నవాదా: బీహార్లోని నవాదా జిల్లా, పక్రిబరావాం ప్రాంతానికి చెందిన రివ రంజన్ కుమార్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇటుక బట్టీలో పనిచేస్తూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, తన పిల్లలు రితేష్ కుమార్, రిచా కుమారీలను ఉన్నత చదువులు చదివించాలన్న తండ్రి పట్టుదల ఫలించింది. ఇద్దరూ ఈ ఏడాది జరిగిన ‘నీట్ యూజీ 2026’ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వైద్య విద్యకు అర్హత సాధించారు.
తొలి ప్రయత్నంలో విఫలమైనా వెనకడుగు వేయకుండా, రెండో ప్రయత్నంలో కోటాలో శిక్షణ పొంది ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రితేష్ కుమార్ 720 మార్కులకు గానూ 655 మార్కులు సాధించి 1160 ఆల్ ఇండియా ర్యాంకును కైవసం చేసుకోగా, రిచా కుమారి 622 మార్కులతో 4685వ ర్యాంకును సాధించారు. తల్లి శోభా కుమారి ప్రోత్సాహం కూడా తోడవడంతో వారు డాక్టర్లు అయ్యేందుకు సిద్ధమయ్యారు. వీరి విజయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ఇదే జిల్లాకు చెందిన ఆయుష్ భలోటియా ఆల్ ఇండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి బీహార్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
ఇది కూడ చదవండి: ‘మందు కొట్టి మొగుడిని చావగొడతా’


