంగా వచి్చన తీర్పును ‘అసంబద్ధం’అని కొట్టివేసింది. కేసును సరికొత్త కోణంలో విచారించాలని ఆదేశించింది. న్యాయం గెలిచింది ‘నా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉద్యోగుల హక్కుల కోసం, పని ప్రదేశాల్లో వివక్ష పోవాలనే నేను పోరాడాను. ఈ విజయం నా ఒక్కదానిదే కాదు’.. అంటూ సంజు పాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రధాని ఇప్పటికే ఈమెను ‘పాయింట్స్ ఆఫ్ లైట్’పురస్కారంతో సత్కరించడం విశేషం. అనారోగ్యం బలహీనత కాదు.. పోరాడితే అది చట్టబద్ధమైన బలం అవుతుందని సంజు పాల్ నిరూపించారు. -
11 ఏళ్లకే పెళ్లి, భార్య అండతో నెరవేరిన ఎంబీబీఎస్ కల
బాల్యంలోనే పెళ్లి, 20 ఏళ్ల వయస్సులోనే బిడ్డకు తండ్రి. అయితేనేం కష్టపడి చదివి, సవాళ్లు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయలేదు. అనుకున్నది సాధించే దాకా నిద్ర పోలేదు. రాజస్థాన్లోని మారుమూల ప్రాంతానికి చెందిన రామ్లాల్ నీట్లో విజయం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. రామ్లాల్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.రాజస్థాన్లోని ఒక చిన్న జిల్లాకు చెందిన వాడు రామ్లాల్. ఎన్నో కష్టాలకోర్చి తన కలను సాకారం చేసుకున్నాడు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, తన వైద్య ప్రయాణానికి మార్గం సుగమం చేసుకున్నాడు. అయితే రామ్లాల్కి 6వ తరగతి చదువుతున్నప్పుడే పెళ్లి అయిపోయింది. పెళ్లి, సంసారం, బాధ్యతలు వీటిపై ఎలాంటి అవగాహన లేని సమయంలోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకునే సమయంలో 11 ఏళ్లకే ఒక ఇంటి వాడైపోయాడు. తల్లిదండ్రులు నిశ్చయం.. పైగా చిన్న వయసు. ఎటూ ప్రశ్నించలేని తనం. తలొగ్గడం తప్పడం చేయ గలిగిందేమీ లేదు. అందుకే, పాత విషయాలను పక్కనపెట్టి, రామ్లాల్ తన చదువును కొనసాగిస్తూనే, తన ఫ్యూచర్ ప్లాన్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. తన కలను కుటుంబం ముందు ఉంచాడు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. అదృష్టం ఏమిటంటే చదువు విలువు తెలిసిన రామ్లాల్ భార్య , భర్త ఆశయాలను అర్థం చేసుకుంది. అతనికి అండగా నిలబడింది. ఆమె మద్దతు ,ప్రోత్సాహం లేకపోయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.10వ తరగతిలో రామ్లాల్ 74 శాతం మార్కులు సాధించి, త్వరలోనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే అంతిమ లక్ష్యంతో సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నెలల తరబడి సన్నద్ధమైన తర్వాత, 2019లో నీట్ పరీక్షకు హాజరై, 720 మార్కులకు కేవలం 350 మార్కులు మాత్రమే సాధించాడు. అయినా నిరాశపడలేదు. తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో కోచింగ్ సంస్థలో చేరాడు.2022లో మరోసారి నీట్ రాశాడు.మునుపటి కంటే మెరుగ్గా 490 మార్కులు సాధించాడు,. ప్రతీ ప్రయత్నం, వైఫల్యం అతనిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. మరింత కష్టపడాలనే సంకల్పం పెరిగింది. దాంతో అతను మంచి ర్యాంకు సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు. చివరికి ఐదు ప్రయత్నాల తర్వాత 2023లోమంచి ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 2023లోనే రామ్లాల్కు ఒక పాపపుట్టడం విశేషం.ఎవరు వ్యతిరేకించినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా సాధించాలనే సంకల్పం, పట్టుదల ఉంటే విజేతలుగా నిలవడంలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు అనడానికి రామ్లాల్ ప్రయాణమే నిదర్శనం. -
ఆ ఒక్క మహిళ..ఆ గ్రామం రూపు రేఖల్నే మార్చేసింది..!
అందరి లాగే తను కూడా ఆ గ్రామానికి కోడలిగా వచ్చింది. తన భర్తతో, కుటుంబంతో సంతోషంగా బతకాలనుకుంది. అంతలోనే భర్తను కోల్పోవడంతో తన బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఆ విషాదంలోనే ఉండిపోకుండా తన ఊరికి ఏౖదైనా సహాయం చేయాలనుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని గ్రామ సర్పంచ్గా గెలిచింది. పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. ఊరిని ప్రగతి మార్గంలో నడిపించింది. అదే నేడు తనను, తన ఊరిని గొప్పస్థానంలో నిలబెట్టింది. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డును అందుకోవడంతోపాటు,రూ. 1 కోటి నగదు బహుమతిని సైతం సొంతం చేసుకునేలా చేసింది. ఆమే .. యోగేశ్వరి శత్రుగన్ చౌదరి.మహారాష్ట్రలోని గోండియా జిల్లా, సడక్ అర్జుని తాలూకాకు చెందిన దవ్వా గ్రామం సరికొత్త చరిత్ర సృష్టించింది. పర్యావరణ హిత కార్యక్రమాలలో ముందుండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు పొందిన గ్రామంగా నిలిచింది దవ్వా. ఇదంతా ఆ ఊరి సర్పంచ్ యోగేశ్వరి శత్రుగన్చౌదరి వల్లే సాధ్యమైందని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు.అనుకోని విషాదంఇంటర్ పూర్తి చేసిన యోగేశ్వరి 2003లో దవ్వా గ్రామానికి కోడలిగా వచ్చింది. అనంతరం భర్త సహకారంతో బీఏ., బీఈడీ, డీఈడీ చేసి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అంతలోనే భర్త మరణించడంతో.. యోగేశ్వరి జీవితంలో అంధకారం అలుముకుంది. అయితే ఈ విషాదంలోనే ఉండిపోకుండా అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తన ఊరికోసం ఏమైనా చేయాలనుకుంది. ఆ ఆలోచనతోనే ఊరి ప్రజల సహకారంతో సర్పంచ్గా గెలిచింది.లక్షాపదహారు వేల మొక్కలు నాటింది యోగేశ్వరి పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. గ్రామంలోని నిస్సారమైన నేలలో నీటిని పారించి పంటలు పండించింది. గ్రామపరిధిలోని ఖాళీ స్థలాలలో సుమారు 1,16,000 మొక్కలను నాటి ఆ తాన్ని పచ్చదనంతో నింపేశారు. గ్రామంలోని 400 ఇళ్లకు పైగా సోలార్గ్రిడ్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం ద్వారా జీరో వేస్ట్ లక్ష్యాన్ని చేరుకున్నారు. రైతుల కోసం ప్రత్యేక ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి, రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. గ్రామం కోసం చేపట్టిన పనులన్నీ పారదర్శకంగా ఉండటం కోసం భువన్ యాప్ ద్వారా జియో–ట్యాగింగ్ చేశారు. (చదవండి: ప్రభుత్వ పాఠశాల విద్యానేపథ్యం..కానీ ఇవాళ మహీంద్రా ఆటోమోటీవ్ టీమ్ హెడ్) -
సర్కారీ స్కూల్లో చదివాడు..కానీ ఇవాళ ఏకంగా..!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటిలానే ఈసారి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు స్ఫూర్తిని రగిలించే ప్రేరణాత్మక స్టోరీలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి టాలెంట్కి సంబంధించిన ఆసక్తికర కథను పంచుకున్నారు. కార్పోరేట్ స్కూల్లో చదివినంత మాత్రాన టాలెంట్ వాడి సొత్తు కాదని..సాధారణ స్కూల్లో చదవిన వాడు కూడా టాలెంట్కి కేరాఫ్గా నిలుస్తారని చెప్పే గొప్ప కథ..!.భారతదేశంలోని సవాళ్లే మనలోని ప్రతిభకు, ఆవిష్కరణలకు కేంద్రం అని చెబుతున్నారు ఆనంద్ మహీంద్రా. అదే మనల్ని మాత్రమే కాదు యావత్తు భారత దేశాన్ని ప్రపంచం ముందు విజేతగా నిలబెడుతోందని అంటూ ఓ మహోన్నత వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. తమిళనాడులో ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదవిన వేలు సామీ ఇవాళ మహీంద్రా ఆటోమోటివ్ వ్యాపార టీమ్కి హెడ్గా సారథ్యం వహిస్తున్నాడు. అతడి ప్రయాణం తన కంపెనీలో చాలా చిన్నగా ప్రారంభమైందని..అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పుకొచ్చారు. ఆయన తన బృందంతో కలిసి కొత్త మహీంద్రా XUV 7XOలో డావిన్సీ డంపింగ్ టెక్నాలజీని పరిచయం చేశాడని, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని అన్నారు. ఆనంద్ ఆప్యాయంగా 'వేలు గురు'గా పిలిచే అతడు అన్నా విశ్వవిద్యాలయం నుంచి ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో బి.టెక్ సీటుని తమిళనాడు నామక్కల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యా నైపుణ్యంతో సాధించాడని చెప్పారు. మహీంద్రాలో జూనియర్ ఇంజనీర్గా చేరి..ఇవాళ ఏకంగా టెక్నాలజీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్ అయ్యాడని, అలాగే గతేడాదే ఆయన మహీంద్రాలో ఆటోమోటివ్ బిజినెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యాడని తెలిపారు. స్వదేశ ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ కంపెనీ ఆర్ అండ్ డీ బృందాలు వేలు ప్రయాణాన్ని పరిచయం చేశాయి. మన స్వదేశీ ఇంజనీర్లు నేర్చుకోవాలనే ఆకలితో ఉన్నారని, అందువల్లే నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటున్నారు, పైగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిని పరిచయం చేస్తున్నారంటూ..మనవాళ్ల టాలెంట్ని, ప్రతిభని కొనియాడుతున్నారు. అంతేగాదు భారతదేశాన్ని ఒక ప్రతిభ కర్మాగారంగా అభివర్ణిచారు కూడా. అంతేగాదు 1991లో, ఆర్థిక వ్యవస్థ తెరుచుకున్నప్పుడు ప్రపంచ కన్సల్టెంట్లు భారతీయ కంపెనీలకు "సహాయం చేయమని" ఎలా సలహా ఇచ్చారో గుర్తు చేసుకుంటూ..మహీంద్రా గ్రూప్ ఆ దిశగానే ముందుకు సాగుతోంది. ఇంకా ఇక్కడే ఉన్నాం, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ ప్రపంచ స్థాయి సాంకేతికతో సేవ చేసేందుకు సదా ఆరాట పడుతోంది మా గ్రూప్ అని చెప్పుకొచ్చారు. కాగా, వేలు సామీ 1996లో మహీంద్రాలో జాయిన్ అయ్యారు. పవర్ట్రెయిన్ అభివృద్ధిలో తన కెరీర్ను ప్రారంభించాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ..అత్యాధునిక M-హాక్ ఇంజిన్ల వెనుక ఉన్న దార్శనికుడిగా పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు కూడా. ది ఆల్ న్యూ థార్, XUV700, స్కార్పియోన్ వంటి బ్లాక్బస్టర్ ఉత్పత్తుల ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషించిన టీమ్ లీడర్ ఆయన.Meet Velu.He and his team have just introduced the world’s first suspension featuring DaVinci damping technology in the new Mahindra XUV 7XOAs you can see, he can’t conceal his excitement to demonstrate it personally.Velu, or "Velu Guru” as we affectionately call him,… pic.twitter.com/tfbkJbLryO— anand mahindra (@anandmahindra) January 19, 2026(చదవండి: 73 ఏళ్ల తాత గారి సిక్స్ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..) -
రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ
నిజజీవిత కథలే చాలా సినిమాలకు ప్రేరణ. కానీ ఒక నిరుపేద బాలుడిని ఒక సినిమా విజయ తీరాలకు నడిపించింది అంటే నమ్ముతారా? బెంగళూరులో పేద కుటుంబంలో జన్మించి, ఫుట్పాత్పై షర్టుల విక్రయించిన పేద బాలుడి జీవితమే ఇందుకు నిదర్శనం. సినిమా ప్రేరణతో అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. వెండితెర వెలుగు కొత్త జీవితాన్ని బాటలు వేసి, విధిని తిరిగి రాసింది. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.ఈ స్టోరీలో హీరో పేరు రాజా నాయక్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త. బెంగళూరులో ఒక చిన్న పిల్లవాడిగా ఆకలితో బాధపడే వాడు. ఎందుకంటే కుటుంబం ఆర్థికపరిస్థితి దుర్భరం. అందుకే చదువుక పుల్స్టాప్ పెట్టేసి 17 ఏళ్లకే బతుకు దెరువును వెదుక్కుంటూ ముంబైకి బయలుదేరాడు. ఆ మహానగరంలో దారి తప్పిన బాటసారిలా అనేక కష్టాలు పడ్డాడు.ఏ ఉద్యోగం చేద్దామని తగిన విద్య లేదు. కానీఆత్మవిశ్వాం, పట్టుదల మెండుగా ఉన్నాయి. ఏదో ఒకటి సాధించాలని సంకల్పించు కున్నాడు. ఇంటినుంచి వస్తూ వస్తూ తన తల్లిదగ్గర తీసుకున్న చిన్న మొత్తమే అతనికి దారి చూపించింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్పాత్పై షర్టులను విక్రయించేవాడు. తిరుప్పూర్ నుండి చౌకైన చొక్కాలు కొని బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో రూ.50 లకు అమ్మేవాడు. నీలం, తెలపు రంగుల్లో సమీపంలోని ఫ్యాక్టరీ నుండి కార్మికులను చూసి ఆ రంగులను మాత్రమే అమ్మడంపై దృష్టి పెట్టాడు. తొలి రోజు రూ. 5,000 లాభం సంపాదించాడు. అంత సొమ్ము చూడటం అదే మొదటి సారి. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ప్రేరణ నిచ్చిన సినిమా ముంబైలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ మూవీ బాగా నచ్చేసింది. హీరో పేదరికం నుండి బయటపడి వ్యాపార వేత్తగా ఎదిగిన తీరు అతడిని ఆకట్టుకుంది. నేను ఎందుకు చేయలేను? అనే సంకల్పానికి పునాది వేసింది. ఆ ఉత్సాహంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఫలితం ఫుట్పాత్పై సాగిన వ్యాపారం కాస్తా చిన్న దుకాణంలోకి మారింది. అలా రాజా నాయక్ అనేక అడ్డంకులనుఎదుర్కొని, ఫుట్పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్వేర్ బిజినెస్ ప్రారంభించాడు. బూట్లు, చెప్పులు, గృహోపకరణాలు జోడించాడు. అన్నీ నిజాయితీగా, తక్కువ ధరలకే అందించేవాడు.1991లో మలుపు తిరిగింది. తన కంపెనీ అక్షయ్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించి ప్యాకేజింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దాని సక్సెస్తో రాజా నాయక్ వ్యాపార సామ్రాజ్యం అనేక విజయవంతమైన అడుగులు వేసింది.రవాణా సంస్థ MCS లాజిస్టిక్స్, వాటర్ బేవరేజెస్ , పర్పుల్ హేజ్ వెల్నెస్ స్పేస్, న్యూట్రి ప్లానెట్లతో కలిసి ఆయన వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్నింటి విజయమే. అలా ప్రతి ఏటా అతని ఆదాయం రూ100 కోట్లకు దాటిపోయింది. ఇదీ చదవండి: సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో భార్య అనిత తోడుగారాజా బహుళ వ్యాపార సంస్థల వెనుక ఉన్న మరో చోదక శక్తి అతని జీవిత భాగస్వామి, అనిత. తన వ్యాపారాలను ఆమె చక్క బెట్టుకుంటోంది కాబట్టే తాను వైవిధ్యభరితంగా విజయం సాధిస్తున్నాను అంటారు రాజా నాయక్. ఆమె కూడా నిరుపేద.ఆమె తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. చదువు మానేసి, 16 ఏళ్లవయసులో ఉద్యోగం కోసం రాజా పాఠశాలకు వచ్చింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించి సిబ్బంది సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. అడ్డంకులు వచ్చినంత మాత్రానా జీవితం ఆగిపోదు. పట్టుదల, నిజాయితీ ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు 50 రూపాయల మొదలై, 100 కోట్లకు చేరిన రాజా నాయక్ జీవితమే ఒక శక్తివంతమైన పాఠం. ఏమంటారు. -
వలస వచ్చి.. ప్రేమ ‘నరకం’లో పడి.. ఇప్పుడు ‘కరోడ్పతి’గా..
బాల్యం అంత బాధలమయం, చెప్పుకోదగ్గ సంతోషభరిత విషయాలేం లేవు. పోనీ వైవాహిక బంధమైన బాగుంటుందా అనుకుంటే..అది కూడా వెక్కింరించింది. ఏం పాలుపోలేని స్థితిలో నేనున్నానంటూ అక్కున్న చేర్చుకున్న ప్రేమ బంధం నరకాన్ని చవిచూపించి..తేరుకునేలోపే చేతిలో బిడ్డను పెట్టేసింది. నా వల్ల కాదంటూ పసికందుతో దేశం కానీ దేశంలో వలసదారిగా బిక్కు బిక్కుమంటూ కారునే నివాసంగా చేసుకుని గడిపింది. లోలోన.. ఏదో కసి, ఏదో బాధ..అదే ఆమెను మొండి ధైర్యంతో ముందుకు నడిపించి.. ఏకంగా 9 కోట్ల కంపెనీని రన్చేసే రేంజ్కి తీసుకొచ్చింది. దురదృష్టవంతురాలివి అని పదే పదే అంటున్న అంతరాత్మ మాటల్ని బేఖాతారు చేస్తూ తన సక్సెస్తో అదృష్టవంతురాలిని అని నిరూపించుకుని అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఎమరామె..? ఏమా కథ..అసామాన్య ధీరురాలు వియాత్నంకి చెందిన జియా హుయిన్. ఆమె కడు దయనీయమైన స్థితిని నుంచి కోట్లకు పడగలెత్తే రేంజ్కు చేరుకున్న తన ప్రస్థానం గురించి ఓ ఇంటర్వూలో ఆమెనే స్వయంగా వెల్లడించారు. 20 ఏళ్ల ప్రాయంలో అమెరికాకు వచ్చానని, వారానికి ఏడు రోజులు పాటు ఉదయ నుంచి రాత్రి వరకు దాదాపు 14 గంటల పాటు ఒక నెయిల్ సెలూన్లో పనిచేనినట్లు తెలిపింది. అమెరికాలో నిరాశ్రయురాలైన వలసదారిగా చేతిలో బిడ్డతో ఆ సెలూన్లో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని అని బాధగా చెప్పింది. ఇక తన బాల్యం అంతా కష్టాలు, వేధింపులేనని వేదనగా చెప్పుకొచ్చింది. తన తండ్రి వెదురు కలప నరికి అమ్మడానికి అడవిలోకి వెళ్లేవాడని, నిజంగా ఎప్పుడొస్తారో తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు, అమ్మ మాకు తిండి పెట్టడానికి తన వల్ల అయ్యే ప్రతి పనిచేసేదని చెప్పుకొచ్చారు. తన బాల్యం చాలా బాధలమయం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టీనేజ్ వయసుకే పెళ్లి చేసుకుని 2016లో వియత్నాం నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొద్దికాలానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాం, దాంతో తాను కూడా చేతనైనిది చేస్తూ సంపాదించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే అదంతా తమ కుటుంబం అవసరాలకు అక్కరకు వచ్చేది కాదని నాటి సంఘటనలను గుర్తు చేసుకుందామె. ఇక తన భర్త తనకు విడాకులు ఇచ్చేయడంతో రోడ్డుపై పడిపోయానని, అప్పుడే ఒకవ్యక్తి అక్కున చేరుకుంటానంటూ ప్రేమను చూపిస్తే పిచ్చిదానిలా నమ్మేశానని బావురమంది. తీరా అతడి వద్దకు వెళ్లాక నరకం అంటే తెలిసిందని వాపోయింది. నిజంగా ఆ రిలేషన్ ఒక నరకకూపం అని బాధగా చెప్పిందామె. ఆ వ్యక్తితో తనకు కొడుకు పుట్టగానే..ఐదువారాల శిశువుని తీసుకుని బయటకు వచ్చేసి నిరాశ్రయురాలైన వలసదారిగా మళ్లీ రోడ్డునపడ్డానంటూ గద్గద హృదయంతో చెప్పుకొచ్చింది నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని. తాను కొనుకున్న కారునే నివాసంగా చేసుకుని కొడుకుతో కలిసి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన సోదరి నెయిల్ సెలూన్లో ఉద్యోగంలో చేరి..మంచి జీవితాన్ని సృష్టించుకోవాలని తపన పడినట్లు చెప్పుకొచ్చింది. ఈ రేంజ్కి ఎలా చేరుకుందంటే..నెయిల్ సెలూన్లో ఉద్యోగం చేస్తూనే, తన కొడుకును చూసుకుంటూ, జియా వివిధ వ్యాపార ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూనే ఉండేది. ప్రారంభంలో వైఫల్యాలు ఎదురైనప్పటికీ, తన క్రిస్టల్ క్యాండీల వ్యాపార ఆలోచన మాత్రం విజయవంతమైంది. అలా రూ. కోట్లు టర్నోవర్ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ క్యాండీ గురించి ఆమెకు ఎలా తెలిసిందటే..సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంది. అయితే ఈ క్యాండీ తన చిన్నప్పుడు నానమ్మతో కలిసి ఇంట్లో తయారు చేసిందే కావడంతో..దీన్నే మళ్లీ పిల్లలకు పరిచయం చేయాలనుకుంది. దాంతో దాని తయారీపై రకరకాలుగా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. అందుకోసం రూ. 40 వేలు ఖర్చు చేసి..మరి ప్రయోగాలు చేసిది. అంతేగాదు ఈ వంట ప్రయోగాలను నెయిల్ సెలూన్ నుంచి తిరిగి వచ్చి..బిడ్డను నిద్రపుచ్చాక చేస్తుండేది. మొదటి మూడు నెలలు చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత రానురాను వ్యాపారం పుంజుకోవడం లాభాలు అందుకోవడం మొదలైంది. అలా ఇవాళ ఏకంగా రూ. 9 కోట్లు టర్నోవర్ చేసే క్రిస్టల్ క్యాండీ కంపెనీని రన్ చేసే స్థాయికి చేరుకోగలిగానని అంటోంది. ఈ విజయంతో అప్పటి వరకు తనపై తనకు ఉన్న అభిప్రాయం నిజంగా మారిందని అంటోంది. ఎందుకంటే తాను చూసిన కష్టాలు, అనుభవించిన బాధలకు తనంత పనికిమాలినిది, నిరుపయోగమైనది మరొకరు ఉండరనే భావన బలంగా ఉండేదట ఆమెకు. కనీసం తన వద్ద స్కిల్స్ లేవు, చదువు లేదు..కేవలం తన కష్టాలే తనలోని సామర్థ్యాన్ని తట్టిలేపి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటోంది జియా. ఐదో తరగతి కూడా చదవని తానే సాధించగలిగానంటే..బాగా చదువుకున్న యువత ఇంకెంత సాధించాలి అని అడుగుతోందామె. అంతేగాదు మన వద్ద చదువు, నైపుణ్యం లేకపోయినా..మనసుపెట్టి నేర్చుకుంటే..ఏదైనా ఇట్టే నేర్చుకుని సక్సెస్ అందుకోగలమని చెబుతోంది జియా.(చదవండి: రెస్టారెంట్ మేనేజర్గా ఇస్రో శాస్త్రవేత్త..! సరదా సంభాషణ..) -
స్కూలు నుంచి గెంటేశారు.. కట్ చేస్తే తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్
బాల్యంలోనే కష్టాలు పలకరించాయి. వైఫల్యాలు వెక్కిరించాయి. కానీ ఆ కష్టాలు అవమానా లనే విజయానికి సోపానాలుగా మల్చుకున్నాడు. కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో విజయం సాధించి పట్టుదలకు మారు పేరుగా నిలిచాడు.రాజస్థాన్లోని బికనీర్లో జన్మించిన ఆకాష్ కుల్హారీ ఐపీఎస్ అధికారిగా ఎదిగిన స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.ఆకాష్ కుల్హారీ బాల్యంలో విద్య చాలా కష్టంగా మొదలైంది. ఉపాధ్యాయుల ప్రశంసలు, ఆదరణ లభించలేదు. 1996లో, అతను 10వ తరగతి బోర్డు పరీక్షలలో కేవలం 57శాతం మార్కులు సాధించాడు. దీంతో పాఠశాల నుంచి తొలగించారు. 11వ తరగతికి అడ్మిషన్ కోరినప్పుడు నిరాకరించారు. ఇదే ఆకాష్ జీవితంలో గొప్ప మలుపుకు పునాది వేసింది.కుటుంబం, ముఖ్యంగా తల్లి ఇచ్చిన మద్దతుతో, ఆకాష్ బికనీర్లోని కేంద్రీయ విద్యాలయంలో తన చదువును తిరిగి ప్రారంభించారు. చదువులో బాగా రాణించి 12వ తరగతిలో 85శాతం మార్కులు సాధించారు. 2001లో బికనీర్లోని దుగ్గల్ కాలేజీనుంచి బి.కామ్ చదివారు. అక్కితో సంతృప్తి చెంది ఆగిపోలేదు. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో, ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్యు)లో ఎం.కామ్ , ఎం.ఫిల్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలుమరోవైపు తన బిడ్డలు గొప్ప గొప్ప ప్రభుత్వ పదవుల్లో చూడాలనే తన తల్లి కలను నెరవేర్చాలనే పట్టుదల పెరిగింది. అలా UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. తీవ్రమైన పోటీ ,ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆకాష్ 2006లో తన మొదటి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో స్థానం సంపాదించారు. ఆకాష్ కుల్హారీ కాన్పూర్లో అదనపు పోలీస్ కమిషనర్గా పనిచేశారు. అనేక ఉన్నత పదవులను చేపట్టారు. ప్రస్తుతం యూపీలో ప్రజా ఫిర్యాదుల ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రధాన కార్యాలయంలో విశిష్టంగా సేవలందిస్తున్నారు. చిన్నపుడు చదువులో వెనుకబడి ఉండవచ్చుకానీ, పట్టుదల, కృషి ఉన్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనడానికి ఆకాష్ గొప్ప నిదర్శనం. ఇది కేవలం ఒక ఐపీఎస్ అధికారి కథ మాత్రమే కాదు. ఎప్పుడు ఎలా ప్రారంభించినా, గట్టిగా నిర్ణయించుకుంటే మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చుకోవచ్చు అని చెప్పే ఒక జీవిత పాఠం.పుట్టుకతోనే మేధావి కాలేకపోవచ్చు. కానీ పట్టదలతో మేధావిగా ఎదగవచ్చు. వైఫల్యం తాత్కాలికం.. అదే అంతం కాదు. అదొక గురువు మాత్రమే ఈ మాటలు ఆకాష్ కుల్హరి సక్సెస్కు మచ్చుతునకలు. -
5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం
సూరత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి సావ్జీ డోలకియా అనగానే అందరికీ గుర్తు వచ్చేది ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం. ఖరీదైన కార్లు ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన బహుమతులతో కేవం తన ఉద్యోగులను మాత్రమే కాదుయావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. కానీ ఇలా ఖరీదైన బహుమతులు వచ్చేంత స్థాయికి రావడానికి వెనుక ఉన్న కృషిని గురించి ఎపుడైనా ఆలోచించారా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి డైమండ్ సామ్రాజ్యాన్ని నిర్మించి, సావ్జీభాయ్గా పేరు గడించిన హరి కృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఛైర్మన్, సావ్జీ ధోలాకియా సక్సెస్ గురించి తెలుసుకుందాం.గుజరాత్లోని దుధాల గ్రామానికి చెందిన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు సావ్జీ ధోలాకియా. కుటుంబ ఆర్థిక పరిస్తితుల కారణంగా 5వ తరగతిలోనే చదువు ఆపేశారు. అంతేకాదు 1977లో కేవలం 13 ఏళ్ల వయసులోనే , జేబులో 12 రూపాయలు 50 పైసలు (బస్సు టికెట్కు సరిపోయే) సూరత్ నగరానికి పయనమయ్యాడు. అప్పటికి ఆయన మనసులో ఉన్నది కుటుంబానికి పోషించుకోవడం మాత్రమే.ఆలా సూరత్ నగరంలో తొలి ఉద్యోగం వజ్రాల కర్మాగారంలో. నెలకు రూ.179 రూపాయల జీతం. ఈ కొద్ది పాటి జీతంలోంచే ఆయన ప్రతి నెలా రూ. 39 పొదుపు చేసేవాడు. 1984లో తనకంటూ ఏదైనా సాధించాలనే కల మొదలైంది. ఈ కల సాకారానికి పట్టుదల ఓర్పుతోడైంది. తన సోదరులతో కలిసి, అతను ‘హరి కృష్ణ ఎక్స్పోర్టర్స్’ అనే చిన్న వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వజ్రాల వ్యాపారం రిస్క్ తో కూడుకున్నది, పైగా పోటీ. దీంతో మొదట్లో వ్యాపారం చాలా కష్టమయ్యేది. కానీ ప్రజలపై సావ్జీభాయ్కి నమ్మకం వమ్ముకాలేదు. దీనికి తోడు ఉద్యోగులకు కార్మికుల్లాగా కుండా, తన ఇంట్లో మనుషుల్లాగా చూసుకునవాడు. అటు ఉద్యోగుల మనసుల్లోనూ, ఇటు వ్యాపారంలోనే అందనంత ఎత్తుకు ఎదిగాడు.ఉద్యోగులకు బోనస్లు ఇవ్వడం మాత్రమే కాదు, ఖరీదైన దీపావళి కానుకలిస్తూ సావ్జీభాయ్ ధోలాకియా వార్తల్లో నిలిచారు. ఆయన నమ్మింది ఒకటే. తన ఉద్యోగులకు బావుంటే.. కంపెనీ బావుంటుంది..వారి అభివృద్దే తన వ్యాపారం అభివృద్ధి అని. అదే నమ్మకం నేటికీ కొనసాగుతోంది. 2025లో కూడా 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన మూడు బ్రాండ్ న్యూ మెర్సిడెస్-బెంజ్ GLS SUVలను కానుకగా ఇచ్చాడు. పాతికేళ్ళనుంచి తన కంపెనీలో సేవలందిస్తున్న నమ్మకమైన జట్టు సభ్యులు, ముగ్గురు సీనియర్ ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చాడు. సావ్జీభాయి దృష్టిలో ఇటువంటి బహుమతులు అంటూ దుబారా కాదు, జీవితాంతం కలిసి చేసిన కృషికి, విజయానికి హృదయపూర్వక 'ధన్యవాదాలు'అంటారాయన.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారంఈ ప్రత్యేకమైన లక్షణమే ఒక చిన్న వర్క్షాప్గా మొదలైన ఆయన కంపెనీ ప్రపంచ వజ్రాల శక్తి కేంద్రంగా నిలిపింది. ఆభరణాల బ్రాండ్ 'కిస్నా వ్యాపారం ఇప్పుడు రూ. 12,000 కోట్లకు పైమాటే.. 2022లో, భారత ప్రభుత్వం సావ్జీభాయ్ ధోలాకియాను గుజరాత్లో సామాజిక సేవలో ఆయన చేసిన విశిష్ట సేవకు గాను దేశంలోని అత్యున్నత పౌర అవార్డులలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. బిలియనీర్ ,పద్మశ్రీ అవార్డు గ్రహీత సావ్జీభాయ్ ఇప్పటికీ చాలా సాదా సీదాగా ఉండే వ్యక్తి. ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్ధోలాకియా 1996లో హరి కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. దాన్నే ధోలాకియా ఫౌండేషన్ అని పిలుస్తారు. దీని ద్వారా అనేక కార్యక్రమాలతోపాటు, చెట్లను నాటడం, నీటిని ఆదా చేయడం , భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని రక్షించడం కోసం కోట్లు ఖర్చు చేయడం విశేషం. మొక్కవోని పట్టుదల, అచంలమైన విశ్వాసంతో సాగిన ఆయన జీవితం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. -
అందంలో.. అధికారంలో..ఆమెకు సాటిరారెవ్వరూ..!
కుటుంబ నేపథ్యం ఆర్థిక సమస్యలకు నిలయం. ఆ నేపథ్యం నుంచి చదువుపై మనసు లగ్నం చేయడం గ్రేట్ అంటే..అందులోనూ..ఏకంగా సివిల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్పై గురిపెట్టడం అంటే మాటలు కాదు. అయినా..ఆ అనితరసాధ్యమైన ఆ పరీక్షను ఎలగైనా గెలవాలన్నదే ఆమె ధ్యేయం. అదొక్కటి అజేయంగా ఎదురునిలబడేలా చేసి..గెలుపుని పాదాక్రాంతం చేసుకుని స్ఫూర్తిగా నిలిచారామె. అంతటితో ఆగలేదు..విధుల పరంగానూ వార్తల్లో నిలిస్తూ..అధికారి అంటే ఇలా ఉండాలి అని ప్రశంసలు సైతం అందుకుని పేరు తెచ్చుకున్నారు. అంతేగాదు ఆమె అందంలోనూ మేటీ. అంతా ఆమెనూ మేథస్సుతో కూడిన అందాల రాశిగా పిలుచుకుంటారు. ఎవరామె..? అంటే..ఆ అందాల సరస్వతే అను బెనివాల్. ఢిల్లీలోని పితాంపురా ప్రాంతంలో ఏప్రిల్ 26, 1992న జన్మించిన అను బెనివాల్ కుటుంబం అత్యంత పేదరికంతో అల్లాడుతూ ఉండేది. తండ్రి సంజయ్ కుమార్ ఓ చిన్న బటన్ తయారీ యూనిట్ని నడిపేవాడు, తల్లి కుటుంబ పోషణ కోసం తనవంతుగా సూట్లు కుట్టేది. అయితే తండ్రి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతగా చదువుకోలేదు. అయినా తన పిల్లలు బాగా చదువుకోవాలని ఆరాటపడేవాడు. అతడి ఆశయానికి అనుగుణంగానే ఇద్దరు పిల్లలు చదువులో బాగా రాణించారు. అంతేగాదు ఆమె యూపీఎస్సీకి సన్నద్ధమైన తరుణంలో ఆమె తల్లిదండ్రులిద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి గుండె జబ్బు వినికిడి లోపంతో బాధపడుతుంటే..ఆమె తల్లి, నాడీ సంబంధిత రోగి, రెండు శస్త్రచికిత్సలు కూడా చేయించుకుందామె. ఇన్ని సవాళ్లు ఇంట్లో ఉన్నా చదువులో ఎప్పుడూ రాజీపడలేదు.. అను. ఇక ఆమె సోదరుడు ఢిల్లీలో ఐఐటీ ఇంజనీరింగ్ వైపుకి వెళ్లగా, అను ఢిల్లీలోనే పాఠశాల విద్య, BSc డిగ్రీ, ఎమ్మెస్సీ పూర్తి చేసింది. కొన్నాళ్లు నానోసైన్స్ పరిశోధన రంగంలో పనిచేసింది. తన విద్యా, పరిశోధన పని పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షపై దృష్టి సారించి.. భౌగోళిక శాస్త్రాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుంది.సివిల్ ఎగ్జామ్లో అను జర్నీ..అను 2018లో తొలిసారి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది కానీ ప్రాథమిక దశలోనే ఉత్తీర్ణురాలైంది. ఇక రెండో ప్రయత్నంలో మెయిన్స్కు చేరినా.. తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే అను పట్టుదటతో మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 638 ర్యాంక్ సాధించినా..అనుకున్న రంగంలో విధులు నిర్వర్తించే అకాశం రాకపోవడంతో మరోసారి సివిల్స్ ఎగ్జామ్కి సన్నద్ధమై మరి నాల్గోప్రయత్నంలో 2022లో 217 ఆల్ ఇండియా ర్యాంక్ను సాధించి.. ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికైంది. అలా ఆమె మధ్యప్రదేశ్ కేడర్లో ఐపీఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తించేవారామె. అంతేగాదు ఆమె ఇటీవల మధ్యప్రదేశ్లో గాల్వియర్లో వాహన తనిఖీల నిమిత్తం ఓ అనూహ్య ఘటనతో వార్తల్లో నిలిచి ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో దటీజ ఐపీఎస్ అను అంటూ అంత కీర్తించారు ఆమెను. ఆ వీడియోలో ఒక డ్రైవర్తో మీ మామ రాష్ట్రపతి అయిన చలానా జారీచేస్తాం అని చెప్పిన డెలాగ్ శెభాష్ మేడమ్ అంటూ సలాం కొట్టారు ఆమెకు. పాలనలో తనకు సాటిలేరెవ్వరూ అనిపించుకుంది ఐపీఎస్ అను బెనివాల్. వ్యక్తిగత జీవితం..ఇక ఈ అధికారిణి అను మధ్యప్రదేశ్ కేడర్లో పనిచేస్తున్న IPS అధికారి డాక్టర్ ఆయుష్ జఖర్ను వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దిలీప్ జఖర్ కుమారుడు. ఇక అను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ..నెటిజన్లతో పిట్నెస్కి సంబంధించిన టిప్స్ షేర్స్ చేస్తుంటుంటారామె. View this post on Instagram A post shared by NDTV India (@ndtvindia)(చదవండి: జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..) -
జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..
ఒక సాధారణ కాలేజీలో చదివిన అబ్బాయి..అంచెలంచెలుగా ఎదుగుతూ..ఐఐటీ రేంజ్లో స్టూడెంట్ రేంజ్లో వేతనం అందుకున్నాడు. అది కూడా..జస్ట్ రెండేళ్లలో అత్యున్నత వేతనం అందుకునే రేంజ్కి చేరి.. ఓ విద్యార్థి చదువుతుండగానే జాబ్ కెరీర్ని ఎలా నిర్మించుకోవాలో చూపించి.. యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఓ సాధారణ చిన్నకాలేజ్లో చదివి..ఉద్యోగం సంపాదించలేకపోయా అని సాకులు చెప్పేవాళ్లుకు అతడి కథ ఓ చెంపపెట్టు..మరి అతడి స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఏంటో చకచక చదివేద్దామా..!.రెడ్డిట్లో ఒక యువ సాఫ్ట్వేర్ డెవలపర్ తన స్టోరీని షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ప్రేరణ కలిగించే అతడి స్టోరీ..అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడమే కాదు ఇది కథ సక్సెస్ అని కితాబిచ్చేస్తున్నారు నెటిజన్లు. ఆ పోస్ట్లో తాను ఓ సాధారణ స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యేయట్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే తాను కాలేజ్లో చదువుతున్నప్పుడే పనిచేయడం ప్రారంభించానని, మూడో ఏడాదిలోనే..ఒక స్టార్టప్లో ఎస్డీఈ ఇంటర్న్గా చేరి నెలకు రూ. 25 వేలు వరకు సంపాదించనని చెప్పాడు. జస్ట్ ఐదునెలలకే అతడి జీతం రూ. 35 వేలుకి పెరిగింది. ఆ తర్వాత చివరి ఏడాదిలో ఆ టెకీ నెలకు రూ. 45 వేల స్టైఫండ్తో మరో స్టార్టప్లో ఇంటర్న్గా చేరినట్లు తెలిపాడు. ఆరు నెలలకు ఏడాదికి రూ. 12 లక్షల వేతనంతో పర్మినెంట్ ఉద్యోగం ఆఫర్ అందుకున్నట్లు తెలిపాడు. చివరికి ఆ జీతం కూడా ఆ ఏడాదిలోపే రూ. 18 లక్షలకు మేర పెంచినట్లు పేర్కొన్నాడు. ఆ తదుపరి అప్రైజల్ తర్వాత తన జీతం ఏడాదికి రూ. 24 లక్షలకు చేరిందని వెల్లడించాడు. అయితే తాను ఇంటర్న్షిప్ సమయంలో ఒక్కసారి మాత్రమే కంపెనీని మారినట్లు తెలిపాడు. ర్యాపిడ్ రేంజ్లో వృద్ధిలో వచ్చినా..ఎందుకో తనలో అసంతృప్తి వెంటాడుతోందంటూ తన రెడ్డిట్ పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు తన కెరీర్ మరింత ఉత్సాహభరితంగా కొనసాగాలంటే ఏం చేయాలో సూచించండి ప్లీజ్ అంటూ సలహా కూడా కోరాడు. అలాగే ఆ పోస్ట్లో ఆ టెకీ తాను ఇంటర్న్షిప్లలో ఎలా అధిక వేతనం అందుకోగలిగాడో కూడా షేర్ చేసుకున్నాడు. ప్రారంభదశ స్టార్టప్ల వ్యవస్థాపకులకు నిధులు సమీకరించేందుకు నేరుగా మెసేజ్లు పంపేవాడిని. అలాగే స్టార్టప్కి సంబంధించిన వార్తల సాయంతో కొత్తస్టార్టప్లను ట్రాక్ చేసి..తన రెజ్యుమ్లో తాను కోరుకుంటున్న జాబ్ గురించి వివరాలను పొందుపరిచేవాడిని..దాంతో తనకు సులభంగా మంచి స్టార్ట్ప్లలో ఉద్యోగం దక్కించుకునేందుకు హెల్ప్ అయ్యిందన్నాడు ఈ పోస్ట్ చాలామంది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..ఓ సాధారణ కాలేజ్ నుంచి ఈ రేంజ్లో వేతనం అందుకోవడం అంటే మాటలు కాదంటూ ప్రశంసించడమే కాదు..తాము కూడా ఆ మార్గంలోనే పయనిస్తామంటూ పోస్టులు పెట్టారు. ఇతడి కథ చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ మూవీలోని డైలాగ్ గుర్తొస్తుంది. ఈ టెకీని ఏ కాలేజ్లో చదివాం అన్నది కాదు..లక్షల్లో వేతనం అందుకున్నమా లేదా అన్నది మేటర్ అనొచ్చు కదూ.. -
ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్స్టాక్ డెవలపర్ రేంజ్కి..!
ఏ చిన్న ఉద్యోగం చేసినా..అక్కడే ఉండిపోకూడదు..దినదినాభివృద్ధి చెందాలన్నా ఆర్యోక్తిని బలంగా నమ్మాడు ఈ వ్యక్తి. శ్రమతో కూడిన ఉద్యోగం చేస్తూ..కూడా మంచి ఉన్నతోద్యోగిగా మారాలన్న ఆశయాన్ని బలంగా ఏర్పరుచకున్నాడు. ఆర్థిక పరిస్థితి చదువు కొనసాగనివ్వకపోయినా..తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. అనుకున్నది సాధించి..పరిమితులు, ఆర్థిక వనరులు అనుకూలంగా లేకపోయినా..ఉవ్వెత్తిన ఎగిసిపడే కెరటంలా అనితర సాధ్యమైన లక్ష్యాన్ని చేధించగలమని నిరూపించి.. స్ఫూర్తిగా నిలిచాడు. అతడు పూణేకు చెందిన యువకుడు. అతడి కథ నెట్టింట వైరల్గా మారండంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అతడు యూఎస్ ఆధారిత కూరగాయల ప్రాసెసింగ్ ఫ్యాకర్టీలో రోజుకి పదిగంటల షిప్ట్లో పనిచేస్తుండేవాడు. నిజానికి ఈ ఉద్యోగం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమతో కూడిన ఉద్యోగం. అతనికి కోడింగ్పై ఎలాంటి ముందస్తు నేపథ్యంగానీ, అవగాహన గానీ లేదు. కానీ స్నేహితుడు చెప్పిన ఎలోనమస్క్ సూచన అతడిని ఎంతగానే ప్రేరేపించింది. ఆ సూచననే కార్యరూపంలోకి తీసుకొచ్చేలా..ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాన్ మస్క్ అన్నట్లుగా ప్రతీది ఇంటర్నెట్లో ఉచితంగా లభిస్తుంది కాబట్టి అదే మీ అభ్యున్నతికి అద్భుతమైన వనరు అన్న మాటలు తూచతప్పకుండా ఫాలో అయ్యాడు అతడు. డబ్బు ఆదా చేసుకుని మరి తల్లిదండ్రుల మద్దతుతో ఓ ల్యాప్టాప్ కొనుకున్నాడు. దాని సాయంతో ఆన్లైన్ వనరులను ఉపయోగించుకుని హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ను అధ్యయనం చేశాడు. ఖరీదైన కోర్సులు లేకుండా డాక్యుమెంటేషన్ చదవడం ప్రారంభించాడు. అలా ప్రాజెక్టులు నిర్మించడం, ఆ క్రమంలో జరిగే తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి చేస్తున్నాడు. జస్ట్ 18 నెలల్లో తనను తాను ఫుల్స్టాక్ డెవలపర్గా తీర్చిదిద్దుకుని యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. నేర్చుకోవాలనే తప్పన, మంచి స్ధాయిలో ఉండాలన్న అభిలాష, ఆర్థిక వనరులు, పరిస్థితులు వెనక్కిలాగలేవు, ఆపలేవు అని నిరూపించాడు. From a factory worker to a full-stack developer in 1.5 years of grind.I’m not saying this to flex.I’m saying this because I didn’t believe it was possible either.1.5 years ago, I was working in a vegetables factory.10 hours a day. Packing. Picking. Standing.Physically… pic.twitter.com/pn30AaJ8LY— Sambhav.apk▲ (@Coding_Sage) January 2, 2026 ఫుల్-స్టాక్ డెవలపర్ అంటే వెబ్సైట్ లేదా అప్లికేషన్ ముందు భాగం (యూజర్ చూసేది), వెనుక భాగం (డేటాబేస్లు, సర్వర్లు) రెండింటినీ నిర్మించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. వీరికి HTML, CSS, JavaScript (ఫ్రంట్-ఎండ్ కోసం), Python, Java, Node.js వంటి భాషలు, డేటాబేస్ మేనేజ్మెంట్ (బ్యాక్-ఎండ్ కోసం) వంటి విస్తృత నైపుణ్యాలు అవసరం. ఇది ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్ను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్తో మొదటి సంపాదన..!) -
మెక్డొనాల్డ్స్లో పార్ట్టైం జాబ్ నుంచి..ఫ్లయింగ్ ఆఫీసర్ రేంజ్కి..!
సక్సెస్ అనేది ఎంతో కష్టపడి సాధించుకోవాల్సిందే. అలుపెరగని పోరాటం, కఠిన శ్రమ తోడు అయితే గానీ గెలుపుని పాదాక్రాంతం చేసుకోలేం. అంత కష్టపడ్డా ఒక్కోసారి దోబుచులాడి బాధపెడుతుంటుంది. ఓర్పుతో పోరాడితే ఓటమిని ఓడించి విజయాన్ని వశం చేసుకోగలం. అలా కష్టపడి శదేశానికి సేవ చేసే అత్యుతన్న హోదాని కైవసం చేసుకున్నాడు భవ్య షా. భవ్యమైన అతడి సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..భవ్య షా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అబ్బాయి. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే భాద్యతలు తీసుకుంది. పూణేలోని కళాశాలలో చదువుతున్నప్పుడే మెక్డొనాల్డ్స్ కౌంటర్లో పార్ట్టైమ్ పనిచేసేవాడు. ఆ ఉద్యోగం అతడికి తనను తాను పోషించుకోవడం తోపాటు, క్రమశిక్షణ, సమయ నిర్వహణ, స్వతంత్రంగా వ్యవహరించడం వంటి విలువైన జీవిత పాఠాలను నేర్పింది. ఒకపక్క పార్ట్టైం ఉద్యోగం, మరోవైపు చదువు సాగిస్తున్నప్పుడే ఎదురయ్యే నిరుత్సాహాన్ని ఎలా బలంగా మార్చుకోవాలో నేర్చుకున్నాడు. చదువు, పనిని అంకితభావంతో చేస్తూనే..దేశానికి సేవ చేయాలనే తన డ్రీమ్ని అస్సలు మర్చిపోయేవాడు కాదు. ఆ తర్వాత నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), ఎయిర్ వింగ్లో చేరినప్పుడు భవ్య జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. NCC శిబిరాలు, శిక్షణ ద్వారా, అతను క్రమశిక్షణా జీవితాన్ని అనుభవించాడు.ఆ తర్వాత మైక్రోలైట్ ఫ్లయింగ్లో అనుభవం గడించాడు. ఆ అనుభవం భారత వైమానిక దళంలో పైలట్గా చేరాలనే లక్ష్యానికి నాంది పలికింది. అలా భవ్య షా సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB)కి ప్రిపరయ్యేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ క్రమంలో ఎన్నో తిరస్కరణలు, వైఫల్యాలు ఎదుర్కొనక తప్పలేదు. అయితే సాధించేంత వరకు ఆపేదే లే అన్నట్టు మరింత దృఢనిశ్చయంతో ఆ ఎగ్జామ్కి ప్రపేరయ్యాడు.చివరికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో చేరినప్పుడు తన కల సఫలమైంది. శిక్షణ పొందిన కేవలం మూడు నెలలలోనే, భవ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరిట్ జాబితాలో స్థానం సంపాదించి IAF పైలట్ కావాలనే తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. ఏళ్ల తరబడి కృషి, సంకల్పం, సడలని ఆత్మవిశ్వాసంతో తన కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలిచాడు భవ్యషా. అతడు సదా "తగ్డా రహో"(ఎల్లప్పుడూ బలంగా, ఆరోగ్యంగా ఉండటం)ని విశ్వసిస్తుంటాడు. కష్టాల్లో బలంగా, ప్రయత్నంలో స్థిరత్వం, శక్తివంతమైన ఆత్మవిశ్వాసమే గెలుపుని పాదాక్రాంతం చేసుకునే ఆయుధాలని తన విజయంతో చెప్పకనే చెప్పాడు భవ్యషా.(చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..) -
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
వ్యాపారం చేసి రాణిద్దామనుకున్నాడు. ప్రారంభించిన నెలల వ్యవధిలోనే భారీగా నష్టపోయి, అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా అప్పు తీర్చి.. మరోసారి వ్యాపారం చేయడానికి పెట్టుబడి సిద్ధం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాడు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అప్పు తీర్చడమే కాకుండా.. కొత్త ఏడాదిలో కోటి రూపాయలతో రెండు టిఫిన్ సెంటర్లు కూడా ప్రారంభిస్తాడట. నిరాశతో కూరుకుపోయిన జీవితాన్ని స్వయంకృషితో ముందుకు సాగిన చైనాకు చెందిన పాతికేళ్ల కుర్రాడి గురించి అక్కడి మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఫుడ్డెలివరీ బాయ్గా కోట్లు ఎలా సంపాదించాడో గర్వంగా చెప్పుకుంటున్నాడు. శ్రమ, పట్టుదల ఉంటే అసాధ్యమేదీ కాదని నిరూపించిన చైనా యువకుడు జాంగ్ జుకియాంగ్ గురించి తెలుసుకుందాం.వ్యాపారంలో నష్టందక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన పాతికేళ్ల 'జాంగ్ జుకియాంగ్' 2020లో ఓ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెలల వ్యవధిలోనే నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. నష్టంతో పాటు అప్పటికే అతనికి 50వేల యువాన్లు ఇక్కడి కరెన్సీ ప్రకారం. సుమారు ఆరున్నర లక్షలు అప్పు కూడా అయింది. సర్దుకున్న జాంగ్ నిరాశపడలేదు. ఎలాగోలా ముందుకెళ్లాలని నిర్ణయించుకుని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో చేరాడు. ఫుడ్ ఆర్డర్లను సరఫరా చేయసాగాడు. తోటి డెలివరీ బాయ్స్లా కాకుండా.. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టకున్నాడు. నెలకు కనీసం ఇక్కడి కరెన్సీలో చూస్తే మూడు లక్షల రూపాయలు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.365 రోజులు పని & రోజుకు 300 పార్శిళ్లుఏడాది మొత్తంలో 365 రోజులు పని చేయడం, రోజూ కేవలం విశ్రాంతి, తినడానికయ్యే సమయాన్ని మినహాయించి మిగతా సమయం అంతా ఫుడ్ డెలివరీ కోసం కేటాయించాడు. నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు అంటే సుమారు 14 గంటలు ఫుడ్ డెలివరీ కోసం తిరిగాడు. రోజూ కనీసం 300 పార్శిళ్లను లక్ష్యంగా పెట్టకుని వాటిని కస్టమర్లకు అందజేశాడు. ప్రతిరోజు సుమారు 9 గంటల పాటు విశ్రాంతి తీసుకునే వాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగతా సమయాన్ని ఫుడ్ డెలివరీకి కేటాయించాడు.డబ్బు సంపాదన ధ్యేయంగా పని చేసిన జాంగ్ రోజూ 300 పార్శిళ్లు ఇవ్వడం... ప్రతి పార్శిల్కు అత్యధికంగా 20 నుంచి25 నిముషాలకు మించి సమయం తీసుకోకుండా త్వరితగతిన డెలివరీ చేయడంలోనూ ఫుడ్ డెలివరీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. ఐదేళ్ల వ్యవధిలో జాంగ్ డెలివరీ కోసం 3లక్షల 24వేల కిలోమీటర్లు ప్రయాణించడంతో పాటు లక్షన్నరకు పైగా ఫుడ్ డెలివరీ పార్శిళ్లను అందజేశాడు. అతని అంకితభావాన్ని చూసి తోటి ఉద్యోగలు అతనికి ఆర్డర్ కింగ్ అని నామకరణం చేశారు. ఐదేళ్ల కాలంలో జాంగ్ మొత్తం కోటి 80లక్షలు సంపాదించి.. వాటిలో కోటి 42 లక్షలు పొదుపు చేయగలిగాడు. ఆ డబ్బుతో తిరిగి వ్యాపారం చేయడానికి సిద్ధమవుతన్నాడు. -
క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే..
చాలామంది విద్యార్థులు మంచి యూనివర్సిటీ డిగ్రీ, పీజీలు చేశాక ఉద్యోగ వేటలో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అప్పుడే తెలుస్తుంది ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాదని. అచ్చం అలాంటి పరిస్థితిని ఎదర్కోని ఎన్నో చిన్న చితకా ఉద్యోగాలతో విసిగివేసారి.. చివరికి లక్షల కోట్లు విలువ చేసే కంపెనీకి సీఈవో రేంజ్కి ఎదిగాడు గేమింగ్ ఫ్లాట్ఫామ్ రోబ్లా సీఈవో డేవిడ్ బస్జుకి. పైగా విద్యార్థులకు తనలా చేయొద్దంటూ తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు కూడా. మరి అతడు ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడో సవివరంగా చూద్దామా..!స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి అయిన 62 ఏళ్ల డేవిడ్ బస్జు అక్కడ విద్యార్థులతో తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా గందరగోళానికి గురయ్యానని, పలు ఉద్యోగాల ఇంటర్వ్యూలో రిజెక్షన్లు, దాంతో తన అర్హతకు సరిపడని ఏవేవో ఉద్యోగాలు చేసి చాలా నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యానంటూ వివరించాడు. చెప్పాలంటే చాలామంది విద్యార్థులు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారని అన్నారడు. ఎందుకంటే సరిగ్గా మనం వచ్చేటప్పటికే ఉద్యోగ మార్కెట్ పేలవంగా ఉండటంతో ఉద్యోగం సంపాదించడం అన్నది కష్టాసాధ్యమైన విషయంగా మారిపోతుందన్నారు. అలాగే ఆ సమయంలో మనకు సలహాలిచ్చే వాళ్లు కూడా ఎక్కువైపోతారు, పైగా అవి వినబుద్ధి కూడా కాదని అన్నారు. ఆ కష్టకాలంలో తాను తన అంతరదృష్టిపై ఫోకస్ పెట్టి అస్సలు తానేం చేయాలనుకుంటున్నాడు, ఏదైతే తన కెరీర్ బాగుంటుంది అనే వాటి గురించి ప్రశాంతంగా ఆలోచించేవాడని చెప్పారు. తన అంతరంగా చెబుతున్నదాన్ని, ఇష్టపడుతున్నదాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేశానని, అలాగే తాను అంతకుముందు చేసిన చెత్త ఉద్యోగాలతో పొందిన అనుభవం కూడా దీనికి హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. స్టాన్ఫోర్డ్ విద్యార్థిని అన్న పేరు..మంచి కెరీర్ని సంపాదించుకోవడానికి హెల్ప్ అవ్వలేదని అంటాడు ఈ టెక్ దిగ్గజం డేవిడ్. ఎందుకంటే కాలేజ్ చదువు పూర్తి అయిన తర్వాత కెరీర్ ఒక్కసారిగా స్థంభించిపోయినట్లు అయిపోయిందంటూ నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. తన డ్రీమ్ జాబ్ సంపాదించలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావని వాపోయాడు. చివరికి ఆ కష్ట సమయంలో సమ్మర్ టైంలో తన సోదరులతో కలిసి కిటికీలు శుభ్రంచేసే పనికి సైతం వెళ్లినట్లు తెలిపాడు. ఈ చిన్ని చిన్ని ఉద్యగాలుచేయలేక సతమతమవుతున్న తరుణంలోను తన అంతరంగం చెబుతున్న దానివైపు మళ్లాడానికి చాలా ధైర్యం కావలి కూడా. ఎందుకంటే అప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో తిరస్కరణలు చూశాక..అస్సలు మనపై మనకు నమ్మకం ఉండదు. కానీ సక్సెస్ కావాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయకుడదు, అలాగే నీ సామర్థ్యంపై నమ్మకం సడలకూడదు. అప్పుడే విజయం ఒడిలోకి వచ్చివాలుతుందని అంటాడు డేవిడ్. అంతేగాదు తన మనసు ఏకంగా తొమ్మిది రకాల కెరీర్ ఆప్షన్లు ఇచ్చిందని, అయితే వాటిలో ఏది బెటర్, ఏది మంచిది కాదు అని అంచనా వేసుకుంటూ..కెరీర్ని నిర్మించుకున్నానని చెప్పాడు. అలా సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువచేసే గేమింగ్ ఫ్లాట్ఫామ్ రోబ్లాక్స్కి నాయకత్వం వహించే రేంజ్కి వచ్చానంటూ తన విజయ రహస్యాన్ని విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు డేవిడ్ ఏకంగా రూ. 4 వేల కోట్ల నికర విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్న కుభేరుడు కూడా.(చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..) -
ఫోర్బ్స్ జాబితాలో 26 ఏళ్ల కళ్యాణి రామదుర్గం
కోబాల్ట్ ల్యాబ్స్ కో-ఫౌండర్.. భారత సంతతికి చెందిన కళ్యాణి రామదుర్గం(Kalyani Ramadurgam).. మాజీ అఫర్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'ఆషి అగర్వాల్'తో కలిసి, ఫైనాన్స్ విభాగంలో 2026కి ఫోర్బ్స్ 30-అండర్-30 యునైటెడ్ స్టేట్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంతకీ ఎవరీ కళ్యాణి రామదుర్గం?, ఫోర్బ్స్ జాబితాలో చేరేలా ఏమి సాధించారనే.. విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించడానికి ముందు.. కళ్యాణి రామదుర్గం యాపిల్ సంస్థలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు, సెక్యూరిటీ సమస్యలు వంటివి గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీపై పని చేశారు.అలా కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభంయాపిల్ కంపెనీలో పని చేస్తూ.. బ్యాంకులు, ఇతర పెద్ద కంపెనీలు తమ నియమాలను పాటిస్తున్నాయా.. లేదా? అని తెలుసుకోవడానికి వేల పేజీల డాక్యుమెంట్లను మనుషులు మాన్యువల్గా చెక్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం తీసుకురావాలనే సంకల్పంతో కళ్యాణి కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించారు.కోబాల్ట్ ల్యాబ్స్ స్టార్టప్.. ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ సహాయంతో పెద్ద పెద్ద డాక్యుమెంట్లను వేగంగా చదివి, బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు తమ వ్యాపారాలను.. చట్టాలు, నియమాల ప్రకారం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. భద్రత కూడా మెరుగవుతుంది.అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ గుర్తింపుకోబాల్ట్ ల్యాబ్స్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది.. మిలియన్ల డాలర్ల ఫండింగ్ను కూడా సాధించగలిగింది. టెక్నాలజీని ఉపయోగించి, అద్భుతం చేసిన.. కల్యాణి రామదుర్గం కృషికి గుర్తింపుగా 26ఏళ్ల వయసులో ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు దక్కింది.కోబాల్ట్ ల్యాబ్స్ ఒక మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం.. ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో చూపించే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ రంగంలో ఇలాంటి ఆలోచనలు చేసే ఎంతోమందికి ఇదొక ప్రేరణ.కళ్యాణి రామదుర్గం యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా అని అక్కడే ఆగిపోయి ఉంటే.. నేడు ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు సంపాదించగలిగేవారా?, కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి చెందకూడదు. కొత్తగా ఆలోచించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పెద్ద సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విజయమే. ఆ విజయాన్ని అక్కడితో ఆపేయకూడదు.In 2023, Kalyani Ramadurgam founded Kobalt Labs with former Affirm software engineer Ashi Agrawal to bring compliance into the machine-learning age. Kobalt's AI models sort through mountains of documents to help banks vet their business partners, ensuring they're following the… pic.twitter.com/G238c6pXVg— Forbes (@Forbes) December 17, 2025 -
ఆర్మీ లెఫ్టినెంట్గా ఆయమ్మ కొడుకు!..!
కొన్ని సక్సెస్లు సంవత్సరాల తరబడి నిరీక్షణ, అంకితభావం, ఓపికతో సాకారం అవుతాయి. అలాంటి కథలు ఎప్పటికీ చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం.చిన్ననాటినుంచి కష్టాలు, తగినన్ని వనరుల కొరత ఇన్ని ఉన్నా..ఎలాగైన అద్భుతమైన విజయం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగి గెలుపు తీరాలకు చేరుకున్నవారని జగజ్జేతలు అనొచ్చు. కలను నిజం చేసుకోవడంలో మార్గదర్శకులు కూడా. అలాంటి ప్రేరణాత్మక సక్సెస్ స్టోరీ ఈ లెఫ్టినెంట్ హర్దీప్ గిల్. హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాకు చెందిన హర్దీప్గిల్ చిన్ననాటి నుంచి ఆర్మీలో సేవ చేయాలనేది డ్రీమ్. బాల్యంలో స్కూల్లో మాస్టర్ల వల్ల మదిలో పురుడుపోసుకున్న డ్రీమ్ అతడితోపాటు పెరిగిందే కానీ కనుమరగవ్వలేదు. అయితే హర్దీప్ రెండేళ్ల వయసు నుంచి కన్నీళ్ల కష్టాల కడలిని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నతనంలోనే తండ్రిన పోగొట్టుకున్నాడు. కుటుంబ భారం అంతా అమ్మమీదే పడింది. ఆమె మధ్యాహ్నా భోజన పథకం వంటమనిషిగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేది. అలాగే కొంత ఆదాయం కోసం చిన్నపాటి వ్యవసాయం కూడా చేస్తుండేది అప్పడప్పుడూ. ఇంట్లో ఉన్నత చదువుకు తగినన్ని వనరులేమి లేవు. కానీ ఆ వాతావరణమే గిల్కి నిలకడను, క్రమశిక్షణ, బాధ్యతలను అలవర్చాయి. తనచుట్టూ ఇన్ని సవాళ్లు ఉన్న గిల్ తన ఆశయాన్ని కొనసాగించాడమే కాకుండా, ఎలాగైన ఆర్మీలో చేరి సేవ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఆనేపథ్యంలో తన గ్రామంలోనే పాఠశాల విద్య, ఇగ్నో ద్వారా బీఏ పూర్తి చేసి చదవు తోపాటు ఇతర రక్షన పరీక్షలకు సిద్ధమవ్వడం కొనసాగించాడు. సుమారు నాలుగేళ్ల క్రితం గిల్ భారత వైమానిక దళంలో ఎయిర్మెన్గా ఎంపికయ్యాడు. అతని విజయం కుటుంబంలో కొండంత ఆశను నెప్పింది. శిక్షణా ప్రక్రియ పూర్తి అయ్యి సర్వీస్లో చేరతాడు అనగా అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి..మునుపటి నియమాకాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ తన ప్రస్థానం మొదట నుంచి మొదలుపెట్టాల్సి వచ్చినందుకు నిరాశ పడలేదు. ఈసారి ఏకంగా కమిషన్డ్ అధికారి అవ్వడమే లక్ష్యంగా ఎస్ఎస్సీ పరీక్షలపై ఫోకస్ పెట్టాడు. పదేపదే ఓటములు..గిల్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు అనేకసార్లు హాజరవ్వుతూనే ఉండేవాడు. ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉండేది. రాతపూర్వక పరీక్షలోనే విజయవంతమవ్వలేక నానా తిప్పలు పడ్డాడు. పాపం అది తన ఆత్మవిశ్వాసానికి, సహనానికి పరీక్షలా మారింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్నికొనసాగించాడు. చివరికి తొమ్మిదో ప్రయత్నంలో సక్సెస్ అందుకుని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్లో 54వ ర్యాంక్ను సాధించాడు.ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణగిల్ 2024లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. కఠినమైన శిక్షణా షెడ్యూల్ ఉండేది. ఆ దినచర్య చాలా సవాలుతో కూడినది. ముందుకుసాగడం అంత సులభం కాదు. కానీ అందుకు తగ్గట్టుగా తనను తాను రాటుదేల్చుకుని మరి నిలబడ్డాడు. అనుకున్నట్లుగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో లెఫ్టినెంట్ కమిషన్డ్ అధికారిగా నియమించబడ్డాడు. గిల్ని సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ 14వ బెటాలియన్కు అదికారిగా నియమించారు. ఇది క్రమశిక్షణ, కార్యచరణ సింసిద్ధతలకు పేరుగాంచిన యూనిట్. ఈ దృఢ సంక్పలం తన తల్లిన నుంచి వచ్చిందని చెబుతున్నాడు గిల్. ముఖ్యంగా ఎయిర్మ్యాన్ అవకాశాన్ని కోల్పోవడాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాగే కొండంత ఆశతో మొదటి నుంచి మొదలుపెడుతే..తీరా పదేపదే పలకరించే వైఫల్యాలను అధిగమించి సక్సెస్ అందుకోవడం అనేది మాటల్లో చెప్పగలిగేంత సులభం కాదు అని అంటాడు గిల్. ఇది అలాంటి ఇలాంటి సక్సెస్ స్టోరీ కాదుకదూ..!(చదవండి: ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్! 93 ఏళ్ల రికార్డు బ్రేక్ -
ఆ తల్లి కొడుకు కార్పెంటర్ అయితే చాలు అనుకుంది..! కట్చేస్తే..
తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్ కార్పెంటర్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అమ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా..గొప్ప టాలెంట్, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.అతడే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్ బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్ జర్నీ గురించి ఇలా షేర్ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్ఎహెచ్ఎస్ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్గానో లేదా ఎలక్ట్రిషియన్ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు. ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్. అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్ట్రైడ్ సెంటర్ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్ సర్వీస్లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్ ముస్లింలకు ఆ సర్వీస్ వరంగా మారింది. ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్మైండ్(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్ 650 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు. తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్ పొజిషన్లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు!
ఎన్నో స్ఫూర్తిదాయకమైన స్టోరీలు చూస్తుంటాం. ఎంతవరకు ప్రేరణగా భావిస్తామో తెలియదు గానీ, మన కళ్లముందే డెవలప్ అవుతున్న వాళ్లను బొత్తిగా గమనించం. కనీసం వాళ్లను చూసినా.. సక్సెస్ని ఒడిసిపట్టుకోవడం ఎలాగో తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈవిద్యార్థి.జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఒకప్పుడు బ్లింకిట్లో డెలివరీ ఏజెంట్గా పనిచేసిన ఉద్యోగి గురించి సోషల్ మీడియాలో ఎక్స్లో షేర్ చేశారు. ఆయన ఆ పోస్ట్లో విద్యార్థి దృఢ సంకల్పాన్ని, ఆహార సాంకేతికత పర్యావరణ వ్యవస్థ సృష్టించిన అవకాశాలను ప్రశంసించారు. గోయల్ తన పోస్ట్లో బ్లింకిట్ ఉద్యోగి అథర్వ్ సింగ్ తండ్రి మద్దతు లేకుండా విద్య, జీవన ఖర్చుల కోసం ఎలా నిధులను సమకూర్చుకుంటున్నాడో వివరించారు. ఇది చూశాక తాను ఏమి సంపాదించలేని సమయం చాలానే ఉంది కదా అని నా జీవితం ప్రశ్నిస్తున్నట్లు అనిపించిందని గోయల్ పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ వ్యక్తి పరిస్థితి మెరుగుపడింది బ్లింకిట్ నియామకం గురించి ఇన్స్టాగ్రామ్ ప్రకటన చూశాకేనని అన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థి జీవితం దినదినాభి వృద్ది చెందుతూనే ఉందని పోస్ట్లో వెల్లడించారు గోయల్. ఒక పక్క కాలేజ్లో డిజైన్ కోర్సు చదువుతూ బ్లింకిట్లో డెలివరి బాయ్గా పని చేసిన ఆ అబ్బాయి ఇవాళ జొమాటో డిజైన్ బృందంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడంటూ ఆయన పోస్ట్ని ముగించారు. ఇది నిజంగా గ్రేట్ కదా..ఒకప్పుడు డెలివరీల చేసిన అబ్బాయే ..డిజైన్ చేసే స్థాయికి అంటే చాలా స్ఫూర్తిదాయకమైన జర్నీ కదూ ఇది. క్షణాల్లో వైరల్ అయిన ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు చాలా అమ్యూలమైన పాఠాన్ని అందించింది ఈ స్టోరీ అని కొందరూ, ఇలాంటి సక్సెస్ స్టోరీలు మనకు ఆకాశమే హద్దు అని అనిపించేలా చేస్తాయి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Stories like this make all of it absolutely worth it. pic.twitter.com/HMd1U3N8c7— Deepinder Goyal (@deepigoyal) December 11, 2025 (చదవండి: రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు) -
డ్రాపౌట్ టు బిలియనీర్
సెల్ఫ్–మేడ్ బిలియనీర్ల సక్సెస్ స్టోరీలు ఎంతో ఆసక్తిగా వినేవాడు ఆదర్శ్ హిరేమర్. ‘మెర్కోర్’ స్టార్టప్తో తాను కూడా సెల్ఫ్– మేడ్ బిలియనీర్ల జాబితాలో చిన్న వయసులోనే చేరిపోయాడు. ఇది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమఫలం. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’తో విశిష్ఠ విజయాన్ని సాధించాడు 22 సంవత్సరాల ఆదర్శ్...ట్రెండన్ ఫుడీ, సూర్య మిదా (ఇద్దరి వయసు 22 ఏళ్లు)తో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’ ప్రారంభించాడు ఆదర్శ్. ఈ స్టార్టప్ ఇటీవల పది బిలియన్ డాలర్ల విజయాన్ని అందుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫేస్బుక్ను ప్రపంచానికి పరిచయం చేసిన ‘టెక్ టైటాన్’ మార్క్ జుకర్బర్గ్ రెండు దశాబ్దాల రికార్డ్ను బ్రేక్ చేసింది. సిలికాన్వ్యాలీలోని బే ఏరియాకు చెందిన ఈ ముగ్గురు స్నేహితులు ఒక స్కూల్లో జరిగిన డిబేట్ సందర్భంగా మొదటిసారిగా కలుసుకున్నారు. బెల్లార్మైన్ కాలేజిలో చదువుకునే రోజుల్లో ప్రతిష్ఠాత్మకమైన థీల్ ఫెలోషిప్ అందుకున్నారు. ఆ తరువాత కాలేజికి గుడ్బై చెప్పారు.స్టార్టప్ ప్రారంభించారు..డాటా లేబులింగ్, ఏఐ మోడలింగ్ ట్రైనింగ్కు సంబంధించి తక్కువ టైమ్లోనే ఈ స్టార్టప్ మంచి పేరు తెచ్చుకుంది. డాక్టర్లు, లాయర్లు, కన్సల్టెంట్స్, బ్యాంకర్ల రూపంలో కంపెనీలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ వార్షిక రికరింగ్ రెవెన్యూ(ఏఆర్ఆర్) 500 మిలియన్ డాలర్లు.‘ఇది నిజమేనా అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఈ స్టార్టప్ లేకపోతే కాలేజీలోనే చదువుతూ ఉండేవాడిని’ నవ్వుతూ అంటాడు ఆదర్శ్. కాలేజీ రోజుల్లో క్రమశిక్షణ, కొత్త విషయాలపై ఆసక్తితో ఉండేవాడు ఆదర్శ్. ఆ రెండూ తనకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. పని బాగా నచ్చితే పనిలాగా అనిపించదు. ఆదర్శ్ విషయంలోనూ ఇదే జరిగింది. కంపెనీ ప్రారంభించిన తరువాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కూడా పని గురించే ఆలోచిస్తుంటాడు!‘మెర్కోర్’ స్టార్టప్ సూపర్ సక్సెస్కు కారణం ఏమిటి?ఆదర్శ్ మాటల్లో చె΄్పాలంటే.. ‘ఏఐ ల్యాబ్లు, కస్టమర్లు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయం అది. ఆ సమయంలోనే మేము మెర్కోర్తో ఏఐ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. కొద్ది కాలంలోనే వారు ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయం మేము కావడం సంతోషంగా ఉంది’ అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ ఆదర్శ్కు మన దేశంతో బలమైన భావోద్వేగ బంధం ఉంది. అతడి తల్లిదండ్రులు కర్నాటకకు చెందిన వారు..‘ఇండియాలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు’ అంటాడు ఆదర్శ్. సైజబుల్ ఆపరేషన్స్, ప్రొడక్ట్స్, ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ టీమ్తో గ్లోబల్ ఏఐ టాలెంట్లో తనదైన పేరు తెచ్చుకుంది మెర్కోర్. ‘ఏఐ రెవల్యూషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి’ అనే విమర్శతో ఆదర్శ్ ఏకీభవించడు. ‘ఏఐ ద్వారా సరికొత్త లేబర్ మార్కెట్ ఏర్పడుతుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏఐతో ఎలాంటి భయం అవసరం లేదు. ప్రతి సాంకేతిక విప్లవం మనిషి జీవితాన్ని మెరుగుపరిచింది’ అంటాడు ఆదర్శ్.నెక్స్ట్ ఏమిటి!కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నా చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆసక్తి నాకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడింది. ఇప్పుడు అసలు సిసలు సవాలు ఏమిటంటే నెక్ట్స్ ఏమిటి? అనేది. ప్రజలు ఇప్పుడు దీని గురించే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందుకే మా ప్రాధాన్యత జాబితాలో....‘నెక్ట్స్ ఏమిటీ?’ అనేది కూడా ఉంటుంది.– ఆదర్శ్ (చదవండి: ఇండిగో...ఇదిగో! నో డిలేస్, నో డైవర్షన్స్...) -
ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..
