లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన? | From 51 Marks to a Billion Dollar Rocket Company Who Is Pawan Kumar Chandana | Sakshi
Sakshi News home page

లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?

Jul 18 2026 3:48 PM | Updated on Jul 18 2026 4:32 PM

From 51 Marks to a Billion Dollar Rocket Company Who Is Pawan Kumar Chandana

జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులు మాత్రమే కాదు. ఎందుకంటే.. ఒకప్పుడు గణితంలో కేవలం 51 మార్కులు మాత్రమే సాధించిన విద్యార్థి, నేడు భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించి చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'పవన్ కుమార్ చందన'.. చిన్నప్పటి నుంచే యంత్రాలు ఎలా పనిచేస్తాయనే విషయంపై ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అయితే.. చదువులో ముఖ్యంగా గణితంలో మాత్రం ఆశించిన ప్రతిభ కనపరచలేకపోయేవారు. ఒక పరీక్షలో ఆయనకు లెక్కల్లో కేవలం 51 మార్కులే వచ్చినట్లు సమాచారం.

లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని.. ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఆ తరువాత మ్యాథ్స్, సైన్స్ మీద ప్రత్యేక శ్రద్ద చూపించి.. తొలి ప్రయత్నంలోనే ఐఐటీ జేఈఈలో విజయం సాధించిన ఐఐటీ ఖరగ్‌పూర్లో ఇంజినీరింగ్ చదివే అవకాశం పొందారు.

ఇస్రోలో జాబ్
ఐఐటీ పూర్తి చేసిన తరువాత.. చాలామంది విద్యార్థులు అధిక వేతనాలు ఇచ్చే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎంచుకున్నప్పటికీ, పవన్ కుమార్ చందన మాత్రం భారత అంతరిక్ష రంగంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఇస్రోలో చేరారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురంలో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేశారు.

స్కైరూట్ ఏరోస్పేస్
ఇస్రోలో పనిచేస్తున్న సమయంలో.. అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనం జీఎస్‌ఎల్‌వీ మార్క్-III (GSLV Mk III) రూపకల్పన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఇస్రోలో ఉద్యోగం వదిలేసి.. భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో ముందుకు రావాలనే ఆలోచనతో పవన్ కుమార్ చందన, తన సహచరుడు నాగ భరత్ డాకాతో కలిసి 2018 జూన్‌లో హైదరాబాద్‌లో స్కైరూట్ ఏరోస్పేస్ స్థాపించారు.

2018లో ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్థాపించడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని అనే చెప్పాలి. పెట్టుబడులు సమకూర్చడం కష్టమైంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ సంస్థపై నమ్మకం ఉంచి తొలి పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కారణంగా నిధుల సేకరణ కష్టతరమైనా, గ్రీన్‌కో సంస్థ ఆర్థిక సహాయం అందించడంతో స్కైరూట్ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. రూ వేలకోట్ల విలువైన కంపెనీగా అవతరించింది.

స్కైరూట్ విజయాలు
2020లో స్కైరూట్ భారతదేశంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థగా.. రామన్-1 రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. 2021లో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడంతో, ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ నిలిచింది.

2022 నవంబర్ 18న స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-ఎస్ అనే భారత తొలి ప్రైవేట్ సబ్-ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక కీలక మలుపు.

విక్రమ్-1 చారిత్రక విజయం
ఇక నేడు (జూలై 18న) స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా భూమి కక్ష్యలోకి చేరి, తనతో తీసుకెళ్లిన అన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా విక్రమ్-1 చరిత్ర సృష్టించింది. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. స్వదేశీ సాంకేతికత, భారత యువత ప్రతిభ, ప్రభుత్వ సహకారం కలిసి ప్రపంచానికి భారత సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.

పవన్ కుమార్ చందన ప్రకారం.. విజయం సాధించడానికి కేవలం డిగ్రీలు లేదా విదేశీ విద్య మాత్రమే అవసరం కాదు. బలమైన పునాది, సరైన ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా గొప్ప విజయాలను సాధించగలరు. యువతకు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన చెబుతారు. అప్పుడే దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది.

ఇదీ చదవండి: కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్‌పై ఆందోళన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement