గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వందలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం కలకలం రేపింది. అమెరికా (US) మొబైల్, డిస్ప్లే, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఉద్యోగాల కోతను విధిస్తోంది. రాయిటర్స్ కథనం ప్రకారం, న్యూజెర్సీ,టెక్సాస్లోని కంపెనీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది.
ఆఫీసు చేంజ్ : శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (SEA) తన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని 'ఎంగ్ల్వుడ్ క్లిఫ్స్' నుండి టెక్సాస్లోని 'ప్లానో'కు మారుస్తోంది. 'వార్న్' (WARN) నోటీసు ప్రకారం, ఎంగ్ల్వుడ్ క్లిఫ్స్ కార్యాలయంలోని 739 ఉద్యోగాలపై దీని ప్రభావం పడనుంది. అక్కడ మొత్తం 1,200 మంది ఉద్యోగులు ఉండగా... అందులో 60 శాతానికి పైగా సిబ్బంది ఈ మార్పుల వల్ల ప్రభావితం అవుతున్నారు. ముఖ్యంగా టెక్సాస్కు మారడానికి ఇష్టపడని వారిపై వేటు వేసింది.
టెక్సాస్ కార్యాలయంలో మార్పులు
టెక్సాస్లోని ప్లానో కార్యాలయంలో ఉన్న మొబైల్ విభాగానికి చెందిన సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. గత రెండు వారాల్లో సీనియర్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లతో సహా 30 మందికి పైగా ఉద్యోగులు తాము కంపెనీ నుండి వైదొలిగినట్లు లింక్డ్ఇన్ (LinkedIn) ద్వారా స్పష్టం చేశారు.
శాంసంగ్ వివరణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మారుతున్న ఆధునిక టెక్నాలజీ మార్కెట్కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు శాంసంగ్ వెల్లడించింది. జూన్ 30న ఉద్యోగులకు అంతర్గతంగా సంస్థాగత ఉద్యోగాల తగ్గింపు నోటీసులు ఇచ్చినప్పటికీ, దీనిని భారీ లేఆఫ్స్గా భావించకూడదని శాంసంగ్ పేర్కొంది. ప్రభావితమైన ఉద్యోగులలో చాలా మందికి టెక్సాస్కు బదిలీ అయ్యే (Relocate) అవకాశం కల్పించామని కంపెనీ తెలిపింది. కేవలం మారడానికి వీలులేని వారు లేదా విధులు రద్దయిన వారు మాత్రమే ఉద్యోగాలు కోల్పోతారని స్పష్టం చేసింది.కంపెనీ సెమీకండక్టర్ (చిప్స్) విభాగం రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తుండగా, చిప్ ధరల పెంపు, తక్కువ మార్జిన్ల కారణంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.


