కుబేర వారసులు | Success Story On Millionaires Sons | Sakshi
Sakshi News home page

కుబేర వారసులు

May 4 2025 7:03 AM | Updated on May 4 2025 7:05 AM

Success Story On Millionaires Sons

ఒకప్పుడు తండ్రి ఒడిలో కూర్చొని ఓనమాలు దిద్దిన వారంతా, ఇప్పుడు వ్యాపార చదరంగంలో ఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. వ్యాపారరంగంలో ఇప్పటికే ఆరితేరిన తండ్రులు తమ వ్యాపార అనుభవాలను పాఠాలుగా చెబుతుంటే, వాటన్నింటినీ శ్రద్ధగా వింటూ కొత్త తరం కోటీశ్వరులుగా ఎదుగుతున్నారు. తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూనే, తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. 

పాతతరం ఢక్కామొక్కీలు తిని కోటీశ్వరులుగా మారితే, ఇప్పుడు వారి పిల్లలు కేవలం వారసత్వం అనే ఏకైక అర్హతతోనే వ్యాపార సామ్రాజ్యాలకు నవనాయకులుగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. అంబానీ మొదలుకొని దేశంలోని చాలామంది వ్యాపార దిగ్గజాలు ఇప్పుడు తమ వారసులకే పట్టం కడుతున్నారు. అందుకే, ప్రస్తుతం ఉన్న యువ కోటీశ్వరుల్లో ఎక్కువమంది వ్యాపార కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. అయితే, వీరిలో కూడా కొంతమంది ఒట్టి వారసులుగానే మిగిలిపోకుండా, తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వేలాదికోట్ల ఆస్తిపాస్తులను, వ్యాపారాలను నిలబెట్టుకుంటూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. వారిలో కొందరే.. వీరు..

రి‘లయన్స్‌’
ఆసియాలోనే అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ ముగ్గురు పిల్లలు ఆకాశ్‌ అంబానీ, ఈశా అంబానీ, అనంత్‌ అంబానీలు కూడా వారి కుటుంబ వ్యాపారాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. 

ఈశా అంబానీ పిరామల్‌
ముకేష్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పిరామల్‌ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆమె రిలయన్స్ రిటైల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అలాగే ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈశా గత ఏడాది ‘మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2024’ అవార్డు పొందింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘టైమ్‌ 100 నెక్ట్స్‌ రైజింగ్‌ స్టార్స్‌’ జాబితాలో పేరు సంపాదించింది. ఆమె వార్షిక వేతనం సుమారు రూ. 4.2 కోట్లు. ఆమె నెట్‌వర్త్‌ రూ.800 కోట్లని అంచనా.

ఆకాశ్‌ అంబానీ
ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఆకాశ్‌ అంబానీ తన చదువు పూర్తి చేసిన వెంటనే, 2014లో రిలయన్స్‌ జియోలో చేరాడు. ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌ ఓనర్స్‌లో ఒకరిగా కూడా ఉన్నాడు. అలాగే, రిలయన్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తులు, డిజిటల్‌ సేవల అప్లికేష¯Œ ల అభివృద్ధి, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఆకాశ్‌ వార్షిక వేతనం రూ. 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 3,32,815 కోట్లు) నెట్‌వర్త్‌.

అనంత్‌ అంబానీ
అంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్‌ అంబానీ. 2022లో రిలయన్స్ బోర్డులో చేరాడు. జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్, రిలయన్స్‌  రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. జంతుప్రేమికుడిగా ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం ‘వంతారా’అనే సంస్థను స్థాపించాడు. ఈ మధ్యనే ఈ సంస్థకు ప్రతిష్ఠాత్మక ‘ప్రాణిమిత్ర’ జాతీయ అవార్డు లభించింది. అనంత్‌ వార్షిక వేతనం రూ. 4.2 కోట్లు. నెట్‌వర్త్‌ విషయానికి వస్తే 40 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 3,32,482 కోట్లు).


నోయల్‌ టాటా 
ఉప్పు నుంచి విమానయానం వరకు దాదాపు అన్ని రంగాల్లోనూ టాటా గ్రూప్‌ వ్యాపార స్రామాజ్యం విస్తరించి ఉంది. అయితే, ఆ సామ్రాజ్యం దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మరణానంతరం కూడా సజావుగా కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన సవతి తల్లి కొడుకు నోయల్‌ టాటా, టాటా గ్రూప్‌ చైర్మన్‌గా నియమితులవడం. ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వీరు కూటా టాటా ట్రస్ట్‌లో వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

లేహ్‌ టాటా
నోయల్‌ పెద్ద కుమార్తె లేహ్‌ టాటా ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌. తాజ్‌ హోటల్స్‌ రిసార్ట్స్‌– ప్యాలెస్‌లలో అసిస్టెంట్‌ సేల్స్‌ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె– నేడు ముంబైలోని తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ను నిర్వహిస్తోంది. వీటితో పాటు, గేట్‌వే హోటల్స్‌ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. టాటా సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్, జేఆర్‌డీ అండ్‌ థెల్మా జే టాటా ట్రస్ట్‌ బోర్డులలో కూడా ఉన్నారు.

