విమెన్ పవర్
ఇన్నోవేషన్
అకస్మాత్తుగా అపరిచిత వ్యక్తి నుంచి కాల్ రావడం. బంపర్ ప్రైజ్ వచ్చిందని, మొబైల్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే సరిపోతుందని చెప్పి మోసం చేసిన ఘటనలు మన దేశంలోనే వేలల్లో ఉన్నాయి. వయసులో పైబడ్డవారు, టెక్నాలజీ మీద అవగాహన లేనివారే ఇలా ఆన్లైన్ స్కామర్ల చేతిలో మోసపోతుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు రూపొందించిందే షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్. దీనిని రూపొందించింది అమెరికాలోని టెక్సాస్కు చెందిన 17 ఏళ్ల యువతి.
ఆమె పేరు తేజస్వీ మనోజ్, భారతీయ సంతతికి చెందిన ఈమె రెండేళ్ల కిందట ఆన్లైన్ మోసగాళ్ల వల్ల తన తాతయ్య మోసం పోవడం గమనించింది. చిన్నప్పటి నుంచి కోడింగ్ మీద ఇష్టం ఉండడంతో ఆన్లైన్ స్కామర్లను అడ్డుకునేందుకు ఒక భద్రతావలయాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. అప్పుడు వచ్చిందే ఈ షీల్డ్ సీనియర్ వెబ్సైట్. దీని ద్వారా కాల్స్, మెసేజెస్, సైట్ డొమైన్... ఇలా ప్రతి దాన్ని జల్లెడ పట్టి అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవచ్చు. తేజస్వీ ప్రతిభని గుర్తించిన టైమ్స్ మేగజైన్ 2025లో ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది.