డ్యాన్సర్గా ప్రయాణం మొదలైనా ఆ అమ్మాయి ప్రయాణం.. అతి కొద్ది సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి..అత్యున్నత స్థాయిలో నిలిచింది. కేవలం 29 ఏళ్లకే అత్యంత పిన్న వయస్కురాలైన యువ బిలియనర్ రికార్డులకెక్కింది. ఆమె స్థాపించిన కంపెనీ ఏకంగా వేల కోట్ల విలువను చేరుకుంది. అలాగే ఆమె సందప కూడా రూ 10 కోట్లు పైనే నికర విలువను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు.. అంత చిన్న వయసులో బిలియనీర్గా ఎలా అవతరించింది ఆ సక్సెస్ మంత్ర ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మాయే బ్రెజిల్కు చెందిన లువానా లోప్స్ లారా. స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్గా అవతరించింది. కేవలం 29 ఏళ్ల వయసుకే ఈ ఘనతను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆమె స్థాపించిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫారమ్ కాల్షి.. ఇటీవలే 11 బిలియన్ డాలర్లు అంటే మన కరెనన్సీలో అక్షరాల రూ. 90 వేల కోట్లకు పైగా విలువను చేరుకోవడంతో ఈ ఘనత సాధించింది.బ్రెజిల్లో జన్మించిన ఆమె రష్యాలోని బోల్షోయ్ థియేటర్ స్కూల్లో ప్రొఫెషనల్ బ్యాలరీనాగా (డ్యాన్సర్) ట్రైశిక్షణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ బ్యాలెరినాగా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే విద్యారంగంలో కూడా రాణించిందామె. అమెరికా వెళ్లి అక్కడ ఎంఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే క్లాస్మేట్ తారెక్ మన్సూర్ (29 ఏళ్ల) కలిసింది. ఆ తర్వాత 2018లో న్యూయార్క్ నగరంలోని ఫైవ్ రింగ్స్ క్యాపిటల్లో ఇంటర్న్షిప్లు చేస్తున్నప్పుడూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలోనే అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్ను కాల్షి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారిద్దరు. అనుకున్నట్లుగా 2019లో కాల్షి కంపెనీని ప్రారంభించారు. . అయితే పలు సవాళ్లు అనంతరం 2020లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) నుంచి ఆమోదం పొంది.. USలో మొదటి సమాఖ్య నియంత్రిత అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్గా అవతరించింది. 2023లో నియంత్రణ సంస్థలు దాని ఎన్నికల ఆధారిత ఒప్పందాలను నిరోధించినప్పుడు పోరాటం తీవ్రమైంది. నిరుత్సాహపడకుండా, లోప్స్ లారా పోరాడారు. ఫలితంగా 2024 సెప్టెంబర్లో అమెరికా ఎన్నికల ట్రేడింగ్కు సంబంధించిన ఒక కీలకమైన దావాలో స్నేహితులిద్దరూ విజయం సాధించారు. అంతుముందు కాల్షి కంపెనీ నికర విలువ రూ. 4,100 కోట్లుగా ఉంది. ఎప్పుడైతే ఎన్నికల ట్రేడింగ్ పొందిన రాత్రి ఒక్కసారిగా రూ. 8 వేల కోట్లకు ఎగబాకింది. అలా ఈ స్టార్టప్ సంపదలో దూకుడుగా విస్తరించింది. అంతేగాదు ఈ కాల్షి కంపెనీలో లారా 12 శాతం వాటా కలిగి ఉంది. దీంతో లారా వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. ఆమె ఆస్తులు 1.3 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైమాట. దాంతో లారా ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్గా నిలిచింది. ఇక లారా తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. వారిద్దరి స్ఫూర్తితోనే ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, గణితంలో డిగ్రీలు పూర్తి చేసింది. ఇంటర్న్షిప్ల ద్వారా క్వాంటిటేటివ్ ట్రేడింగ్లో అనుభవాన్ని పొందింది. అలా రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై.. ట్రేడింగ్ చేయాలనే ఆలోచనతో కాల్షి సంస్థను లారా స్థాపించడం విశేషం. ఇక లారా బిలియనీర్ కథ ఆర్జనలో సరికొత్త ట్రెండ్ని సృష్టించింది. దృఢ సంకల్పం, అభ్యున్నలి కోసం చేసే పదునైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేందుకు లారానే ఒక ఉదాహరణ.Kalshi raised $1B at an $11B valuation.A decade ago, only a few thousand people knew what a prediction market was.Eighteen months ago, most prediction markets were banned - until we overcame the government to set them free.Over the past seven years, our community has opened… pic.twitter.com/hGDkYxkSlh— Tarek Mansour (@mansourtarek_) December 2, 2025 (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం) -
అనుకోకుండా మోడల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు తేజం
-
ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!
కుటుంబ పోషణార్థం టెన్త్కే చదువుకి స్వస్తి పలికాడు. ఏదో సాధించేద్దాం అనుకుంటూ ముంబై మహానగరంలో అడుగుపెట్టాడు. అది కూడా జేబులో కేవలం రూ. 200లతో కుటుంబ సభ్యులకు చెప్పపెట్టకుండా వచ్చేశాడు. అక్కడ బాంద్రాస్టేషన్లో పరిచయమైన స్నేహితుడి చేతిలో మోసానికి గురయ్యా..రోడ్డుపై నిలబడిపోయాడు. కట్చేస్తే..ఏంలేదు అన్న పరిస్థితిని నుంచి ఏకంగా 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. స్వయంకృషితో పైకొచ్చిన మరో సాంబయ్య అతడు..అతడే దోసప్లాజ్ వ్యవస్థాపకుడు ప్రేమ్ గణపతి. తల్లిదండ్రులు ఏడుగురు తోబుట్టువులతో కడు పేదరికంలో ఉన్న కుటుంబాన్ని పేదరికం నుంచి బయపటపడేయాలన్న ఆరాటంతో ముంబైకి ఒంటరిగా వచ్చేశాడు. అది కూడా కేవలం రూ. 200 రూపాయాలతో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ బాంద్రా స్టేషన్లో పరిచయమైన స్నేహితుడే తోడు అనుకుంటే..తనదగ్గరున్న ఆ కాస్త డబ్బుని తీసుకుని పరారయ్యాడు. తోపుడు బండితో మొదలైన వ్యాపారం..తొలిసారిగా నమ్మకంతో చెలగాట మాడిన స్నేహితుడిని ఎదుర్కొని తల్లడిల్లిపోయాడు. ఏం చేయాలి..ఆకలిని ఎలా ఓర్చుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో కూడా ఆశను వెతుక్కుంటూ ఓ బేకరీలో ప్లేట్లు కడిగే పనికి కుదిరాడు. అలా నెలకు 150 రూపాయలు సంపాదించేవాడు. పడుకోవడానికి కటికి నేలపై స్థలం ఏర్పరుచుకున్నాడు. అలా ప్రతి నెల సంపాదించిన డబ్బుని ఆదాచేసి ఒక హ్యాండ్ బండిని అద్దెకు తీసుకున్నాడు. పాత్రలు స్టవ్ కోసం దాదాపు రూ. వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అలా వాషి రైల్వే స్టేషన్ ఎదురగా ఉన్న వీధిలో ఇడ్లీలు, దోసెలు అమ్మడం ప్రారంభించాడు. అది చూడటానికి కేవలం ఒక బండి, కానీ కస్టమర్లకు చాలా పరిశుభ్రంగా అందించే ఆహార ప్రదేశంగా వారి మనసులను గెలుచుకున్నాడు. తన సోదరులను ఈ పనిలో చేర్చుకుని..అందమైన బట్టలు, టోపీలతో కస్టమర్లను ఆకర్షించేలా వ్యాపారం చేశాడు. అతడి భోజనంలోని రుచి త్వరలో వేలాది మంది ప్రజలకు చేరువై నెలకు దాదాపు రూ. 20 వేలు టర్నోవర్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. వారంతా ఒకే అద్దె గదిలో ఉండేవారు. నిరంతరం జీవనాధారమైన తమ తోపుడు బండి, వంటగది కమ్ బెడ్రూం తమనుంచి లాగేసుకుంటారనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలా ఐదేళ్ల తర్వాత 1997లో చిన్న స్థలంలో ప్రేమ్ సాగర్ దోస ప్లాజా హోటల్ని పెట్టుకునే రేంజ్కి వచ్చాడు. అలా పుట్టింది షెజ్వాన్ దోస..అక్కడకు వచ్చిన విద్యార్థులు, స్నేహితులై ఇంటర్నెట్ని పరిచయం చేశారు. దాని సాయంతో ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల వంటకాలపై అవగాహన ఏర్పరుచుకున్నాడు. అలా పలు ప్రయోగాలు చేస్తూ ఉండగా..షెజ్వాన్ దోస అనే రెసిపీని కనుగొన్నాడు. అక్కడ నుంచి వెనుదిరగకుండా ఏకంగా 105 రకాల దోసెలను సృష్టించాడు. ఆ తర్వాత మాల్లో తన వ్యాపారానికి కాస్త చోటు ఇవ్వమని అడగగా బ్రాండ్ కాదంటూ పోమ్మన్నారు మాల్ నిర్వాహకులు. మరో సెంటర్ వన్మాల్ నిర్వాహకులకు అతడి చేతి ఆహారం రుచి గురించి తెలుసు. దాంతో వాళ్లు వ్యాపారం పెట్టుకునేందుకు స్థలాన్ని అందించారు. అక్కడ నుంచి మరిన్ని దుకాణాలు పెట్టమంటూ అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఆ సింగిల్ తోపుడు బండి నుంచి భారతదేశం నుంచి దుబాయ్, ఆస్ట్రేలియా వరకు విస్తేరించేలా 70కి పైగా దుకాణాలు వెలిసాయి. ఆ రోజు మోసగింపబడిని రూ. 200లతో మొదలైన ప్రస్థానం ఇప్పుడూ ఏడాదికి రూ. 50 కోట్ల టర్నోవర్ అందుకునే వ్యాపారాన్ని నిర్మించే రేంజ్కి చేరాడు. చివరగా ప్రేమ్ గణమపతి మాట్లాడుతూ..ఇదంతా అకస్మాత్తుగా వచ్చిన ఐడియా కాదని, రెండు చేతులు ఖాళీగా ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడూ మోసానికి గురైన రైల్వేస్టేషన్ని దురదృష్టకరమైన ప్రదేశం చూడలేదని అంటాడు. ఇదే ప్రదేశం తనకు ఏదో మార్గాన్ని చూపిస్తుందని వెతుక్కుంటూ వెళ్లాను అలా దొరికిన ప్లేట్లు కడిగే పనే తన పాలిట దైవంగా నమ్మా..అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటాడు ప్రేమ్ గణపతి.దొరికిన చిన్న పనిని చూసి నిరాశ పడకుండా..ఒక్కో మెట్టుని చేసుకుంటూ..అభ్యున్నతికి మార్గం వేసుకుని యువతకు ప్రేరణగా నిలవడమే గాక, మోసపోవడం అంటే దురదృష్టం కాదు..స్ట్రాంగ్ నిలబడేందుకు పునాది అని ప్రేమ్ గణపతి కథ చెప్పకనే చెబుతోంది. అంతేగాదు "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషలవుతారు అన్న నానుడికి సరైన అర్థం మన ప్రేమ్ గణపతి" కదూ..! -
ఐఎన్ఐ సెట్లో సత్తా చాటిన మహిళా డాక్టర్..!
పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో ఆలిండియా 7వ ర్యాంకు పొంది వార్తల్లో నిలిచింది డాక్టర్ సాయి త్రిషారెడ్డి. కిందటి నెలలో విడుదలైన ఈ ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే దక్షిణాదిలో మొదటి ర్యాంకు సాధించింది. హైదరాబాద్లోని బీరంగూడలో ఉంటున్న సాయి త్రిషారెడ్డి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ హౌస్ సర్జన్గా చేస్తోంది. ‘కత్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసినట్టే యువతకు ఆన్లైన్ను ఉపయోగించడం కూడా అంతే స్మార్ట్గా తెలిసి ఉండాలి’ అంటూ తన ప్రిపరేషన్ వర్క్ గురించి తెలిపింది..‘‘మాది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా గురజాల. అమ్మా నాన్నలు బారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అనంత లక్ష్మీ నా చిన్నతనంలోనే హైదరాబాద్లో స్థిరపడ్డారు. నాన్న బిజినెస్ రంగంలో ఉండగా, అమ్మ స్కూల్ టీచర్. కుటుంబ నేపథ్యంలో ఎవరూ డాక్టర్లు లేరు. నాన్న స్నేహితుల్లో డాక్టర్లు ఉండటం చూసి, నేనూ వైద్యవృత్తిపై ఆసక్తి పెంచుకున్నాను. ఇండియాలోనే పేరొందిన ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేయాలనే ప్రయత్నం ఫలించాక, నా లక్ష్య సాధనలో సరైన దిశగా ఉన్నాను అనిపించింది. 2020 నీట్ ఫలితాల్లో 14వ ర్యాంకు, మహిళల విభాగంలో 6 వ ర్యాంకు వచ్చింది. ఈ యేడాది ఐఎన్ఐ–సెట్లో ఆల్ ఇండియా 7వ ర్యాంకు, దక్షిణాదిన నేనొక్కదాన్నే నిలవడం మరింత సంతోషాన్నిచ్చింది. సోషల్ మీడియాకు దూరంన్యూ ఢిల్లీ ఎయిమ్స్లో హౌస్సర్జన్గా వర్క్ చేస్తూనే పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఏదీ ఎవరికీ సులువుగా రాదు, దానికి తగిన క్రమశిక్షణతో ప్లానింగ్ చేసుకోవడమే మన ముందున్న మార్గం. ప్రిపరేషన్కి రోజూ ఒకే టైమ్ దొరికేది కాదు. వర్క్ షిఫ్టులు మారుతూ ఉండేవి. ఆరు గంటలు వర్క్, మిగతా టైమ్లో ప్రిపరేషన్ ప్లానింగ్కి కేటాయించుకున్నాను. ఆన్లైన్లో ఇంటర్వ్యూలు, కొన్నియాప్స్ గైడ్లైన్స్ తీసుకున్నాను. సోషల్మీడియాకు మాత్రం పూర్తి దూరంగా ఉన్నాను. ఒత్తిడిగా అనిపించినప్పుడు మాత్రం వాకింగ్, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మానాన్నలతో మాట్లాడటం మాత్రమే చేశాను. దాదాపు 9 నెలల ప్రిపరేషన్ నన్ను నా లక్ష్య సాధనకు చేరువచేసింది. దాదాపు ఈ ఎగ్జామ్కు దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మందికి పైగా హాజరయ్యారు. ఎంత పెద్ద పరీక్ష, ఎంత మంది పాల్గొంటున్నారు.. అనే భయం ఏ విషయంలోనూ ఎప్పుడూ సరైనది కాదు. నాలో ఉన్న శక్తి ఎంత... అనేదానిపైనే దృష్టి పెట్టాను. అదే ఈ రోజు నన్ను అగ్రస్థానంలో ఉంచింది’ అని తెలినారు ఈ యువ వైద్యురాలు. ఐఎన్ఐ సెట్లో దక్షిణ భారత దేశం నుండి పాల్గొన్న అభ్యర్థులలో ఏకైక మహిళా డాక్టర్గా తన ప్రతిభను చాటుకొని తెలుగు వారికి గర్వ కారణమయ్యింది. ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో వైద్య విద్యార్థి గానే కాకుండా అందరిలోనూ ఉత్తమ ఫలితాలను సాధించి భవిష్యత్ డాక్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వైకల్యాన్ని జయించిన సంకల్పం.. ఆ వైద్యుడి తదుపరి కల ఇదే!
విధి వెక్కిరించినా, సమాజం వెక్కిరించినా, తన కలను వదులకోలేదు. పట్టుదలగా తను అనుకున్నదిసాధించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే భారతదేశానికి చెందిన 3 అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య. తన కల సాకారం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతాకాదు. గుజరాత్లోని భావ్నగర్కు చెందిన మూడు అడుగుల గణేష్ ( 25) తాను పోరాడి సాధించిన MBBS కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య అధికారిగా నియమితుడయ్యారు. వికలాంగులకు చట్టపరమైన అడ్డంకులను అధిగమించి సివిల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన పేరు దేశ మంతా మారిమోగిపోతోంది. గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా పుట్టుకనుంచి గణేష్ ఎదుగుదల సమస్య వచ్చింది. అందుకే ఆయన ఎత్తు మూడు అడుగులకే పరిమితం అయింది. మరుగుజ్జుత్వం కారణంగా 72శాతం లోకోమోటర్ వైకల్యంతో జన్మించిన గణేష్ బరయ్య కేవలం మూడు అడుగుల పొడవు , 20 కిలోల బరువు మాత్రమే. శారీరకంగా ఉన్న సమస్య కారణంగా చిన్నతనంనుంచే ఎన్నో అవమానాలు, అవహేళలను తప్పలేదు. 2018లో నీట్ యుజి పరీక్ష రాసిన సందర్భంగా అతనిలోని వైకల్యం కారణంగా భారత వైద్య మండలి ఆయన్ను తిరస్కరించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MBBS కోర్సుకు అడ్మిషన్ తిరస్కరించడంతో గుజరాత్ హైకోర్టులో కేసు వేశారు. అక్కడా ఫలితం దక్కలేదు. అక్కడితో ఆగిపోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి 2019లో మీకు సీటు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వైకల్యం కారణంగా ఎవరూ మిమ్మల్ని ఆపలేరని గణేష్ బరయ్యకు హామీ ఇచ్చింది. చట్టపరమైన ఖర్చులను భరించడంలో సహాయపడిన గణేష్ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దల్పత్భాయ్ కటారియా మద్దతుతో, బరయ్య సంకల్పం ఫలించింది.ఇదీ చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!రోగులు మొదట్లో చికిత్సను నిరాకరించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అయినా తను అలాంటి వాటి గురించి పట్టించుకోనని, దానికి బదులుగా తనతో సానుకూలంగా ఉన్న చాలా మంది రోగులపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. వైద్య అధికారిగా తనతదుపరి లక్ష్యం తన కుటుంబంకోసం ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది. భావ్నగర్ జిల్లాలోని గోర్ఖి గ్రామంలోని కచ్చా ఇంట్లోనే నివసిస్తోంది. వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇటుక ఇల్లు నిర్మించడం అనేది తన డ్రీమ్ అని చెప్పారు. #WATCH | Bhavnagar, Gujarat: Dr Ganesh Baraiya overcomes legal hurdles being differently abled and works as a medical officer in a civil hospital. He says, "... My primary education was from my village... I took the NEET UG exam in 2018 but at that time, the Medical Council of… pic.twitter.com/K2Ai2VeJ8c— ANI (@ANI) December 2, 2025 -
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న దినసరి కూలీ..!
ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్ ఫోన్తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది. అలా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి సరదాగా కొన్న మొబైల్ ఫోన్ లైఫ్నే టర్న్ చేసింది.తొలుత తల్లిదండ్రులు చదువు పాడవుతుందని చాలా బయటపడ్డారు. కానీ అతడు తన క్రియేటివిటీతో సోషల్ మీడియా స్టార్గా ఎదగడమే కాదు నలుగురికి ఉపాధి మార్గం చూపించే రేంజ్కి వెళ్లిపోయాడు. అతడే మహారాష్ట్ర, నెవాషేలోని గోమల్వాడి గ్రామనికి చెందిన రాహుల్ రాందాస్ తమ్నార్. తన బాల్యం ఎండల్లో కష్టపడి పనిచేయడంతో సాగింది. తన చుట్టూ ఉండే పచ్చిన పొలాల మధ్య తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా చిన్న చితక కూలిపనులు చేస్తూ పెరిగాడు. ఒకరోజు తల్లిదండ్రులు అడిగి మరి సరదాగా మొబైల్ ఫోన్ కొనుకున్నాడు. ఇంత చిన్న వయసులోనూ ఫోన్తో ఆడుకుంటూ చదువు పాడు చేసుకుంటాడేమో అని తల్లిదండ్రుల చాలా బయటపడ్డారు. అయితే నేర్చుకోవాలనే ఒకే ఒక్క జిజ్ఞాసతో సోషల్ మీడియా గురించి, ప్రమోషన్లు, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయి. పలు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ అతనెప్పుడూ ఆశను వదులుకోలేదు. అలా ఏదో ఒకనాటికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పనతో తన ప్రయత్నాన్ని విరమించలేదు. నెమ్మదిగా అతడి కష్టం ఫలించడం ప్రారంభించింది. రోజుకు రూ. 5వేలు నుంచి రూ. 6 వేలు రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించాడు. అలా చాలా కొద్ది టైంలోనే లక్ష రూపాయాలు సంపాదించే రేంజ్కి ఎదిగిపోవడమే కాదు, ఏకంగా 400 నుంచి 500 మంది యువతకు ఆన్లైన్ మార్కెటింగ్లో శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేస్తున్నాడు. అతని అంకితభావానికి డిజిటల్ స్కిల్ అవార్డు సైతం వరించింది. పొలాలతో మొదలైన అతడి ప్రస్థానం డిజిటల్ ప్రపంచంలోకి అడుపెట్టి తన జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి స్టోరీ వైరల్గా మారింది. కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు రాదు, కష్టపడేతత్వం, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారికి విజయం వారి ఒడిలోకే వచ్చే వాలుతుంది అనేందుకు ఈ రాహుల్ రాందాస్నే ఉదాహరణ. (చదవండి: ఆ అమ్మకు SIR సర్ప్రైజ్ గిఫ్ట్..! పాపం 40 ఏళ్లుగా..) -
పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభ
యువ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్... వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ అనేది ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో కోడ్ రాసే విధానం. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు అక్కర్లేదు. వైబ్ కోడింగ్కు సంబంధించి ఏఐ టూల్ ‘కర్సర్’ను రూ పొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమన్ సాంగర్ పాతికేళ్ల వయసులోనే బిలియనీర్ అయ్యాడు...కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంతోమంది కాలేజీ కోడర్లలో అమన్ సాంగర్ ఒకరు. ఇప్పుడు మాత్రం గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ప్రపంచ ప్రసిధ్ధ యువకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.జనరేటివ్ ఏఐ ప్రపంచంలో ‘అమన్ సాంగర్’ అనేది సుపరిచిత పేరుగా మారింది. ‘ఎనీస్పీయర్’ సహ–వ్యవస్థాపకులలో 25 సంవత్సరాల అమన్ ఒకరు. ఫాస్ట్–రైజింగ్ ఏఐ టూల్గా పేరు తెచ్చుకున్న ‘కర్సర్’ అనేది ఎనీస్పీయర్ కంపెనీ సృష్టి. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తనకు పరిచయం అయిన మైఖేల్ ట్రుయేల్, సుయాలే, ఆర్విడ్ మార్క్లతో కలిసి ‘ఎనీస్పీయర్’ ్ర΄ారంభించాడు అమన్. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టీమ్గా ‘ఎనీస్పీయర్’ పేరు తెచ్చుకుంది. అమన్, మైఖేల్ ట్రుయెల్లు ‘నియో స్కాలర్స్’గా ఎంపికయ్యారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతరాన్ని సిలికాన్ వ్యాలీలోని ఫౌండర్స్, ఇన్వెస్టర్లకు పరిచయం చేసే కార్యక్రమమే...నియో స్కాలర్స్.ఈ పరిచయాల వల్ల కంపెనీ ఫస్ట్ రౌండ్ ఫండింగ్ సాఫీగా సాగింది. మొదట్లో ‘ఎనీస్పీయర్’ బృందం కంప్యూటర్–ఎయిడెడ్ డిజైన్కు సంబంధించి ఏఐ టూల్ను రూపొందించింది. ఆ తరువాత దారి మార్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసింది. ఇది తాము కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన డొమైన్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు రావాలని తీసుకున్న నిర్ణయమే ‘కర్సర్’ను రూపొందించడానికి కారణం అయింది. ఈ ఏఐ–పవర్డ్ కోడ్ ఎడిటర్ తక్కువ కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘వైబ్ కోడింగ్’ అనే ఐడియాను పరిచయం చేసింది కర్సర్.వైబ్ కోడింగ్ ద్వారా డెవలపర్స్ నేచురల్ లాంగ్వేజ్ మోడల్స్ని ఉపయోగించి కోడ్కు సంబంధించి రైట్, ఎడిట్, డీబగ్ చేయవచ్చు. కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ‘వైబ్ కోడింగ్’ ఎంపికైంది. తక్కువ టైమ్లోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ‘ఎనీస్పీయర్’ వేగంగా వృద్ధి చెందింది. కంపెనీ కో–ఫౌండర్స్ బిలియనీర్లుగా మారారు. పద్నాలుగేళ్ల వయసులోనే కోడింగ్ మొదలుపెట్టాడు అమన్. ్ర΄ోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించేవాడు.ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు‘నా భవిష్యత్ చిత్రపటం’ ఇలా ఉండాలని అమన్ ఎప్పుడూప్లాన్ చేసుకోలేదు.అయితే సాంకేతిక అంశాలపై తనలోని ఆసక్తే ఎన్నో దారులలోకి తీసుకువెళ్లింది. చిన్న వయసులోనే సాంకేతికరంగంలో ప్రపంచ ప్రముఖుడిని చేసింది. మొదట్లో కంపెనీ పరిస్థితి ఎలా ఉన్నా, ఆ తరువాత మాత్రం పోటీ ఎదురవుతుంది. ΄ోటీని ఎలా తీసుకుంటారు?’ అనే ప్రశ్నకు అమన్ ఇచ్చిన జవాబు... పోటీ గురించి నిరంతరం పట్టించుకుంటాం. వారి పనితీరు కూడా పరిశీలిస్తాం. పనితీరు, ఆవిష్కరణలు నచ్చితే వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. మాకే అన్నీ తెలుసు అనుకోము. ఎందుకంటే మేము చేయలేనివి కూడా వారు చేసి ఉండవచ్చు.’ఒక బాటసారి మనలో ఒక అంశంపై ఆసక్తి ఉంటే అది ఒకేచోట ఆగి΄ోదు. నాన్స్టాప్గా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో దారులలో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలాంటి ఒక బాటసారి అమన్ సాంగర్. వీడియో గేమ్స్ కంటే ఎక్కువగా కోడింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టం అతడిని ఎంతో దూరం నడిపించింది. సిలికాన్ వ్యాలీ వరకు తీసుకువెళ్లి సాంకేతిక దిగ్గజాలను పరిచయం చేసింది. పోటీలో మన ముందు ఉన్న వ్యక్తిని చూసి భయపడవద్దు. వెనక్కి తగ్గవద్దు. మన కంటే అతడికి ఎక్కువ తెలిసి ఉంటే అతడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ΄ోటీతో మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవచ్చు’ అంటున్నాడు అమన్ సాంగర్. -
రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
రోజుకు రూ.20 సంపాదన నుండి రూ.300 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ను నిర్మించగలమైనా ఎవరైనా కలగంటారా? కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గొప్ప వ్యాపారవేత్తగా నిలిచింది. చిన్న చినుకులా మొదలై, ప్రభంజనం సృష్టించిన ‘చిను కలా’ స్టోరీ వింటే... ఆత్మవిశ్వాసం, పట్టుదల , కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది.ఆమె ఏ బిజినెస్ కోర్సూ చదవలేదు. ఆమె జీవితమనే విశ్వవిద్యాలయంలోనే ప్రతీదీ నేర్చుకున్నారు. నో కార్పొరేట్ సపోర్ట్. నో గాడ్ఫాదర్ నో ప్లాన్ బి . ఎలాగైనా సాధించాలనే తపన, ఆశ, కల, నమ్మకం. కేవలం 36 చదరపు అడుగులు. ఒకే నగల ట్రే. కట్ చేస్తే.. పొట్టతిప్పల కోసం అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్తో ఒక లగ్జరీ బ్రాండ్తో ఉన్నత శిఖరాలకు చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు స్ఫూర్తి దాయకం. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే అన్నట్టుగా ఎన్నో భయంకరమైన అనుభవాలనుంచి ఎదగి ఉన్నత శిఖరాలకు చేరింది. తన బ్రాండ్ చిను కళాను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్గా నిలిపింది. అక్టోబర్ 10, 1981న ముంబైలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది చిను. ఏడాది వయసున్నప్పుడే ఆమెను తల్లి విడిచిపెట్టి సౌదీకి వెళ్లిపోయింది. తండ్రి, రెండో పెళ్లి చేసుకొని సవతి తల్లిని తీసుకొచ్చాడు. కష్టాలు మొదలయ్యాయి. చినుతోవాగ్వాదం సందర్భంగా నీ యిష్టం వచ్చినట్టు నువ్వు బతకాలనుకుంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు.అంతే 15 ఏళ్ల చిను జేబులో కేవలం రూ. 300 మరియు కొన్ని బట్టలతో ఇంటి నుండి బయలుదేరింది. ఆమె టికెట్ లేకుండా నానాసుపారా నుండి సెంట్రల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ పడుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె పడుకోలేకపోయింది. మరుసటి రోజు తాను ఎక్కడికి వెళ్లాలో, ఏమి తినాలో అర్థంకాక రాత్రంతా ఏడ్చింది, ఉదయం, ఒక మహిళ ఆమె కథ విని, కమిషన్ సంపాదన కోసం ఇంటింటికీ తిరిగి అమ్మే పనిని ఒకదాన్ని అప్పగించింది. ఏదో ఒకపనిచేసుకని, కడుపునింపుకుంటూ గౌరవంగా బతుకుతూ పైకి ఎదగాలని విజయం సాధించాలని అప్పుడే దృఢంగా నిశ్చయించుకుంది.డోర్-టు-డోర్ సేల్ ద్వారా సేల్స్గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్లను అమ్మడం స్టార్ట్చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. అలా రోజుకు 25 రూపాయలు వసూలు చేసే వసతి గృహంలో నివసించింది. ఆమె మొదటి అమ్మకాల ప్రయత్నంలో, ఒక మహిళ ఆమె ముఖం మీద తలుపు వేసేసింది. అలా గంటల తరబడి గుండెలు పగిలేలా ఏడ్చింది కానీ వదులుకోలేదు. వెయిట్రెస్, రిసెప్షనిస్ట్ మొదలైన వివిధ ఉద్యోగాలను చేపట్టింది. కీలక మలుపు 2002లో ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్లో టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం సంపాదించడంతో చిను జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఇక్కడ ఆమె తన కాబోయే భర్త అమిత్ కళను కలుసుకుంది, అతను MBA హోల్డర్, ఆమె వ్యవస్థాపక ప్రయాణంలో కీలకమైన మద్దతుదారుగా మారారు. వారు 2004లో వివాహం చేసుకుని బెంగళూరుకు వెళ్లారు, అక్కడ చినుకు మోడలింగ్ పట్ల ఉన్న ప్రేమ ఆమెను 2008 గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా పోటీలో పోటీ పడేలా చేసింది, అక్కడ ఆమె టాప్ 10లో నిలిచింది. ఈ సమయంలో చిను ఉపకరణాలు , ఆభరణాల గురించి నేర్చుకుంది.తన మోడలింగ్ అనుభవాల నుండి ప్రేరణ పొందిన చిను, కార్పొరేట్ మర్చండైజ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఫోంటే కార్పొరేట్ సొల్యూషన్స్ను స్థాపించింది. ఆ కంపెనీ త్వరగా ఆదరణ పొందింది, సోనీ, ESPN, ఎయిర్టెల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లకు వస్తువులను ఉత్పత్తి చేసింది. 2014లో, స్టైలిష్ మరియు బ్రాండెడ్ ఉపకరణాల కోసం భారతీయ ఆభరణాల మార్కెట్లో అంతరాన్ని గుర్తించి, ఆమె రూబన్స్ యాక్సెసరీస్న రూ. 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. రూబన్స్ యాక్సెసరీస్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్లో 36 చదరపు అడుగుల చిన్న స్థలంలో ప్రారంభమైంది. అది కాస్తా బెంగళూరులోని చాలా ప్రసిద్ధ మాల్ ఫోరం మాల్లో తన రెండవ స్టోర్ను ప్రారంభించే స్థాయికి ఎదిగింది. అలా మొదలై చిను ప్రయాణం వినియోగదారుల ఆదరణతో కొత్త పుంతలు తొక్కింది. వినియోగదారుల అవసరాలపై విస్తృతమైన పరిశోధనల చేసిన 80 శాతం ప్రత్యేకమైన, స్పెషల్ డిజైన్లు రూపొందించింది. అలా పాశ్చాత్య , జాతి అభిరుచులకు అనుగుణంగా ఉండేలా చూసుకుంది. ఈ వ్యూహంతో వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. 2014 నాటికి, రూబన్స్ యాక్సెసరీస్ రూ. 56 లక్షల ఆదాయాన్ని సాధించింది. 2022 నాటికి రూ. 35 కోట్లకు పెరిగింది. ఈ బ్రాండ్ ఐదు ఆఫ్లైన్ స్టోర్లకు విస్తరించింది,ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో పాపులర్ అయింది. అమ్మకాలలో 75శాతం ఆన్లైన్లో నడిచాయి. ఒక దశలో మింత్రాలో బెస్ట్ సెల్లర్గా నిలిచింది.2023లో, రూబన్స్ యాక్సెసరీస్ వార్షిక ఆదాయంలో రూ. 65 కోట్లకు చేరుకుంది. ప్రముఖ టీవీ షో "షార్క్ ట్యాంక్ ఇండియా" సీజన్ 2 నుండి ఆమె రూ. 1.5 కోట్ల నిధులను పొందింది. IIM అహ్మదాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రసంగాలు చేసింది. పాఠశాల విద్య పూర్తి చేయకపోయినా, చిను నికర విలువ ఇప్పుడు రూ. 40 కోట్లుగా ఉంది.ఆమె బ్రాండ్ 40 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలందించింది నమ్మశక్యం కాని రూ.310 కోట్లను దాటింది. ఇంతటితో ఆమె ప్రయాణం ఆగిపోడం లేదు. తన బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన ఆభరణాల బ్రాండ్గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇటీవల ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అనంత క్యాపిటల్, ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ మాతృ సంస్థ ఫోంటే ఫ్యాషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. -
ఇంజనీర్గా సూపర్ సక్సెస్ అయినా కూడా..