మాయా టాటా
మాయా టాటా.. టాటా క్యాపిటల్‌లోని ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్‌ ఫండ్‌లలో మొదలై, నేడు టాటా డిజిటల్‌ రంగంలో ముఖ్యమైన పదవిలో ఉన్నారు. టాటా న్యూ యాప్‌ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె టాటా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్, జెఆర్‌డీ, టాటా మెడికల్‌ సెంటర్‌ ట్రస్ట్‌ బోర్డులో కూడా పనిచేస్తోంది.

నెవిల్లే టాటా
నెవిల్లే టాటా గత సంవత్సరం నుంచి టాటా గ్రూప్‌ రిటైల్‌ వ్యాపారాల బాధ్యతలు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రెంట్‌ హైపర్‌ మార్కెట్‌ యూనిట్‌.. ‘స్టార్‌ బజార్‌’, ‘జూడియో’ సంస్థలకు అధిపతి. వీటితో పాటు టాటా సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్, జేఆర్‌డీ, టాటా ట్రస్ట్‌ అండ్‌ ఆర్‌డీ, టాటా ట్రస్ట్‌ బోర్డులలో ఉన్నారు.

గోద్రేజ్‌
ప్రఖ్యాత కుటుంబ వ్యాపారాల్లో గోద్రేజ్‌ ఒకటి. సబ్బులు, గృహాపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ సంస్థ గోద్రేజ్‌. దీనిని 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అర్దేశిర్‌ గోద్రేజ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రేజ్‌ గ్రూపును గోద్రేజ్‌ ఎంటర్‌ప్రైజెస్, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌గా రెండు విభాలుగా విభజించారు. వీటిల్లో గోద్రేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ను వారి మూడోతరం ఆది, నాదిర్‌ చూసుకుంటుంటే, మరోదాన్ని జంషీద్, స్మితా గోద్రేజ్‌ కృష్ణా నిర్వహిస్తున్నారు. వీరితో పాటు, వారి నాలుగోతరం వారసులైన తన్యా దుబాష్‌.. గోద్రేజ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైర్టెర్‌గానూ, నిసబా గోద్రేజ్‌.. గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇలా గోద్రేజ్‌ కుటుంబంలో చీలిక ఏర్పడినప్పటికీ వారి వ్యాపారాన్ని వారసులు విజయవంతంగా కొన సాగిస్తున్నారు.  

బజాజ్‌ 
బజాజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ తర్వాత, బజాజ్‌ సంస్థను ఆయన కుమారులు రాజీవ్, సంజీవ్, అతని బంధువులు శేఖర్, నీరజ్, నీరవ్‌తో కూడిన కుటుంబ కౌన్సిల్‌ ద్వారా ఏకాభిప్రాయంతో పనిచేస్తోంది. ఇటీవలే మరణించిన మధుర్‌ బజాజ్‌ కూడా ఈ ఆరుగురు సభ్యుల కౌన్సిల్‌లో ఉండేవారు. బజాజ్‌ ఆటో సంస్థను రాజీవ్‌ బజాజ్‌ కుమారుడు రిషభ్‌నయన్‌ బజాజ్‌ చూసుకుంటున్నాడు. గత ఏడాదే, బజాజ్‌ గ్రూప్‌ ఆరోగ్య రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. నీరవ్‌ బజాజ్‌ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాడు. వీరి వారసులు కూడా కంపెనీలో వివిధ పదవుల్లో కొనసాగుతూ విజయం సాధిస్తున్నారు.

అనన్యా బిర్లా..  
దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటైన ఆదిత్యా బిర్లా పెద్ద కుమార్తె అనన్యా బిర్లా వ్యాపార ప్రపపంచంలో విజయవంతమైన మహిళగా రాణిస్తోంది. ఈమె తన çపదిహేడవ ఏటనే సొంత మైక్రోఫిన్‌ సంస్థను స్థాపించింది. ఇది దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న మైక్రోఫైనాస్స్‌ సంస్థల్లో ఇదీ ఒకటి. అలాగే, ఆదిత్యా బిర్లా అనుబంధ హిందాల్కో ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతోంది.  

