డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్రను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతినడం, ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి మార్గాల్లో యాత్రికుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
ప్రస్తుతం చార్ధామ్ ప్రయాణంలో ఉన్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. మరోవైపు, అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రుద్రప్రయాగ్ తదితర ప్రాంతాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదీ తీర ప్రాంతాలు మునిగిపోగా, ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు. వాతావరణం మెరుగుపడి, నిపుణులు భద్రతను ధృవీకరించిన తర్వాతే యాత్ర పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్లో అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఇప్పటివరకు 44.8 లక్షలకు పైగా భక్తులు చార్ధామ్ క్షేత్రాలను దర్శించుకున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది.