ఇంజీనీరింగ్, వైద్య విద్య రెండు చాలా భిన్నమైన కోర్సులు. రెండింటిని చదవాలనుకోవడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టినట్లుగా.. దేనిలోనూ మంచి స్కిల్ని సాధించలేం, రాణించలేం. కానీ అమ్మాయి రెండింటిలోనూ సత్తా చాటి అందర్నీ విస్మయపర్చింది. ఇక్కడ ఈ మహిళ ఇంజనీరింగ్ కెరీర్ని ఎంచుకుని..మంచిగా జాబ్లో సెటిల్ అయ్యాక స్టెతస్కోప్ పట్టుకునెందుకు రెడీ అవ్వడం విశేషం. అలాంటి నిర్ణయం వినడానికి కాస్త హాస్యాస్పదంగా అనిపించినా..ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే అని చూపించి ప్రేరణగా నిలిచింది.ఆ అమ్మాయే ఆకృతి గోయెల్. 2015లో ఇంజనీర్ గ్రాడ్యుయేట్గా బయటకు అడుగుపెట్టి మంచి కెరీర్ని నిర్మించుకుంది. వేగవంతమైన స్టార్టప్ల ప్రపంచంలో విజయవంతమైన ఇంజనీర్ అనిపించుకుంది. కార్పోరేట్ ప్రపంచంలోకి దూసుకుపోయి..అందివచ్చిన నిచ్చెనలన్నీ ఎక్కేసింది. టీమ్ లీడర్గా అందరూ అసూయపడే రేంజ్లో వేతనం అందుకుంది. తనకు ఎదురేలేదు అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతున్న ఆమెకు సడెన్గా ఇక చాలు ఇందులో ఈదింది అనిపించింది. ఎంతో అలసిపోతున్నట్లుగా, అసంతృప్తిగా సాగుతోంది లైఫ్ అనిపించిందామెకు. రోజురోజుకి ఇది వద్దు అనిపిస్తోందామెకు. ఏదో తెలియని ఒత్తిడితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. సరిగ్గా లాక్డౌన్ టైంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయం ధైర్యంగా తీసుకుంది. ఆ తర్వాత తగిన విరామం తీసుకుని, ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చేవరకు వేచి ఉంది. తదుపరి యోగా టీచర్గా, న్యాయవాదిగా లేదా హెచ్ఆర్ కన్సల్టెంట్గా మారాలని అని ఆలోచిస్తూ ఉండేది. సరిగ్గా అప్పుడే తన చిన్ననాటి కల గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు డాక్టర్గా వైద్య విద్యను అభ్యసించడమే ఫన్నీనా అనుకుంది. వయోపరిమితి లేదు కదా అని సరదాగా నవ్వుకుంది. ఇంతలో సుప్రీంకోర్టు వైద్య ప్రవేశ పరీక్షలకు ఉన్నత వయో పరిమితిని తొలగించింది. అంటే ఈ రంగంలోకి పయనించు అనేందుకు ఇది గ్రీన్ సిగ్నల్ కాబోలు అనుకుని..ఎలాంటి ఆలోచన లేకుండా మళ్లీ కెరీర్ని మొదటి నుంచి ప్రారంభించింది. అలా క్లాస్రూమ్లో బయాలజీ పాఠాలపై మనసులగ్నం చేసింది. బహుళ మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను నిర్వహించిన ఆ మహిళ పెన్నుతో తడబడింది. ఉపాధ్యాయులను అడగడానికి ఇబ్బంది పడే ప్రశ్నలను సైతం అడిగేందుకు భయపడలేదు. పదేళ్ల తర్వాత తరగతికి రావడం అంత సులభం కాలేదామెకు. అయినా అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ చదవుకోసాగింది. మరోవైపు స్నేహితులు, బంధువులు టైం వేస్ట్ చేసుకుంటుందంటూ విమర్శించడం ప్రారంభించారు. కానీ ఆకృతి ఇంజీరింగ్ కెరీర్లో సక్సెస్ అందుకున్నా.. ఇందులో కూడా గెలుపు నా సొంతం అవ్వాలన్న కసి మరింత పెంచుకుంది. అవిశ్రాంతంగా చదివింది. దాదాపు వంద మాక్టెస్ట్లకు పైగా రాసింది. ఆందోళనకు గురైనప్పుడల్లా..కుటుంబ మద్దతు తీసుకుని మళ్లీ రీఛార్జ్ అవుతుండేది. అలా నీట్ యూజీ పరీక్షలో 676 స్కోరు తెచ్చుకుని డాక్టర్ కోర్సు అభ్యసించింది. 2026లో డాక్టర్గా బయటకు అడగుపెట్టనుంది. కార్పొరేట్ లీడర్ నుంచి వైద్య విద్యార్థిగా సాగిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం, ప్రేరణ కూడా. ఏ నిర్ణయం తీసుకున్నా..దానిపై స్ట్రాంగ్గా నిలబడాలి, నిలదొక్కుకునేలా విజయ ఢంకా మోగించాలని ఆకృతి స్టోరీ చెబుతోంది కదూ..!.(చదవండి: పర్యావరణ స్ఫూర్తి: క్లీన్ ఎనర్జీ స్టార్స్..!) -
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్గా, వైస్ కెప్టెన్గా మహిళా క్రికెట్పై ఆమె ముద్ర ప్రత్యేకం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్-19 టీమ్ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా అవార్డు అందుకుంది.వరల్డ్కప్ చాంపియన్గాభారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్కప్ చాంపియన్గా నిలిచింది. అయితే, క్రికెటర్గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్ బనేగా కరోడ్పతి 15 షోలో స్పందించింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్ ఆడేదాన్ని.అన్న నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్ చేస్తూ లెఫ్టాండర్గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ పర్సన్ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్-19 స్థాయిలో లిస్ట్-ఎ మ్యాచ్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్ ముచ్చల్తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్వర్త్ ఎంత? -
క్రికెటర్ టు ఐఏఎస్ జర్నీ..! బస్సు డ్రైవర్ కొడుకు విజయగాథ..
ఒక్కోసారి మనం కోరుకున్న కలకి, అందనంత దూరంలో మన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. దాంతో మన డ్రీమ్ని చంపేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ బస్సు డ్రైవర్ కొడుకు. పోనీ నచ్చిన యూనివర్సిటీలో చదువుదామన్న చేతిలో చిల్లిగవ్వ లేదు. అలాంటి నేపథ్యంలో ఐఏఎస్ చదవాలనుకోవడమే సాహసం అనుకుంటే..సివిల్స్ ఎగ్జామ్లో విజయ సాధించడమే కాదు తాను కోరుకున్నట్లుగా ఐఏఎస్ అయ్యాడు. విధి నీ వల్ల కాదని వెక్కిరిస్తూ ఉన్నా..వెనకడుగు వేయకుండా తలరాతనే మార్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు.అతడే ఉత్తరప్రదేశ్కి చెందిన బస్సు డ్రైవర్ కొడుకు మొయిన్ అహ్మద్. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావలన్నిది అతడి కల. అతని తండ్రి వలీ హసన్ ఏకైక సంపాదనపైనే కుటుంబం అంతా ఆధారపడి ఉంది. అదీగాక తండ్రి తన క్రికెట్కు అవసరమైన కిట్కొనడమే కష్టంగా ఉండేది. దాంతో ఇది ధనవంతు పిల్లలు ఆడే ఆట అని మనసుకు నచ్చజెప్పుకుని..చదువుపై దృష్టి సారించాడు. అలా ఇంటర్మీడియెట్లో మంచి మార్కులు తెచ్చుకుని చాలామంది విద్యార్థుల డ్రీమ్ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. కానీ అక్కడి కాలేజీ చదువుల ఖర్చులు తట్టుకునే సామర్థ్యం లేక ఆ కలను కూడా చంపేసుకున్నాడు. ఎందుకంటే అతడికి విద్యా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రాలేదు. చివరికి తను ఉండే గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. అలాగే తన భవిష్యత్తు కోసం అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం సైబర్కేఫ్లో పనిచేస్తూ.. చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత నెలకు రూ. 40 వేలు వచ్చే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. అప్పుడే అతనికి ఐఏఎస్ అవ్వాలనే కోరిక పుట్టింది. చిన్నప్పటి నుంచి ప్రతి డ్రీమ్పై నీళ్లు జల్లేసిన తన ఆర్థిక పరిస్థితి మారేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే దీన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకైన సివిల్స్ఎగ్జామ్ వైపుకి వెళ్లడం అంటే కెరీర్ని నాశనం చేసుకోవడంతో సమానమని హితవు పలికారు. అతడి అమ్మ తస్లీమ్ జహాన్ మాత్రమే ఇందుకు మద్దతిచ్చింది. దాంతో మోయిన్ ఆత్మవిశ్వాసంతో కథన రంగంలోకి దిగాడు. అలా 2019లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి మకాం మార్చాడు. తన ప్రిపరేషన్కు నిధులు సమకూర్చుకోవడానికి రూ. 2.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఢిల్లీలో అతడి జర్నీ చాలా భయనకంగా ఉండేది. ఓ పక్కన తెచ్చుకున్న డబ్బులన్నీ నీళ్లలా ఖర్చు అయిపోతుండేవి, మరోవైపు ఒత్తిడి పెరిగపోతుండేది. ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో తెలియని టైంలో తన గురువు IRS అధికారి ఆసిఫ్ యూసుఫ్ అతియా ఫౌండేషన్ సాహిల్ ఖాన్ మార్గనిర్దశంలో ముందుగకు సాగాడు. ఖర్చుల నిమిత్తం అతడికి సాయం చేసేందుకు సాహిల్ ముందుకొచ్చేవాడు. ఈ చర్య ఇతరులు తనకు సహాయం చేయగలరన్న నమ్మకం అతడిని కార్యోన్ముఖుడిని చేసింది. అలా తన మొదటి మూడు ప్రయాత్నాలలో సివిల్స్లో ఓటమిని ఎదుర్కొన్నా..నాల్గో ప్రయత్నంలో ఆలిండియా 296వ ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అధికారి అయ్యాడు. తను ఉన్న స్థితికి మించిన లక్ష్యం పెట్టుకోవడం తప్పుకాదని..తగిలే ఎదురుదెబ్బలే ఆయుధాలు అవుతాయి అనేందుకు మొయిన్ అహ్మద్నే ఉదాహరణ. తలచుకుంటే ఎంత కఠినమైన సవాళ్లును కష్టాలై పరారైపోయేలా తలరాతను మార్చుకోవచ్చని అహ్మద్ కథ వింటే స్పష్టమవుతుంది కదూ..!. (చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
లక్షల్లో వేతనం.. రోబోటిక్ లైఫ్ వద్దనుకున్నాడు..! కట్చేస్తే..
బిందాస్ లైఫ్.. మంచి కంపెనీలో లక్షల్లో జీతం, గుర్తింపు ఉన్నాయి. అయినా ఏదో తెలియని వెలితి..తన చుట్టూ ఉన్న వాళ్లు 30 ఏళ్లకే వైస్ప్రెసిడెంట్ హోదాను అనుభవిస్తుంటే..తాను 26 ఏళ్లు వచ్చినా..ఇదే 9 టు 5 జాబ్..రొటీన్ లైఫ్. రోబోటిక్గా పనిచేస్తూ..ప్రమోషన్లు,గుర్తిపుతోనే బతికేయాలా అనే ఆలోచన నిద్రపట్టనివ్వలేదు. అలాగని ఈ ఉద్యోగం వదులుకునే సాహసం కూడా లేద అతనికి. చివరికి ఏదోలా ఉద్యోగం వదిలేస్తే..ఊహించని విధంగా ఆ జాబ్ కాస్త ఊడిపోయింది. తలకిందులైన తన పరిస్థితికి కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓటమికి అవకాశం ఇవ్వనంటూ పడిలేచిన కెరటంలా సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి గొప్ప సక్సెస్ అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. అతడే ముంబైకి సెమ్లానీ. కామర్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తాత్కలిక వర్క్ వీసాపై యూఎస్ వెళ్లాడు. అలా 2015లో జేపీ మోర్గాన్ యూఎస్ వీసాపై ఇంటర్న్గా పనిచేశాడు. తర్వాత భారత్కు తిరిగి వచ్చి..అదే కంపెనీకి సంబంధించి.. ఆస్తినిర్వహణ విభాగంలో అసోసియేట్గా విధులు నిర్వర్తించేవాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆనందం లేదనే ఫీలింగ్ వెంటాడేది సెమ్లానికి. తన చుట్టూ ఉన్నవాళ్లు చకచక వైస్ ప్రెసిడెంట్ హోదా పొందేస్తుంటే..నేను మాత్రం ఇలా మెకానికల్గా 9 టు 5 జాబ్ చేస్తున్నాననే బాధ వెంటాడేది. ఈ ఉద్యోగంలో లక్షల్లో వేతనం, మంచి గుర్తింపు ఉన్నాజజ ఏదో అసలైన సక్సెస్ని అందుకోలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉండేది. పోనీ జాబ్ని వదిలేద్దామంటే..అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునే ధైర్యం రావడం లేదు.ఎందుకంటే అద్దె కూడా చెల్లించని విధంగా మంచి సౌకర్యాలు, ప్రతి ఏడాది మంచి వేతనంతో కూడిన ప్రమోషన్లు, చక్కటి గుర్తింపు ఉన్నాయి. ఇవన్నీ వదులుకుని వెళ్లడం అంటే గుండెల్లో ఏదో తెలియని గుబులు వెంటాడింది. ఏం చేయాలో తెలియక ధ్యానం, డిజటల్డిటాక్స్ వంటి మానసిక థెరపీలు తీసుకుని..తనకేం కావలి అనేదానిపై స్పష్టత తెచుకున్నాడు. అలా ఈ జాబ్ వద్దనే నిశ్చయానికి రావడమేగాక మంచి జాబ్లో తక్కువ వేతనానికి చేరిపోయాడు. తాను కోరుకున్న మానసికి ఆనందం దొరికింది చాలు..ఇక ఖర్చులు విషయమైతే..తన జీవినశైలిని సర్దుబాటు చేసుకుంటే సరి అనుకున్నాడు. అలా సాగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి లాక్డౌన్ రావడం..సంపాదించిన ఆ ఉద్యోగం కాస్తా పోవడం అన్ని చకచక జరిగిపోయాయి.తీవ్ర నిరాశ, నిస్పృహ..తప్పు చేసిన ఫీలింగ్..అనవసరంగా జేపీ మోర్గాన్లో ఉద్యోగాన్ని వదులుకున్నానా..తప్పు నిర్ణయం తీసుకున్నానా అంటూ..నిద్రలేని రాత్రుల గడిపేవాడు. తన మీద తనకే జాలేసిది. అలా..పూర్తిగా డిప్రెషన్లోకి కూరుకుపోయాడు. కానీ తను చేసే మెడిటేషన్, మానసిక థెరపీల సాయంతో మళ్లీ రీచార్జ్ అయ్యి..స్టార్టప్ దిశగా అడుగులు కదిపాడు. ఆ విధంగా రూ. 53 కోట్లు టర్నోవర్ చేసే టార్టన్ స్టార్టప్ని నెలకొల్పి గొప్ప సక్సెస్ని అందుకున్నాడు. తాను కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా..పరిస్థితులు తలికిందులైనప్పుడూ ఎలా సంయమనంగా ఉండాలో నేర్చుకున్నాడు. అంతేగాదు విజయం అంటే పెద్దమొత్తంలో జీతం కాదు..అంతకుమించిన ఆనందం., సంతృప్తి అని చెబుతున్నాడు సెమ్లానీ.(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..) -
సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..
కంటతడి పెట్టించే కష్టాల కొలిమి..సాధించాలన్న ఆశయాన్ని కన్నీళ్లు చుట్టుముట్టేస్తున్నా..వెనకడగు వేయలేదు. మనసును మెలిపెట్టే బాధనంతటిని లక్యాన్ని మరింత చేరువ చేసే సాధనంగా మార్చాడు. జీవిత పోరాటంలో ఎలా గెలుపుని ఒడిసి పట్టుకోవాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. అతడు అడగడుగునా ఎదురయ్యే సవాళ్లను, కంటతడి పెట్టిస్తున్న ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవడమే గాక, తన బాధ్యతల విషయంలోనూ రాజీకి తావివ్వకుండా ఎలా సమర్థవంతంగా నిర్వర్తించింది రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు.ఆ పోస్ట్లో తాను ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని పేర్కొన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అతడి తండ్రి తన పిల్లలకు మంచి మెరుగైన జీవితాన్ని అందించాలనే తపనతో ఢిల్లీ వెళ్లాడు. కానీ విధి మరోలా తలిచింది. అనూహ్యంగా 2013లో తండ్రి ఆకస్మిక మరణం తన జీవితాన్ని పూర్తిగా విషాదకరమైన జీవితంలోకి నెట్టేసింది. అయితే అతడు ఎంతటి కఠినమైన సమస్యలు వచ్చినా..చదువును వదలకూడదన్న సంకల్పంతో ముందుకు సాగాడు. అలా 2015లో రూ. 3.15 లక్షల ప్యాకేజ్తో బహుళ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ సక్సెస్ని అక్కడితో ఆపకుండా 2018 నాటికి వేరే కంపెనీకి మారి రూ. 7.5 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. ఢిల్లీ అద్దె ఇంట్లో ఉంటూ అప్పులన్నీ తీర్చేశాడు. కానీ నవంబర్ 2020లో మళ్లీ విషాదం చుట్టుమట్టింది. ఆ ఏడాది తన తల్లిని కోల్పోయాడు. దాంతో అతడిపై తమ్ముడు, చెల్లి బాధ్యతలు మీద పడ్డాయి. తనలా తన తోబుట్టువులను కూడా మంచి స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వారి చదువుల విషయంలో రాజీపడకుండా చదివించాడు. దాని ఫలితం సోదరికి రూ. 11 లక్షల వార్షిక ప్యాకేజ్తో ఉద్యోగం రాగా, తమ్ముడికి బీటెక్ సెకండియర్లో ఉండగానే జాబ్ కొట్టేశాడు. అలాగే తన స్వగ్రామంలోని ఇంటిని 2021లో పునర్నిర్మించే పనులు ప్రారంభించాడు. ఆ ఇల్లు అక్టోబర్ 2022 నాటికి పూర్తవ్వగా, నవంబర్ 2022లో, తాను వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. అలాగే తన వివాహం ఇంటి నిర్మాణాన్ని కవర్ చేయడానికి సుమారు రూ. 20 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నానని, దాని ఈ ఏడాది ఆగస్టు 2025 నాటికి క్లియర్ చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం తన దగ్గర ఎలాంటి పొదుపులు లేవు గానీ అతిపెద్ద సక్సెస్ని సాధించగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. ఇదేంటి అనుకోకండి. ఎందుకంటే జీవితం నన్ను బాధించే కష్టాల కడలిలో ముంచినా..వెనక్కిచూడలేదు, ఆగిపోలే..!. స్థైర్యంతో ముందుకు సాగిపోయాను..మంచి స్థాయికి చేరుకున్నా. అలాగే నా తోబుట్టువులను సెటిల్ చేయగలిగా. ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నా. గుర్తించుకోండి సక్సెస్ అటే ఎన్ని కోట్లు కూడబెట్టాం అన్నది కాదు. జీవితం మనల్ని ఎంత కష్టబెట్టినా..తడబడకుండా ముందుకు సాగడం అని సగర్వంగా పోస్ట్లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకర్షించడమే కాదు..ఇది గొప్ప స్ఫూర్తిగాకమైన స్టోరీ బ్రదర్ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!) -
లోగో గుర్తుపట్టలేదని ఉద్యోగమివ్వలేదు, కట్ చేస్తే రూ. 400 కోట్ల కంపెనీ
RodBez Founder Dilkhush Success Story: నడి గుండెల్లో నిప్పుంది మండించు దాన్ని ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని అంటాడో సినీ కవి. ఈ సరిగ్గా ఈ మాటలకు అతికినట్టు సరిపోయే సక్సెస్ స్టోరీ బిహార్కు చెందిన ఆటో డ్రైవర్ ది. ఎక్కడో ఒక మారు మూల గ్రామంలో పుట్టాడు. చదివింది 12వ తరగతే. సెక్యూరిటీ గార్డు ఉద్యోగానివెళితే.. కాదు పొమ్మన్నారు. కట్ చేస్తే 400 కోట్ల కంపెనీ సీఈవో. ఆసక్తిగా ఉంది కదూ.. పదండి ఈ విజయగాథ ఏంటో తెలుసుకుందాం.ఇది బిహార్కు చెందిన దిల్ఖుష్ కుమార్ (Dilkhush Kumar) కథ. ఇతని సక్సెస్ స్టోరీ IIT గ్రాడ్యుయేట్లను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పట్టుదలగా పనిచేస్తే, దిల్ ఉంటే.. ఆటో డ్రైవర్ కూడా ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవోగా సత్తా చాటవచ్చని నిరూపించిన కథ. 12వ తరగతి చదివిన ఒక సాదారణ యువకుడు ఆటో డ్రైవర్గా నానా కష్టాలు పడ్డాడు. కానీ వాటినే తలుచుకుంటూ అక్కడే ఆగిపోలేదు దిల్ఖుష్. ఈ రోజు రూ.400 కోట్ల వ్యాపార ప్రపంచాన్ని సృష్టించాడు.తన చదువుకు తగ్గట్టుగా అనుకొని ఒక రోజు సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు దరఖాస్తు చేశాడుదిల్ఖుష్ కానీ విద్యార్హతలు సరిపోవంటూ తిరస్కరించారు. దీంతోపాటు అనేక ఇంటర్వ్యూలకు వెళ్లాడు. యాపిల్ లోగోను గుర్తించలేకపోవడంతో ఈ ఉద్యోగం పొందలేకపోయాడు. ఈ తిరస్కరణలు అతన్ని వెనక్కి నెట్టలేదు, మరింత కసి పెంచాయి. ముందుకు నడిపించాయి. తానూ పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని నిర్ణయించు కున్నాడు. ఆటో డ్రైవర్గా జీవితాన్ని ఆరంభించాడు. అదే ఎన్నో జీవిత పాఠాల్ని నేర్పించింది. ఎన్నో సమస్యల్ని కళ్లారా చూశాడు. వాటిల్లోంచే ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లాలనుకుంటే సురక్షితమైన మార్గం లేదనీ, సుదూర ప్రాంతాలకు, టాక్సీలు ఖరీదైనవి , నమ్మదగినవి లేవని గమనించాడు. చాలామంది అతని కస్టమర్లు కూడా ఇదే ఫిర్యాదు చేశారు. తానే ఏదో చేయాలని నిర్ణంచుకున్నాడు. పెద్దగా పెట్టుబడిలేదు. ధైర్యమే అతని పెట్టుబడి. 2016లో "రోడ్బెజ్"(Roadbez) అనే యాప్ సేవను ప్రారంభించాడు. ఇదిరైడ్-హైలింగ్ యాప్ కాదు, సొంత టాక్సీలూ ఉండవు. విశ్వసనీయ నెట్వర్క్. కానీ ప్రజలు, సర్టిఫైడ్ , నమ్మకమైన స్థానిక డ్రైవర్లను కలిపే నమ్మకమైన ప్లాట్ఫారమ్. "రోడ్వేస్" అనే ఆలోచన సరళమైనది కానీ శక్తివంతమైనది. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారికి వాహనాలను అందిస్తుంది.రోడ్బెజ్ వన్-వే టాక్సీలను అందించింది, కాబట్టి మీరు రౌండ్ ట్రిప్ కోసం చెల్లించాల్సిన అవసరం లేదు. వారు 50 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి కార్పూలింగ్, రైడ్-షేరింగ్ను ప్రోత్సహించారు. దీని వలన సామాన్యులకు కూడా సుదూర ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. అలా మొత్తం రాష్ట్ర ప్రయాణ అనుభవాన్ని నెమ్మదిగా మార్చాడు. తరువాత 2021లో,బిహార్లోని ప్రతి నగరాన్ని అనుసంధానించడానికి అతను ఒక యాప్ను ప్రారంభించాడు. అతనిని , అతని ఆలోచనను, పెట్టుబడిదారులు నమ్మారు. రూ. 40 లక్షల ప్రారంభ నిధులు వచ్చాయి. అతను అందించిన గ్యారెంటీ గేమ్-ఛేంజింగ్. రోడ్బెజ్ డ్రైవర్ పొరబాటు కారణంగా ఒక వేళ విమానాన్ని మిస్ అయితే, కంపెనీ కొత్త టికెట్ బుక్ చేస్తుంది. అంతకు ముందు ఇలాంటి ఆఫర్ మరి ఏ సంస్థ ఇవ్వలేదు. భారీ ఆదరణ లభించింది. కేవలం 7 నెలల్లోనే దిల్ఖుష్, అతడి టీమ్ ఏకంగా రూ.4కోట్ల నిధులను సమీకరించింది.షార్క్ ట్యాంక్ ఇండియా సెట్లోకి అడుగుపెట్టినప్పుడు అతని ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తల ముందు, IIT ,IIM గ్రాడ్యుయేట్ల ముందు నమ్మకంగా నిలబడి, తన కంపెనీలో 5 శాతం కోసం రూ. 50 లక్షలు అడగడంతో వారంతా షార్క్స్ ముగ్ధులయ్యారు. మార్కెట్పై అతని లోతైన అవగాహన, అద్భుతమైన ప్రయాణాన్ని చూసి ఫిదా అయిపోయారు. చివరికి, OYOకి చెందిన రితేష్ అగర్వాల్ , ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన నమితా థాపర్ రూ. 50 లక్షలు పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా చాలా తక్కువ సమయంలోనే వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టించింది కంపెనీ. రూ. 4 వందల కోట్ల వ్యాపారంగా మారింది. ఇప్పుడు తన స్టార్టప్లో ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. సక్సెస్ ఫుల్ థాట్స్ కేవలం కార్పొరేట్ బోర్డ్ రూంల నుంచే కాదు.. మామూలు ఆటోడ్రైవర్ ఆలోచనలోంచి కూడా పుడతాయని నిరూపించాడు దిల్ఖుష్ -
ఐఏఎస్ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు..
పరాజయం అనగానే..ఫెయిల్యూర్స్ అని కాదు..పోరాడుతూ..ఉండేవాళ్లని. గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గొప్ప యోధులు కూడా. ఎప్పుడు విజేతల విజయాలనే సెలబ్రేట్ చేసుకోవడం క, స్ఫూర్తిగా తీసుకోవడమే కాదు. ఓటమిని ఓర్చుకుంటూ సాగుతున్న పరాజితులు కూడా అంతకుమించిన మహామహులే. గెలుపు.. పొగరుని, అహంకారాన్ని అందిస్తే..ఓటమి ఓర్పు విలును నేర్పిస్తుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఏంటో తెలియజేస్తుంది. నిద్దురలో సైతం భయపెట్టించే ఓటమని ఒడిసిపట్టి గెలుపు శిఖరాన్ని అందుకోవడం కోసం తపించే పట్టువదలని విక్రమార్కులు. వాళ్ల అనుభవం విజేతలకు మించిన గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఎప్పుడూ సక్సెస్ని అందుకున్నవాళ్లని కాదు..విజయంకోసం ఆరాటపడుతూ..వెన్ను చూపకుండా చివ్వరి వరకు పోరాటం చేసే పరాజితులను కూడా అభినందిద్దాం, ప్రేరణగా తీసుకుందాం.! వాట్ ఇదేంటి అని అనుకోకండి..చక చక స్టోరీలోకి వెళ్లిపోదాం..ఇంతవరకు సివిల్ సర్వీసెస్లలో గెలుపొందిన ఐఏఎస్ అధికారుల విజయ ప్రస్థానాన్ని అభినందించాం, స్ఫూర్తిగా తీసుకున్నాం. ఈ సారి ఐఏఎస్ కోసం చివ్వరి వరకు పోరాడి..లెక్కలేనన్ని ఓటములు చవి చూసినా..తన కథ కూడా మరొకరికి స్ఫూర్తిగా మారుతుందని చిరునవ్వుతో చెబుతున్న కునాల్ విరుల్కర్ ఫెయిల్యూర్ స్టోరీ ఏంటో చూద్దామా..!.మొత్తం 12 ఏళ్లు యూపీఎస్సీకి తన లైఫ్ని అంకితం చేశాడు. ఒకటి, రెండు కాదు 12 సార్లు విఫలం. అయినా తనకు దొరికిన ప్రతి ఛాన్స్ని మిస్ చేయలేదు. గెలుపు తీరం అందుకునేదాక పోరాడేందుకు సంకల్పించిన అతడి తీరు ప్రశంసనీయం. సరిగ్గా 2012లో తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీ పరీక్షలో తడబడ్డాడు. పోనీలే అని 2013లో మరోసారి ట్రై చేశాడు. ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసినా, మెయిన్స్లో ఓటమి తప్పలేదు. ఇదే పరిస్థితి 2014లో కూడా పునరావృతమైంది. 2015లో ఎట్టకేలకు మెయిన్స్ కూడా క్లియర్ చేశాడు. రెండింటిని దాటుకుని వచ్చినా ఇంటర్వ్యూలో ఓటమి పలకరించింది. పరాజయానికి కారణాన్ని విశ్లేషిస్తుండగా..52 మార్కుల తేడాతో ఇంటర్వ్యూని కోల్పోయానని తెలుసుకుని మరింత గట్టిగా ప్రయత్నించాడు. కానీ అప్పటికే నైరాశ్యం మనసుని కమ్మేయడంతో 2016, 2017 ప్రిలిమ్స్ చేధించలేక..మళ్లీ యథావిధిగా జీరో పొజిషన్కి చేరిపోయాడు. ఇక లాభం లేదనుకుని మరింత కసితో 2018లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్, రెండింటిని క్లియర్ చేసి.. నూతనోత్సాహంతో ఇంటర్వ్యూ దశకి చేరాడు. అయితే ఈసారి చవిచూసిన ఓటమి కంటిమీద కునుకప్టటనీయకుండా చేసింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో గెలుపు కనుచూప మేరలో కూడా లేదు, ఈసారి సక్సెస్కి ఒక్కడుగు దూరంలో సివిల్ సర్వీస్ అధికారిని అవ్వలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అయినా అంత బాధను ఓర్చుకుంటూ..ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అలా 2023 వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండటం విశేషం. ఇంతలా ఓటమి తనను మట్టికరిపించినా..ఏ మాత్రం నైరాశ్యానికి తావివ్వలేదు..జీవితం అంటేనే పోరాటం అంటూ అజేయమైన సంకల్పంతో ముందుకుపోతున్నాడు. అంతేగాదు..తాను సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పొందిన అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సోషల్ మీడియా వేదికగా తన పరాజయాల పరంపరను పంచుకున్నాడు. అది కూడా ఏడుస్తూ కాదు..సగర్వంగా కాన్ఫిడెంట్గా తాను చేసిన పోరాటాన్ని చెబుతుంటే..ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి, మనసు మెలిపెట్టేలా భావోద్వేగం చెదేలా చేసింది. ఇంతలా ఓటమి నీడలా వెంటాడుతున్నా..అంతలా స్థైర్యంగా చిరునవ్వుతూ ఉండటం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు అంటూ నెటిజన్లు అభినందించారు. అంతేగాదు ఓటమిని అధిగమించి..లైఫ్ని ధైర్యంగా లీడ్ చేయడం ఎలా అనే విషయంలో గొప్ప మార్గదర్శకులు మీరే అని కునాల్ని అభినందించారు. ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయినా కునాల్ టీచర్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..ఔత్సాహిక సివిల్ సర్వీస్ అభ్యర్థులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. కునాల్ స్టోరీలో..ఓటమి పదే పదే పలకరించినా..పట్టువదలని విక్రమార్కుడిలా చేసినా అతడి ప్రయత్నాన్నికి కచ్చితంగా సెల్యూట్ చెప్పాల్సిందే కదూ..!. 12 attempt 7 main5 interview NO SELECTION.शायद जिंदगी का दूसरा नाम ही संघर्ष हैं ।#UPSC #यूपीएससी pic.twitter.com/FEil9NGJ5l— Kunal R. Virulkar (@kunalrv) April 16, 2024(చదవండి: Bhavya Narasimhamurthy on: అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!) -
చచ్చిపోదామనుకుంది...ఇపుడు వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతి
ముంబై నడిబొడ్డున ఎన్నో కలలు కంటున్న ఒక చిన్నారి కలలు ఒక్కసారిగా ఊహించని మలుపు తీసు కున్నాయి. పుస్తకాలతో దోస్తీ చేయాల్సిన 12 ఏళ్ల వయసులోనే పెళ్లి. కట్ చేస్తే.. గృహ హింస, తీరని అణిచివేత అంతకుమించిన పేదరికం. జీవితం పీడకలగా మారిపోయింది. కానీ అక్కడినుంచే తననుంచి దూరంగా వెళ్లి పోయిన జీవితాన్ని వెదుక్కుంది. వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారింది.దళిత కుటుంబంలో జన్మించి, కడు పేదరికాన్ని అనుభవించి, ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన కల్పనా సరోజ్ సక్సెస్ స్టోరీ.1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కల్పనా సరోజ్. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్కు పెళ్లి జరిగిపోయింది. భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో నివసించేది. కానీ పెళ్లి తరువాత అత్తింటి వేధింపులు భరించలేక, బయటపడటానికి మార్గం లేదని భావించి కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆమె తండ్రి ఆమెను రక్షించి,ఇంటికి తిరిగి తీసుకు వచ్చాడు. అలా16 సంవత్సరాల వయసులో, మనుగడ కోసం పోరాటం ప్రారంభమైంది. ముంబైలోని ఒక ప్రభుత్వ వస్త్ర మిల్లులో ఉద్యోగం మొదలు పెట్టింది జీతం నెలకు రూ. 2 మాత్రమే. కానీ అదే కల్పన భవిష్యత్తుకు తొలి అడుగు. సాధికారతకు స్వావలంబంనకు బీజం.ఇదీ చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీఈ కష్టాలమధ్యే బట్టలు కుట్టడం నేర్చుకుంది. అలా కల్పన ఆదాయాన్ని రూ. నెలకు 50 రూపాయలు. ఆ అనుభవంతో ఆమె పెద్ద రిస్కే చేసింది. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో రూ. 50 వేల రుణం తీసుకొని సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. క్లాత్ బొటిక్ ప్రారంభించింది. అనుకోకుండా ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టింది . అక్కడితో ఆగిపోలేదు. బలమైన నెట్వర్క్తో రియల్ ఎస్టేట్లోకి విస్తరించింది. ఎలా అంటే..1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొని మోసపోయింది. కానీ అప్పటి కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చిన కల్పనా సరోజ్,ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగింది. KS ఫిల్మ్ ప్రొడక్షన్ఆ తర్వాత తన సొంత సంస్థ KS ఫిల్మ్ ప్రొడక్షన్ను స్థాపించింది. మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబం ఎదుర్కొన్న దారుణాల గురించి 'ఖైర్లాంజిచ్య మాత్యవర్' అనే వాణిజ్య చిత్రాన్ని నిర్మించింది. ఆధునిక కాలంలో కూడా దళితులను ఎలా చూస్తారనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ కథనాన్ని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకురావాలనది ఆమె అభిమతం. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ ,తెలుగు భాషలలో డబ్ చేశారు. నేరస్థులను ఆపకపోతే, అవగాహన పెంచకపోతే, సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని కల్పన నమ్ముతారు.కమానీ ట్యూబ్స్కు ప్రాణం పోసిందిదృఢసంకల్పం, తెలివైన వ్యాపారవేత్తగా ఆమె ఖ్యాతి పెరిగింది. కమానీ ట్యూబ్స్ కంపెనీప్పుల్లో మునిగి, పతనం అంచున ఉంది. దాదాపు మూడేళ్లుగా దాని 3,500 మంది ఉద్యోగులకు చెల్లించలేకపోయింది. అలా వారు 2001లో, కల్పనను సలహా కోసం సంప్రదించారు. ఇదే ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైన చాలెంజ్ విసిరింది. దాన్ని బాధ్యతగా తీసుకుంది కల్పన. ఏకంగా కంపెనీని కొనుగోలు చేసి, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించింది. అచంచలమైన సంకల్పంతో ముందుకు నడిపించింది. అప్పులను తీర్చేసి,కార్మికులకు జీతాలు చెల్లించడమే కాదు, కంపెనీ లాభాల బాట పట్టింది. ఇపుడు కమానీ ట్యూబ్స్ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.చదవండి: చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్ఏడో తరగతిలోనే పెళ్లి, కష్టాలు అనుభవించి, రూ. 2 సంపాదించిన బాల్య వధువు కల్పన సరోజ్, రూ. 1000 కోట్ల నికర విలువను కలిగి ఉంది. కమానీ ట్యూబ్స్ చైర్పర్సన్గా 2013లో పద్మశ్రీ అవార్డును అందుకుంది. IIM బెంగళూరులో గవర్నర్ల బోర్డు సభ్యురాలు కూడా. దీంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోందామె.కల్పన సరోజ్ జీవితం అద్భుతమైన విజయగాథ మాత్రమే కాదు. కృషి, పట్టుదల ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అనడానికి ఇదొక బ్లూప్రింట్. కష్టాల కొలిమినుంచే అందమైన జీవితానికి బాటలు వేసుకున్న ధీర కల్పన సరోజ్ ఎంతోమందికి ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ
చిన్నప్పటినుంచీ తండ్రి వ్యాపారాన్ని చూస్తూ పెరిగింది. ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకరోజు అనుకోకుండా కుల్ఫీ మేకింగ్లో ప్రయోగం చేసింది. అంతే అక్కడినుంచి ఆమె జీవితం, ఆలోచన మారి పోయింది. కట్ చేస్తే కోటి రూపాయలు ఆర్జించే బిజినెస్కు యజమానిగా మారిపోయింది. ఎవరామె? ఏమా సక్సెస్ జర్నీ. తెలుసుకుందామా ఢిల్లీకి చెందిన సమత బోత్రా(Samta Bothra) సగటు అమ్మాయి మాదిరిగా పెళ్లి చేసుకుని భర్త, పిల్లా పాపాలతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తోంది. అలాదాదాపు మూడు దశాబ్దాలు గడచిపోయాయి. 2018లో హోలీ పండుగ సందర్బంగా సరదాగా కుల్ఫీ తయారు చేసింది. అందరికి తెగ నచ్చేసింది. ఇంటికొచ్చిన బంధువులకు కూడా రుచి చూపించింది. అంతే అలాంటి కుల్పీ కావాలని బంధువులు మళ్లీ మళ్లీ అడగడం మొదలు పెట్టారు. దీంతో దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదనే ఆలోచన 51 ఏళ్ల సమత మదిలోవచ్చింది. View this post on Instagram A post shared by Foodler (@realfoodler)తన కొడుకు సహాయంతో, సమతా కేవలం మూడు రుచులతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది సమత. ఇంట్లో నుండే రబ్రీ, గులాబీ , కేసర్ కుల్ఫీ ఆర్డర్స్ మీద తయారు చేసింది. కేవలం రూ.5 వేలతో మమ్మీస్ కుల్ఫీ మొదలైంది. అలా ప్రారంభ రోజుల్లో ఆర్డర్ల సంఖ్య చాలా తక్కువగా అంటే రెండు రోజులకు ఒక ఆర్డర్ వచ్చేవి. స్నేహితులు ,బంధువుల తదితరుల ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. అలా ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆరేడు నెలల తర్వాత రెగ్యులర్గా కుల్ఫీల కోసం ఆర్డర్ట్ మొదలైనాయి. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీంతో డిమాండ్ మరింత పుంజుకుంది. ప్రతి రోజు 60 నుంచి 70 దాకా ఆర్డర్లు వచ్చేవి.కార్పొరేట్ కంపెనీలు సైతం మమ్మీస్ కుల్ఫీలకు ఆర్డర్లు ఇచ్చేవారు. జొమాటోతో భాగస్వామ్యం కార్పొరేట్ల కోసం ఒకేసారి 2000 - 3000 కుల్ఫీ బల్క్ ఆర్డర్లు వచ్చేవి. మెట్ లైఫ్ , భారతి ఎయిర్టెల్తో సహా అనేక ఇతర కంపెనీలలో కుల్ఫీ స్టాల్లను కూడా ఏర్పాటు చేసింది. రూ. 5వేల నుంచి కోటి టర్నోవర్ దాకాడిమాండ్ బాగా పెరగడంతో రిటైల్ బిజినెస్లోకి కూడా ప్రవేశించింది సమత. ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణా నగర్లో మమ్మీ కుల్ఫీ షాప్ను తెరించింది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. మమ్మీ కుల్ఫీ రుచికి, నాణ్యతకు వినియోగదార్లు ఫిదా అయిపోయారు. దీంతో తరువాత ఏడాదికే మరో షాపును ఓపెన్ చేసే స్థాయికి చేరింది. ఇపుడు ఏడాదికి కోట రూపాయల టర్నోవర్ను సాధించింది. అన్నీ సహజ, సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తామని చెబుతున్నారు సమత. ఒక్క ఐడియాతో తన జీవితాన్ని మార్చేసుకుని తన లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది సమత. సక్సెస్కు వయసుతో సంబంధం లేదని ఓర్పు, సహనం, మార్కెటింగ్ టెక్నిక్ తెలిస్తే చాలని చాటి చెప్పింది. -
20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
కరియర్ పీక్లో ఉండగా, దాన్ని వదిలేసి, పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని కోట్లకు పడగలెత్తిన ఒక నటి సక్సెస్ స్టోరీ గురించి తెలుసా? ఒకటీ రెండూ కాదు, ఏకంగా 1200 కోట్ల విలువైన కంపెనీకి సారధిగా సత్తా చాటుకుంటున్న ప్రముఖ టీవీ నటి ఆష్కా గొరాడియా విజయ గాథను తెలుసుకుందాం పదండినటులు కేవలం నటనలో మాత్రమే కాదు, వ్యాపార రంగంలోనూ రాణించగలరు అని నిరూపించిన నటి ఆష్కా. టీవీ నటిగా మరపురాని పాత్రలు పోషించడమే కాదు స్టార్ట్ప్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. రోజువారీ సబ్బుల నుండి గ్లోబల్ బ్యూటీ ప్రొడక్ట్స్ దాకా నైపుణ్యం విస్తరించింది.2002లో 'అచానక్ 37 సాల్ బాద్' షోతో టీవీలో అడుగుపెట్టింది. తర్వాత 'భాభి', 'తుమ్ బిన్ జౌన్ కహాన్' వంటి షోలలో పనిచేసింది. అయితే 2003లో, ఏక్తా కపూర్ షో 'కుసుమ్'తో ఆమె కరీయర్ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆమె 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థి', 'సిందూర్ తేరే నామ్ కా', 'నాగిన్' పాపులర్ టీవీ సీరియల్స్తో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. అష్కా కేవలం కల్పనలో మాత్రమే కాకుండా రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. 2019 లో 'దాయన్' ,రియాలిటీ షో 'కిచెన్ ఛాంపియన్ 5' లో కనిపించింది. 2021 లో, ఆమె తన వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించడానికి నటనను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది.రెండు దశాబ్దాల స్టార్డమ్కు బైబై చెప్పేసింది. కళాశాల స్నేహితులు ప్రియాంక్ షా , అశుతోష్ వలాని తో కలిసి, ఈ ముగ్గురూ 2020 లో ‘రెనీ కాస్మెటిక్స్’ ను ప్రారంభించారు. మిత్రుల వ్యాపార అనుభవానికి ఆష్కార్ తెగువ, ధైర్యం మరింత కలిసి వచ్చాయి. వలం రూ.50 లక్షలతో ప్రారంభమైన డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ రూ. 1,200–1,400 కోట్లకు చేరింది. తరువాతి క్రమంలో ఈ బ్రాండ్ ఆఫ్లైన్లో కూడా విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాలలో, రెనీ కాస్మెటిక్స్ బ్రాండ్ నుండి పూర్తి స్థాయి సామ్రాజ్యంగా మారింది. లిప్స్టిక్లు, ఐలైనర్లు, హైలైటర్లు ఇలా 200 కంటే ఎక్కువ బ్యూటీ ఉత్పత్తులతో, బ్రాండ్ ఇప్పుడు భారతదేశం అంతటా 650 స్టోర్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, మింత్రాలో అమ్మకాలు సాగుతున్నాయి. రెనీ సునామీమెరుపు వేగంతో వచ్చిన పెట్టుబడులు కంపెనీనీ రూ. 100 కోట్లను సేకరించింది. 2024 సంవత్సరంలో, రెనీ కాస్మెటిక్స్ కంపెనీ ఎవాల్వెన్స్ ఇండియా మరియు ఎడెల్వీస్ గ్రూప్ నేతృత్వంలో వచ్చిన నిధులతో కంపెనీ రూ. 820 కోట్ల నుండి కూల్ రూ. 1,200 కోట్లకు ఎగిసింది. కాగా భారతదేశంలో అందం మరియు సౌందర్య సాధనాల పరిశ్రమ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్లను మించుతుందని అంచనా.రెనీ అంటే అర్థం ఇదీ! “రెనీ” అనే పేరుకు ఫ్రెంచ్లో “పునర్జన్మ” అని అర్థం. అలా రెనీ ద్వారా ఆష్క తన కరియర్ పునర్ని ర్మించుకుంది. తాను 16 ఏళ్ల వయసులో గుజరాత్ నుండి ముంబైకి వచ్చిన అష్కా ప్రారంభంలో, పేయింగ్ గెస్ట్గా అద్దె ఇంట్లో నివసించింది. కానీ 23 ఏళ్ల వయసులో ముంబైలో నా సొంత ఇల్లు కొనుక్కోవడం తన జీవితంలో పెద్ద సక్సెస్ అయి ఒక సందర్బంలో స్వయంగా చెప్పుకుంది ఆష్కా. ఇంతటి అద్భుతమైన విజయంతో నటననుంచి వ్యాపారవేత్తలుగా మారిన అతి కొద్ది మంది వారిలో ఆష్క ముందు వరుసలో ఉంటారు. ప్రేమ, పెళ్లి ప్రతి సూపర్ ఉమెన్ వెనుక, ఒక సూపర్ సపోర్టివ్ పార్టనర్ తప్పకుండా ఉంటారు. అలాంటి వారిలో ఆషా భర్త కూడా ఒకరు. 2016లోపరిచయమైన అమెరికన్ వ్యాపారవేత్త బ్రెంట్ గోబుల్తో ప్రేమలో పడింది. 2017లో వీరిద్దరూ క్రైస్తవ , హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. -
గెంటేశారనే కోపంతో రూ.12వేల కోట్ల కంపెనీ ఏర్పాటు!
అవమానాలు జరిగిన చోటే సత్తా ఏంటో చూపించాలని పెద్దలు చెబుతుంటారు. సరిగ్గా సుధీర్ జాటియా జీవితంలో ఇదే జరిగింది. ఒకప్పుడు తాను నడిపిన సంస్థ నుంచి కొన్ని కారణాల చేత తనను బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. దాంతో అదే రంగంలో అంతకుమించిన శక్తిగా ఎదిగాలనుకున్నారు. ఫలితంగా ఇప్పటికే ఆ రంగంలో లాభాలులేక కొట్టుమిట్టాడుతున్న ఓ కంపెనీని కొనుగోలు చేసి తనను బయటకు పంపిన కంపెనీకి అతిపెద్ద పోటీదారుగా మారారు. ఓటమిని గెలుపు మెట్టుగా మార్చుకున్న సుధీర్ జాటియా వ్యాపారం ప్రయాణం తెలుసుకుందాం.దాదాపు రెండు దశాబ్దాల పాటు సుధీర్ జాటియా ఒకే పరిశ్రమలో, అందులోనూ వీఐపీ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలో కీలక పాత్ర పోషించారు. అయితే, 2010లో ఆ సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు సుధీర్ జాటియా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అంతటితో నిరాశ చెందకుండా ఒక కొత్త లక్ష్యానికి పునాది వేశారు. ఆయన కొనుగోలు చేసిన సఫారీ ఇండస్ట్రీస్ నేడు రూ.12,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగి భారీ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.ముంబై నగరంలో జన్మించిన సుధీర్ జాటియా ముంబై విశ్వవిద్యాలయం నుంచి కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన జీవితంలో తొలి వ్యాపార అనుభవం తండ్రి నిర్వహించిన టెక్స్టైల్ వ్యాపారంతో మొదలైంది. 1988లో ఆయన తండ్రి, దిలీప్ పిరమల్ (వీఐపీ) సంయుక్తంగా అరిస్టోక్రాట్ (Aristocrat) అనే లగేజ్ కంపెనీని కొనుగోలు చేశారు. దాంతో 21 ఏళ్ల వయసులో జాటియా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అరిస్టోక్రాట్, VIP వంటి పెద్ద సంస్థల మధ్య పనిచేస్తూ ఆయన కేవలం రెండేళ్లలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎదిగారు.ఊహించని మలుపుతన కుటుంబ ప్రయోజనాలను కాపాడుకుంటూ వ్యాపారంలో నైపుణ్యం సంపాదించిన సుధీర్ జాటియా 2003లో వీఐపీ, అరిస్టోక్రాట్ రెండింటికీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆ సంస్థను భారతదేశంలోనే అతిపెద్ద లగేజ్ సామ్రాజ్యంగా నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, 2010లో VIP వ్యవస్థాపకుల్లో కొందరు తమ కుటుంబ సభ్యులను(తరువాతి తరం) సంస్థ నాయకత్వంలోకి తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో జాటియాను ఆ కంపెనీ నుంచి పంపించాలని నిర్ణయించిట్లు ఆరోపణలున్నాయి(వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు). జీవితంలో కష్టపడి పనిచేసిన సంస్థ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మనసులో బలమైన సంకల్పం ఏర్పడింది.సఫారీవీఐపీ నుంచి బయటకు వచ్చిన తరువాత సుధీర్ జాటియాకు తన వ్యాపార నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనే కసి పెరిగింది. ఆయన దృష్టి అప్పటికే మార్కెట్లో బలహీనంగా ఉన్న సఫారీ ఇండస్ట్రీస్ (Safari Industries)పై పడింది. 2011లో జాటియా కేవలం రూ.29 కోట్లతో సఫారీ ఇండస్ట్రీస్లో 56% వాటాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో సఫారీ కంపెనీ మొత్తం విలువ రూ.55 కోట్లు మాత్రమే. సఫారీ అమ్మకాలు అప్పటివరకు ఎక్కువగా సైనిక క్యాంటీన్లపై ఆధారపడి ఉండేవి. ఆయన మొదటగా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. నాణ్యత లేనిదే మార్కెటింగ్ పనికిరాదని గట్టిగా నమ్మారు.ఆన్లైన్ మార్కెటింగ్కు సంబంధించి VIP వంటి పాత కంపెనీలు సంకోచిస్తున్న సమయంలో సుధీర్ జాటియా ముందడుగు వేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. ఆన్లైన్ ప్రకటనలపై భారీగా పెట్టుబడి పెట్టారు. ఇది సఫారీకి మార్కెట్లో విపరీతమైన వృద్ధిని అందించింది.రూ.12,000 కోట్ల సామ్రాజ్యంతన అనుభవం, మార్కెట్పై ఉన్న పట్టు, ముక్కుసూటి నిర్ణయాలతో సుధీర్ జాటియా సఫారీని అనూహ్యంగా వృద్ధి చేశారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత సఫారీ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. 2018-19 ప్రాంతంలో సుమారు రూ.1,500 - రూ.1,800 కోట్లుగా ఉన్న సఫారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆయన వ్యూహాత్మక నాయకత్వంలో ప్రస్తుతం సుమారు రూ.12,000 కోట్లకు పైగా చేరుకుంది. ఈ వృద్ధి, ఆయన పూర్వ సంస్థ వీఐపీ కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.ఇదీ చదవండి: బీమా రంగానికి ఏఐ ధీమా -
అలా చేస్తేనే విజయం తథ్యం..! ఐఏఎస్ పారి బిష్ణోయ్ సక్సెస్ స్టోరీ
యూపీఎస్సీ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలు, ఎదురుదెబ్బలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిశ్శబ్ద పోరాటంతో ఐఏఎస్ సాధించింది పారి బిష్ణోయ్(Pari Bishnoi ). ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తాను ఎదుర్కొన్న ఒత్తిడి, తన ప్రయాణంలో అత్యంత కష్టమైన దశ గురించి వివరించింది. యూపీఎస్సీలో మొదటి ప్రయత్నంలో విఫలం అయినప్పుడు రాజస్థాన్లోని తన స్వస్థలానికి వెళ్లింది పారి. ప్రపంచం నుండి తనను తాను దూరం చేసుకొని ఒంటరి ప్రపంచంలోకి వెళ్లిపోయింది. తట్టుకోలేని ఒత్తిడిలో బాగా తినేది. దీంతో 30 కిలోలకు పైగా బరువు పెరిగింది! మానసిక భారంతో పాటు శారీరక భారం కూడా తనను భయపెట్టింది. దీంతో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పొద్దుటే లేచి వ్యాయామాలు చేసి బరువు తగ్గింది. మనసు తేలిక పడింది. తేలిక పడిన మనసు తిరిగి లక్ష్యం వైపు దృష్టి సారించింది.‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అని తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. పరీక్ష ప్రిపరేషన్కు సంబంధించిన వ్యూహాన్ని మెరుగుపరుచుకుంది. దృఢనిశ్చయంతో అనుకున్నది సాధించింది.పారి బిష్ణోయ్ షేర్ చేసిన వీడియో ఇప్పటికే పది లక్షల లైక్లను దాటింది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!) -
పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలు
పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటపుడు ‘అయ్యో.. రేటు వచ్చేదాకా వీటిని భద్రపరిస్తే ఎంత బాగుండు’ అని అనుకుంటాం. అలా పుట్టిన ఆలోచనే ఆధునిక పద్దతులకు బాటలు వేస్తుంది. అదే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పదండి వారి విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని గగన్బావ్డా తహసీల్లో, తేజస్-రాజేష్ పొవార్ అనే ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ ఇది. అది జాక్ఫ్రూట్ (పనస) చిప్స్ బిజినెస్తో. సాధారణంగా పనసకాయలు ఒకసారి కాతకొచ్చాయంటే విపరీతమైన దిగుబడి వస్తుంది. కొల్హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని దాదాపు ప్రతి రైతు తమ పూర్వీకుల నుండి పనస చెట్లు వారసత్వంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వాటి ద్వారా మంచి జీవనోపాధిని కూడా పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఉత్తిత్తి కూడా చాలా అధికంగా ఉండేది. దీంతో రైతులు వాటిని కోయలేక, మార్కెట్ చేసుకోలేక, మండీకి రవాణా ఖర్చులు కూడా భరించలేక వాటిని అలాగే పారవేసేవారు.తేజస్, రాజేష్ తల్లిదండ్రులకు జాక్ఫ్రూట్ చెట్లు బాగానే ఉండేవి. ఒక ఏడాది పనసకాయలుబాగా రావడంతో కొల్హాపూర్లో నివసించే బంధువులైన సంగీత, విలాస్ పొవార్ ఇంటికి తీసుకెళ్లారు.మా దగ్గర చాలా కాయలున్నాయి. వృధాగా పార వేస్తున్నామనే విషయాన్ని వారితో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా వాటిని పారవేయడానికి బదులు చిప్స్గా తయారు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉందని వారు సూచించారట. అంతే అక్కడినుంచి వారి జీవితం మరో మలుపు తిరిగింది.15 కిలోల చిప్స్తో మొదలుదీంతో కుమారులతో కలిసి వారు రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలో దాదాపు 15 కిలోల చిప్స్ను తయారు చేసి కొల్హాపూర్లో ఇంటింటికీ వెళ్లి విక్రయించారు. డిమాండ్ పెరిగినప్పటికీ, ఇంటింటికీ డెలివరీ అందించడం సాధ్యం కాలేదు. దీంతో ఐటీఐ చదువు అయిన వెంటనే తేజస్ పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. ప్యాకేజింగ్ చేయడానికి కొన్ని ప్రాథమిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేరుగా హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లకు విక్రయించే పద్దతులను ప్రారంభించారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో పది పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాక్ఫ్రూట్ కోత జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభమైజూలై-ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఏటా 4,000 కిలోల జాక్ఫ్రూట్ను ప్రాసెస్ చేసి 1,000 కిలోల వేఫర్లను ఉత్పత్తి చేస్తారు.మార్కెట్ డిమాండ్ బట్టి కేజీ చిప్స్ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తారు. ఇక జాక్ఫ్రూట్ పోలీలు కేజీకి రూ. 700 చొప్పున అమ్ముడవుతాయి. అలా ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ పని పనసపంట వృధాను అడ్డుకోవడంతోపాటు, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది అంటూరు తేజస్ సంతోషంగా.పనస చెట్లు 30 అడుగుల నుండి 70 అడుగుల వరకు పెరుగుతాయి. పెద్ద పెద్దకాయలతో దిగుబడి కూడా భారీగా వస్తుంది. దీనికి తోడు భారీ బరువు, కాయలనుంచి వచ్చే జిగట రబ్బరు పాలు కారణంగా వాటిని కోయడం చాలా ఛాలెంజ్ అంటారు తేజస్. అందుకే రైతు లనుంచి కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారట. అలాగే పనసకాయలను ప్రత్యేక పద్ధతిలో కోసేలా నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం వాటిని చిప్స్, ఇంకా పండిన పండ్లను ఫనాస్ పో (భక్ష్యాలు) జాక్ఫ్రూట్ గుజ్జు, బెల్లం, గోధుమ పిండితో కలిపి తీపి ఫ్లాట్బ్రెడ్ తయారు చేస్తారు. చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన పనసకాయలో పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు ఇపుడు ఏ పెళ్లిళ్లు, పంక్షన్లలో చూసినా పనస కాయ బిర్యానీ చాలా ఫ్యామస్. జాక్ఫ్రూట్ కబాబ్లు, బిర్యానీలు, ఇతర రెడీ-టు-కుక్ ఉత్పత్తులకు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది.భారతదేశ జాక్ఫ్రూట్ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1252 కోట్లు. రానున్న ఐదేళ్లలో దాదాపు రూ. 1580 కోట్లకు పెరుగుతుందని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCSNIAM) నివేదిక పేర్కొంది. -
ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిల్..! కానీ ఇవాళ..
అందరు లక్షల్లో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవాలనుకుంటారు. అందుకోసం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదివి మరి అనుకున్న డ్రీమ్ని నెరవేర్చుకుంటుంటారు. అలానే ఈ వ్యక్తి కూడా 17 ఏళ్ల వయసులో ఐఐటీలో చేరడమే లక్ష్యంగా చదివాడు. కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో ఆ కల చేజారిపోయింది. పోనీలే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు. అది కూడా విఫలమే. ఇన్ని ఫెయ్యిల్యూర్స్ ఎదురైనా..నా వల్ల కాదని చేతులెత్తేయలేదు. చివరికి అనుకున్న లక్ష్యానికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడే డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. పాపం చిన్నప్పటి నుంచి తను కన్న ప్రతి కల నీరుగారిపోయేది. అడుగడుగునా వైఫల్యాలే. చిన్నప్పటి నుంచి ఐఐటీలో చేరడమే హర్షిల్ లక్ష్యం . కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా 75 వేల ర్యాంకు తెచ్చకున్నాడు. దీంతో ఆ ఐఐటీ డ్రీమ్ కలగానే మిగిలిపోయింది. చివరికీ మాములు కాలేజ్లో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పోనీలే 20 ఏళ్లకే అందరికంటే మంచి పొజిషన్లో ఉండేలా లక్షల వేతనంతో కూడిన జాబ్ కొట్టేయాలనుకున్నాడు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. చివరికి నెలకు రూ. 30 వేలు సంపాదించే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని అతికష్టం మీద తెచ్చుకున్నాడు. ప్రతి రోజు తనను తాను అసహ్యించుకుంటూ..ఇదేం ఉద్యోగం అని బాధపడిపోతుండేవాడు. అయినా సరే తన డ్రీమ్ని వదిలిపెట్టకుండా..అలా చాలా ఉద్యోగాలు ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటూనే ఉండేవాడు. అలా చేస్తుండగా ఏ కంపెనీ నుంచి రిప్లై వచ్చేది కాదు. అలా ఆరు నెలలుగా కేవలం చదువుకోవడం, వ్యాయామాలు చేయడం, ఉద్యోగం కోసం వేట. ఇంతలా చేసినా..ఎలాంటి ఫలితం లేదు. అయితే ఒకరోజు నుంచి ఆకస్మికంగా ఇటర్వ్యూ కాల్స్ రావడం ప్రారంభించాయి. అలా 2024 నాటికి ఓ చిన్న ఆన్లైన్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇంటర్న్షిప్నే పూర్తి సమయం ఉద్యోగంగా మార్చుకున్నాడు. తొందరలో ఆ ఉద్యోగానికి స్వస్తి పలకక తప్పలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. అలా పెద్దపెద్ద సంస్థలతో స్పాన్సర్ షిప్లు చేసే స్థాయికి చేరుకుని.. సొంతంగా కంపెనీకి పెట్టుకునే రేంజ్కి ఎదిగాడు. ఇవాళ ఏకంగా రూ. 54 లక్షలు అధిక వేతనానన్ని అందుకుంటూ తన కలను నెరవేర్చుకున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్లో తన సక్సెస్ జర్నీ గురించి వివరించాడు డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. బ్రో మీది చాలా స్ఫూర్తిదాయకమైన స్టోరీ, ఎదురుదెబ్బలను ఎలా ఇంధనంగా మార్చుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. దృఢ సంకల్పంతో ఉండేవాడికి అదృష్టమే ఒళ్లోకొచ్చి వాలుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచారు అంటూ హర్షిల్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్) -
దోసె బిజినెస్తో నెలకు రూ. కోటి సంపాదిస్తున్న జంట
ఒక్కోసారి మనకు తగిలిన దెబ్బలే విజయపథంవైపు అడుగులు వేయిస్తాయి. మన అభిరుచులు, కోరికలే మన జీవితంలోఊహించని సక్సెస్కు బాటలు వస్తాయి.ముంబైకు చెందిన జంట సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే.బెంగళూరుకు చెందిన అఖిల్, శ్రీయ దంపతులు ముంబైలో మొదట్లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అరకొర జీతాలతో నెట్టుకొచ్చేవారు. దీంతో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఇద్దరిలోనూ బాగా ఉండేది. అఖిల్ అయ్యర్, శ్రియ నారాయణకు కర్ణాటకలోని దావణగిరె దోసెలంటే పిచ్చి ప్రేమ. దాన్ని తమ స్నేహితులకు రుచి చూపించారు. మంచి స్పందన లభించింది. అంతే వ్యాపార ఆలోచనకు పదును పెట్టారు. ఆ అభిరుచి, పట్టుదలకు కృషి తోడైంది. అలా ఎంబీఏలు, ఐఐటీలు లేకుండానే నెలకు కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) ఎలాంటి పెట్టుబడి దారులు, ఫుడ్ ఇండస్ట్రీలో అనుభవం లేకుండానే బాంద్రాలో ఒక చిన్న కేఫ్ను ప్రారంభించారు. కేవలం 12 సీట్లతో కెఫే మొదలైంది. మెల్లిగా మంచి పేరు తెచ్చుకుంది. తాజా దోసెకు తోడు రుచికరమైన చట్నీ ఇంత కంటే ఏం కావాలి. స్పందన అఖండంగా మారిపోయింది. త్వరలోనే, నగరం నలుమూలల నుండి ప్రజలు బెన్నే దోసెల రుచి చూడటానికి అవుట్లెట్ వెలుపల బారులు తీరారు. నేడు ప్రతీ రోజుకి 800కు పైగా దోసెలమ్మే స్థాయికి వారి బిజినెస్ వృద్ధి చెందింది. ఒక్కో దోసె ధర రూ. 250 నుండి రూ. 300 వరకు ఉంటుంది. ఫలితంగా నెలకు రూ. 1 కోటి సంపాదన ఆర్జించే వ్యాపారంగా మారింది. దోసె టేస్టే పెద్ద సక్సెస్ ఫ్యాన్సీ ఇంటీరియర్స్ లేదా సెలబ్రిటీ ఎండార్స్మెంట్లేవీ లేవు. ఒక చిన్న ప్రాంతాన్ని అద్దెకు తీసుకుని దానిని క్లౌడ్ కిచెన్లా మార్చారు. తమ కలల కేఫ్ అయిన బెన్నేగా పేరుపెట్టుకున్నారు. శుభ్రత, నిజమైన రుచి, తాజా వంటలు ఆహార ప్రియులకు తెగ నచ్చేశాయి. ఆ నోటా ఈ నోటా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి గిరాకీ వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల ద్వారా ఈ రెస్టారెంట్ ఖ్యాతి పెరిగింది. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ , అనుష్క జంట 2024లో బెన్నే కేఫ్ను సందర్శించి ఆహా అని అరగించారు. ఇంకా రోహిత్శర్మ లాంటి ప్రముఖుల మనసు దోచుకుందీ బెన్నే దోసె ఇంకా దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, రాజ్కుమార్ రావు, శ్రద్ధా కపూర్ , దియా మీర్జా వంటి ప్రముఖులు విరాట్ జంటతో కలిసి కన్నడ బెన్నే దోసెలమీద మనసు పారేసుకున్నవారే. అంతేకాదు సోషల్మీడియా ద్వారా బాగా ప్రచారం చేసుకున్నారు. రీల్స్ ద్వారా మంచి ఆదరణను పెంచుకున్నారు. ఇక్కడ అన్ని రకాల దోసెలతో పాటు, ఇడ్లీ, ఇతర సౌత్ ఇండియన్ టిఫిన్లు, కాఫీ కూడా ప్రత్యేకమే. కాగా శ్రియ నారాయణ్ , అఖిల్ అయ్యర్ దంపతులు ముంబైలో ‘బెన్నే, బెంగళూరు హెరిటేజ్’ గోవాలో ‘బెన్నే బ్రాంచ్లను నిర్వహిస్తున్నారు. అన్నట్టు అఖిల్ ఒకప్పుడు సినిమా నిర్మాత. కాగా ఆమె మనస్తత్వవేత్త. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) -
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా. -
ప్లేస్మెంట్లో ప్రతిసారి 'నో'..కట్చేస్తే..!
ఎన్నో స్ఫూర్తిని కలిగించే సక్సెస్ స్టోరీలను చూసుంటారు. అయితే వాటిలో..ఎన్నో వైఫల్యాల తర్వాత విజయాన్ని చవిచూసిన వారు కొందరైతే..తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నవారు మరికొందరు. అలా కాకుండా మన స్నేహితులంతా సెటిల్ అవుతూ హ్యాపీగా ఉంటే..మనం మాత్రం ఓటమితో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే..మళ్లీ ప్రయత్నించాలన్నా బాధకంటే..మనమే ఎందుకు ఓడిపోతున్నాం అనే బాధ ఎక్కువుగా ఉంటుంది. కానీ ఇతడు వాళ్లతో నార్మల్గా వ్యవహరిస్తూ..యథావిధిగా తన ప్రయత్నం సాగించి..వారికంటే స్పెషల్ అనిపించుకునేలా అందనంత స్థాయిలో సెటిల్ అయ్యాడు. వైఫల్యాలను హ్యాండిల్ చేయడం అంటే ఇది బ్రో అని చెబుతున్నాడు అతడు. నెట్టింట తెగ వైరల్గా మారింది అతడి సక్సెస్ స్టోరీ.అతడే ఫ్లట్టర్ యువర్ వే వ్యవస్థాపకుడు కార్తీకే సింగ్. తన స్టోరీని సోషల్ మీడియాలో ఎక్స్లో షేర్ చేసుకున్నాడు. వింటే కచ్చితంగా వాటే సక్సెస్ స్టోరీ అంటారు. 16 ఏళ్ల వయసులో ఐఐటీలో అడ్మిషన్ పొందాలనుకున్నాడు. అది మిస్. సర్తే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు..అది కూడా ఫెయిల్. స్నేహితులంతా క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలక్ట్ అయిపోతుంటే..కార్తీక్కి మాత్రం రిజెక్ట్లే ఎదురయ్యేవి. మెక్రోసాఫ్ట్ నుంచి ఆటోడెస్క్ వరకు అన్ని నో చెప్పాయి. హాస్టల్ రూమ్లో స్నేహితులంతా జాబ్ కొట్టేశామన్న ఆనందంతో పార్టీలు చేసుకుంటే..తాను మాత్రం బెడ్పై పడుకుని..వందోసారి జాబ్ పోర్టల్స్ రిఫ్రెష్ చేస్తున్నా అని పోస్ట్లో రాసుకొచ్చాడు కార్తీక్. అనుకోకుండా ఒక రాత్రి ఇన్స్టాగ్రామ్లోఒక ఫ్రీలాన్సర్ని చూశాడు. ఆన్లైన్లో పనిచేస్తూ..స్థిరమైన ఆదాయం అందుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని చూసి..అతడితో సంభాషించాడు. అదే అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. కార్తీక్ అతడిలా ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ఎటువంటి ప్రతిస్పందన, లైక్లు, సందేశాలు రాలేదు. దాదాపు ఆరు వారాల తర్వాత నాకు సహాయం చేయగలరా అనే మెసేజ్ వచ్చింది. ఇది అతని తొలి ప్రాజెక్ట్. అందుకు అతనికి రూ. 3000 వేతనం పొందాడు. ఆ ప్రారంభ ప్రాజెక్ట్ క్రమంగా పెరిగింది. అలా క్లయింట్లురావడం ప్రారంభించారు, ప్రాజెక్టులు రేట్లు పెరిగాయి. చివిరకి ఒక ఐదుగురు వ్యక్తులతో కూడిన ఏజెన్సీని నడుపుతూ నెలకు దాదాపు రూ. 6 లక్షల మేర ఆదాయం అందుకుంటున్నాడు. ఇన్ని వైఫల్యాలు చూసిన తానే ఇంతలా సక్సెస్ని అందుకుంటే..మీరు కూడా కచ్చితంగా సాధించగలుగుతారు అని పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసులను తాకడమే కాదు..కార్తీక్ చేసిన ప్రయత్నాలకు ప్రశంసిస్తూ..ఏమి చేయలేని పరిస్థితిలో కూడా సానూకూల దృక్పథం, ఆశను వదులకోకూడదని చెబుతున్న మీ స్టోరీ చాలా స్ఫూర్తిని రగిలిస్తోందని అని పోస్టులు పెట్టారు.At 16, all I wanted was IIT.Didn't happen.At 20, all I wanted was a job offer.That didn't happen either.Microsoft said no.Autodesk said no.Everyone said no.Lying on my hostel bed, watching my friends celebrate placements while I refreshed job portals for the 100th time.…— kartikey singh (@askwhykartik) October 26, 2025 (చదవండి: ఆ దేశానికి ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్లోనే అత్యంత ధనిక దేశం..) -
ఆ పరీక్ష మిస్ అవ్వడం వల్లే.. సక్సెస్ అయ్యా!: నందన్ నీలేకని
జరిగేదంతా మన మంచికే అనే మాట.. చాలామంది తమ నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో వినే ఉంటారు. కానీ జరిగిపోయింది కూడా మంచికే అంటున్నారు.. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నందన్ నీలేకని' (Nandan Nilekani). ఇంతకీ ఎందుకిలా అంటున్నారు?, దాని వెనుక ఉన్న కారణం ఏమిటనేది.. ఇక్కడ చూసేద్దాం.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీలేకని.. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నారు. కానీ అదే సమయంలో తనకు ఆరోగ్యం సరిగ్గాలేకపోవడంతో.. పరీక్ష రాయలేకపోయారు. అంతే కాకుండా.. SAT లేదా GMATకు అప్లై చేసుకోవడానికి తాను బద్దకించినట్లు ఆయన పేర్కొన్నారు.ఆ తరువాత ముంబైలో ఉన్న ఒక చిన్న టెక్ సంస్థ పట్ని కంప్యూటర్ సిస్టమ్స్ కంపెనీ గురించి తెలుసుకుని నందన్ నీలేకని అక్కడ చేరారు. ఆ సమయంలోనే ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy)ని కలిశారు. అప్పుడే తన జీవితం ఒక మలుపు తిరిగింది. సొంతంగా కంపెనీ స్థాపించాలని నారాయణమూర్తి ఆలోచన నచ్చింది. దీంతో నా అడుగులు.. ఆయన వెంట సాగాయని నీలేకని వెల్లడించారు. మా ప్రయాణంలో.. మాలాంటి ఆలోచన కలిగిన మరో ముగ్గురుని కలిశాము. ఆ తరువాత ఇన్ఫోసిస్ స్థాపించామని వివరించారు.ఇన్ఫోసిస్ ప్రారంభించినప్పుడు.. చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు. కానీ పట్టుదలతో శ్రమించడం వల్లనే.. ఆ కంపెనీ దిగ్గజ ఐటీ కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచింది. 2002 మార్చి నుంచి 2007 ఏప్రిల్ వరకు ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేశారు. ఆ సమయంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది.నిజానికి ఆ రోజు పరీక్ష రాయకపోవడమే మంచిదైందని నీలేకని చెబుతారు. ఒకవేళ పరీక్ష రాసుంటే.. విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ పరీక్ష రాయకపోవడం వల్ల.. నారాయణమూర్తిని కలిసి కంపెనీ స్థాపించారు. ఇదంతా చూస్తుంటే.. ఆ రోజు జరిగిన పని నందన్ నీలేకని జీవితాన్నే మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. ఎక్కడంటే..!?