ప్రణవ్‌ అదానీ
భారతీయ కుబేరుల్లో ఒకరైన పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ తర్వాతి తరం కూడా వేర్వేరు వ్యాపారాల్లో కొనసాగుతూ, ఆయన పేరును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో గౌతమ్‌ అదానీ అన్న వినోద్‌ అదానీ కుమారుడు ప్రణవ్‌ అదానీ బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తయిన వెంటనే, అదానీ కమ్యూనికేషన్స్‌లో ఎంటరై, తన చురుకుతనం చూపించాడు. తర్వాత అదానీ విల్మార్, అదానీ రియాలిటీలకు అధిపతిగా ఉన్నాడు. అలాగే, ఆసియాలో అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌కు ఇతడే నాయకత్వం వహిస్తున్నాడు.  

కరణ్‌ అదానీ.. 
గౌతమ్‌ అదానీ కుమారుడు కరణ్‌ అదానీ అంచెలంచెలుగా ఎదిగి అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. ఆయన హయాంలో, కంపెనీ నాలుగు నుంచి ప్రస్తుతం పన్నెండు పోర్టులకు విస్తరించింది. అంతేకాదు, దాని కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని 500 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచాడు. అదానీ గ్రూప్‌ సిమెంట్‌ వ్యాపారాన్ని పెంచడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.

జీత్‌ అదానీ...
గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడు జీత్‌ అదానీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఇంజినీరింగ్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరి, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్, క్యాపిటల్‌ మార్కెట్స్‌ వంటి విభాగాల బాధ్యతలు చూసుకోవడంతో తన కెరీర్‌ ప్రారంభించారు. ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు.

సాగర్‌ అదానీ..
అదానీ సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీ. అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందిన తర్వాత 2015లో అదానీ గ్రూప్‌లో చేరాడు. ప్రస్తుతం అదానీ గ్రీన్‌ ఎనర్జీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. విదేశాల నుంచి సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు తెప్పించడంలో సాగర్‌ కీలక పాత్ర పోషించాడు.

ఆర్యమాన్‌ విక్రమ్‌ బిర్లా
బిర్లా తనయుడు ఆర్యమాన్‌ బిర్లా వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌. అయినప్పటికే, తండ్రి పేరును నిలబెట్టే ప్రయత్నంతో చిన్న వయసులోనే బిర్లా రియల్‌ ఎస్టేట్, పెయింట్స్, ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ వ్యాపారాల్లో తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. 2023లో గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్‌ కంపెనీలైన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ బోర్డులో చేరారు. వీటితోపాటు, బిర్లా హాస్పిటాలిటీ, బిర్లా వెంచర్స్‌ను చూసు కుంటున్నాడు.

దేశంలో కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో అంబానీ కుటుంబ వ్యాపారం మొత్తం విలువ రూ.25.75 లక్షల కోట్లు. ఇది భారత జీడీపీలో 10 శాతంతో సమానమని ‘బార్‌క్లేస్‌ ప్రైవేట్‌ క్లయింట్స్‌ హురున్‌ ఇండియా–2024’ నివేదిక పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్, బిర్లా కుటుంబాలు ఉన్నాయి. అయితే, వారసత్వ వ్యాపారం ఇలాగే కొనసాగితే, రాజకీయాల్లోను, సినిమాల్లోను మాదిరిగానే వ్యాపారరంగంలోనూ వారసత్వాలు పెరిగి, కొత్త వ్యాపారులకు చోటు లేకుండా పోతుందనేది నిపుణుల మాట. ఇలా కాకుండా, ఎక్కడైనా సరే, వారసత్వ అర్హతతో పనిలేకుండా, ప్రతిభతో అవకాశాలు దక్కడం, దక్కించుకోవడమే అందరికీ మేలు.

వ్యాపార కుటుంబాల్లో భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాలలో ఇప్పటికే చాలా మార్పు జరుగుతోంది. కొత్త తరానికి నియంత్రణ అప్పగిస్తూ, వారసులను వ్యాపార బరిలోకి దింపుతున్నారు. వీరి రాకతో వారి కుటుంబాల వ్యాపారాల విలువలు కూడా పెరుగుతున్నట్లు తాజాగా బార్‌క్లేస్‌ ప్రైవేట్‌ క్లయింట్స్‌ హురున్‌ ఇండియా 2024 ఇచ్చిన నివేదిక వెల్లడించింది. వీటితో పాటు, అత్యధిక విలువ కలిగిన కుటుంబ వ్యాపారాల నివేదికను రూపొందించింది. అదే ఇది..

నివేదిక ప్రకారం.. కుటుంబాల వ్యాపారాల విలువలు 

దీపిక కొండి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement