న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీస్ చర్య అంశం పార్లమెంట్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించడంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
రాజ్యసభ తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే ఖర్గే మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగిందని ఆరోపించారు. విద్యార్థుల గొంతును అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వేలాది మంది విద్యార్థులను మౌనం చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జంతర్ మంతర్ వద్ద వారిపై లాఠీచార్జ్ చేశారు అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం సరికాదని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఖర్గే అధికార పక్షంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. చందా చోరీకి మద్దతుదారులు ట్రెజరీ బెంచ్లలో కూర్చున్నారు(అయోధ్య రామ మందిర విరాళాల వివాదాన్ని ఉద్దేశించి) అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అధికారపక్ష సభ్యులు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఖర్గే ప్రసంగం కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇరువైపుల సభ్యుల నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించడం కష్టంగా మారడంతో రాజ్యసభను కొద్దిసేపటికే వాయిదా వేశారు.
#WATCH | Delhi: Rajya Sabha adjourned to meet again at 12 Noon today.
Leader of the Opposition in Rajya Sabha Mallikarjun Kharge says, "You have allowed me to present my views regarding this paper leak and the NEET examination scandal. This is a matter concerning students; I am… pic.twitter.com/2bRWp771zI— ANI (@ANI) July 20, 2026
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా స్పందించారు. నిరసనల సమయంలో పోలీసులు చేపట్టిన చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. జంతర్ మంతర్ ఘటన ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. విద్యార్థుల నిరసనలు, పోలీస్ చర్య, ప్రభుత్వ వైఖరిపై చర్చలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.