ఆ ఊర్లో ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ లాంటి లగ్జరీ కార్లు కనిపిస్తాయి. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 11 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఊరి జనమంతా కలిసి 1000 కోట్ల రూపాయలకు పైగా దాచుకున్నారు. జనానికి కావాల్సిన సదుపాలయాన్నీ ఆ ఊరిలో ఉన్నాయి. అయితే ఇదేదో సిటీ అనుకుంటున్నారా? కానేకాదు పక్కా పల్లెటూరు. విలేజ్లో ఇంటికో విలాసవంతమైన కారు ఎలా అబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? మరి అదే ఆ గ్రామం ప్రత్యేకత.మనం చెప్పుకోబోయే గ్రామం పేరు ధర్మజ్. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉంది. మన దేశంలో అత్యంత ధనిక గ్రామంగా, ఎన్నారై విలేజ్గా ఆఫ్ ఇండియాగానూ (NRI Village of India) ప్రసిద్ధికెక్కింది. సగటు పల్లెలకు భిన్నంగా ధర్మజ్ సక్సెస్ సాధించడం వెనుక చాలా పెద్ద ప్రయాణమే ఉంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సొంతూరిని మరిచిపోకపోకుండా ఉండడమే ఈ ఊరి విజయ రహస్యం. ఇక్కడి నుంచి పలు దేశాలకు వలసవెళ్లిన వారు పంపించిన సొమ్ములతో ధర్మజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.అలా మొదలైంది..ధర్మజ్ గ్రామ విజయయాత్ర 1895లో మొదలైంది. ఈ గ్రామం మొదటి తరానికి జోతారామ్ కాశీరామ్ పటేల్ చతుర్భాయ్ పటేల్ ఉగాండా దేశానికి వలసవెళ్లి మార్గదర్శకులుగా నిలిచారు. తర్వాత నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లడం క్రమంగా పెరిగింది. జోతారామ్, చతుర్భాయ్ తర్వాత ప్రభుదాస్ పటేల్ వంటి వారు మాంచెస్టర్కు వెళ్లి స్థిరపడ్డారు. గోవింద్ భాయ్ పటేల్ ఒక అడుగు ముందుకేసి యెమెన్లోని పోర్ట్సిటీ ఆడెన్లో పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ధర్మజ్ నుంచి విదేశాలకు వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. ఎంతగా అంటే అక్కడి కుటుంబాల్లో సగానికిపైగా విదేశాల్లోనే ఉండేంతగా. తాజా గణాంకాల ప్రకారం బ్రిటన్లో 1700, అమెరికాలో 800, కెనడాలో 300, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్లో 150 కుటుంబాలు నివసిస్తున్నట్టు అంచనా. ఆఫ్రికాతో పాటు మిగతా దేశల్లోనూ చాలా కుటుంబాలు ఉన్నాయి.ప్రపంచ దేశాలకు వలస వెళ్లిన వాళ్లంతా తమ మూలాలను మర్చిపోకుండా తమ గ్రామాభివృద్ధి బాటలు వేయడమే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసులను 2007లో ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడంతో ధర్మజ్ (Dharmaj) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఊరంతా విశాలమైన సిమెంట్ రోడ్లతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ.. ప్రతి గ్రామస్థుడు పాటించేలా చేస్తున్నారు. యువత, పెద్దల కోసం సువిశాలమైన పార్క్ ఉంది. ఇందులో తక్కువ ధరకే ఈత కొలను, బోటింగ్ చేయొచ్చు. గ్రామంలో పశువుల మేత కోసం ప్రత్యేకంగా 50 బిఘాల భూమిని కేటాయించారు.11 బ్యాంకులు.. వెయ్యి కోట్లు11,333 మంది జనాభాతో 17 హెక్టార్లలో విస్తరించి ధర్మిజ్ గ్రామం ఆర్థిక విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఊరిలోని 11 బ్యాంకుల్లో రూ. 1000 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. 1959, డిసెంబర్ 18న దేనా బ్యాంక్ మొదటి శాఖను ఇక్కడ ప్రారంభమైంది. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ధర్మజ్ గ్రామ వాసి హెచ్ఎం పటేల్ (HM Patel) వ్యవస్థాపక అధ్యక్షతన 1969, జనవరి 16న గ్రామ సహకార బ్యాంకు ఏర్పాటైంది. విదేశాల్లో స్థిరపడిన ధర్మజ్ వాసులు సొంతూరికి డబ్బులు పంపిస్తుండటంతో ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ బాగా పుంజుకుంది. అలాగే ఊరి ప్రజల జీవనశైలి కూడా మెరుగుపడింది. ధర్మజ్ రోడ్లపై ఇప్పుడు మెర్సిడెస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు చక్కర్లు కొట్టడం సర్వసాధారణ విషయం. అక్కడ ఇళ్లు కూడా వివిధ దేశాల శైలిని ప్రతిబింబిస్తుంటాయి.గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మ గాంధీ. ఆర్థిక పరిపుష్టి, పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయడానికి ధర్మజ్ ప్రత్యక్ష నిదర్శనం. డబ్బులు పంపి చేతులు దులుపుకోవడమమే కాదు ప్రతిఏడాది జన్మభూమికి వస్తుంటారు విదేశాల్లోని ధర్మజ్ వాసులు. ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహించే ధర్మజ్ దివస్కు (Dharmaj Diwas) పెద్దసంఖ్యలో హాజరవుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. అనుభూతులను పంచుకుంటారు. అభివృద్ధి గురించి చర్చిస్తారు.ధర్మజ్ అంటే కేవలం డబ్బు ఉన్న గ్రామం మాత్రమే కాదు. గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్ కలిసి ఎంతటి విజయం సాధించగలవో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ.చదవండి: అమెరికాలో ఐదేళ్లలో 100 మంది భారతీయుల మరణం -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..
ఏఎస్ కావాలనేది చాలామంది యువత డ్రీమ్. అందుకోసం ఎంతలా అహర్నిశలు కష్టపడతారో తెలిసిందే. ఒక్కోసారి త్రుటిలో తప్పితే. మరోసారి..ఆదిలోనే అంటే ప్రిలిమ్స్లోనే విఫలమవ్వడం వంటి పలు అవరోధాలను దాటి తమ కలను సాకారం చేసుకుంటుంటారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఎగ్జామ్లో పాసవ్వడం అంత ఈజీ కాదు. అలాగనే అసాధ్యము కాదు. అలాంటిది ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే గెలుపు అందుకుంది. అది కూడా అత్యంత చిన్న వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయం సాదించినప్పటికీ.. ఐఏఎస్, ఐసీఎస్ రెండు వద్దనుకుని ఈ అమ్మాయి ఎందులో విధులు నిర్వర్తించాలనుకుందో వింటే విస్తుపోతారు. ఇదేంటి చాలామంది ఐఆర్ఎస్, ఫారెస్ట్ సర్వీస్ వంటివి వచ్చినా..సరే ఐఏఎస్ కోసం మళ్లీ.. మళ్లీ..రాస్తే..ఈ అమ్మాయి మాత్రం విభిన్నంగా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ అమ్మాయే అయెధ్యకు చెందిన 21 ఏళ్ల విదుషి సింగ్(Vidushi Singh). ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(UPSC Civils Service Exam) పరీక్షలో విజయ ఢంకా మోగించి ఆలిండియా 13వ ర్యాంకు సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన విదుషి స్వీయంగా ప్రిపేరై సివిల్స్ సక్సెస్ అందుకుంది. క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే స్వీయ గైడెన్స్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని తన సక్సెస్తో చెప్పకనే చెప్పింది. అయితే ఆమె ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన హోదాలకు మించి దేశ సరిహద్దులకు అతీతంగా సేవలందించాలని, ఐఎఫ్ఎస్ని ఎంపిక చేసుకుంది. అది ఆమె జాతీయ సరిహద్దులకు అతీతమైన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. కుటుంబ నేపథ్యం..ఆమె తండ్రి ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యకు విలువనిచ్చే వాతావరణంలో పెరిగిన అమ్మాయి విదూషి. ఆ నేపథ్యంలోనే స్వీయంగా ప్రిపేరయ్యి సివిల్స్ విజయం సాధించింది. ఆమెకు రాత పరీక్షలో 855 మార్కులు రాగా, ఇంటర్వ్యూలో 184 మార్కులతో కలిపి మొత్తం 1039 మార్కులు వచ్చాయి. దీంతో 21 ఏళ్ల వయసులోనే సివిల్స్లో ఇంతటి ఉన్నత ర్యాంకు సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. విదూషి సక్సెస్ జర్నీ ఎందరో సివిల్స్ ఔత్సాహికులకు మార్గదర్శం, స్ఫూర్తి కూడా. కోచింగ్లు తీసుకుంటేనే సక్సెస్ కాదని, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదని ప్రూవ్ చేసింది విదూషి. (చదవండి: Diwali 2025: ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..) -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..
ఒకప్పుడూ ఒక ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్గా కంప్యూటర్లను క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత వాటితో పనిచేసే స్థాయికి చేరుకుని..ప్రోఫెషన్ డిజైనర్గా మారాడు. ఇంతలో మహమ్మారి తన ఆశలపై చన్నీళ్లు జల్లి గ్రామంలో కూర్చొబెట్టింది. అయినా సరే ..అక్కడ నుంచి వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి..అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ డిజైన్ దిగ్గజంతో పోటీపడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరి ప్రస్థానం అయినా ఏమి తెలియని సున్నా స్థాయి నుంచి మొదలవ్వుతుంది..ఆ శూన్యం విలువని పెంచడం అనేది మన చేతిలోనే ఉంది అనేది తన చేతలతో చెప్పకనే చెప్పాడు ఈ వ్యక్తి. అతడెవరు? అతడి ప్రస్థానం ఎలా మొదలైందో సవివరంగా చూద్దామా..!.ఎక్కడో కరువు బాధిత గ్రామం నుంచి వచ్చి..జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ వ్యక్తి దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat ). ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన కీ బాత్లో అతడి గురించి ప్రస్తావించడమే కాదు మేక్ ఇన్ భారత్కు సరైన అర్థం ఇచ్చాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు. భగత్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందినవాడు. అతడి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల అతడి కుటుంబం తన విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అయినా భగత్ ఐటీఐ వరకు ఏదోలా చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత మెరుగైన భవిష్యత్తు కోసం పూణేకు వెళ్లి నెలకు 4 వేలు జీతం ఇచ్చే పనిక కుదిరాడు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఆఫీస్ బాయ్(Infosys office boy) ఉద్యోగాలు గురించి తెలుసుకుని అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ రోజువారి పనులు చేస్తూ..అందులో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడుతుండేవాడు. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ చేసి ఉండాలని చెప్పారు అక్కడి ఉద్యోగులు. పోనీ కంప్యూర్ జాబ్ కావాలంటే గ్రాఫిక్ డిజైన్ వంటి యానిమేషన్ కోర్సులు ద్వారా ఆ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అని సూచించారు భగత్కి. వాటికి క్రియేటివిటీ ముఖ్యం అని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. అలా రాత్రిళ్లు ఆఫీస్ బాయ్గా డ్యూటీ చేస్తూ.పగలు యానిమేషన్ కోర్సునేర్చుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేరే చోట ఉద్యోగం చేయడం కంటే తనకంటూ సొంత మార్గంలో వెళ్లాలనేది అతడి ఆలోచన. ఆ నేపథ్యంలోనే తొలుత డిజైనర్గా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించాడు..ఆ తర్వాత సొంత డిజైన్ కంపెనీని ప్రారంభించాడు. అయితే అతడి కలలపై నీళ్లు జల్లినట్లుగా కోవిడ్మహమ్మారి విజృంభించి తిరిగి గ్రామంలోకి వెళ్లిపోయేలా చేసింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు భగత్. గ్రామంలో బతకడం ఈజీ..కానీ తన గ్రాఫిక్ డిజైన్ కంపెనీ ప్రారంభించడం అంత సులభం కాదు. ఎందుకంటే తరుచుగా విద్యుత్ కోతలు..సరైన ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కాబట్టి దీన్ని పరిష్కరించేలా తన బృదం సాయంతో మార్గాన్ని అన్వేషించాడు. తమ ఊరిలో కొండపై ఉండే గోశాల వద్ద మొబైల్ సిగ్నల్ బేషుగ్గా ఉంది. కాబట్టి అక్కడ తన డిజైన్ టెంప్లేట్ ఆఫీస్ను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్నగా మొదలైంది అతడి కార్యాలయం. స్థానిక యువకులకు గ్రాఫిక్ డిజైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. వారికి డిజిటల్ నైపుణ్యాల అందివ్వడంలో సహాయం చేశాడు. అతడి వినూత్న స్ఫూర్తి మీడియా కంటపడి..మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆయన మన్ననలను అందుకోవడమే కాదు షార్క్ ట్యాంక్ ఇండియాకు చేరుకుంది అతడి విజయగాథ. దాంతో చిన్నగా మొదలైన డిజైన్ టెంప్లేట్ కాస్తా అంచలంచెలుగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక షార్క్ ట్యాంక్ షోలో బోట్ వ్యవస్థాపకుడు సీఎంఓ అమన్ గుప్పా ఏకంగా అతడి కంపెనీలో పదిశాతం ఈక్విటీని కోటి రూపాయలకు విక్రయించాడు. అయితే ఆ షోలో తన కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడంలో తడబడ్డానని, అప్పుడు రాధికా గుప్తా మంచినీళ్లు ఇచ్చి ఏదో ఆఫీస్ ప్రెజెంటేషన్లా కాదు..నీ ప్రస్థానాన్ని తోటి స్నేహితులకు వివరించినట్లుగా చెప్పుచాలు అని ధైర్యం ఇచ్చారని నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు భగత్. అయితే ఈ డిజైన్ టెంప్లేట్ భారతీయ వినియోగదారుల కోసం భగత్ రూపొందించిన క్రియేటివిటీ సాధనం. ఇప్పుడు ఇది అంతర్జాతీయ డిజైన్ ఫ్లాట్ఫామ్ కాన్వాతో పోటీపడే రేంజ్కి చేరుకుంది. ఆఫీస్ బాయ్ కాస్తా ప్రోఫెషనల్ డిజైనర్ స్థాయికు చేరుకుని తానే ఉద్యోగాల ఇచ్చే రేంజ్కి చేరడం అంటే..అది అలాంటి ఇలాంటి సక్సెస్ జర్నీ కాదు కదూ..! కాగా, భగత్ స్థానిక క్రియేటర్లకు సాధికరత కల్పించి..డిజిటల్ డిజైన్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నాడు భగత్. View this post on Instagram A post shared by Dadasaheb Bhagat (@dadasaheb_bhagat) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. కష్టాలు కన్నీళ్లు ఎన్ని వచ్చినా ఓపిగ్గా ఉంటూ కృషిని నమ్ముకోవాలి. వీటన్నింటికి తోడు మట్టిని ప్రేమించాలి. అపుడు మాత్రమే ఊహించని ఫలితాలు సాధ్యం. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నాడు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.కర్ణాటకకు చెందిన ఉమేశ్ రావు మునగ సాగుతో భారీ లాభాలు సాధించిన తనలాంటి ఔత్సాహిక రైతులకు ప్రేరణగా నిలిచాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఉమేశ్ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో పూర్వీకుల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది ఎకరాలకు పైగా చెరకు, మొక్కజొన్న, రాగులు, కూరగాయలు, ఇతర పంటలను పండించాడు. కానీఆశించిన ఫలితాలు పెద్దగా లభించ లేదు. ఇంతలో మొరింగ సాగు గురించి తెలుసుకున్నాడు.2010లో మొరింగ ఒలిఫెరా మొక్క విత్తనాలను నాటాడు ఉమేష్. దాదాపు 900 మొక్కలతో తన జర్నీని మొదలు పెట్టాడు. మొదట్లో మునక్కాయలను క్రమంగా మునగాకు పౌడర్ను విక్రయించడం మొదలు పెట్టాడు. పదేళ్ల పాటు ఆర్థికంగా కుదుట పడ్డాడు. 2020లో కోవిడ్ మహమ్మారి రావడంతో మునగ పొడి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్ కనుగుణంగా ఇతర పంటలను నిలిపివేసి సేంద్రీయ పద్ధతుల్లో మునగ సాగు చేశాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!ఇది ఇలా ఉండగా భూవిషయంలో కుటుంబ వివాదం నేపథ్యంలో తన సాగును వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు మోరింగ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇట్లా చిన్నమొత్తంలో కేవలం రెండు ఎకరాల్లో ఒకవైపును సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నాడు. కోడి ఎరువు, మేక ఎరువు , ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా తయారు చేసాడు. ఇది నేల సారాన్ని, నీటిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను వేరు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడింది. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి ఫలితాలు లభించాయి. మార్కెట్ను స్టడీ చేసి మెరుగైన (ఓడీసీ-3 వెరైటీ) చెందిన మొక్కలను నాటాడు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి , ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తాడు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుండి 3 టన్నుల దాకా, కిలోకు సగటున రూ.140 చొప్పున విక్రయిస్తాడు. ఎక్స్ట్రాక్టర్లు, ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు ,ఎరువుల కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. దీని ఫలితంగా ఎకరానికి రూ.4 లక్షల టర్నోవర్ వస్తుందని ఉమేష్ చెప్పారు. ఇదీ చదవండి: 45 కిలోలకు పైగా వెయిట్లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!ఏడాదికి రూ. 40 లక్షలుఅలా ఎకరానికి 10 లక్షల టన్నుల వరకు మునగాకును, మునగకాయలను పండిస్తున్నాడు. వీటిని కేజీకి రూ. 140 చొప్పున విక్రయిస్తున్నాడు. డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో కేజీ రూ. 500కు కూడా విక్రయిస్తున్నాడు. అలా మునగకాయలను, ఆకులను విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ.. ఏడాదికి 10 ఎకరాలకు రూ. 40 లక్షల టర్నోవర్కు ఎదిగాడు ఉమేశ్. ఇక ఎండబెట్టిన మునగాకును ఫార్మా కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు ఉమేశ్ తెలిపాడు. -
చదివింది ఎనిమిదో తరగతి..కానీ ఇవాళ ఏకంగా బుర్జ్ ఖలీఫాలో నివసించే రేంజ్కి..
చాలామంది ఉపాధి కోసం దుబాయ్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు పయనమవుతుంటారు. అక్కడకు వెళ్లి బ్రోకర్ల చేతిలో మోసపోయిన వాళ్లు కొందరైతే..మరికొందరు సవ్యంగా ఆయా దేశాలకు వెళ్లి..మంచి స్థాయిలో స్థిరపడి..తమకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే సతీష్ సన్పాల్. అతడి సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. ఒక్కోమెట్టు ఎక్కుతూ..స్వయంకృషితో పైకి రావడం ఎలా అనేది నేర్పిస్తుంది అతడి కథ. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన సతీష్ సన్పాల్ ఎనిమిదో తరగతితోనే చదువుకి స్వస్తి పలికాడు. తన తల్లి ఇచ్చిన రూ. 50 వేల రూపాయలతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించాడు. జస్ట్ 15 ఏళ ప్రాయానికి భారత్లో చిన్న దుకాణం ప్రారంభించాడు. ఆ వ్యాపారం పెట్టిన రెండేళ్లకే మూతపడ్డప్పటికీ..అదే అతడికి ఎన్నో అమూల్యమైన పాఠాలను నేర్పించింది. అయితే సతీష్లో ఆ పరాజయం మరింత కసి, పట్టుదలను పెంచేశాయి. ఏదో సాధించాలనే దృఢ సంకల్పంతో అవకాశాల కోసం అన్వేషిస్తూ..అలా దుబాయ్కి పయనమయ్యాడు. కనీసం డిగ్రీ చదువు కూడా లేకపోయినప్పటికీ..తన స్వీయ తెలివితేటలు, అభిరుచిలనే పెట్టుబడిగా పెట్టి..తనకంటూ ఒక సొంత మార్గాన్ని స్వయంగా నిర్మించుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. అక్కడ తనకంటూ ఎలాంటి వ్యాపార సెటప్ లేకపోయినా..చిన్నగా క్లయింట్లు స్టాక్ మార్కెట్ బ్రోకర్లతో కనెక్ట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యే అంశంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. అది అతనికి మంచి అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలా నెమ్మదిగా వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తూ..2018లో ఏఎన్ఏఎక్స్ హోల్డింగ్ నిర్మించడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ బృదంలో మూడు ప్రధాన వ్యాపార దిగ్గజాలు ఉన్నాయి. ఒకటి ఏఎన్ఏఎక్స్ డెవలప్మెంట్స్, ఏఎన్ఏఎక్స్ హాస్పిటాలిటీ, ఏఎన్ఏఎక్స్ క్యాపిటల్ తదితరాలు..సంక్షోభాన్ని..లాభంగా మార్చేయడం..కోవిడ్ సంక్షోభంలో చాలా తెలివిగా తక్కువ విలువ కలిగిన దుబాయ్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టి..కోట్లకు పడగలెత్తాడు. వాటి విలువ ఇవాళ పది రెట్లు పెరిగాయి. ఆయన పొదుపు, ఖర్చులని చాలా తెలివిగా బ్యాలెన్స్ చేస్తాడట. సతీష్ ఎక్కువగా రియల్ ఎస్టేట్, లగ్జరీ గడియారాలు, బంగారం, కార్లపై పెట్టుబడులు పెడతాడట. ఆయన సాహసోపేతమైన నిర్ణయాలకు నిదర్శనమే వెయ్యి కోట్ల హిల్స్భవనం. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి బుర్జ్ ఖలీఫాలో నివసిస్తున్నాడు. సతీష్కు లగ్జరీ కార్ల గ్యారేజ్ ఉంది. అవి ఆయన హోదాకు నిదర్శనంగా కాకుండా తన ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా చూస్తాడట. అంతేగాదు సతీష్ 2034 నాటికి ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకరిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెబుతున్నాడు. ఇక ఈ ఏడాది అతని కంపెనీ దుబాయ్, యూకేల వెంచర్లతో సహా డీహెచ్3 వంటి బిలియన్లకు పైగా నాలుగు కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించడం విశేషం. చివరగా యువతకు ఆయన ఇచ్చే అమూల్యమైన సందేశం ఏంటంటే.. "క్రమశిక్షణతో నేర్చుకుంటూ ఉండండి, ఎప్పుడూ ఆశను వదలుకోవద్దు, ఓడిపోయానని చేతులెత్తేయొద్దు" అని సూచిస్తున్నారు. మనం తినే ఎదురుదెబ్బలే విజయానికి దారితీస్తాయనే విషయం గుర్తురెగాలని చెబుతున్నాడు సతీస్ సన్పాల్.(చదవండి: Success Story: ఐఏఎస్గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్గా..) -
నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
ఒకపుడు ఆమెను తమ సంస్థలో ఉద్యోగానికి తిరస్కరించింది.కట్ చేస్తే రెండేళ్లలోపే అదే కంపెనీలో ఉన్నత పదవికి ఎంపికైంది. ఇదే కదా సక్సెస్ కిక్ అంటే.. ఆ సక్సెస్ పేరే రాగిణి దాస్. ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారిన రాగిణీ దాస్ స్టోరీ ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోమహిళా-కేంద్రీకృత ప్రొఫెషనల్ నెట్వర్క్ లీప్.క్లబ్(Leap club) సహ వ్యవస్థాపకురాలు, FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్పర్సన్ రాగిణి దాస్ ఇపుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్గా ఎంపికైంది. 2013లో గూగుల్ ఉద్యోగానికి సంబంధించి చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఎంపిక కాలేక పోయింది. కట్ చేస్తే లీప్.క్లబ్ సహ వ్యవస్థాపకురాలిగా జొమాటో వంటి సంస్థలతో కూడా పనిచేసిన అనుభవంతో గూగుల్ ఇండియా స్టార్టప్ హెడ్గా నియమితులైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది అంటూ ట్విట్ చేసింది.గూగుల్లో తన కొత్త బాద్యతలను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను సమర్థులైన వ్యక్తులు, ఉత్పత్తులు , ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వారికి సాయం అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. (84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! )Life has come full circle, and I’m excited to share that I’ve joined @Google as Head of Google for Startups - India 🍋The backstory: In 2013, I sat for two interviews: one at Google and one at Zomato. pic.twitter.com/Hs9cqKHFxJ— Ragini Das (@ragingdas) October 6, 2025ఎవరీ రాగిణి దాస్?గురుగ్రామ్లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అందుకు ముందు సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేసింది. అలాగే గ్రాడ్యుయేషన్ సమయంలో, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , ఇతర సంస్థలతో ఇంటర్న్ గా, మార్కెట్ పరిశోధన మరియు భారత మార్కెట్ కోసం వ్యాపార ప్రణాళికలను డెవలప్ చేసింది. 2012లో, దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యుఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. తిరిగి ఒక్క ఏడాదిలోనే 2013లో, జొమాటోలో రాగిణి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చేరింది. అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్తో సహా వివిధ పాత్రల్లో ఆరేళ్లు తన సేవలను అందించింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో 2017లో, ఆమె జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ మరియు లెబనాన్తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జోమాటో గోల్డ్ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.2020లో, వేలాది మంది మహిళల కోసం ఆన్లైన్ యాప్ మరియు ఆఫ్లైన్ క్లబ్ను leap.clubను సహ-స్థాపించింది వేలాది మంది మహిళలకు నెట్వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్లు ,ఆసక్తి-ఆధారిత కమ్యూనిటీలను అందిచింది. ఈ ఏడాది జూన్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం రాగిణి దాస్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ భారతదేశ విభాగానికి కొత్త హెడ్గా ఎంపికకావడం విశేషం. -
డీఎస్పీగా గృహిణి..! ఆమె కలను వివాహం ఆపలేదు..
వివాహం ఏ అమ్మాయికైనా తన కలలను కనడమే మరిచిపోయేలా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సపోర్టు ఉంటే తనను తాను ప్రూవ్ చేసుకునేలా ఎదుగుతుంది. లేదంటే వంటిటికే పరిమితమవ్వాల్సిందే. కానీ అలాంటి మూసపద్ధతులన్నింటిని బద్దలుకొట్టుకుంటూ దూసుకొచ్చింది ఈ మహిళ. ఓ పక్క పేదరికం, మరోవైపు ఇంటి బాధ్యతలు అయినా.. తన కలలు కల్లలుగా మారనివ్వ లేదు. తాను అనుకున్నది సాధించడం కోసం గుక్కపెట్టి ఏడిపించేలా చేస్తున్న కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని..గృహిణులు కూడా ఉన్నతాధికారుల కాగలరని చాటి చెప్పిందిఆ ధీర వనితే అంజు యాదవ్(Anju Yadav). 1988లో హర్యానాలోని నార్నాల్ జిల్లాలోని చోటే అనే గ్రామంలో జన్మించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తండ్రి లాల్రామ్ వ్యవసాయం, పార్చున్ దుకాణం సాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లి సుశీలా దేవి గృహిణి. ఆమెకు ముగ్గురు సోదరీమణులు. బీఏ వరకు తన గ్రామంలోనే చదువుకున్న అంజు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 22 ఏళ్లకే తల్లి అయ్యి ముకుల్దీప్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా సరే తన డ్రీమ్ ఆగిపోకూడదనుకుంది. తల్లిగా, భార్యగా ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ సతమతమైంది. తన లక్ష్యానికి నెరవేర్చుకునేందుకు అత్తమామలు ముందుకు రాకపోవడంతో తల్లి సాయం తీసుకుంది. ఆమెకు తన కొడుకు బాధ్యతను అప్పగించి తన కెరీర్పై దృష్టిసారించింది. అలా ఎలాంటి కోచింగ్ లేకుండా బీఈడీ సీటు సంపాదించి ఏకంగా మూడుసార్లు పలు చోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక ఆ సమయంలో తల్లి ఆమెకు మద్దతిచ్చి..కొడుకు ముకుల్దేవ్ బాధ్యతను తీసుకుంది. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఆరాటంతో సాగిపోతున్న అంజుకి భర్త అనారోగ్యం ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) రిక్రూట్మెంట్ వచ్చింది. ఆ బాధను దిగమింగుకుని మరీ ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఆ డీఎస్పీ ఎగ్జామ్కి సన్నద్ధమవుతుండగా భర్త నిత్యానంద్రావు అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి తల్లిగా నానా ఇబ్బందులు పడింది. ఆ కష్ట సమయంలో తల్లిదండ్రులు మద్దతివ్వడంతో..ఆహర్నిశలు కష్టపడి ప్రిపేరయ్యింది. అలా 2023లో 1725 ర్యాంకు సాధించి డీఎస్సీ అయ్యింది. చివరికి సెప్టెంబర్ 2025కి విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాజస్తాన్ పోలీస్ సర్వీస్లో డీఎస్పీ(Deputy Superintendent of Police )గా విధులు నిర్వర్తిస్తోంది. ఓ మారుమూల గ్రామంలో వివాహితురాలిగా మారిన తర్వాత కూడా అంజు కలలు కనడం ఆపలేదు. ఎన్ని రకాలుగా తనను అణిచివేసేలా ఇబ్బందులు వచ్చి పడినా అధైర్యపడలేదు. ఏదో ఒక నాటికి తను అనుకున్న గుర్తింపు సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందుకు సాగింది. చివరకు సుదీర్ఘ పోరాటం అనతరం తన కలను నెరవేర్చుకుంది .కష్టపడేతత్వం ఉంటే కల ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచి.. 'దటీజ్ అంజు యాదవ్' అని అనిపంచుకుంది . View this post on Instagram A post shared by Anju Yadav (@anjuyadav_dsp) (చదవండి: అందాలపోటీలకు అంతరాయం కలిగించిన భూకంపం..! వీడియో వైరల్) -
చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే
మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సమయానికి తగ్గట్టు ఆలోచించడంలో వారికి వారే సాటి. కృషి, పట్టుదలే వారికి పెట్టుబడి. అలా గత దాదాపు రెండు దశాబ్దాలుగా మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన వందన ప్రభాకర్ పాటిల్ (Vandana Prabhakar Patil) మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) పనిచేస్తూ తనదైన వ్యాపారానికి నాంది పలికారు. తన ఆలోచనకు పదునుపెట్టి నెలకు మూడు లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నారు.వందన పాటిల్ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఉంది. ఆమె చదివింది. 12వ తరగతి మాత్రమే ఉంది. ఆమె వ్యవసాయంలో కూరగాయల నుండి ఆదాయం పొందేది, కానీ కూరగాయల ఉత్పత్తి వచ్చినప్పుడు, మార్కెట్లో కూరగాయల ధరలు ఆశించిన లాభాలు రాకపోవడంతో ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. దీంతో 2021లో ఆమె జల్గావ్లోని మామురాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని (KVK) సందర్శించి, కూరగాయలు, పండ్లను పొడి లేదా ఒరుగులుగా మార్చే ప్రక్రియ డీహైడ్రేషన్ (Dried Vegetables and Fruits) గురించి తెలుసుకుంది. అంతే ఆమె మెదడులో ఆలోచన రూపుదిద్దుకుంది. అందరికలా కాకుండా తాను భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. తనలాంటి అనేక మంది రైతుల సమస్యలను కూరగాయలను సౌరశక్తితో ఎండబెట్టడం ద్వారా పరిష్కరించవచ్చని, కూరగాయల డీహైడ్రేషన్ పరిష్కరిస్తుందని గ్రహించింది.వందన తన పాలస్ఖేడ గ్రామంలో కూరగాయలను డీహైడ్రేట్ చేసి వాటి నుండి పొడిని తయారు చేయడానికి ఒక కంపెనీని స్థాపించింది. ఆమె తన గ్రామంలోని కొంతమంది మహిళల సహకారంతో గాయత్రి ఫుడ్స్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది. దీనికి సౌరశక్తితో ఎండబెట్టిన ఆహార పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ కలిసి వచ్చింది. తన యూనిట్ను ప్రారంభించడానికి,2021లో కూరగాయల డీహైడ్రేషన్లో శిక్షణ తీసుకుంది. వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకుంది, కానీ ఆమె దరఖాస్తు తిరస్కరించారు అధికారులు. ఆ తర్వాత ఆమె రూ. 10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంది. మహారాష్ట్రలో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకం కింద, సూక్ష్మ సంస్థలు అర్హత కలిగిన ప్రాజెక్ట్ ఖర్చులో 35 శాతం సబ్సిడీని పొందే అవకాశాన్ని వినియోగించుకుంది. తన వ్యాపారంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 నుండి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. .సోలార్ డ్రైయింగ్ యూనిట్న్నెల్ ఆకారంలో పాలికార్బోనేట్తో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ఏర్పాటు, పల్వరైజర్, కటింగ్ మెషిన్ కొనుగోలు మరియు ప్యాకేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇది సౌర వికిరణాన్ని బంధించి లోపల గాలిని వేడి చేస్తుంది, గ్రీన్హౌస్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. కూరగాయలను సోలార్ ఎండబెట్టడానికి ముందు కడిగి, శుభ్రం చేసి, ముక్కలుగా కోస్తారు. వేడిచేసిన గాలి సొరంగం ద్వారా లోనికి వెళ్లి, తేమను తొలగించడం ద్వారా ట్రేలు లేదా రాక్లపై ఉంచిన ఉత్పత్తులను ఎండేలా చేస్తుంది. చివరల్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తేమ గాలిని బయటకు వెళ్లేలా చేస్తాయి.ప్రధానంగా ఉల్లిపాయ, టమోటా, దుంప, సెవ్గా, మెంతులు, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం లాంటివి కూరగాయలు ఉన్నాయి.కూరగాయల పొడిని తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంది. కూరగాయలను కడిగి శుభ్రం చేస్తారు. తరువాత వాటిని కటింగ్ మెషిన్ ద్వారా ఎండబెట్టి, ఆపై వాటి పొడిని తయారు చేస్తారు. సౌరశక్తి ద్వారా సహజంగా ఎండబెట్టడం వల్ల, వాటి రంగు , నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటుందని వందన పాటిల్ చెప్పారు. అవి పూర్తిగా సహజమైనవి కాబట్టి, కూరగాయల పొడి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, ఆమ్లత్వం, మధుమేహం, చర్మం, జుట్టు మొదలైన అనేక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా ఉంటుంది. .వందన పాటిల్ వ్యాపారం తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించింది. కంపెనీలో ఇప్పుడు కొత్త ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని వందన పాటిల్ చెప్పారు. తమ డీహైడ్రేటెడ్ కూరగాయలు పునఃవిక్రేతలు, టోకు వ్యాపారుల ద్వారా US, మాల్దీవులు మరియు కెనడాకు కూడా చేరుతాయని వందన చెప్పారు.యూనిట్ను విస్తరించాలని మరియు ఎగుమతి ఆర్డర్లను అందించే సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు.వందన కుటుంబం తన గ్రామంలో ఐదు ఎకరాలకు పైగా నిమ్మకాయతో మునగ పంటను అంతర పంటగా పండిస్తుంది. రెండింటినీ డీహైడ్రేట్ చేస్తూ, స్థానిక రైతుల నుండి ఇతర కూరగాయలను కొనుగోలు చేస్తుంది. ఏదైనా కూరగాయల కొరత ఉంటే, వ్యవసాయ-ఎండబెట్టడం కోసం ఆమె వాటిని హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తుంది. 22 కిలోల తాజా టమోటాలు 1 కిలోల డీహైడ్రేట్ టమోటాలు వస్తాయి. కనుక ఒక కిలో డీహైడ్రేట్ టమోటా ధర దాదాపు రూ.700. అలాగే బీట్రూట్ ధర 100 గ్రాములకు రూ. 100 ,హోల్సేల్లో కిలోకు రూ. 700గా ఉంటుంది. ఉల్లిపాయలు కిలోకు రూ. 500 నుండి రూ. 600 వరకు ఉంటుంది. తాజా ఉత్పత్తుల మార్కెట్ ధరలను బట్టి ధరలు కూడా మారుతూ ఉంటాయి. తద్వారా వీరి సగటు నెలవారీ టర్నోవర్ రూ. 3 లక్షలు. ఒక్కోసారి రెండు,మూడు రోజుల్లోనే రూ. 8-10 లక్షల టర్నోవర్ వస్తుంది అంటారు ఆ యూనిట్లో పనిచేసే ఇతర మహిళలు. వందనా సందేశంఈ ప్రాజెక్ట్ రైతులకు సహాయం చేయడంతోపాటు, గ్రామంలోని మహిళలకు తాను ఉపాధి కల్పించడం గర్వంగా ఉంటుందనీ, ఏ స్త్రీ కూడా తనను తాను తక్కువ అంచనా వేసుకోకూడదని, పట్టుదలతో ఉంటే, మహిళలు తమ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలరని వందనా పాటిల్ మహిళలకు సందేశం ఇస్తుంది.మార్కెట్: భారతదేశపు డీహైడ్రేషన్ పండ్లు, కూరగాయల మార్కెట్ 2023లో రూ. 17,200 కోట్లుగా ఉండగా 2035 నాటికి రెట్టింపు రూ. 37,200 కోట్లుగా ఉంటుందని అంచనా. డీహైడ్రేటెడ్ కూరగాయలు మరియు పండ్లకు డిమాండ్ పెరుగుతున్న సౌకర్యవంతమైన ఆహారాలకు ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే అవి అవసరమైన పోషకాలను నిలుపుకుంటూ నిల్వ చేయడం , తయారు చేయడం సులభం. సౌర ఎండబెట్టడం వాటి షెల్ఫ్ జీవితాన్ని పెంచుతుంది మరియు పోషక విలువను ప్రభావితం చేయకుండా బరువును తగ్గిస్తుంది. -
బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తే
ప్రకృతి దగ్గరగా జీవించాలని, ఆర్గానిక్ ఆహారాన్ని మాత్రమే తినాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆచరణ ఎలాగో అర్థంకాదు. అలా నిస్తేజంగా, నిర్జీవంగా జీవితం గడపకుండా, పచ్చని ప్రకృతి,స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని భోజనమే జీవితం అనుకుంది స్నేహా రాజ్గురు. ఇది తన ఒక్కదానికే పరిమితం కాకుండా తన తండ్రితో కలిసి ‘బాప్ బేటీ ఫామ్స్’’ పేరుతో సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతోంది. ఎవరీ స్నేహ, తెలుసుకుందాం పదండి.స్నేహ రాజ్గురు పుణెలో పుట్టి పెరిగింది. ఇద్దరు అన్నయ్యలు. తండ్రి అనిల్ రాజ్గురు. స్నేహ రాజ్గురు సినిమాల్లో పనిచేస్తానంటే సంపూర్ణ మద్దతిచ్చారు. స్నేహ బాలీవుడ్లో స్క్రిప్ట్ సూపర్వైజర్గా, ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసింది, 'బుల్బుల్', 'లుకా చుప్పి' వంటి సినిమాలకు పనిచేసింది. వృత్తిలో భాగంగా భారతదేశం అంతటా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలోనే ఆమె జీవితం మలుపుతిరిగింది. ‘లూకా చుప్పి’ సినిమా లొకేషన్ల కోసం మదురై వెళ్లింది. అక్కడి ప్రకృతి, మట్టితో కట్టిన ఇళ్లు చూసి పరవశించి పోయింది. అపుడే నిర్ణయించుకుంది..ప్రకృతిలో మమేకమవుతూ, సేంద్రియ ఆహారాన్ని సేవిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని. మట్టిలో మెరుపుపశ్చిమ బెంగాల్ అడవులలోని పెర్మాకల్చర్ ఫామ్లో 52 రోజుల బస చేయడం తన ఆలోచనలకు మరింత బలం వచ్చింది. అలంకరణలు లేవు, ఫిల్టర్లు లేవు, కేవలం ఒక టెంట్, అడవి. స్నేహ ఇక్కడే పెర్మాకల్చర్ సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ప్రకృతిని వినడం, వర్షంలో లయను, కలుపు మొక్కలలోని జ్ఞానాన్ని చూడటం నేర్చుకుంది. అలా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన వృత్తిని వదిలిపెట్టి, తన తండ్రి అనిల్ రాజ్గురుతో కలిసి పూణే సమీపంలో 'బాప్ బేటీ ఫామ్స్'ను ఏర్పాటు చేసింది. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm)బాప్ బేటీ ఫామ్స్ (BaapBeti Farms) "నేను కథలు చెప్పడం మాత్రమే కాదు.. ఆ కథల్లో ఈ ప్రకృతిలో జీవించాలనుకున్నాను. అదే నన్ను భూమికి అనుసంధానించినది. భూమినుంచే తీసే తాజాగా తినే ఆహారం, పాలిష్ చేయని, ప్రాసెస్ చేయని , స్వచ్ఛమై ఆహారంతో నా సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసింది”అంటారు స్నేహ. ముంబైలో తన జీవితాన్ని సర్దుకుని పూణేకు తిరిగి వచ్చింది. బ్యాకప్ ప్లాన్ ఏమీ లేదు. ఉన్నదల్లా నమ్మకం. ఓర్పు, అభిరుచే పెట్టుబడి. దీనికి కూతురి కలలకు అండగా నిలిచిన తండ్రి తోడ్పాటు, పెర్మాకల్చర్లో కోర్సులు, భూమి భాషను అధ్యయనం తోడైంది. టాటా మోటార్స్ పనిచేస్తున్న పదవీ విరమణకు దగ్గరగా ఉన్న స్నేహ తండ్రి అనిల్ రాజ్ గురు తొలుత ఆమె నిర్ణయానికి విస్మయం చెందాడు. అయితే “స్నేహ ఎప్పుడూ ఆరుబయట ఉండటం ఇష్టపడేది. చిన్నప్పుడు కూడా, ఆమె నేల వైపు ఆకర్షితురాలైంది," అని గుర్తు చేసుకుంటారుపూణే దగ్గర ఉందీ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ సేంద్రీయ కూరగాయలు, పళ్లు పండిస్తారు. అందుకే ఆమె వ్యవసాయం గురించి ప్రస్తావించగానే మారు మాట్లాడకుండా ఆమెతో చేయి చేయి కలిపారు.పూణే బయట బంజరుగా ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని కనుగొన్నారు. విత్తనాలు నాటారు. భూమిని పెర్మాకల్చర్ జోన్లుగా విభజించారు, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, అందంగా అమర్చుకున్న పర్యావరణ వ్యవస్థ. పక్షులు, తేనెటీగలు, కూరగాయలు, కోళ్లు, కంపోస్ట్ కుప్పలు - ప్రతిదీ ఈ పచ్చని సోయగంలో తన పాత్రను పోషించింది. (ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్) ప్రతీ ఆకులో ఒక వారసత్వాన్ని వెతుక్కున్న వారి కృషి ఫలించింది. స్ట్రాబెర్రీల నుండి లెట్యూస్, క్యాప్సికమ్ వరకు స్థానిక ఉత్పత్తులలో ప్రయోగాలు వరకు, బాప్బేటి ఫామ్స్ పూర్తిగా సేంద్రీయం మారిపోయింది. వ్యక్తిగత ప్రయాణంగా ప్రారంభమై, ఉద్యమంగా మారింది. స్నేహ ఈ పొలాన్ని Airbnbలో జాబితా చేసింది, అతిథులను స్థిరమైన జీవనశైలిని అనుభవించమని ఆహ్వానించింది. నగరవాసులు క్యూ కట్టారు. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతోమంది రైతులకు మార్గ నిర్దేశకులయ్యారు. ఆమె తండ్రి అనధికారిక టూర్ గైడ్ అయ్యాడు. అంతేకాదు నచ్చిన పనిచేస్తూనే ప్రతి ఉదయం ప్రకృతిలో నడక. దీంతో సుగర్ నియంత్రణలోకి వచ్చింది. 18 కిలోగ్రాముల బరువ తగ్గాను అంటూ సంతోషంగా చెబుతారు అనిల్. అన్నింటికంటే ముఖ్యం నా బిడ్డ కల సాకారంలో నేను ముఖ్య భూమికనయ్యాను అంటారు. చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీసంపాదన కాదు ముఖ్యంబాప్ బేటి ఫామ్స్ నెలకు రూ.80 వేలకు పైగా సంపాదిస్తుంది. కానీ తనకు డబ్బు కాదు ముఖ్యం. ప్రకృతిలో జీవించడం, వ్యవసాయ క్షేత్రం స్వయం సమృద్ధిగా, నిరంతరం అభివృద్ధి చెందడం. అలాగే ఏ హాలీవుడ్ చిత్రం రాయలేని ట్విస్ట్లు, విలువల కంటే మేటి జ్ఞానం.అదే నిజమైన బహుమతి అంటారు స్నేహ. -
టెన్త్ ఫెయిల్యూర్ ఐపీఎస్ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్.. నాల్గోసారి పాసైనా..
పదోతరగతి కూడా పాసవ్వలేదు.. ఇంకేం చదువుతాడు అని అనేస్తారు. కానీ కొందరూ పది ఫెయిలైనప్పటికీ..తర్వాత నెమ్మదిగా సక్సెస్ని అందుకోవడం ప్రారంభిస్తుంటారు. అలానే సాగింది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ ప్రస్థానం. పదోతరగతి ఫెయిలై..సాదాసీదాగా చదివే ఈ అబ్బాయి ఈ రేంజ్లో అందుకోవడం చూసి అంత విస్తుపోయారు. అతడికి ఈ సివిల్స్ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నిసార్లు ఓటమి పలకరించిందో తెలిస్తే చెమటు పడతాయి. పోని విజయ దక్కింది అనుకుంటే అనుకున్న డ్రీమ్ జాబ్ దక్కక నిరుత్సాహం నిలువెల్ల వెంటాడుతున్న తగ్గేది లే అంటూ పోరాడి దక్కించుకున్న గెలుపు కథ ఇది. ప్రతిష్టాత్మకమైన ఈ సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేరవ్వుతున్న వాళ్లకు ఈ ఐపీఎస్ స్టోరీ ఓ ప్రేరణ. అతడే ఈశ్వర్ గుర్జార్. రాజస్థాన్లోని భిల్వారాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సువాలాల్ ఒక కిరాణ దుకాణం నడిపేవాడు. తల్లి సుఖి దేవి గృహిణి. చదువులో యావరేజ్ స్టూడెంట్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్లో ఫెయిలై తీవ్ర డిప్రెషన్కి గురయ్యాడు. కానీ అతడి తండ్రి అందరి నాన్నల్లా కోప్పడకుండా.. ఏం కాదు మరోసారి ప్రయత్నించు పర్లేదని వెన్నుతట్టాడు. అదే అతడికి మనోబలాన్నిచ్చి పదోతగరతి పాసైయ్యేందుకు దారితీసింది. అలా 2012లో 54% మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక పన్నెండో తరగతి బోర్డు పరీక్షలలో 68% మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 2019లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అయితే అతడు తన సక్సెస్ని అక్కడితో ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ (UPSC Civil Services Exam)ని ఎంచుకున్నాడు.వైఫల్యాలు అధిగమించి గెలుపొందిన తీరు..2019 తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. 2020లో ఇంటర్వ్యూ దాక చేరుకున్నా..నిష్క్రమించాల్సి వచ్చింది. చివరికి 2021లో మరోసారి ఓటమిని చవిచూడక తప్పలేదు. ఎట్టకేలకు 2022 నాల్గో ప్రయత్నంలో సివిల్స్ని క్లియర్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 644ని సాధించి ఐఆర్ఎస్ కేడర్కి ఎంపికయ్యారు. కానీ ఆయన చిరకాల వాంఛ ఐపీఎస్ అందుకోసం మరోసారి ప్రయత్నించారు. అలా 2023లో, అతను ఆల్ ఇండియా ర్యాంక్ 555తో IPS అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు. కానీ తన ర్యాంకు మరింత మెరుగుపడేలా చేసి పూర్తి స్థాయిలో ఐపీఎస్ హోదాని అందుకోవాలని 2024లో మరోసారి సివిల్స్ ఎగ్జామ్ రాసి ఈసారి ఏకంగా 483 ర్యాంకుతో మరింతగా మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ గుర్జార్ సెప్టెంబర్ 2025 వరకు, IPS సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్నాడు. కృషి, ఓర్పు పట్టుదలతో ఎంతటి కఠినమైన సవాలునైనా ఢీకొట్టి సక్సెస్ని అందుకోవచ్చని ప్రూవ్ చేశారు. ఓటమి ఎదురైనప్పుడల్లా గెలుపుకి దార్లు వెతికే ప్రయత్నంలో ఉన్నాం అనుకుంటూ ఓర్పుతో ముందుకు సాగాలనే గొప్ప సందేశం అందిస్తోంది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ సక్సెస్ స్టోరీ.చదవండి: ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..! -
ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్లే!
అదో చిన్న ఊరు. అక్కడ 75 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు చిన్నదే కానీ దాని ప్రత్యేకత మాత్రం చాలా ఘనం. ఆ ఊరి నుంచి 50 మంది పైగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, పీసీఎస్ జాబ్స్ సాధించిన వారు ఉన్నారు. దీంతో ఆఫీసర్స్ విలేజ్, యూపీఎస్సీ ఫ్యాక్టరీగా ఆ ఊరిని పిలుస్తుంటారు. ఇంత చిన్న ఊరి నుంచి అంత మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారంటేఅక్కడేదో పెద్ద కోచింగ్ సెంటర్ ఉండే ఉంటుందని ఊహిస్తున్నారా? అలాంటిదేమి లేదక్కడ. ఇంతకీ ఆ ఊరు పేరేంటి, ఎక్కడ ఉంది..?ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరి పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఊరి విజయగాథ (success story) గురించి తెలుసుకోవాలంటే వందేళ్లు వెనక్కి వెళ్లాలి. స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామరతి సింగ్తో ఈ విలేజ్ సక్సెస్ స్టోరీ ప్రారంభమైంది. శ్యామరతి సింగ్ 1917లో అమ్మాయిలకు చదువు చెప్పడం ప్రారంభించారు. తర్వాత అబ్బాయిలు కూడా ఆమె దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఆ ఊళ్లో విద్యార్జనకు బీజం పడింది.మాధోపట్టి మహిమస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ ఊరి నుంచి ఒకరు తొలిసారిగా ఓ యువకుడు ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాడు. తర్వాత వినయ్ కుమార్ సింగ్ అనే మరో యువకుడు ఐఏఎస్ సాధించాడు. ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్, ఐపీఎస్కు ఎంపిక కావడంతో మాధోపట్టి గ్రామం పేరు మార్మోగిపోయింది. యూపీఎస్ జాబ్స్ సాధించడం మాధోపట్టి (Madhopatti) వాసులకు అలవాటుగా మారిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన యువతులు కూడా ఈ విజయంలో భాగస్వాములయ్యారు. మెట్టింటిలో అడుగు పెట్టగానే పుస్తకాలతో కుస్తీ పట్టి సర్కారీ కొలువులు సాధించారు. మాధోపట్టి మహిమ అది!విజయ రహస్యంఇంత మందికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు రావడానికి అక్కడేమి పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు. గ్రామమే కోచింగ్ సెంటలా పనిచేస్తుంది. ఇప్పుడు అధికారులుగా ఉన్న సీనియర్లు కొత్త విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకరు గెలిచినప్పుడు మొత్తం గ్రామం సంబరాలు జరుపుకుంటుంది. ఎవరైనా విఫలమైనప్పుడు మళ్లీ ప్రయత్నించడానికి మద్దతు ఇస్తుంది. ఇదే మాధోపట్టి విజయ రహస్యం.చదవండి: ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. ఆ రాష్ట్రం!మాధోపట్టి అనేది కేవలం మ్యాప్లో ఉన్న ప్రదేశం మాత్రమే కాదు. సంకల్పానికి చేయూత తోడైతే ఎలాంటి విజయాన్నైనా సాధింవచ్చనే భరోసాయిచ్చే స్ఫూర్తిదాయక ప్రాంతం. కష్టపడి పనిచేసే వారికి అండగా నిలబడేవారు ఉంటే అపజయం అన్నమాటే ఉండదనడానికి మాధోపట్టి గ్రామ విజయమే ప్రత్యక్ష నిదర్శనం. -
ఆరాటం ముందు ఆటంకం ఎంత!
చిన్నచిన్న సమస్యలకే గాబరా పడిపోతుంటాం. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతుంటాం. అయితే కొంతమంది మాత్రం ఓటములనే తమ విజయానికి మెట్లుగా మలుచుకుంటారు. అవరోధాలను అధిగమించడానికి అనుభవాలుగా అపజయాలను అనుకుంటారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయరు. కష్టాలు ఎదురొచ్చినా తాము అనుకున్నది సాధించే వరకు పట్టువదలరు. దీపేష్ కుమారి కూడా ఈ కోవలోకే వస్తారు.ఎవరీ దీపేష్ కుమారి?రాజస్థాన్లోని భరత్పూర్కు దీపేష్ కుమారిది చాలా పేద కుటుంబం. ఆమె తండ్రి గోవింద్ కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలను పోషించడానికి పకోడీలు, స్నాక్స్ అమ్మేవాడు. ఏడుగురు సభ్యుల కుటుంబం పరిమిత వనరులతో ఒక చిన్న గదిలో నివసించింది. చాలీచాలని సంపాదనతో ఆ కుటుంబం నెట్టుకొచ్చేది. అయితే ఇంత కష్టంలోనూ పిల్లల చదువును నిర్లక్ష్యం చేయలేదు. విద్యతోనే తమ కష్టాలు తీరతాయని గోవింద్ భావించాడు. ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లలను చదివించాలని గట్టిగా అనుకున్నాడు. అతడి పెద్ద కుమార్తె దీపేష్ కుమారి. తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని తొలగించాలంటే చదువుతోనే సాధ్యమని ఆమె గట్టిగా విశ్వసించింది. అందుకే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది. భరత్పూర్లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్లో చదివి.. 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% స్కోర్ సాధించి సత్తా చాటింది. జోధ్పూర్లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ ( B.Tech), ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ పట్టా సాధించింది.ప్రైవేట్ జాబ్ వదిలేసి..చదువు ముగిసిన తర్వాత ఏడాది పాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసింది. సివిల్ సర్వెంట్ కావాలన్న తన కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి UPSC పరీక్షకు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. 2020లో మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ ఆమె పట్టు వదలేదు. తాను దాచుకున్న డబ్బుతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుంది. దీక్షగా చదవడంతో మరుసటి ఏడాదే ఆమె కల సాకారమయింది. దీపేష్ UPSC పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్, EWS విభాగంలో 4వ ర్యాంక్ సాధించి ఐఏఎస్కు ఎంపికైంది. శిక్షణ పూర్తైన తర్వాత జార్ఖండ్ కేడర్కు నియమించబడింది.తోబుట్టువులకు స్ఫూర్తిదీపేష్ కుమారి విజయం ఆమె తోబుట్టువులకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆమె చెల్లెలు ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా, ఒక సోదరుడు గౌహతిలోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్నాడు. మరొక సోదరుడు లాతూర్లో చదువు కొనసాగిస్తున్నాడు.చదవండి: 40 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం తప్పు నాన్నే ప్రేరణదీపేష్ కుమారి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి అంకితభావమే తనకు అతిపెద్ద ప్రేరణ (Inspiration) అని చెప్పారు. "నేను అలసిపోయినప్పుడల్లా, ఆయన పోరాటం నాకు బలాన్నిచ్చింది" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పరిమిత మార్గాలు ఉన్నప్పటికీ గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించే యువతకు దీపేష్ కుమారి ఇన్స్పిరేషన్గా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
ఐటీ ఉద్యోగాలొదిలేసి కేవలం నాలుగు ఆవులతో, కోట్లు: చార్మి జంట
వ్యవసాయం, అన్నా డైరీ వ్యాపారం అన్నా లాభాలు రావేమో అనే భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఐదెంకల జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ విజయం సాధించారో ఐటీ జంట. సేంద్రీయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ పాల ఉత్పత్తులను అందిస్తూ ఏడాదికి కోట్లలో ఆర్జిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం వెనకాల ఒక విషాదగాథ కూడా ఉంది.గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన శ్రీకాంత్ మాల్డే, అతని భార్య చార్మి మాల్డే తమ లాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐటీలో బీఈ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసిప శ్రీకాంత్ దశాబ్ద కాలం ఐటీ కెరీర్ను వదిలేశారు.అలాగే కెమికల్ ఇంజనీర్ అయిన చార్మికూడా భర్తనే అనుసరించి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకుంది. అర్థవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనే ఉద్దేశంతోపాటు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో డైరీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. 2014లో ముఖ్యంగా శ్రీకాంత్ తండ్రి క్యాన్సర్తో మరణించడం వారిని ఆలోచింప చేసింది. View this post on Instagram A post shared by GauNeeti (@gauneeti)"> సేంద్రీయ వ్యవసాయంపై వారి పరిశోధన ఆవుల కీలక పాత్రను గుర్తించేలా చేసింది. కేవలం పాల కోసం మాత్రమే కాకుండా, ఆవు పేడ , మూత్రం వంటి సహజ ఎరువుల ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా అని గ్రహించారు.దీంతో 2017లో, కేవలం నాలుగు గిర్ ఆవులతో గుజరాత్లోని గాంధీనగర్లో గౌనీతి ఆర్గానిక్స్ ప్రారంభించారు. పాడి పరిశ్రమలో ముందస్తు అనుభవం లేకపోయినా, సానుకూల స్పందన వారికి ఊతమిచ్చింది. మొదటి 5-6 సంవత్సరాలు కొన్ని చాలెంజెస్ విసిరినీ,వాటిని అధిగమించారు. ఎన్ని కష్టాలొచ్చినా కానీ స్వచ్ఛమైన, కల్తీ లేని పాలను అందించాలనే పట్టుదలతో కొనసాగాగారు. ఆహార కల్తీ, అనారోగ్యకరమైన ఆహారంపై ఆందోళన, సహజమైన, నమ్మదగిన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న జనం వీరికి బ్రహ్మరథం పట్టారు. అలా కేవలం నాలుగు ఆవులతో ప్రారంభమై 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 కోట్లకుపైగా టర్నోవర్ను చేరుకున్నారు.తమ పాల వ్యాపారం కోసం గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన స్థానిక భారతీయ జాతి గిర్ ఆవులను ఎంచుకున్నారు. గిర్ ఆవులు బీటా-కేసిన్ ప్రోటీన్ను కలిగి ఉన్న పాలను ఉత్పత్తి చేస్తాయి. స్థానిక జాతులను ఎంచుకోవడం వల్ల స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సాంప్రదాయ పాల జ్ఞానాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని వీరి విశ్వాసం .“మా దృష్టి పాల ఉత్పత్తిపైనే కాదు, నైతిక, క్రూరత్వం లేని పద్ధతులపై ఉంది. దూడ జన్మించిన తర్వాత, ఏదైనా పాలు పితికే ముందు తగినంత ఆహారం ఇవ్వడానికి అనుమతిస్తారు. ఇది ఆవులు ఆక్సిటోసిన్ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, దీనిని తరచుగా 'హ్యాపీ హార్మోన్' అని పిలుస్తారు, ఇది సహజంగా పాల నాణ్యతను ,జంతువు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంటారు శ్రీకాంత్. నాణ్యతను అందించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. జెర్సీ ఆవు రోజుకు 25 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదు, కానీ గిర్ ఆవు 8 నుండి 10 లీటర్లు మాత్రమే దిగుబడి ఇస్తుంది. ఇది కాల క్రమేణా తగ్గిపోతుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఎటువంటి హార్మోన్లు ఇవ్వమనీ, సేంద్రీయ పచ్చి మేతతో నాణ్యతను కాపాడుకోవడానికి చాలా అవసరమనిచెప్పారు. చదవండి: 37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీఆవులకు సేంద్రీయ మేత ఆవులకు పురుగుమందులు లేకుండా పండించిన సేంద్రీయ మేతను తినిపిస్తారు. పోషకాహారాన్ని పెంచడానికి కాలానుగుణ సర్దుబాట్లు చేస్తారు. టిబి, జాన్స్ వ్యాధి , బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధులకు ప్రతి 4 నుండి 6 నెలలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. చదవండి: భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్ప్రస్తుతం 100 ఆవులతో, ఆర్గానిక్ పాలు, వెన్న, నెయ్యి, అగరుబత్తులను కూడా విక్రయిస్తున్నారు. అంతేకాదు స్థానిక మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తుంది. అభిరుచి, పట్టుదలతో పాటు, తాము అందించే ఉత్పత్తుల్లో స్థిరత్వాన్ని, నాణ్యతను అందిస్తే విజయం వంగి సలాం చేస్తుందనటానికి ఈ దంపతులు నిదర్శనంగా నిలిచారుఇదీ చదవండి: అర్రే... క్షణంలో రూ. 25 లక్షలు మిస్.. కానీ అదే తెలివైన పని! -
కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్కి..
చిన్నప్పటి నుంచి కడు పేదరికం, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగింది. అవే ఆమెను కార్పొరేట్ స్థాయి ఉద్యోగాన్ని సాధించే దిశగా నడిపించాయి. పోని అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలి..తన కుటుంబం తనను చూసి గర్వించేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆరాటపడేది. ఆ క్రమంలోనే యూపీఎస్సీకి సన్నద్ధమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆమెను అపజయం పలకరిస్తూనే ఉంది. అది కూడా ప్రిలిమినరీ స్టేజ్లోనే విఫలమవ్వడం అంటే..అస్సలు సివిల్స్ విజయం దరిదాపుల్లోకి వెళ్లకుండానే ఆమెను ఫెయిల్యూర్ భూతం భయపెట్టేస్తూ ఉండేది. మరేవరైనా అయితే మూడేళ్లు వృధా అయ్యిందని డిప్రెషన్కి గురై ఆ ప్రయత్నమే మానుకుంటారు కానీ.. ఈమె మొండి పట్టుదలతో తాడోపేడో అన్నట్లుగా ముందుకు సాగి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై ఐఏఎస్ సాధించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ అమ్మాయే కేరళ నిర్మాణ కార్మికుడి కుమార్తె అశ్వతి. తండ్రి నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. చిన్నతనం నుంచి ఆమెకు స్ఫష్టమైన జీవిత లక్ష్యం ఉంది. ఐఏఎస్ (IAS) కావాలనేది ఆమె ధ్యేయం. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చేరి కుటుంబానికి ఆసరాగా మారింది. అయితే అక్కడితో తన సక్సెస్కి బ్రేక్ వేయలేదామె. తన చిన్ననాటి కల ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఎలాగైనా ఐఏఎస్ కావాలనే కోరిక ఆమె మనసులో చాలా బలంగా ఉండేది. అందుకోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలనై నిర్ణయాన్ని అత్యంత ధైర్యంగా తీసుకుని మరీ యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సన్నద్ధమైంది. అయితే 2017, 2018, 2019లలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. కనీసం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేక తిప్పలు పడింది. ఇక లాభం లేదని, చేస్తున్న తప్పిదాలను సమీక్షిస్తూ.. మెరుగ్గా రాసేలా ప్రాక్టీస్ చేసింది. ఆమె దృఢ సంకల్పంతో మరోసారి సివిల్స్ ప్రయత్నించగా.. ఈసారి అపజయం తోకముడవడమే కాదు, సక్సెస్ సంతోషంగా ఒడిలోకి వచ్చి చేరింది. అలా ఆమె 2020 నాల్గో ప్రయత్నంలో 481వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారామె. ఈ సక్సెస్ స్టోరీ (Success Story).. ధైర్యంగా రిస్క్ తీసుకునేందుకు సన్నద్ధం కావడమే గాక, దాంట్లో ఎదురై ఫెయిల్యూర్లను ఓర్చుకునే ఓపిక కూడా అవసరమని చెప్పకనే చెబుతోంది. అప్పుడే విజయ ఢంకాను సగర్వంగా మోగించగడం సాధ్యమని నొక్కి చెబుతోంది కదూ..!.చదవండి: పనిమనిషికి రూ. 8 లక్షల జరిమానా..! ఎందుకో తెలుసా..? -
4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మరో జాబ్!
కాసిపేట: సర్కారు కొలువు సాధించడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఏఈ (ఆపరేషన్)గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటులో రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం పాతబస్తీ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు చల్ల రమేశ్, రమాదేవి దంపతులు మంచిర్యాల వినూత్న కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు చల్ల ఆదర్శ్ 2018లో సింగరేణి (Singareni) సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఓవర్మెన్గా ఎంపికయ్యాడు.ఉన్నతోద్యోగం సాధించాలనే లక్ష్యంతో అందులో చేరలేదు. ఆ తర్వాత రైల్వేశాఖలో జూనియర్ ఇంజనీర్గా ఎంపికయ్యాడు. 2021లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీపీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం (Junior Engineer Job) సాధించాడు. 2022లో రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి సిర్పూర్ ఏఈగా విధుల్లో చేరాడు. గ్రూప్స్ సాధించడమే లక్ష్యంగా సాగుతున్న క్రమంలో ఏఎండీ ప్రాసెసర్ ప్రైవేటు కంపెనీలో రూ.50 లక్షల ప్యాకేజీతో నియామకం అయ్యాడు. ఈ ఉద్యోగంలో చేరుతున్నానని, ఎప్పటికైనా గ్రూప్స్ సాధించడమే తన లక్ష్యమని ఆదర్శ్ తెలిపారు.చదవండి: అమెరికా నుంచి వచ్చి ఫ్రెండ్ను సర్ప్రైజ్ చేసిన ఎన్నారై -
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్షిప్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లుమొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!ఇండోర్లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుబ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్లు , PPE కిట్లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ఐదెంకల వేతనమిచ్చే ఐటీ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆ జంట కోరిక, చేసిన సాహసం వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మలిచింది. ఎవరా జంట? ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టారు? వారు సాధించిన విజయంఏంటి? తెలుసుకుందాం రండి.మహారాష్ట్ర(Maharashtra) లోని కొంకణ్ఖు కు చెందిన గౌరి, దిలీప్ పరబ్ దంపతులు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగలలైన వీరు ముంబైలోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేసేవారు.. జీతం, జీవితం సంతోషంగానే సాగిపోతున్నాయి. ఎలాగైనా మహారాష్ట్రలోని కొంకణ్కు తిరిగి వచ్చి, ఏదైనా సొంతంగా అదీ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే కోరిక రోజు రోజుకు పెరగసాగింది. దీంతో ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కొంకణ్ తిరిగొచ్చారు.కొంకణ్లోని కల్చర్, అందమైన తీరప్రాంతం, బీచ్లు, వ్యవసాయ ప్రకృతి దృశ్యం ఇవన్నీ తమను ఎల్లప్పుడూ మమ్మల్ని ఇంటికి రారమ్మని పిలుస్తూ ఉండేవని అందుకే తిరిగి సొంతూరికి వచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది గౌరి. 2021లో సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా అటు వ్యాపారాన్ని, ఇటు స్థానిక ఉపాధిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మార్కెట్ను స్టడీ చేసి తరువాత ఆ భూమిలో నిమ్మ గడ్డిని సాగు( lemongrass Farming ) చేయాలని భావించారు. నిమ్మగడ్డి పెంపకం లాభదాయమనీ, దీన్ని సౌందర్య సాధనాలు, ఔషధాలు, ఆహారం మరియు పానీయాలతో సహా వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు, దీని వలన డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్తో పాటు కొంకణ్ ఏరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా నిమ్మగడ్డి సాగుకు అనుకూమని గ్రహించామని అందుకే దీన్ని ప్రారంభించామని దిలీప్ వెల్లడించాడు. పైగా నిమ్మగడ్డిని సంవత్సరానికి మూడు -నాలుగు సార్లు పండించవచ్చు, దిగుబడిని పెంచుతుంది . ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలను సృష్టిస్తుందని దిలీప్ వివరించాడు. View this post on Instagram A post shared by Diilip Parab (@houseofsugandhaofficial)సేంద్రీయ వ్యవసాయం నుండి ప్రాసెసింగ్ వరకుఒక ఎకరంలో నిమ్మగడ్డి సాగు ప్రారంభించారు. హైదరాబాద్లోని ఓ నర్సరీలో కొనుగోలు చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎకరా పొలంలో 25 వేల వరకు మొక్కలు నాటారు. ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మధ్యలో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో సేంద్రీయ నిమ్మకాయ గడ్డిని పండిస్తున్నారు. అందులో ఆరు ఎకరాలు వారి సొంతం, మిగిలినది లీజుకు తీసుకున్న భూమి.వర్మీకంపోస్ట్, ఆవు పేడ ,నిమ్మకాయ గడ్డి బయో వ్యర్థాలను వేస్తాము. పంట కోసేటప్పుడు మీరు వేర్లను కత్తిరించాల్సిన అవసరం లేదు కాబట్టి నిమ్మకాయ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మొదటి పంట నాలుగు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. ప్రతి 80 నుండి 90 రోజులకు ఒకసారి లెమన్ గ్రాస్ను కోయవచ్చు. మొదట ఎకరా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు చేరుకుంది. ఇందులో ఆరు ఎకరాలు సొంతం కాగా, మరో రెండు ఎకరాలను లీజుకు తీసుకున్నట్లు గౌరి తెలిపింది. లెమన్గ్రాస్ ఆయిల్ (Lemongrass Oil)ఒక ఎకరంలో దాదాపు 18 టన్నుల నిమ్మగడ్డి దిగుబడి వస్తుంది. ఒక టన్ను లెమన్గ్రాస్ నుండి 7 నుండి 8 లీటర్ల సుగంధ నూనెను పొందవచ్చు. వేసవిలో 1 టన్ను లెమన్గ్రాస్ నుండి నూనె ఉత్పత్తి 10 లీటర్లకు చేరుకోగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇది కేవలం 2.5 లీటర్లు శీతాకాలంలో 5 నుండి 6 లీటర్లకు తగ్గుతుంది, సగటున 7 లీటర్లు వస్తుందనీ, ఎకరా పొలంలో నిమ్మగడ్డితో 126 లీటర్ల ఆయిల్ను తయారు చేయొచ్చు.లెమన్గ్రాస్ ఆయిల్ను రిటైల్ , బల్క్లో ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ కంపెనీలకు విక్రయిస్తారు. మార్కెట్ డిమాండ్ను బట్టి ధరలు లీటరుకు రూ.850 నుండి రూ.1500 వరకు ఉంటుంది. సగటు లీటరుకు రూ.1200, అనిఇలా ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నట్లు దీలీప్ గౌరి జంట వెల్లడించారు.కాగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మొక్కలలో నిమ్మగడ్డి ఒకటి. CSIR-CIMAP (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) ప్రకారం, 2020లో ప్రపంచ నిమ్మగడ్డి మార్కెట్ 38.02 మిలియన్ డాలర్లు . 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 81.43 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లెమన్ గ్రాస్ నూనె మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది, దీనిని 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ , ఆసియా పసిఫిక్ ఖండాలు ఇందులో ఉన్నాయి. -
స్టాక్ మార్కెట్లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!
జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు. -
లండన్నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్
స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆచరణలో పెట్టి విజేతగా నిలిచాడు. కోటి రూపాయల సంపాదనతో నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. యువరైతుగా ఎదిగి ఎవరూ చేయని విధంగా వినూత్నంగా నిలిచాడు. లండన్లోని ఒక లేబుల్ ద్వారా ప్రేరణ పొంది, ఇజ్రాయెల్లో శిక్షణ పొందిన హర్షిత్ గోధా ఇప్పుడు భారతీయ రైతులకు స్వదేశంలో ప్రపంచ స్థాయి అవకాడోలను పెంచడంలో సహాయం చేస్తున్నాడు. 2023 నాటికి, అతని వెంచర్ ‘ఇండో ఇజ్రాయెల్ అవకాడో’ రూ. 1 కోటి ఆదాయాన్ని ఆర్జించింది.హర్షిత్ రైతు కుటుంబం నుండి రాలేదు. కానీ ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది - ఇజ్రాయెల్ దాని పొడి వాతావరణంతో అవకాడోలను విస్తృతంగా పండించగలిగినపుడు భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అనే ప్రశ్నతో తన స్వస్థలమైన భోపాల్కు తిరిగి వచ్చాడు. వెంటనే, టూరిస్ట్ వీసాపై ఇజ్రాయెల్కు విమానం ఎక్కాడు. అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నాడు. భోపాల్ శివార్లలో కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల బంజరు భూమిని తీసుకొని దానిని మార్చడం ప్రారంభించాడు. నేల అభివృద్ధి, నీటి-సమర్థవంతమైన బిందు వ్యవస్థలు, గ్రీన్హౌస్లు , నర్సరీ ఏర్పాటు కోసం అతను రూ. 50 లక్షలు ఖర్చు చేశాడు. తొలి ఏడాదిలో మంచి లాభాలను సాధించాడు. కానీ మద్య కోవిడ్ మహమ్మారి ఛాలెంజ్ విసిరింది. అయినా నిరాశ పడలేదు. హర్షిత్ ఈ సమయాన్ని విద్య కోసం ఉపయోగించుకున్నాడు. ఒక బ్లాగును ప్రారంభించి అవకాడో వ్యవసాయంపై ఉచిత ఇ-పుస్తకం రాశాడు YouTube, LinkedInలో తన జ్ఞానాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. వందలాది మంది ఆశావహులైన రైతులు అతనికి లేఖలు రాయడం ప్రారంభించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదలమీద ఆధారణపడకుండా మల్చింగ్పై ఎక్కువగా ఆధారపడుతాడు. రసాయన ఎరువులను వాడడు. అతను నేల ఆరోగ్యం, నీటి నిలుపుదలని పెంచడానికి కంపోస్ట్, సూక్ష్మ పోషకాలు ఉపయోగిస్తాడు.ప్రస్తుతం 20,000 కంటే ఎక్కువ అవకాడో మొక్కలను నిర్వహిస్తున్నాడు. రైతులకు శిక్షణ ఇస్తున్నాడు ,స్థానికంగా పండించిన, అధిక నాణ్యత గల పండ్ల కోసం వెతుకుతున్న లగ్జరీ హోటళ్ళు, బోటిక్ దుకాణాలు, చెఫ్లతో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు వర్క్షాప్లు, శిక్షణా సెషన్లు ,మెంటర్షిప్ ద్వారా, హర్షిత్ ఇతరులు కూడా తమ అవకాడో తోటలను ప్రారంభించడంలో సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.2023 నాటికి, ఇండో ఇజ్రాయెల్ అవకాడో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. కానీ హర్షిత్ కోసం, ఇది కేవలం సంపాదన ఆర్జన మాత్రమే కాదు. ,నా లక్ష్యం అవకాడోలను పండించడం మాత్రమే కాదు,” “ప్రతి లేబుల్పై ‘సోర్స్డ్ ఇన్ ఇండియా’ని అనే తన కలను నిజం చేయడమే.” అంటారు. యాంటీఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వుల యొక్క గొప్ప మూలం అయిన అవకాడో గుజ్జులో ప్రోటీన్లు (4 శాతం వరకు) , కొవ్వు (30 శాతం వరకు) ఎక్కువగా ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వలన ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులు, హోటళ్ళు, రెస్టారెంట్లు , జిమ్ల నుండి అధిక డిమాండ్ ఉంటుందని గ్రహించాడు. పైగా కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం, జీవనశైలిమీద అవగాహన పెరిగింది. ఇదీ చదవండి: భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడుప్రపంచ బ్యాంకు వాణిజ్య డేటా ప్రకారం, భారతదేశం 2023లో 39 లక్షల కిలోల అవకాడోలను దిగుమతి చేసుకుంది, ఎక్కువగా టాంజానియా, న్యూజిలాండ్, పెరూ, చిలీ,ఆస్ట్రేలియా ఉన్నాయి. అవకాడోకు ఇండియాలో ఉన్న డిమాండ్ను దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. -
బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
1970లలో యువ అమితాబ్ బచ్చన్ పాత్రలో ఇంటింటా గుర్తుండిపోయే పేరు బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన ‘దీవార్’, ‘సీతా ఔర్ గీత’ ‘మజ్బూర్’లలో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు. అతను మరెవ్వరో కాదు 100కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. మాస్టర్ అలంకార్గా అందరి దృష్టినీ ఆకర్షించిన అలంకార్ జోష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలుసా?100కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. దీవార్ (1975), మజ్బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి బాల నటుడుగా ఆకట్టుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం బాల్య నటుడుగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న అలంకార్ మరాఠీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. నాలుగు హిందీ సినిమాలు, రెండు టీవీ సీరియల్స్ , మినీ సీరియల్స్ చేశాడు.కానీ వచ్చవన్నీ చిన్న పాత్రలే కావడంతో తన కెరీర్ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాకు మకాం మార్చి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చదివాడు. తరువాత 1996లో తన సొంత టెక్ సంస్థను స్థాపించాడు. పలు నివేదికల ప్రకారం రూ. 200 కోట్ల సంస్థకు అధిపతి కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నటి పల్లవి జోషి అలంకార్ జోషి సోదరి. ప్రస్తుతం కుమార్తె అనుజా జోషి ఇప్పుడు హాలీవుడ్లో కెరీర్ను కొనసాగిస్తోంది. ‘హలో మినీ’ అనే వెబ్ సిరీస్లో నటించింది. కుమారుడు ఆశయ్ సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు, మరో కుమార్తె కూడా యాక్టింగ్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతోంది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. రెండేళ్లలో రూ.100 కోట్ల సామ్రాజ్యం!
చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది. 11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్లో ఇంటర్న్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే? -
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
అనుకున్నది సాధించాలంటే సాహసం చేయక తప్పదు. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం వంగి సలాం చేస్తుంది. విదేశాల్లో కార్పొరేట్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి మరీ తమకిష్టమైన వ్యాపారంలోకి అడుగుపెట్టిన దంపతులు సక్సెస్ సాధించారు. పదండి వారి సక్సెస్ గురించి తెలుసుకుందాం.సందీప్ జోగిపర్తి (Saandeep Jogiparti), కవిత గోపు (kavitha gopu) దంపతులు ఐదేళ్లపాటు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం కానీ వారికి అది సంతృప్తినివ్వలేదు. స్వంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనే కలను సాకారం చేసుకునేందుకు 2019లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్వేషణ మొదలైంది. సందీప్ ఆరు నుండి ఎనిమిది నెలలు భారతదేశం అంతటా ప్రయాణించారు.ఆ సమయంలో ఆహారం, ఫిట్నెస్ పరిశ్రమ వారి దృష్టిని ఆకర్షించింది. సందీప్కు స్వీట్లంటే చాలా ఇష్టం. పైగా భోజనం తర్వాత ఏదైనా తీపి తినడం ఇంకా (చాలామందికి) అలవాటు. మార్కెట్ నిండా ఎనర్జీ బార్లు,స్నాక్స్ , స్వీట్లు, కృత్రిమ స్వీట్లతో నిండి తీపిపదార్థాలతో నిండి పోయాయి. అందుకే దీనికి భిన్నంగా ఆరోగ్యం, పోషకాలతో నిండిన స్వీట్లను తయారు చేయాలని భావించారు. అలా 2020లో పుట్టింది హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ లడ్డుబాక్స్. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మిల్లెట్స్, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బెల్లం నెయ్యి వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి 11 రకాల లడ్డూలు విక్రయిస్తారు. ప్రతి ఒక్కటి 21 రోజుల షెల్ఫ్-లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా ఖాక్రాస్, చిక్కీలు, నట్స్ అండ్ స్వీట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను కూడా విక్రయిస్తారు.చక్కెర, ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రంగులు లేకుండా అధిక పోషకాల లడ్డూలను విక్రయించడమే వీరి లక్ష్యం.చదవండి: Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలుకేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన లడ్డూ బాక్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించింది. కేవలం 4 రకాల లడ్డూల నుండి, ఇప్పుడు 15 రకాలను అందిస్తుంది. 2020 మేలో COVID-19 సమయం వారికి అనుకూలంగా పనిచేసింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో లడ్డూబాక్స్కు అద్భుత మైన స్పందన వచ్చింది.భారతదేశం అంతటా డెలివరీ చేస్తారు. పెద్ద B2B ఆర్డర్స్ తీసుకుంటారు. హైదరాబాద్లో వారి స్వంత స్టోర్ ఉంది. 2025 చివరికి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ NCR అంతటా 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం -
మర్రిపాలెం బుల్లోడు : షార్ట్ఫిల్మ్స్ టు ఆస్కార్స్ గోల్డ్ఫెలోషిప్
బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ప్రకృతి, మూగజీవులపై పలు డాక్యుమెంటరీలను చిత్రీకరించాడు శ్రీహరి వర్మ(Sagi Sree Hari Varma). మూగజీవులు స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించాలో వివరిస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’ సంస్థలో వాలంటీర్గా చేరి మూగ జీవులపై డాక్యుమెంటరీ రూపొందించాడు. మూగ జీవులపై చిత్రీకరించిన షార్ట్ ఫిలిమ్స్ను రష్యాలోని విజీఐకె ఫిల్మ్ స్కూల్కు పంపిచాడు. రష్యా ప్రశంసలురష్యా ప్రభుత్వం తమ దేశ ప్రగతి, సంస్కృతి, అభివృద్ధిని చాటిచెప్పే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు యువ దర్శకులను ఎంపిక చేయగా మన దేశం నుంచి శ్రీహరి వర్మకు మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కళ్ళకు కట్టినట్టుగా ‘గో మారడోవియా’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించి రష్యా ప్రతినిధుల నుండి ప్రశంసలు పొందాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ‘స్కూల్ ఆఫ్ సినిమా టెక్ ఆర్ట్స్’లో చేరి దర్శకత్వ నైపుణ్యాలపై సంవత్సరం పాటు శిక్షణ పొందాడు. హాలీవుడ్ సినిమా చిత్రీకరణపై అవగాహన పెంచుకున్నాడు. శిక్షణా సమయంలోనే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలు (పీస్కీపింగ్ ఫోర్సెస్) పై డాక్యుమెంటరీ రూపొందించాడు. (Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలు)ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్బాక్స్ రిటన్ గిఫ్ట్స్ఫస్ట్ ఇండియన్షార్ట్ ఫిలిమ్స్తో మొదలైన శ్రీహరివర్మ ప్రస్థానం ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ వరకు వెళ్ళింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతిభావంతులైన దర్శకులను తీర్చిదిద్దేందుకు ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ అందజేస్తుంది. దీని కోసం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 20 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తుంది. ఈ ఫెలోషిప్కు 2019లో ఎంపికైన తొలి భారతీయుడుగా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు శ్రీహరివర్మ. ఫెలోషిప్లో భాగంగా యువ దర్శకులు, ప్రముఖ హాలీవుడ్ దర్శకులతో కలసి పనిచేసే అవకాశం పొందాడు. గేమ్ ఆఫ్లైఫ్, హెడ్ అండ్ ఫిగర్స్, అమెరికన్ డ్రీమర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు టెడ్ మెల్ఫీ దగ్గర శిక్షణ పొందాడు.చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం సినీ–మదమారెలో అవకాశంఇటలీలో జరిగిన ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ (సినీ మదమారె)లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీహరివర్మకు అవకాశం లభించింది. ప్రతి ఏటా వివిధ దేశాల నుండి యువ దర్శకుల ప్రతిభను గుర్తించడానికి ఇటాలియన్ ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. సిని మదమారెలో శ్రీహరి వర్మ 4 విభిన్న షార్ట్ ఫిలిమ్స్ను చిత్రీకరించాడు.విశాఖ నగరం, మర్రిపాలెంకు చెందిన సాగి శ్రీహరివర్మ షార్ట్ ఫిలిమ్స్తో ప్రారంభించి ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్లో స్థానం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల ఇటలీలో జరిగిన వేసవి చలన చిత్ర నిర్మాణ కార్యక్రమం (సినీ మదమారె)లో పాల్గొని తన సత్తా చాటాడు... -
తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం
తెనాలి: నాన్న కల నిజం చేయాలని కుమారుడు పట్టుదలతో కృషి చేశారు. తొలి ప్రయత్నంలోనే 22 ఏళ్ల వయసులో ఐఆర్ఎస్ సాధించారు. తండ్రి కల అయిన ఐఏఎస్ కోసం మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఐపీఎస్ సాధించారు. మరోమారు ఐఏఎస్కు ప్రయత్నం చేస్తానని చెప్పారు. తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబు 2024 సివిల్స్ పరీక్షల్లో 681వ ర్యాంక్ సాధించారు. తుది ఫలితాల్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. 2021లో ఐఆర్ఎస్కు ఎంపికై ప్రస్తుతం ఆదాయ పన్నుశాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్)గా విజయవాడలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాలుగో ప్రయత్నంలో ఇప్పుడు ఐపీఎస్కు ఎంపికయ్యారు. విజయ్బాబు తండ్రి మధుబాబు, తల్లి రాజ్యలక్ష్మి. తల్లి గ్రాడ్యుయేట్ కాగా, తండ్రి ఎనిమిది పీజీలు చేశారు. జిల్లా కలెక్టర్గా చేయాలని ఆయన ఆశపడ్డారు. దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అవకాశం రాలేదు. జీఎస్టీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సమయంలో కన్ఫర్మ్డ్ ఐఆర్ఎస్ హోదా లభించింది. ఆ హోదాలోనే ఆయన రిటైరయ్యారు. తన కవల పిల్లలు అజయ్బాబు, విజయ్బాబులు ఐఏఎస్ సాధిస్తే చూడాలనేది మధుబాబు కల. చిన్ననాటి నుంచే మంచి విద్యాసంస్థల్లో చదివించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!చిన్ననాటి నుంచే... 2007లో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషించిన తాతయ్య ప్రభాకరరావు ఆశీర్వదిస్తూ ‘భవిష్యత్లో కలెక్టరు కావాలి నాన్నా’ అంటూ ఉత్తరం రాశారు. అప్పుడే విజయ్బాబు మనసులో ఆ పదం నాటుకుపోయింది. ఎదుగుతున్న క్రమంలో తండ్రి ఆశయం తెలిసింది. ఇక లక్ష్యం ఐఏఎస్గా ఫిక్సయ్యారు. టెన్త్లో 10 జీపీఏ సాధించారు. ఇంటర్లో స్నేహితులకు భిన్నంగా ఎంఈసీలో చేరారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలనే రూలేం లేదు... ఆర్ట్స్తోనూ సాధించొచ్చు’ అని తండ్రి ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టారు. ఇంటర్లో 975 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. ఇదీ చదవండి: 5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలుఇంటి వద్దే సిద్ధమై... డిగ్రీ కోసం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం పోటీ పడిన 30 వేల మంది నుంచి ఆయన ఎంపికయ్యారు. 2019లో బీఏ ఆనర్స్ను ఫస్ట్ డివిజనులో ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది జులైలో తెనాలికి వచ్చారు. అప్పటి నుంచి సివిల్స్పై గురిపెట్టారు. అవిశ్రాంత కృషితో 2021 సివిల్స్ పరీక్షలలో 682వ ర్యాంకుతో ఐఆర్ఎస్ను ఖాయం చేసుకున్నారు. అప్పటికి విజయ్బాబు వయసు 22 ఏళ్లు మాత్రమే. 2022 రెండోసారి రాసినా మళ్లీ ఐఆర్ఎస్ వచ్చింది. మూడో ప్రయత్నంలో తగిన ర్యాంకు రాలేదు. నిరుత్సాహం పడకుండా నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్ను దక్కించుకున్నారు. నాన్న కలను నెరవేర్చాలని మరోమారు పరీక్షలకు హాజరుకానున్నారు. -
నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..
ఒక వ్యక్తికి జీవితంలో కష్టాలు సర్వసాధారణమే. పోరాడి గెలుస్తుండగా..లాగిపెట్టి అమాంతం కిందపడేసే కష్టాలు హఠాత్తుగా ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంటే..గెలుపు అన్న మాట భయంగా మారిపోతుంది. మళ్లీ తిరిగి లేచి నిలబడటానికి ధైర్యం చాలదు కూడా. కానీ ఈ మహిళ గుక్కపెట్టి ఏడిపించిన కష్టానికి తన దైన శైలిలో సమాధానం ఇచ్చి నిలబడటమే గాక..ఆ కష్టమే తోకముడిచి పారిపోయేలా అచంచలంగా ఎదిగింది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆ మహిళే నీతు మేడమ్గా పేరుగాంచిన నీతుసింగ్. జార్ఖండ్లోని గిరిదిహ్లో జన్మించిన నీతు మూడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి కిషోర్ దేవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో తన అన్నయ్య, ఆరుగురు సోదరిమణులతో కలసి పెరిగింది. చిన్ననాటి నుంచే కష్టం విలువ తెలిసిన ఆమె చదువులో బాగా రాణించేది. కార్మెల్ కాన్వెంట్, సెయింట్ జాన్స్ స్కూల్ (వారణాసి)లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. వినోబా భావే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్లో ఎల్ఎల్బీ పూర్తి చేసింది. అప్పుడే కోచింగ్ సెంటర్ని ప్రారంభించింది. ఆ సెంటర్ని ప్రారంభించిన ఒక ఏడాదికి రాజీవ్ సౌమిత్రను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారామౌంట్ కోచింగ్ సెంటర్ని విజయవంతంగా నడిపారు. దాదాపు రూ. 200 కోట్ల టర్నోవర్ సంస్థగా మలిచారు. పోటీ పరీక్షల కోసం నీతు ఇంగ్లీష్ వాల్యూమ్1 అనే పుస్తకాన్ని రచించింది. ఇది అత్యధికంగా అమ్ముడైన కాంపిటీషన్ బుక్గా నిలిచింది కూడా. ఇంతలో ఆమె వైవాహిక బంధంలో మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. అది రాను రాను మరింతగా క్షీణించే స్థాయికి వచ్చేసింది. ఆమె కూడా ఆ కోచింగ్ సెంటర్లో దాదాపు 50% వాటాదారు అయినా..ఆమెభర్త ఆగస్టు 5,2015న బౌన్సర్ల చేత బలవంతంగా బయటకు గెంటేశాడు. దాంతో మళ్లీ రోడ్డు మీదకు వచ్చేసింది నీతు జీవతం. వివాహం విచ్ఛిన్నమవ్వడమే గాక లాభాల బాట పట్టించిన వ్యాపారం కూడా పోయింది. తగ్గేదేలే అంటూ లేచి నిలబడింది..మళ్లీ పరిస్థితి చలికిలబడినట్లు అయినా..అచంచలమైన ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడి ఆ దిశగా సాగింది. ఈసారి తన తండ్రి దివంగత కిషోర్ దేవ్ పేరుతో కేడీ కోచింగ్ సెంటర్ని ప్రారంభించింది. చూస్తుండగానే అచిరకాలంలోనే ఆ సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఎస్ఎస్సీ ఎగ్జామ్లో ర్యాంకర్లుగా మార్చే సంస్థగా కేడీ సంస్థ పేరుతెచ్చుకుంది. ఇలా మంచి లాభాలతో దూసుకుపోతున్న కోచింగ్ సెంటర్కి మళ్లీ మహమ్మారి రూపంలో బ్రేక్ పడింది. అయినా సరే టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా అడుగులేసి ఆన్లైన కోచింగ్లు ఇవ్వడం ప్రారంభించింది. అలా ఆమె యూట్యూబ్ ఛానెల్కి సుమారు రెండు మిలయన్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు కలిగి ఉండటమే గాక, వేలాదిమంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులకు తీర్చిదిద్దింది. అంతేగాదు తన కోచింగ్ సెంటర్తో పేద కుటుంబాలు, అనాథలు, వృద్ధులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది నీతు. బాల్యంలో తండ్రిని కోల్పోవడం దగ్గర నంచి మొదలైన ఎదురుదెబ్బలు వెవాహిక జీవితం కోల్పోవటం, నమ్మక ద్రోహం వరకు భరింపరాని కష్టాలను కడగండ్లను ఎందుర్కొంది. అయినా ఎక్కడ నా వల్ల కాదు అని గివ్ అప్(చేతులెత్తేయ లేదు) ఇవ్వలేదు. జీరో నుంచి మళ్లీ మెదలు పెట్టినా.. చివరికి గెలుపు మాత్రం నాదే అని ప్రూవ్ చేసింది నీతు మేడమ్. చిన్న చిన్న కష్టాలకే భయపడే నేటి యువతరానికి నీతు సింగ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.(చదవండి: ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్) -
విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?
చాలా మంది భారతీయులు విదేశాల్లో విజయవంతమైన కెరీర్ సొంతం చేసుకోవడమే కాకుండా.. అతిపెద్ద పారిశ్రామికవేత్తల లీగ్లో కూడా నిలిచారు. వ్యాపార, పరిశ్రమల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వారిలో ఒకరు 'ప్రకాష్ లోహియా'. ఇంతకీ ఈయన ఎవరు?, నెట్వర్త్ ఎంత? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కోల్కతాకు చెందిన ప్రకాష్ లోహియా.. 1952 ఆగస్టు 11న మోహన్ లాల్ లోహియా & కాంచన్ దేవి లోహియా దంపతులకు జన్మించారు. 1973లో తన తండ్రితో కలిసి ఇండోనేషియాకు మకాం మార్చారు. అక్కడ వారు 1976లో స్పన్ నూలు ఉత్పత్తిదారు ఇండోరమా కార్పొరేషన్ను స్థాపించారు. ఈ కంపెనీ ఎరువులు, పాలియోలిఫిన్లు వంటి ఉత్పత్తులను తయారు చేసేది.ప్రకాష్కు ఒక అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. కాబట్టి వీరి తండ్రి మోహన్ లాల్ లోహియా తమ వ్యాపారం వృద్ధి చెందడానికి, కుటుంబ వివాదాలను నివారించడానికి వారి 1980లలో ఆస్తిని ముగ్గురు కుమారులకు విభజించారు. ఆ తరువాత ప్రకాష్ లోహియా అన్నయ్య ఓం ప్రకాష్ భారతదేశానికి తిరిగి వచ్చి ఇండోరామా సింథటిక్స్ను స్థాపించారు. తమ్ముడు అలోక్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఉన్ని నూలును తయారు చేసే ఇండోరామా హోల్డింగ్స్ను స్థాపించారు.అన్న, తమ్ముడు సొంత వ్యాపారాలను ప్రారభించుకున్న తరువాత.. ప్రకాష్ లోహియా 2006లో నైజీరియాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఓలేఫిన్ ప్లాంట్ను కొనుగోలు చేశాడు. ఇది అప్పట్లోనే పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద పెట్రోకెమికల్ సంస్థ, ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద ఓలేఫిన్ల ఉత్పత్తిదారు.ప్రకాష్ లోహియా.. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ & సీఈఓ, భారతదేశ బిలియనీర్లలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ సోదరి సీమా లోహియా భర్త. 2025 నాటికి ప్రపంచ బిలియనీర్లలో ఆయన 353వ స్థానంలో.. 2024 నాటికి ఇండోనేషియాలోని 50 మంది అత్యంత ధనవంతులలో ఆరవ స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..ప్రకాష్ లోహియా నెట్వర్త్లోహియా నికర విలువ 8.3 బిలియన్ డాలర్ల (రూ. 72,000 కోట్లు) కంటే ఎక్కువ అని ఫోర్బ్స్ వెల్లడిస్తూ.. ఈయనను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా & ఇండోనేషియాలోని టాప్ పది బిలియనీర్లలో ఒకరిగా పేర్కొంది. ఈయన SP లోహియా ఫౌండేషన్ను కూడా స్థాపించి.. దీని ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు కళా కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. -
కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్డీకి గైడ్గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. అనుకున్నట్టు ఎదగాలంటే పట్టుదల ఉండాలి. దానికి తగ్గ కృషి ఉండాలి. అందుకే కృషి ఉంటే మనుషులు మహాపురుషులౌతారు అంటాడో సినీ కవి. కర్ణాటకకు చెందిన రైతు లోహిత్ శెట్టి సక్సెస్ స్టోరీ వింటే మీరు కూడా ఔను అంటారు.జీవితం అంటే ఐటీ కంపెనీల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసే వ్యక్తులదేనా, నాది కూడా అని ఒక సామాన్య రైతుగా లోహిత్ శెట్టి నిరూపించిన వైనం ఇది. విలక్షణమైన సాగుతో, మార్కెట్ అవసరాలను అవగాహన చేసుకొని కోట్లు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి పుట్టింది వ్యవసాయ కుటుంబం. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. అందరిలాగానే లోహిత్కు చాలా ఆశలు, ఆశయాలుండేవి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఉన్నచోటనే సక్సెస్ను వెదుక్కున్నాడు.కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో తొలుత క్వారీలో చిన్న ఉద్యోగిగా పనిచేశాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పని చేశాడు. అయితే లోహిత్కు వ్యవసాయంపట్ల ఉన్న మక్కువ అతణ్ని వ్యవసాయం వైపు మళ్లించింది. తొలుత తన కుటుంబ వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ పంటలను సాగు చేసేవాడు. ఈ పంటల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది పైగా లాభదాయకంగా కూడా లేదని గమనించాడు. దీంతో కొంత పరిశోధన చేసి విదేశీ పండ్ల పెంపకంవైపు మళ్లి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. 2006లో కేరళ నుండి రంబుటాన్ , మాంగోస్టీన్ మొక్కలను కొని దక్షిణ కన్నడ జిల్లాలోని తన పొలంలో నాటాడు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఈ చెట్లు ఇప్పుడు సీజన్కు 80-100 కిలోల పండ్లను ఇస్తాయి. టోకు వ్యాపారులు వాటిని పొలం నుండి కిలోకు రూ.350 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుంది. రంబుటాన్, మాంగోస్టీన్ , డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లను పండించడంలో ప్రత్యేకతను సాధించాడు. ప్రకృతిలో మమేకమై, మెళకువలను అర్థం చేసుకుంటూ భారీగా లాభాలను ఆర్జించాడు. వీటిని బెంగళూరు, చెన్నై , ముంబై వంటి ప్రధాన నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఏడాదికి కోటి రూపాయట టర్నోవర్ సాధించాడు. తన లాంటి ఎందరో రైతులకు ప్రేరణగా నిలిచాడు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంఅదనంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని, పెద్ద ఎత్తున సాగుచేసి సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక నర్సరీని కూడా స్థాపించారు. దీని ద్వారా మరికొంత ఆదాయం లభించింది.లోహిత్ విజయం, విజ్ఞానం కేవలం తన సొంత పొలానికే పరిమితం కాలేదు. ఆయన తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, తోటి రైతులకు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సలహాలు సూచనలు అందిసతూ ముందుకు సాగుతున్నాడు. కృషి, వినూత్న విధానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల అంకితభావానికి లోహిత్ సక్సెస్ గొప్ప నిదర్శనం.చదవండి: వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్ప్రపంచంలోనే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు అతిపెద్ద రంబుటాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. 1980లలో మలేషియా, శ్రీలంక ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు చెబుతారు. -
కష్టాల్లోంచి పుట్టిన స్టార్టప్
నల్గొండ: పట్టుదల, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు మారుమూల గ్రామీణ ప్రాంతంలోని కూలీ కుటుంబంలో జన్మించిన యువకుడు. పేద కుటుంబంలో పుట్టినా దాతల సహకారంతో ఐఐటీలో చదివి.. స్టార్టప్ కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి అనిల్కుమార్. బాల్యం నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగిన అనిల్కుమార్ అడుగడుగునా ఎదురైన ఆటంకాలను అధిగమించి జీవితంలో సక్సెస్ అయ్యాడు.ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు సునీల్కుమార్, అనిల్కుమార్ సంతానం. ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు. కవిత దినసరి కూలీ. వారికి పెద్దగా ఆస్తులు లేవు. అనిల్కుమార్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద హుజూర్నగర్లోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్లో ప్రవేశ పరీక్ష రాసి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. పదో తరగతి తర్వాత హైదరాబాద్లోని గౌలిదొడ్డిలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(ఐఐటీ అకాడవీు)లో ప్రవేశ పరీక్ష రాసి ఇంటర్తో పాటు ఐఐటీ కోచింగ్ తీసుకునేందుకు సీటు సాధించాడు. ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ స్థాయి కోచింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన నాటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్ఫూర్తితో అనిల్కుమార్ ఐఐటీ ఖరగ్పూర్లో సీటు సంపాదించాడు. అయితే ఏడాదికి దాదాపు లక్షన్నర రూపాయల ఫీజు చెల్లించాల్సి రావడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పైగా అనిల్కుమార్ అన్న సునీల్కుమార్ కూడా అదే సమయంలో బీటెక్ చదువుకుంటుండడంతో ఇద్దరికి ఫీజు చెల్లించడం వారి తల్లిదండ్రులకు భారంగా మారింది. దాతల సాయంతో ఐఐటీకి..ఈ నేపథ్యంలో సాక్షి దినపత్రికలో 2021 డిసెంబర్ 12న అనిల్కుమార్ పరిస్థితిపై ‘అట్టడుగు నుంచి ఐఐటీకి’ అనే కథనం ప్రచురించడంతో దాతలు ముందుకు రావడంతో పాటు అప్పటి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్, ఇతరుల నుంచి ఆర్థిక సాయం లభించింది. అంతేకాకుండా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం రూ.2.50లక్షలు చెక్కు అనిల్కుమార్కు అందించడంతో ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు దోహదం పడింది. తనకు అందివచి్చన అవకాశాన్ని సద్వినియోగం చేసుకన్న అనిల్కుమార్ కష్టపడి చదివి ఈ నెల 15వ తేదీన ఐఐటీ ఖరగ్పూర్లో నిర్వహించిన 71వ స్నాతకోత్సవంలో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ చేతులమీదుగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు.కేటీఆర్ మాటలే ప్రేరణగా...‘మనం ఒకరి కింద ఎందుకు పనిచేయాలి..? మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేం..? మనం కంపెనీలను ఎందుకు ప్రారంభించకూడదు..?’ అని మాజీ మంత్రి కేటీఆర్ మాటలతో ప్రేరణ పొందిన అనిల్కుమార్ ఐఐటీలో చదువుతుండగానే తన మిత్రులతో కలిసి లూప్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ను స్థాపించాడు. ఈ స్టార్టప్ ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. అనిల్కుమార్ స్టార్టప్ కంపెనీని నెలకొల్పడంతో మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు స్టార్టప్ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మరిన్ని విజయాలు సాధించాలి. ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారండి’ అని కేటీఆర్ అనిల్కుమార్ విజయ ప్రస్థానంపై ఎక్స్(ట్విటర్)లో అభినందనలు తెలిపారు. -
ఒకప్పటి ఎస్టీడీ బూత్బాయ్.. నేటి యువ పారిశ్రామికవేత్త
ఉద్యోగం చేయడం కాదు.. పది మందికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యం.. ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మరువద్దన్న వినయం.. కొత్తగా చేయాలన్న తపన.. ఆ యువకుడిని విజయతీరాలకు చేర్చింది. ఊరి పేరును బ్రాండ్గా మార్చుకున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన యువకుడు దొంతినేని బాలకృష్ణ (Donthineni Balakrishna) తన ఊరి పేరుతో స్వీట్ల వ్యాపారాన్ని దేశ, విదేశాల్లో విస్తరించాడు. ఎస్టీడీ బూత్బాయ్గా పనిచేసిన కుర్రాడు యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సంక్షోభంలో వ్యాపారం ప్రారంభించి.. విజయవంతంగా దూసుకెళ్తున్న బాలకృష్ణ సక్సెస్స్టోరీ.పల్లె నుంచి పట్నానికి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన దొంతినేని మాధవరావు, శ్యామల కుమారుడు దొంతినేని బాలకృష్ణ పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీఎస్సీ బయోటెక్నాలజీ హైదరాబాద్లో పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకు భారం కావద్దని నల్లకుంటలో ఎస్టీడీ బూత్లో పనిచేశాడు. ఢిల్లీ, డెహ్రాడూన్లో మెడికల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఏది చేసిన అందులో తృప్తి లేదని గ్రహించిన బాలకృష్ణ.. వినూత్నంగా ఆలోచించాడు. 2020లో కరోనాతో ఉద్యోగాలు పోవడం చూసి మనమే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆలోచించి హైదరాబాద్కు తిరిగొచ్చాడు.అక్కాచెల్లెళ్లు సునీత, అనిత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్నేహితుల అండతో రూ.20 లక్షల పెట్టుబడితో స్వీట్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా వెళ్లేలా ఉండాలని తన ఊరు పేరుతో ‘పోతుగల్ స్వీట్స్’ను 2021లో సరూర్నగర్లో అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్లోని కొంపల్లి, హైటెక్సిటీ, కొత్తపేట్, కర్మాన్ఘాట్లలో బ్రాంచ్లు ప్రారంభించారు. స్వీట్స్ వ్యాపారంతోపాటు తంగెడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. దుబాయ్లో నెల రోజుల కిందట పోతుగల్ స్వీ ట్స్ షాప్ ప్రారంభించాడు. రుచి.. శుచి.. నాణ్యతలే ప్రామాణికం ఏ వ్యాపారం ప్రారంభించినా నాణ్యత.. రుచి.. శుచితోనే విజయం సాధిస్తామని నమ్మి బాలకృష్ణ పోతుగల్ స్వీట్స్ను నడిపిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. స్వీట్స్ రంగంలో అప్పటికే మార్కెట్లో పేరు గడించిన వ్యాపారులతో పోటీని తట్టుకొని రూ.వంద కోట్ల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాడు. స్నేహితులు రఘునాథ్రెడ్డి, సుధాకర్రెడ్డి, మహేందర్రెడ్డి అండతో స్వీట్స్ వ్యాపారం చేస్తూ 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. ‘పోతుగల్ ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ స్వీట్స్’ పేరుతో సంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్గా బాలకృష్ణ బ్రాంచీలు నిలుస్తున్నాయి. తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని కష్టపడి పనిచేసి నిజాయితీగా వ్యాపారం చేస్తే అది విజయతీరాలకు చేరుస్తుందని బాలకృష్ణ అంటున్నాడు. వెయ్యి మందికి ఉపాధి కల్పించి.. అమెరికా, బ్రిటన్లలో పోతుగల్ స్వీట్స్ (Pothgaal Sweets) ప్రారంభించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొన్నాడు.చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ డిమాండ్.. త్వరపడండి సంప్రదాయాలకు పెద్దపీట నాణ్యత, స్వచ్ఛతలకు తోడు కస్టమర్ల నమ్మకానికి ప్రాధాన్యం కల్పిస్తూ పనిచేస్తున్నాం. పండుగలు, వేడుకలకు వినియోగించే స్వీట్లను అంతే పవిత్రతతో అందిస్తున్నాం. ఆ నమ్మకమే వంద కోట్ల వ్యాపారానికి నాంది వేస్తుంది. ఎయిర్పోర్టులు, విదేశాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేస్తాం. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. – దొంతినేని బాలకృష్ణ, పోతుగల్ స్వీట్స్ యజమాని -
చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా
MumbaiDreams చిన్న వయసులోనే కేవలం రూ.500తో ముంబైకి వచ్చాడు. దాదాపు 34 ఏళ్ల పోరాటం.ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు. కానీ మంచిరోజులు తప్పక వస్తాయని తనపై నమ్మకం పెట్టుకున్నాడు. కట్ చేస్తే సూపర్ స్టార్ అయ్యాడు. పట్టుదల, సహనం ఆయనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కష్టాలు, సుఖాలు వెలుగు నీడల్లాంటివే వస్తాయ్..పోతాయ్.. కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దృఢ నిశ్చయంగా గమ్యం వైపు సాగిపోవాలి అని నిరూపించిన నటుడు, రాజకీయ నాయకుడి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవీంద్ర కిషన్ శుక్లా(Ravi Kishan Shukla) (జననం 1969, జూలై 17న సంప్రదాయాలు, కట్టుబాట్లతో నిండిన ఒక పూజారి ఇంట్లో పుట్టాడు. కానీ చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం. చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించాడు. ఇది తండ్రి బాగా మందలించాడు. చఅంతే 17 ఏళ్ల ప్రాయంలో 500 రూపాయలు చేతబట్టుకొని ముంబైకి పారిపోయాడు. అదే అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ముంబై లాంటి మహానగరంలో ఆయన జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు. దివింది 12వ తరగతే...అయినా సరే. ఈ భూమ్మీద తన నకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశతోనే ముందుగా సాగాడు. కట్ చేస్తేప్రస్తుతం గోరఖ్పూర్ నుండి పార్లమెంటు, లోక్సభ సభ్యునిగా పనిచేస్తున్నారు.అతను పార్లమెంటరీ విధులలో తన పనితీరుకు 2025లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.1992లో విడుదలైన బాలీవుడ్ చిత్రం పితాంబర్తో తన కెరీర్ను ప్రారంభించాడు. తన తొలి సినిమాతో రూ.5000 సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ భోజ్పురి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2003లో వచ్చిన సయ్యా హమార్ బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతే అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేడు. స్టార్గా రాణించాడు. బిగ్ బాస్ 1 తో పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ చిత్రానికి మొట్టమొదటిసారిగా భోజ్పురిలో స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చేశాడు. అయితే నటుడిగా ఉండాలంటే చాలా భ్రమల్లో ఉండేవాట. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని, అయితే అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఇలా గెలుపోటముల నుంచి నేర్చుకుంటూ, పడుతూ లేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు రవికిషన్.1993లో ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్న రవి కిషన్ నలుగురు పిల్లల(ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు )తండ్రి. ముక్కాబాజ్, బాట్లా హౌస్ , లాపతా లేడీస్ - నుండి మామ్లా లీగల్ హై వంటి OTT హిట్ల వరకు.. ఎన్నో మైలు రాళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి.రవి కిషన్ నికర విలువ: పలు మీడియా నివేదికల ప్రకారం రవికిషన్కు రూ.14.96 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దాదాపు రూ.20.70 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన 11 ఫ్లాట్లు ఉన్నాయి. భార్య ప్రీతి శుక్లా పేరుతో రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దీనితో పాటు రూ.9.38 లక్షల విలువైన బంగారం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక కోట్ల విలువ చేసే టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు BMW వంటి లగ్జరీ కార్లున్నాయి. -
తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..
‘నా జీవన ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలకు గురయ్యాను.. అయినా వెనక్కి తగ్గలేదు.. వాటినే విజయవానికి మెట్లుగా మలచుకున్నా’ అని ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సినీ నిర్మాత గునీత్ మోంగా అన్నారు. యువ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం వైఎఫ్ఎల్ఓ (యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ‘గోల్డెన్ లెన్స్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలో ఎదురైన అనుభవాలను వారితో పంచుకుని స్ఫూర్తిని నింపారు. ‘20 సంవత్సరాలు ఒక అద్దె ఇంట్లో జీవించాను. నా తల్లిదండ్రులకు ఇల్లు కొనాలని అనుకున్నా. నెలకు రూ.5,000 అద్దె చెల్లిస్తూ జీవితాన్ని గడిపా. నా ప్రయాణం అంత సులభం కాదు. జీవితంలో అనేక ఛీత్కారాలను స్వాతగించా’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఏడాదికి 1500లకు పైగా సినిమాలు నిర్మితమవుతున్నా అందులో 10 శాతం కూడా మహిళా దర్శకులు లేకపోవడం బాధాకరమని, ఈ పరిస్థితి మారాలని, అందుకే ఉమెన్ ఇన్ ఫిలిం–ఇండియా చాప్టర్ని ప్రారంభించామని అన్నారు. ఇది మహిళలకు మద్దతు ఇచ్చే ప్లాట్ఫాం అని, వాళ్ల గొంతు వినబడాలని అన్నారు. హైదరాబాద్ అన్నా, బిర్యానీ అన్నా ఇష్టం.. తనకు హైదరాబాద్ అన్నా, ఇక్కడి బిర్యానీ అన్నా ఎంతో ఇష్టమని, అవకాశం లభిస్తే టాలీవుడ్ కళాకారులతో కలిసి పనిచేయాలని ఉందని అన్నారు. ఆమె నిర్మించిన ప్రసిద్ధ చిత్రాలు ‘ది లంచ్ బాక్స్, మసాన్, పగ్గలైత్, ఆస్కార్ గెలుచుకున్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విస్పరర్ వంటి చిత్ర అనుభవాలను పంచుకున్నారు. వైఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ పల్లవిజైన్ మాట్లాడుతూ గునీత్ అనేక మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ, వైఎఫ్ఎల్ఓ సభ్యులు పాల్గొన్నారు. (చదవండి: హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్..!)


